26, ఏప్రిల్ 2015, ఆదివారం

మీడియా శ్రీకృష్ణులు!

‘‘ఏంటీ విశేషాలు. తమ్ముళ్లను అలా అరెస్టు చేయడం తప్పు కదా? ’’
‘‘ఆదా నీ గోల..... మన చిన్నప్పుడు గుర్తుందా? ప్రతి పెళ్లిలో ఎవడో ఒకరు పప్పు చారులో పప్పు తక్కువైందనో, వంకాయ కూరలో ఉప్పు తక్కువైందనో, గడ్డపెరుగు లేదనో హంగామా చేసేవారు. వారు అరవడం కొత్త జంటను పక్కన పెట్టి వీరిని బతిమిలాడేందుకు ఇరువైపుల వాళ్లు తంటాలు పడడం భలేగా ఉండేది. అంతా అటువంటివారిని పురుగును చూసినట్టు చూసేవాళ్లు కానీ ఒక్కరూ పైకి అనేవారు కాదు. అన్ని పెళ్లిళ్లలో, అన్ని ఊళ్లలో ఇలాంటి పాత్ర కనిపించేది. పప్పులో ఉప్పు తక్కువ కావడం ఇండియా-పాకిస్తాన్ యుద్ధం అంత కీలకమైనదిగా చర్చలు సాగించే వాళ్లు. ఎవరి భోజనం వాళ్లే వడ్డించుకుని వెళ్లే ఈ రోజుల్లో బంధువుల అలకలు పాత చరిత్రే!! ’’
‘‘నిజమే కానీ తమ్ముళ్ల గురించి అడిగితే, పెళ్ళిళ్ల గురించి గురించి చెబుతున్నావు’’
‘‘గులాబీ పార్టీ వాళ్లు అట్టహాసంగా ప్లీనరీ జరుపుకుంటుంటే తమ్ముళ్లు పార్టీ మారిన ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు, జిల్లాల్లో వారి బంధువుల ఇళ్ల ముందు హడావుడి చేసి అరెస్టు కావడం చూస్తే ఎందుకో పూర్వకాలం పెళ్లిళ్లలో భోజనాల దగ్గర లేకిగా గొడవ చేసే వాళ్లు గుర్తొచ్చారు.’’
‘‘రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్లు, మరో పార్టీలో చేరడాన్ని నువ్వు సమర్ధిస్తున్నావా? ’’
‘‘నేనెక్కడ సమర్ధించాను. ఆ పని చేసింది కూడా తమ్ముళ్లే’’
‘‘ఎలా?’’
‘‘యువనేత పార్టీ ఎంపిలిద్దరిని చేర్చుకున్న తమ్ముళ్ల బాస్‌ను మరిచిపోయావా? అలాంటి బాస్ ఆదేశాలతో తమ్ముళ్లు గులాబీ నేతల ఇళ్ల ముందు ఆందోళన చేయడాన్ని ఏమంటారు? ’’
‘‘అది కూడా నువ్వే చెప్పు’’
‘‘పెళ్లిళ్లలో గుర్తింపు కోసం ఉప్పు పప్పు తక్కువైందని హంగామా చేసేవాళ్లు అందుకే గుర్తుకొచ్చారు. నిజానికి కూరలో ఉప్పు తక్కువ కావడమే అతని ప్రధాన సమస్యనా? అంటే కానే కాదు. వాళ్లను ఇంట్లో కనీసం భార్యకూడ గుర్తించదు, కనీసం పెళ్లిళ్లలోనైనా ఏదో రూపంలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు. వీళ్లది ఐడెంటిటీ క్రైసెస్.’’
‘‘తప్పును తప్పంటే ఐడెంటిటీ క్రైసెస్ అని ఎలా అంటావు? ’’
‘‘నీలాంటి వాడు అది తప్పు అంటే ఓ అర్ధం ఉంది. తప్పులో పుట్టి, తప్పులోనే పెరుగుతున్న వాళ్లు తప్పంటే ఎలా ఉంటుంది? నైతిక విలువల ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడి ఇంటి ముందు ధర్నా చేసి, అటు నుంచి గులాబీ నేతల ఇళ్ల ముందు ఆందోళన చేస్తే ఎంత బాగుండేది’’...‘‘పోనీలే ఆ సంగతి మనకెందుకు కానీ... ఇంకేంటి విశేషాలు..? అప్పుడు టీవిలో తెగ కనిపించిన ముఖాలేమీ ఇప్పుడు కనిపించడం లేదు. వాళ్లేమయ్యారంటావు?’’
‘‘ఎవరు వాళ్లు? ’’
‘‘ఎన్ని పేర్లని చెప్పమంటావు. ఒకరా? ఇద్దరా? రోజూ టీవి చర్చల్లో తెగ కనిపించే వాళ్లు. ప్రజలను నడిపించేది వీళ్లే అనిపించేది.’’
‘‘నువ్వడిగేది వాళ్ల గురించా? చెబుతా?... జర్నలిస్టులను నారదులు అంటారు. కానీ నాకెందుకో వాళ్లలో శ్రీకృష్ణుడు కనిపిస్తాడు’’
‘‘దానికీ దీనికి లింకేమిటి? ’’
‘‘అక్కడికే వస్తున్నా? మహాభారతం మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించింది శ్రీకృష్ణుడే. ఏ పాత్రను ఎప్పుడు ప్రవేశపెట్టాలో, ఎప్పుడు ముగించాలో డిసైడ్ చేసింది ఆయనే. మీడియా కూడా అంతే. 95 ప్రాంతంలో శంకరపిచ్చయ్య పేరు మీడియాలో మారు మ్రోగేది. లాడెన్ వల్ల ప్రపంచానికి ఎంత ప్రమాదమని అమెరికావాడు భయపడ్డాడో, ఆ కాలంలో శంకర పిచ్చయ్య వల్ల తెలుగు జాతికి అంత కన్నా ఎక్కువ ప్రమాదం అని మీడియా రోజూ హడావుడి చేసేది. ఎవరీ శంకరపిచ్చయ్య అనే కదా నీ సందేహం. లక్ష్మీపార్వతి సోదరుడు. ఈయన వల్ల రాష్ట్రంలో భూ కంపం కన్నా ఎక్కువ ప్రమాదం తప్పదని ప్రచారం సాగేది. ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించేశాక. శంకర పిచ్చయ్య ఏమయ్యాడో ఎవరూ పట్టించుకోలేదు. నిజంగా శంకర పిచ్చయ్య అంత ప్రమాదకరమైన వ్యక్తా? అంటే కాదు.. ఎన్టీఆర్‌ను దించేసే వ్యూహం లో అతనో పాత్ర అంతే. అచ్చం శ్రీకృష్ణుడు కూడా అంతే కదా మహా మహా వీరులను మట్టికరిపించేందుకు ఇలాంటి శంకరపిచ్చయ్యలు ఎంతో మందిని యుద్ధ రంగంలోకి తీసుకు వచ్చాడు.’’
‘‘నిజమే ఇంతకూ శంకరపిచ్చయ్య ఏమయ్యారు? ’’
‘‘ఏమో ఎవరికి తెలుసు.. ఆ పాత్ర అవసరం తీరాక పట్టించుకోవలసిన అవసరం మీడియాకెందుకు?
‘‘అంతే కదా’’
తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆయనెవరో చక్రవర్తి అని పాపులర్ చానల్స్ అన్నింటిలో అరగంట చొప్పున ప్రత్యేక దర్శనం ఇచ్చేవారు. నేనూ పూర్వం తెలంగాణలోనే పుట్టాను. తెలంగాణ వద్దే వద్దు అని గట్టిగా వాదించేవారు. ఎక్కడ చూసినా ఆయనే కనిపించేవారు. ఆయనలో ఒక మహా రచయిత కూడా ఉన్నాడని మీడియా వెలికి తీసింది. తెలంగాణ ఏర్పడ్డాక పాపం ఆయన్ని పిలిచిన చానల్ లేదు. పలకరించిన మీడియా లేదు. కెసిఆర్‌కు వరుసకు మేనల్లుడని ఒకరు, అన్నగారి కూతురని మరొకరు టీవిల్లో కెసిఆర్‌ను దుమ్మెత్తిపోస్తూ తెగ దర్శనం ఇచ్చేవాళ్లు. ఏంటో ఇప్పుడు వాళ్ల పేర్లు కూడా గుర్తుకు రావడం లేదు. నిజంగా వాళ్లు అంత శక్తివంతులా? అంటే విషయం అది కాదు చానల్స్‌కు తమ కోపాన్ని వ్యక్తం చేసే మైకులుగా వీరు కనిపించారు కానీ వారికి సొంత బలం ఏమీ ఉండదు. సొంత బలం ఉంటే ఇప్పటికీ దర్శనం ఇచ్చి ఉండేవాళ్లు. అందుకే అన్నాను మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసిన పనే మీడియా చేస్తోందని, ఒప్పుకుంటావా? లేదా? ’’
‘‘నువ్వు చెప్పిందంతా నిజమే కానీ ఆ పోలికను నేను ఒప్పుకోను. మీడియా సొంతంగా నడిపిస్తే నువ్వన్నట్టు శ్రీకృష్ణుడు అంటే ఒప్పుకుంటాను. కానీ ఏదీ మీడియా సొంతంగా నడిపించదు. వాటి వెనుక ఉన్న నాయకులే నడిపిస్తారు. కాబట్టి శ్రీకృష్ణులు మీడియా కాదు. మీడియాను నడిపించే నాయకులు’’

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం