10, మార్చి 2016, గురువారం

నా తెలంగాణా కోటి ఎకరాల వీణ

పేదరికం, కరవు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, అశాంతితో యువత, ఎన్‌కౌంటర్‌లు తెలంగాణ అనగానే ఒకప్పుడు గుర్తుకు వచ్చే వరుస క్రమం. ఇప్పుడు తెలంగాణ ముఖ చిత్రం మారుతోంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ నిన్నటి మాట, నా తెలంగాణ కోటి ఎకరాల వీణ రేపటి మాట.

 సస్యశ్యామల తెలంగాణకు ఆంకరార్పణ జరిగింది. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర తెలంగాణల మధ్య కుదిరిన ఒప్పందం చారిత్రక ఒప్పందం. పాలమూరు-రంగారెడ్డి దక్షిణ తెలంగాణను సస్య శ్యామలంగా మారిస్తే, మహారాష్టత్రో కుదిరిన ఒప్పందంతో కాళేశ్వరం తదితర ప్రాజెక్టులతో ఉత్తర తెలంగాణ స్వరూపాన్ని మారుస్తుంది. ఇది సాకారం కావడానికి మరో రెండు మూడేళ్లు పట్టవచ్చు. కానీ ప్రాజెక్టులు పూర్తి అయి తీరుతాయని తెలంగాణ వాదులకే కాదు తెలంగాణ ఆవిర్భావాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారికి సైతం స్పష్టత ఉంది. రెండు మూడేళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణ కోటి ఎకరాల వీణగా పచ్చని పైర్లతో కళకళ లాడుతుంది.


తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ, కానీ ఆత్మమాత్రం గ్రామాలే. హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత ఐటి కంపెనీలు ఎన్నయినా రావచ్చు. గూగుల్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, అమెజాన్ ఒకటేమిటి ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలు ఎన్నయినా క్యూ కట్టవచ్చు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశానికి అంటవచ్చు. లక్షల మందికి హైదరాబాద్ ఐటి రంగం ఉపాధి కల్పించ వచ్చు. ఫ్లై ఓవర్లు, స్కై వేలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందవచ్చు. విశ్వనగరంగా హైదరాబాద్ ప్రపంచ పటంలో చేరవచ్చు. ఇవేవీ అసాధ్యం కాదు. హైదరాబాద్‌లో ఇలాంటివి ఎన్ని జరిగినా గ్రామాలకు ఇంత కాలం ఒరిగిందేమీ లేదు. గ్రామాల్లో బీడుబారిన భూములు పచ్చదనంతో కళ కళ లాడినప్పుడే సాధించిన తెలంగాణకు అర్ధం. పరమార్ధం. గుండెకాయ సరిగా ఉంటేనే శరీరం సజీవంగా ఉంటుంది. కాబట్టి కచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టాల్సింది. ఇంకా పెంచాల్సిందే. రెండేళ్ల కాలంలో ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది.

 తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ధరలు అడుగంటి పోతాయని, చీకటి రోజులు తప్పవని హెచ్చరించిన వారికి చెంప ఛెళ్లుమనిపించేలా టిఆర్‌ఎస్ పాలించింది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు అనేక హైదరాబాద్‌కు వచ్చేట్టు చేసింది. గుండెను జాగ్రత్తగా కాపాడుకుంది. ఇక గుండె తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు ఆత్మపై దృష్టిసారించాలి. నెలకు వెయ్యి రూపాయల ఆసరా, ఆరు కిలోల బియ్యం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఒక మనిషి ప్రశాంతంగా జీవించేందుకు ఉపయోపడతాయి. ఒక పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి అద్భుతంగా పని చేస్తాయి. దీనికే పాలకులు తృప్తి పడితే ఇంత కాలం పాలించిన వారికి ఇప్పుడు పాలిస్తున్న వారికి తేడా ఉండదు. కేవలం జీవిస్తే సరిపోదు. తెలంగాణ గ్రామాలు సంపదతో కల కలలాడాలి. అది ఐటితో సాధ్యం కాదు వ్యవసాయంతోనే సాధ్యం అవుతుంది.

 పంట పండించే పొలం ఖరీదు ఎకరానికి లక్ష అయితే , అదే రియల్ ఎస్టేట్‌లో ప్లాట్లుగా మారిస్తే దాని ఖరీదు కోటి రూపాయలు కావచ్చు. ఒకేసారి కోటి రూపాయల ధర పలికినా దాని వల్ల కలిగే అభివృద్ధి కన్నా లక్ష రూపాయల ధర పలికే వ్యవసాయ పొలంలో పంట పండిస్తే గ్రామాల్లో కలిగే అభివృద్ధి ఎక్కువ.


రియల్ ఎస్టేట్ ధరల్లోనే సంపద దాగి ఉంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని స్థానికులంతా సంపన్నులు కావాలి. కానీ అలా జరగలేదు. కారు చౌకగా అమ్ముకున్న స్థానికుల పరిస్థితి దయనీయంగా ఉంటే కారు చౌకగా పొలాలను కొని ప్లాట్లు చేసిన వారు అపర కుబేరులయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు ఇప్పుడు కూడా మీడియా రంగం, రియల్ ఎస్టేట్, సినిమా రంగం అదీ ఇదని కాదు భారీ ఎత్తున పెట్టుబడులు అవసరం అయిన అన్ని రంగాల్లో కొన్ని ప్రాంతాల వారిదే ఆధిపత్యం. దానికి కారణం అక్కడ ఎప్పుడో నిర్మించిన ప్రాజెక్టులే. తిండి అవసరాలు తీరిన తరువాత అదనపు సంపాదనతో ఎన్నో ఆలోచనలు వస్తాయి, పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. అలా అదనపు సంపాదన సాధించిన వర్గాలే ఇప్పుడు అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి .


తెలంగాణలో హైదరాబాద్ విశ్వనగరం అయితే కావచ్చు కానీ గ్రామాల్లో పరిస్థితి ఇప్పటికీ సామాన్యుల జీవితం చేతికి నోటికి అన్నట్టుగానే ఉంది. రెండు మూడేళ్లలో కోటి ఎకరాలు సాగులోకి వస్తే గ్రామాల స్వరూపమే మారిపోతుంది. తెలంగాణ స్వరూపం మారిపోతుంది. ఆసరా కోసమో, ప్రభుత్వం కట్టించే ఇళ్ల కోసమే ఎదురు చూడరు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై ఇంత కాలం మొసలి కన్నీరే కార్చారు. 

తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో రైతుల ఆత్మహత్యలపై మీడియా అతిగా ప్రచారం చేసింది. ఇలా ప్రచారం చేయడం ద్వారా మీడియా ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకుందో, రైతులకు ఏ విధంగా ఆత్మ స్థయర్యం కలిగించదలుచుకుందో తెలియదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ చేస్తానని ప్రకటించి చేయలేదని, దాని వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని అని ఒక రైతు లేఖ రాసి మరణిస్తే మీడియా పట్టించుకోలేదు. కానీ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై చివరకు దసరా పండుగను కూడా జరుపుకోవద్దని మానవతా వాదులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో తెలంగాణ రైతుల కష్టాలపై సానుభూతి కన్నా తెలంగాణ సాధించుకున్నారనే కసి ఎక్కువ ఉంది. 

తెలంగాణను నడిపించేందుకు తాము సరైన నాయకత్వానే్న ఎన్నుకున్నామని ప్రజలు పదే పదే అనుకునేట్టుగా అధికార పక్షం ముందుకు వెళుతుంటే కాంగ్రెస్, టిడిపి వంటి విపక్షాలు తమ వైఖరి ద్వారా ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయ. హైదరాబాద్ లేనిదే తెలంగాణ లేదు. అయితే తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు. గ్రామాలు పచ్చగా ఉంటేనే తెలంగాణ సంపన్న తెలంగాణ అవుతుంది.


ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే తెలంగాణ సస్య శ్యామలం అవుతుంది. కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ ప్రకటించిన దాన్ని సీరియస్‌గా పట్టించుకోని వారు ఉంటే ఉండవచ్చు. ఉంటారు కూడా. కానీ తొలి రెండేళ్ల కాలం పగడ్బందీగా పథకాల రూపకల్పనపై దృష్టిసారించిన టిఆర్‌ఎస్ ఇప్పుడు తెలంగాణ పేదరికాన్ని శాశ్వతంగా పారద్రోలేందుకు సరైన మార్గంలో పయనిస్తోంది. అధికార పక్షం ఏం చేసినా వ్యతిరేకిస్తాం అనే ధోరణికి బదులు పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం పథకాలపై అసెంబ్లీ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చ జరగాలి. రాజకీయ కోణంలో కాకుండా నిపుణులతో చర్చించి ఈ ప్రాజెక్టులు, ఒప్పందాల్లోని మంచి చెడులపై చర్చ జరగాలి. ప్రాజెక్టులు పూర్తయితే అధికార పక్షానికి మేలు జరుగుతుంది అనే కోణంలో కాకుండా ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణకు మేలు జరుగుతుంది, పూర్తయి మేలు జరగాలి అనే కోణంలో చర్చ జరగాలి. అధికార పక్షం అయినా, విపక్షం అయినా సర్వం తెలిసిన మేధావులేమీ కాదు. నీటిపారుదల రంగ నిపుణులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయంలో తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపాలి. అదే విధంగా అధికార పక్షం సైతం సాంకేతికంగా తాము తీసుకున్న నిర్ణయం ఏ విధంగా సరైనదో అర్ధవంతంగా వివరించాలి. అంతిమంగా అధికార, విపక్షాల లక్ష్యం తెలంగాణ ప్రయోజనం కావాలి. ఈ అంశంలో తెలంగాణ ఒక విధంగా అదృష్ట వంతురాలే.


ప్రాజెక్టులతో అభివృద్ధి చెందిన ఆంధ్రలో కులాది పత్యంతో రాజకీయాలు సాగుతున్నాయి. కుల రాజకీయాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆంధ్ర నేతలు నడిపించే తెలంగాణ రాజకీయాల్లో అదే ధోరణి కనిపించేది. కానీ ఇప్పుడు అది బలహీనపడింది. నామ మాత్రంగా నిలిచింది. దాని గురించి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. ప్రాణహిత-రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి చంద్రబాబు ఫిర్యాదు చేస్తే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించలేరు. ప్రశ్నించడం సాధ్యం కాదు కూడా. తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకునే వారిని ప్రశ్నించలేనప్పుడు ఆ పార్టీని ప్రజలు ఎలా ఆదరిస్తారు? తెలంగాణ సాధించిన పార్టీ అధికార పక్షంగా, తెలంగాణ ఇచ్చిన పార్టీ విపక్షంగా నిలిచింది. 

తెలంగాణ ప్రజల అభివృద్ధి ఈ రెండు పక్షాల ప్రధాన అజెండాగా ఉండాలి. ఉంది కూడా. ఆవిధంగా ఉండడం తెలంగాణ అదృష్టం. అయితే ఈ ప్రయత్నాలన్నీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి. బడ్జెట్ సమావేశాల్లో ఇది ప్రతిబింబించాలి.
బుద్దా మురళి (ఎడిట్ పేజి 10-3-2016)

3 కామెంట్‌లు:

  1. తెలంగాణా విశ్రాంత ఇంజినయర్ల సమాఖ్య (TREF) వ్యవస్థాపకులు & ప్రముఖ సాగునీటి నిపుణులు మేరెడ్డి శ్యాం ప్రసాద్ రెడ్డి గారు రెండేళ్ళ కిందట ఇచ్చిన దిశానిర్దేశం: "నా తెలంగాణము కోటి ఎకరాల మాగాణము"

    రిప్లయితొలగించండి
  2. Gottimukkala garu thanks ee samacharam unna book yemaina labhistundaa ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బుక్ అంటూ లేదండీ. వంద గ్రామీణ నియోజక వర్గాలన్నిటిలో చెరి లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తామన్న తెరాస ఎన్నికల వాగ్దానాన్ని శ్యాం ప్రసాద్ అన్న ఇలా వ్యక్తీకరించారు. It is a slogan, not a book.

      మీ టపా శీర్షిక వారి నినాదానికి చాలా దగ్గరగా ఉండడం విశేషం. I guess it shows great minds think alike!

      తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం