7, మే 2016, శనివారం

రెండు ప్రాజెక్టులు-ఒక జ్ఞాపకం

ఉత్తర, దక్షిణ తెలంగాణను సస్య శ్యామలంగా మార్చే రెండు ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ తరుణంలో ఒక పాత జ్ఞాపకం..


అది 2004 ఎన్నికల ఫలితాలు వెలువడి చంద్రబాబు పార్టీ ఓడిపోయి వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చిన సమయం. అప్పటికే మూడేళ్ల నుంచి వరుస కరవు. తెలంగాణ కరువు రక్కసిలో చిక్కుకుని విలవిలవాడుతున్న కాలమది. ఆత్మహత్యలు అలానే కొనసాగుతున్నాయి. మెదక్ నియోజక వర్గంలో రైతు ఆత్మహత్య సంగతి తెలిసి అప్పుడు టిడిపి రాజ్యసభ సభ్యునిగా ఉన్న,రాయల సీమకు చెందిన  సి రామచంద్రయ్య నాయకత్వంలో ఒక బృందాన్ని చంద్రబాబు రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు పంపించారు. ఆ రైతు కుటుంబంలో మిగిలింది ఆమె ఒక్కతే. అంతకు ముందే పంటలు పండక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఆమెను పరామర్శించడానికి వెళ్లిన సి రామచంద్రయ్య ఆమె స్థితి చూసి నిర్ఘాంత పోయాడు.


వెళ్లి వచ్చిన తరువాత తన అనుభవాన్ని ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరులతో పిచ్చాపాటి మాట్లాడుతూ పంచుకున్నాడు. ఆమెను పరామర్శించడానికి వెళ్లిన నేను ఆమె స్థితిని చూశాక మనసు కలత చెందింది. కొడుకు, భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖంలో ఏ మాత్రం జీవ కళ లేదు. దుఃఖం లేదు, నిర్జీవ రూపంతో మాట్లాడుతున్నట్టుగా ఉం ది. ఏమని ఓదార్చాలో అర్ధం కాలేదు. చంద్రబాబు వద్దకు వెళ్లి ఇదే విషయం చెప్పాను. ఏంటి సార్ ఇంత కాలం మనం చేశామని చెప్పుకుంటున్న అభివృద్ధి, గ్రోత్ రేట్ ఏది సార్ అంటూ బాబుతో చెప్పిన విషయాలను మిత్రులతో పంచుకున్నారు. అంతకాలం అధికారం చెలాయించిన పార్టీకి చెందిన ఎంపిగా తెలంగాణలో కరవు పీడిత గ్రామంలో రైతు కుటుంబాన్ని చూసిన తరువాత చలించిన సి రామచంద్రయ్య నోటి నుంచి వచ్చిన మాటలివి. రాయలసీమ కరువు ను చూసిన రామచంద్రయ్యను కూడా ఆనాటి తెలంగాణ పల్లెల్లోని కరువు కదిలించింది . 


అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల కన్నా మెదక్‌లోనే గ్రోత్ రేట్ ఎక్కువ అంటూ జిల్లాల వారిగా గణాంకాలు విడుదల చేసేవారు. ఆ గ్రామంలోని పరిస్థితిని రైతు కుటుంబాన్ని చూసిన తరువాత సి రామచంద్రయ్యకు అంకెలు వేరు వాస్తవ జీవితం వేరని అర్ధమైంది. అదే విషయాన్ని మిత్రులతో పంచుకున్నారు. సి రామచంద్రయ్య చూసిన ఒక్క గ్రామం, ఒక్క రైతు కుటుంబం పరిస్థితే కాదు ఆ కరవు కాలంలో వర్షంపై ఆధారపడి పంటలు పండించే ప్రతి తెలంగాణ పల్లె పరిస్థితి ఇదే. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. తనకు ఏం కావాలో, తన ప్రాధాన్యతలు ఏమిటో ? వాటిని ఎలా సాధించుకోవాలో తనకు బాగా తెలుసు. తనకు ఏది ప్రయోజనమో ఆ నిర్ణయం తీసుకుని అమలు చేసే సత్తా ఉన్న రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ.
ఉత్తర, దక్షిణ తెలంగాణలను సస్యశ్యామలం చేసే రెండు ప్రాజెక్టులకు రెండు రోజుల తేడాతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావులు శంకుస్థాపన చేశారు. దక్షిణ తెలంగాణను సస్యశ్యామలంగా మార్చే పాలమూరు ఎత్తి పోతల ప్రాజెక్టుకు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో సుదీర్ఘ పాలనానుభవం ఉన్న నాయకులు, రాజ్యాంగ నిపుణులు అని చెప్పుకున్న వాళ్లు , కాకలు తీరిన పెద్దలు, చివరకు పార్టీ కార్యాలయాల్లో ఉగాదికి పంచాగ పఠనంలో తెలంగాణ ఒక కల అని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల సంకల్పం, నాయకత్వం, ఆ కలను నిజం చేసింది. ఉద్యమ కాలంలో అయ్యేదా పొయ్యేదా? అని వినిపించినట్టుగానే ఇప్పుడు ఉత్తర, దక్షిణ తెలంగాణను సస్య శ్యామలం చేసే రెండు ప్రాజెక్టులపై సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి.


ప్రాజెక్టులపై ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న తెలంగాణ విపక్షం విమర్శలతో తమను తాము బలహీన పరుచుకుంటోంది. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ప్రాజెక్టు నిలిపివేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను బాబు వ్యతిరేకించడం లేదని విపక్ష నాయకుడు జగన్ మరింత తీవ్ర స్వరంతో విమర్శిస్తున్నారు. దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఓటుకు నోటు వల్లనే బాబు ప్రాజెక్టులను వ్యతిరేకించడం లేదనేదని జగన్ ఆరోపణ.
తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఏకమైనందున, ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెలంగాణ ఏకం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపు ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో అధికార పక్షం, విపక్షం జల రాజకీయాలు చేయడం సాధారణమే.. దీనితో ప్రజలకు సంబంధం లేదు. తెలంగాణ ఏర్పాటు అనివార్యం అని కెసిఆర్ ఎంత గట్టిగా నమ్మారో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం జరిగి తీరుతుందని తెలంగాణ రైతాంగం అంతే గట్టిగా నమ్ముతోంది.
ఈ రోజుల్లో కనిపించడం లేదు కానీ పాత రోజుల్లో ప్రతి పెళ్లిలో ఎవరో ఒకరు పెద్దగా అరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించేవాడు. కూరలో ఉప్పు తక్కువైందనో, పెరుగు గట్టిగా లేదనో వంకాయ కూర చప్పగా ఉందనో కారణం చూపుతూ అరిస్తే అందరూ వానిపై దృష్టికేంద్రీకరించేవారు. ఉప్పు తక్కువ కావడం అతని సమస్య కాదు. ఐడెంటిటీ క్రైసెస్‌తో అందరి దృష్టిలో పడాలి అనేదే అతని ప్రధాన సమస్య. ఇలానే ప్రాజెక్టులపై కొందరి విమర్శలున్నాయి.


ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తెలంగాణ సస్య శ్యామలం అవుతుంది. రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు ఉపయోగపడుతుంది. అదే ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ విఫలం అయితే తెలంగాణ ప్రజలకు తీరని నష్టం, విపక్షాలకు రాజకీయంగా బాగా కలిసి వస్తుంది. తమకు కలిసి వచ్చే అవకాశం కోసం రాజకీయ పార్టీలు ఎదురు చూడడం సహజమే. కానీ రాజకీయ పార్టీల ప్రయోజనం కన్నా రాష్ట్ర ప్రజల ప్రయోజనం ముఖ్యం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రాజెక్టులు పూర్తి కావాలని కోరుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం తప్పు చేస్తే శాస్ర్తియంగా ఇది తప్పు ఇలా చేస్తే మరింత ప్రయోజనం అని చెప్పగలగాలి. అలాంటి ప్రయత్నమేదీ విపక్షాల నుంచి కనిపించడం లేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తే సమావేశంలో కాంగ్రెస్, టిడిపి పాల్గొనలేదు. అయితే కాంగ్రెస్ మాత్రం ఏప్రిల్ తొమ్మిదిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రభుత్వం చేస్తున్న తప్పును సవివరంగా చెబుతామని ప్రకటించింది. తరువాత వాయిదా అన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో బిజీగా ఉంటాం, ఆ తరువాత అన్నారు. అంబేద్కర్ జయంతి ముగిసి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఊసేత్తడం లేదు. రీ ఇంజనీరింగ్ డిజైన్‌లో తప్పులుంటే రాష్ట్రానికి దాని వల్ల నష్టం కలిగితే ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంది.


జల యజ్ఞం పేరుతో వైఎస్‌ఆర్ హయాం లో జరిగిన హడావుడి తెలంగాణ ప్రజలకు తొలిసారి ప్రాజెక్టులపై ఆశలు రేకెత్తించాయి. నిధుల కేటాయింపు, నీటి మాటలు అంకెల్లో ఘనంగానే కనిపించాయి. ఏం జరిగిందో కానీ వైఎస్‌ఆర్ ఐదేళ్లపాలనా కాలంలో తెలంగాణను వర్షాలే ఆదుకున్నాయి కానీ ప్రాజెక్టుల యజ్ఞ్ఫలం దక్కలేదు. ‘‘శాసన సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కెసిఆర్ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల గడువే ఉంది, ఐదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాను అని చెబుతున్నారు కాబట్టి ప్రజలను మోసం చేయడమే’’ ఓ కాంగ్రెస్ నేత వాదన ఇది. నిజమే మూడేళ్ల వరకు ఏమీ చేయకుండా ఐదేళ్లలో పూర్తి చేస్తాను అంటే ఇది ఫక్తు ఎన్నికల మాటే అని విశ్వసించాల్సిన అవసరం లేదు. ఏటా 25వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయిస్తున్నారు. ఐదేళ్ల సంగతి పక్కన పెడదాం. మూడేళ్లలో 75వేల కోట్లు ఖర్చు చేయాలి. 75వేల కోట్ల ఖర్చు కంటికి కనిపించకుండా ఉంటుందా? ఖర్చు చేయకుండా , ఏ పని చేయకుండా చేశామని చెప్పడం సాధ్యం అవుతుందా ? అలా చెబితే వాస్తవం ఏమిటో విడమరిచి చెప్పే ప్రజా సంఘాల చైతన్యానికి తక్కువేమీ కాదు తెలంగాణా లో .. 



కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంలో మూడేళ్లలో సగానికి పైగా లక్ష్యాన్ని చేరుకొంటారు. ప్రాజెక్టు అంటే ఐదేళ్లు, పదేళ్లు అనే పాత విధానం కాదు. వచ్చే ఏడాదిన్నర కాలంలోనే కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు దాకా నీటిని పంపించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాలువలు తవ్వి జేబులు నింపుకోవడం కాదు. బ్యారేజీలు, పంప్ హౌజ్‌లు, రిజర్వాయర్లు సమాంతరంగా నిర్మించనున్నట్టు ప్రభు త్వం ప్రకటించింది.
తెలంగాణ సంపన్న రాష్ట్రం, రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం, విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఇవన్నీ నిజాలే అయినా గ్రామీణ తెలంగాణ మాత్రం ఇంకా పేదరికంలోనే ఉంది. ఈ పేదరికం తాము పుట్టక ముందు ఉంది, పుట్టిన తరువాత ఉంది, వారసత్వ సంపదగా ఈ పేదరికానే్న వారసులకు ఇచ్చి వెళతాం అనేది నిన్నటి తెలంగాణ మాట. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి తెలంగాణ ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. పేదరికానికి వీడ్కోలు పలుకుతామనే ఆశాభావం తెలంగాణ పల్లెల్లో కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడేస్తుందనే రాజకీయ లెక్కల కన్నా ఆరు దశాబ్దాల తరువాత ప్రజల్లో కనిపిస్తోన్న ఆశలను నిజం చేయడం ప్రభుత్వ బాధ్యత.- బుద్దా మురళి (ఎడిట్ పేజి 7. 6. 2016)

1, మే 2016, ఆదివారం

హీరో 101 వ సినిమాకో కథ

‘‘అంత శ్రద్ధగా రాస్తున్నావు.. ఏంటి శ్రీశ్రీకి నివాళినా? ’’
‘‘తెలుగు సినిమాకు నివాళి.. ఆ ఏంటో అన్నావు. సరిగా వినలేదు’’
‘‘ ఏం రాస్తున్నావు ?’’
‘‘ మన తెలుగు హీరో 101వ సినిమాకు కథ రాస్తున్నాను. చదువు’’


***
పొలం నుంచి కారులో హీరో 200 కిలోమీటర్ల స్పీడ్‌తో ఇంటికి వెళుతున్నాడు. హఠాత్తుగా కారు నిలిచిపోయింది. నడిచే వెళదామని రెండు అడుగులు వేశాడు. విలన్లు దాడి చేసేందుకు చెట్టు చాటును పొంచి ఉన్నారు. ఆకాశంలో విమానం వెళుతున్న శబ్దం వినిపించి హీరో తల పైకెత్తి చూశాడు. వేగంగా పరిగెత్తే రైలును కంటి చూపుతో వెనక్కి వెళ్ళేట్టు చేసిన తనకు కంటిచూపుతో విమానాన్ని కిందికి దించడం ఓ లెక్కా అనుకున్నాడు. ప్రయాణీకులను ఇబ్బంది పెట్టడం మా వంశాచారం కాదు అంటూ ముందడుగు వేశాడు. విమానం ఒక్కసారిగా హీరో ముందు వాలిపోయింది. పైలట్ కిందకు దిగి సార్ విమానంలో ఎక్కండి మీ ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తాను. అని ప్రాదేయపడ్డాడు. హీరో సంశయిస్తూ చూస్తుంటే సార్ నాకు తెలుసు సహాయం చేయడమే తప్ప ఇంకొకరి నుంచి సహాయం పొందడం మీ వంశాచార రాజ్యాంగంలోనే లేదు. నేను మీ పాలేరును ఎర్రటి ఎండలో గొడ్లు కాస్తుంటే ఓసారి మీరు నా భుజంపై చేయి వేసి. బాగా చదువుకో వృద్ధిలోకి వస్తావు అని ఆశీర్వదించారు. మీ దయ వల్లనే నేను పైలట్‌ను అయ్యాను. మీ ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తే విమానం పావనం అవుతుంది. నా జీవితం ధన్యమవుతుంది. ఇది మీరు నాకు చేసే మహోపకారం అని ప్రాదేయపడడంతో హీరో వేడుకోలుకు కరిగిపోయి విమానం ఎక్కాడు.


ఇంటి వద్ద హీరో ఆశీస్సుల కోసం చాలా మంది వేచి ఉన్నారు. అయ్యగారూ మా బిడ్డకు మీరే పేరు పెట్టాలని ఓ డజను మంది తల్లిదండ్రులు హీరో కాళ్ల మీద పడ్డారు. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పిల్లలకు పేర్లు పుస్తకం 50 రూపాయలు పెట్టి కొంటే కొన్ని వేల పేర్లు దొరుకుతాయి. 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పేదలు పేరు కోసం హీరో కాళ్ల మీద పడ్డారు. వరుసగా వాళ్లందరికీ పేర్లు పెడుతూ హీరో వెళుతున్నారు.


దూరంగా ఒక మధ్య వయసు వ్యక్తి నిలబడ్డాడు. హీరో అతని వైపు చూస్తూ ఏం పరవాలేదు. మా వంశాచారం ప్రకారం ఏమడిగినా మేం సహాయం చేయడానికి సిద్ధం. మోహమాటపడకండి అడగండి అని అభయం ఇచ్చారు. బాబయ్యా మీరు నన్ను గుర్తు పట్టలేదు? అని ఆ అగంతకుడు ఆగాడు. రోజూ ఎంతో మంది మిమ్ములను సహాయం కోసం కలుస్తారు. ఎంత మందినని మీరు గుర్తు పెట్టుకుంటారు బాబయ్యా! నేను... నేను... అంటూ ఆ మధ్య వయసు అగంతకుడు రెండు చేతులు జోడించి మీరూ మీ నాన్న గారు మా దేశానికి వచ్చినప్పుడు మీ ఇద్దరి ఆశీర్వాదం వల్ల నేను ఇంతటి వాడిని అయ్యాను. ఇప్పుడు నేను అమెరికా అధ్యక్షుడు ఒబామాను ... మీ వంశానికి నేను రుణపడి ఉన్నాను బాబయ్యా! పనుల వత్తిడి వల్ల ఇంత కాలం మిమ్ములను కలువలేకపోయాను క్షమించండి బాబయ్యా! అంటూ ఒబామా రెండు చేతులు జోడించి హీరోను వేడుకున్నారు. 

చాలా సంతోషం జీవితంలో మంచి స్థితికి వచ్చారు. అభిమానుల నుంచి మా వంశం ఆశించేది ఇదే అంటూ హీరో అభిమానిని దీవించాడు. హీరో ఇంట్లో మనిషి అన్నపూర్ణ కనిపించగానే అమ్మా ఒబామాకు కడుపు నిండా అన్నం పెట్టి పంపు మన ఇంటికి వచ్చిన వాళ్లను కడుపు నింపి పంపడం మన ఇంటి ఆచారం అని చెప్పి హీరో లోపలికి వెళ్లిపోయాడు.


***
‘‘తెలుగు సినిమా ప్రేక్షకులంటే నీకెలా కనిపిస్తున్నారు. ఇదేం కథ. వెయ్యి మంది జనాభా లేని బోడి గ్రామంలో ఓ మోతుబరిని ప్రపంచ నాయకుడిగా బిల్డప్... అదేమన్నా శ్రీకృష్ణ దేవరాయ వంశమా ? మొఘలాయిల వంశమా ? కొద్దిగ నన్నా సహజత్వం ఉందా? కథైనా కాస్త నమ్మేట్టుగా ఉండాలి’’


‘‘ నువ్వు మరీ పాత కాలంలో ఉన్నావోయ్.. టెక్నాలజీ పెరిగింది. ఇంకా పాత కాలం ఆలోచనల్లోనే ఉన్నావు. సినిమాకు కథలు ఎక్కడి నుంచి వస్తాయి. జీవితం నుంచే కదా? ’’
‘‘ అంటే జీవితం ఇంత అసహజంగా ఉందా?’’
‘‘ మొన్నో పెద్ద రాజకీయ నాయకుడు ఏమన్నాడు. జగన్ ఇంటికి టిఫిన్‌కు పిలిచాడు. వెళ్లగానే మెడలో కండువా వేసి పార్టీలో చేర్చుకున్నాడు అని చెప్పాడు... ఓ మంత్రి కొడుకు అమ్మాయి చెయ్యి పట్టుకుని ఎందుకు లాగావురా! అని ప్రశ్నిస్తే కుక్కను తప్పించడానికి అన్నాడు ఇది సహజంగా ఉందా? అల్లరి చేస్తున్నాడని మంత్రి కొడుకును పిలిచి చితక్కొట్టించి పోలీసులకు పట్టించిన ఆ యువతి కాస్తా ఇప్పుడు అబ్బే అదంతా ఓ కల నా భ్రమ... అంతా ఉత్తుత్తిదే అని చెప్పగానే కోర్టు కేసు కొట్టేసింది. ఇందులో ఎవరి చర్య సహజంగా ఉంది చెప్పు ’’
‘‘ అంటే అది వేరు ఇది వేరు’’


‘‘ ఏళ్లపాటు జైలులో ముప్పు తిప్పలు పెట్టి పాపం అమాయకులు ఏమీ తెలియదు అని వదిలేయడం సహజంగా ఉందా? బుల్లి రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్, చైనా, అమెరికా చేస్తాననడం సహజంగా ఉందా? మాల్యా దేశంలో ఉన్నంత వరకు వౌనంగా ఉండి, పారిపోయాక, పాలకులు సీరియస్ కావడం సవ్యంగా ఉందా? ఓడిపోయిన వాడు కోర్టులో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడుస్తాడని మనకో పాత సామెత. ఆ ఇద్దరికీ కనీసం ఏడ్చే అవకాశం కూడా లేకుండా దాన్ని కూడా ఈ మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాక్కున్నారు. ’’
‘‘ దానికీ దీనికేం సంబంధం? ’’
‘‘ మన జీవితాలు సవ్యంగా లేవు, మన వ్యవస్థలు సవ్యంగా లేవు. మన రాజకీయాలు సవ్యంగా లేవు. మొత్తం సమాజమే సవ్యంగా లేదు. సవ్యంగా లేని సమాజంలో సినిమా కథలు మాత్రం సవ్యంగా ఉండాలని కోరుకోవడం ధర్మమా? ’’


‘‘ నిజమేనోయ్ కానీ మరీ విమానంలో లిఫ్ట్’’
‘‘ అంటే సినిమాలో ఈ ఒక్కటి తప్ప అంతా సవ్యంగానే ఉందంటావా? అభిమాని కనిపిస్తే ముద్దు పెట్టాలి, లేదంటే కడుపు చేయాలి అని యువతకు జ్ఞానబోధ చేసే హీరోల ఇమేజ్‌పై నీకు జెలసీ. అందుకే ఇలా విమర్శస్తున్నావు.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని, అట్టర్ ఫ్లాప్‌లను అడ్డుపెట్టి ఇలాంటి సినిమాలను ఆపలేవు ’’ - బుద్దా మురళి (జనాంతికం 1. 5. 2016) 

27, ఏప్రిల్ 2016, బుధవారం

ప్రభుత్వం పనితీరే తెరాసకు ఊపిరి

జల దృశ్యంలో ఒక మొక్కగా ఊపిరి పోసుకున్న టిఆర్‌ఎస్ 16 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో 29వ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ దృష్టిని ఆకట్టుకునే మహా వృక్షంగా ఎదిగింది. ఉద్యమ కాలంలో జై తెలంగాణ నినాదమే టిఆర్‌ఎస్‌కు ఊపిరిగా నిలిచి, టిఆర్‌ఎస్‌ను ఒక రాజకీయ పార్టీగా నిలబెట్టింది. ఇప్పుడు టిఆర్‌ఎస్‌కు ప్రభుత్వ పని తీరే అసలైన బలం. బుధవారం ఖమ్మంలో టిఆర్‌ఎస్ ప్లీనరీ జరుగుతోంది. ప్రభుత్వ పథకాలు ఎంత బాగా అమలు చేస్తే పార్టీ అంతగా పటిష్టపడుతుంది అని గ్రహిస్తే పార్టీకీ , తెలంగాణకు ప్రయోజనం. తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ ప్రజల సమస్యలను తెలంగాణ కోణంలో ఆలోచించి పరిష్కార మార్గాలు చూపే దిశగా పాలన సాగిస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో తిరుగులేని శక్తిగా నిలుస్తుంది. తప్పటడుగులు వేస్తే పార్టీ నష్టపోవడమే కాదు, తెలంగాణ సుడిగుండంలో చిక్కుకుంటుంది.


దాదాపు రెండేళ్ల పాలన చూసినా, ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసినా ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోందని స్పష్టమవుతోంది. వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆకస్మిక తనిఖీలు, ముఖ్యమంత్రి ఆగ్రహాలు వ్యక్తం చేయడం వంటి చిలిపి పనులతో నిరంతరం మీడియాలో ఉంటూ పని మంతునిగా బోలెడు ప్రచారం తెచ్చుకోవచ్చు. ప్రభుత్వానికి దీనికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణకు ఇది అవసరం లేదు. తెలంగాణ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే నిర్ణయాలు కావాలి. ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోందని ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తెలంగాణ ప్ర భుత్వం ఏదో చేసేసింది అని కాదు, చెప్పింది చేస్తుంది అనే నమ్మకంతోనే ప్రతి ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్ సైతం ఊహించని స్థాయిలో విజయం చేకూర్చి పెట్టారు. 

కొన్ని దశాబ్దాల పాటు పాలకులు 18 గంటలు కష్టపడ్డామని, ఎన్నో మీటింగులు పెట్టామని చెప్పినా తెలంగాణ కరవు సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణను ఇంత కాలం అంటిపెట్టుకుని ఉన్న శతకోటి దరిద్రాలకు కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే సరైన పరిష్కారం.
దర్భతో గోవును హతమార్చిన వశిష్టుడు గోహత్యా పాతకం పోయేందుకు తపస్సు చేసి గోదావరిని ఆ ప్రాంతం గుండా ప్రవహింప చేశాడని గోదావరి గురించి పురాణ కథ. కథలో నిజానిజాలు ఎలా ఉన్నా కోటి ఎకరాలకు సాగునీరు లభిస్తే, తెలంగాణకు గత నాయకత్వం తెలిసో తెలియకో చేసిన పాపాలను ప్రక్షాళన చేసి, సస్యశ్యామల తెలంగాణను అందిస్తే పాలకులకు అంతకు మించి పుణ్య కార్యం ఉండదు. ఈ దిశగా ప్రభుత్వం సరైన అడుగులే వేస్తోంది. మేం వెళ్లిపోతే హైదరాబాద్ తలక్రిందులు అయిపోతుందని, చీకట్లో బతుకుతారు అని బెదిరించిన వారు కుళ్లుకునే స్థాయిలో నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రియల్ ఎస్టేట్ పాతాళంలోకి ఏమీ వెళ్లలేదు. మరింతగా పెరిగింది. గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరం విద్యుత్ కోతలు లేని వేసవిని చూస్తోంది. ఇవన్నీ తాత్కాలిక విజయాలు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడం శాశ్వత విజయం. తాత్కాలిక విజయాలను సొంతం చేసుకుంటే ప్రభుత్వం బలంగా ఉండేట్టు చూసుకుంటే ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోంది అనే అభిప్రాయం ప్రజలకు కలిగించడంలో విజయం సాధించారు.


ఆసరా, డబుల్ బెడ్‌రూమ్, కోటి ఎకరాలకు సాగునీరు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తే, టిఆర్‌ఎస్ ఒక మహావృక్షంగా నిలుస్తుంది. పథకాల అమలులో మాట తప్పినా, వెనకడుగు వేసినా, లక్ష్యాన్ని చేరుకోకపోయినా టిఆర్‌ఎస్‌కు అదే పెద్ద ప్రమాదం. హామీల అమలులో విఫలమైతే మరుగుజ్జు నేతలే టిఆర్‌ఎస్‌ను బలంగా ఢీకోనే శక్తివంతులుగా అవతరిస్తారు. తన బలం మొత్తం ప్రకటించిన పథకాలను అమలు చేసి చూపడమే అని టిఆర్‌ఎస్ నాయకత్వం సదా గుర్తుంచుకోవలసిన అంశం.
తెలంగాణలో పెద్దగా ప్రతిపక్షం అంటూ లేదు. ప్రభుత్వం, పార్టీ దేనికైనా భయపడడం అంటే తామిచ్చిన హామీలను తాము విజయవంతంగా అమలు చేసే అంశంపైన ప్రజలకే భయపడాలి. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ రెండు కోవల్లోకి వస్తాయి. ఒకటి సినిమా నటులు తమ గ్లామర్‌ను పెట్టుబడిగా పెట్టి ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీలు. లేదా ఒక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీలు. ఆవిర్భావ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సినీ గ్లామర్ లేదు. వారసత్వ నాయకత్వం లేదు. తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకత్వం లేదు. నాయకత్వం ఒక జిల్లాకు ఒక నియోజక వర్గానికే పరిమితం అయి ఉండవచ్చు. కానీ ప్రజల ఆకాంక్ష మాత్రం తెలంగాణ వ్యాప్తం. తెలంగాణ ప్రజలు తమ చిరకాల స్వప్నాన్ని నిజం చేసే సత్తా ఉన్న పార్టీగా టిఆర్‌ఎస్‌ను గుర్తించారు.
తెలంగాణ వాదులే కాదు తెలంగాణ వ్యతిరేకులు సైతం కొద్ది కాలంలోనే ఈ విషయం గ్రహించారు. అందుకే తెలంగాణను కోరుకునే వారికి కెసిఆర్ కేంద్ర బిందువుగా మారితే, తెలంగాణ వ్యతిరేకులకు సైతం ఆయనే కేంద్ర బిందువుగా మారారు. 


చంద్రబాబు వైఎస్‌ఆర్, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి నాయకులు, ఆంధ్ర నాయకత్వం, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వర్గాలన్నీ కెసిఆర్‌నే కేంద్ర బిందువుగా చేసుకుని విమర్శలకు దిగాయి. అదే ఆయనకు వరంగా మారింది.
తెలంగాణకు సంబంధించి అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఆయననే  నాయకునిగా గుర్తించడం తెలంగాణకు బలమైన నాయకత్వం లభించేట్టు చేసింది. తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగింది, తెలంగాణ సాకారం అయితే ఎలా అభివృద్ధి చెందుతామో చెబుతూ కెసిఆర్ తెలంగాణ వారికి దగ్గరవుతుంటే, తెలంగాణ వ్యతిరేకులు ఆయన్ని వ్యతిరేకిస్తూ పాపులర్ నాయకునిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో కెసిఆర్‌ను నిలిపేందుకు తమకు తెలియకుండానే తమ వంతు సహకారం అందించారు. దీని వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ కాలంలోనే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా అభివృద్ధి చెందాల్సి ఉండే. కానీ అలా జరగలేదు.


 2014 ఎన్నికలకు ముందు వరకు 47 స్థానాల్లో పోటీ చేయడమే టిఆర్‌ఎస్ రికార్డు. 2004లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తే 27 స్థానాలు వచ్చాయి, 2009లో టిడిపితో కలిసి పోటీ చేస్తే 10 స్థానాల్లో గెలిచింది. తెలంగాణ ఉద్యమానికి టిఆర్‌ఎస్ కెరాఫ్ అడ్రస్ అని అన్ని పార్టీలు ఒప్పుకోక తప్పని పరిస్థితి. అయితే ఎన్నికల్లో సీట్ల సంఖ్య తక్కువ కావడం అసలు రాజకీయం. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో, జై తెలంగాణ నినాదాలు ఇవ్వడంలో, తీర్మానాలు చేయడంలో అన్ని పార్టీలు పోటీ పడ్డాయి. అదే సమయంలో పార్టీ అగ్రనాయకత్వాలు తెలంగాణను అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాయి.టిఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమం చేస్తే మేం మౌ నంగా ఉంటే మా నియోజక వర్గంలో కొత్త నాయకత్వం పుడుతుంది, అలా కాకుండా ఉండాలంటే మేం టిఆర్‌ఎస్ కన్నా గట్టిగా జై తెలంగాణ నినాదం వినిపించాలి అదే చేస్తున్నాం అంటూ ఉద్యమ కాలంలో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు చెప్పిన మాట. అన్ని పార్టీలు, అన్ని నియోజక వర్గాల్లో ఇదే విధంగా తెలంగాణ కోసం ఉద్యమాలు చేశాయి. సమయం వచ్చినప్పుడు పార్టీ నాయకత్వాలు తెలంగాణను అడ్డుకున్నాయి. దీంతో ఉద్యమ కాలంలో ఉద్యమ స్థాయిలో నియోజక వర్గాల్లో టిఆర్‌ఎస్ చొచ్చుకు వెళ్లలేకపోయింది. అలా కాకుండా ఉంటే ప్రతి నియోజక వర్గంలోనూ తెలంగాణకను కోరుకున్న యువనాయకత్వం గ్రామ స్థాయి నుంచి నియోజక వర్గం స్థాయి వరకు బలంగా ఉండేది. అలా జరగకుండా దాదాపు సగానికి పైగా నియోజక వర్గాల్లో పార్టీ ఏదైనా పాత కాపులే తమ తెలివి తేటలతో నియోజక వర్గంలో నాయకత్వం తమ చేయి దాటి పోకుండా చూసుకున్నారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. తెలంగాణ సాధించిన టిఆర్‌ఎస్‌కే పాలించే బాధ్యతను ప్రజలు అప్పగించాఠు. ఉద్యమ కాలంలో రాజకీయ భవిష్యత్తు కోసం అధిష్టానం కోరిక మేరకు నడుచుకున్న నాయకులు, ఎన్నికల తరువాత మళ్లీ తమ రాజకీయ భవిష్యత్తు కోసమే టిఆర్‌ఎస్‌ను ఆశ్రయించాయి. రెండు కుటుంబాలు, ఇద్దరు వ్యక్తులు, రెండు కులాల మధ్యనే పోరు అన్నట్టుగా తెలుగునాట గత మూడు దశాబ్దాల రాజకీయం సాగింది. అవశేష ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పటికీ అదే రాజకీయం కనిపిస్తుంటే తెలంగాణలో మాత్రం దీనికి భిన్నవైఖరి కనిపిస్తోంది. ప్రభుత్వ పాలన తెలంగాణ కోణంలో తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ సాగుతోంది. అందుకే మిషన్ కాకతీయ, భగీరథ వంటి పథకాలపై ప్రధానమంత్రితో పాటు నీతి ఆయోగ్ ప్రత్యేకంగా దృష్టిసారించింది.


ఇక రాజకీయాల అంశానికి వస్తే గతానికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదు. ఉద్యమ కాలంలో ఇష్టం లేకపోయినా జై తెలంగాణ అని నినదించిన నాయకులు నియోజక వర్గంలో పట్టు కోల్పోకుండా ఉండడమే కాకుండా తరువాత మంత్రివర్గంలో సైతం స్థానం సంపాదించారు. వారు అలా అని ఉండకపోతే బలమైన కొత్త నాయకత్వం పుట్టుకు వచ్చేది. తెలంగాణ ఈ అవకాశాన్ని కోల్పోయింది. అధికార పక్షం ఎమ్మెల్యేలనే కొనుక్కొని ప్రభుత్వానే్న పడగొట్టే మహా నీతిమంతుల ఎత్తుగడలను తిప్పి కొట్టి టిటిడిపినే టిఆర్‌ఎస్‌లో విలీనం అయ్యేట్టు చేశారు. అధికారం కన్నా సిద్ధాంతాలే ముఖ్యం అని మడికట్టుకుని కూర్చోని ఉంటే టిఆర్‌ఎస్ కూడా సిపిఐ, సిపిఎం తరహాలో మిగిలిపోతే, ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే కాంగ్రెస్, టిడిపిల మధ్య అధికార మార్పిడి జరిగేది. గొంగట్లో తింటూ వెంట్రుకలను ఏరినట్టు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత కన్నా గొప్ప విలువలతో కూడిన రాజకీయాలను ఆశించడం అత్యాశే. ఎందుకు చేర్చుకుంటున్నారు? ఎందుకు చేరారు అనే వాటి జోలికి ప్రజలు వెళ్లడం లేదు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసే స్వాప్నికునిగా కెసిఆర్‌ను ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు తొలుత కెసిఆర్ ఒక్కరికే తెలంగాణ సాధ్యం అనే గట్టి నమ్మకం ఉండేది. అందరికీ అపనమ్మకమే. ఇప్పుడు బంగారు తెలంగాణ సాకారం అవుతుందనే నమ్మకం తెలంగాణ మేలును కోరుకునే వారందరికీ ఉంది. ఆ నమ్మకం ప్రతి ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తోంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. 

ప్రజల్లో కెసిఆర్ పట్ల అంత బలమైన నమ్మకం ఉంది కాబట్టే విపక్షాలు డీలా పడడమే కాదు. సొంత పార్టీలోని నేతలు సైతం మౌ నంగా ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వం పట్ల ప్రజల్లో ఇంతటి విశ్వాసం లేకుంటే సొంత పార్టీ వారే విశ్వరూపం చూపించేవారు. ఈ నమ్మకాన్ని కలకాలం నిలబెట్టుకోవలసిన బాధ్యత కెసిఆర్‌పైనే ఉంది. అదే తెలంగాణకు మేలు.- బుద్దా మురళి (ఎడిట్ పేజి 27. 4. 2016)

24, ఏప్రిల్ 2016, ఆదివారం

ఓటరుకో విగ్రహం!

‘‘దేశంలో ఎత్తయిన విగ్రహం ఏదో తెలుసా?’’
‘‘ మోదీ మాట నిలబెట్టుకుంటే పటేల్ విగ్రహం, కెసిఆర్ నిర్మించే అంబేద్కర్ విగ్రహం, లేదంటే బాబు గారి అంబేద్కర్ విగ్రహం.. కానీ నాకైతే ఈ మూడూ అనుమానంగానే ఉన్నాయి. ’’
‘‘ విగ్రహాల గురించి అడిగితే, రాజకీయాల గురించి చెబుతున్నావ్’’
‘‘రెండూ ఒకటే. భోజరాజుకు సాలభంజికలు కథలు చెప్పినట్టు ప్రతి విగ్రహం వెనుక రాజకీయ కథ ఉంటుంది.’’
‘‘ గుజరాత్ అనగానే మహాత్మాగాంధీ గుర్తుకు వస్తారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు మహాత్మున్ని పటేల్‌తో రీ ప్లేస్ చేస్తూ, గుజరాత్‌లో పటేళ్ల ఓటు బ్యాంకును పదిల పరుచుకోవడానికే మోదీ ప్రపంచంలోకెల్లా ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు’’
‘‘పటేల్ ఈ దేశం కోసం ఏమీ చేయలేదా? ’’
‘‘గాంధీ, పటేల్ మాత్రమే కాదు వారి కన్నా ముందు, వారి తరువాత ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. అయితే విగ్రహాలకు వారి త్యాగాలు కాదు, వారి ఓటు బ్యాంకే కొలమానం. ’’
‘‘ పటేళ్లే మోదీకి తలనొప్పిగా మారారని వార్తలొస్తున్నాయి. ’’
‘‘ పటేల్ విగ్రహ ఏర్పాటు సైతం నెమ్మదించింది అందుకేనేమో! ఇంటికో ఇటుక సేకరించి రామ మందిరం నిర్మిస్తామని, ఆ నినాదంతోనే అధికారంలోకి వచ్చిన వాళ్లు ఆ సంగతి మరిచిపోయారు. దేవుడినే బురిడీ కొట్టించినప్పుడు రాజకీయ వారసులు కూడా లేని పటేల్‌ను పక్కన పెట్టలేరా? ’’


‘‘రాజకీయాలకు విగ్రహాలకు సంబంధం అంటే నమ్మలేకపోతున్నాను? ’’
‘‘ విగ్రహాలకు రాజకీయాలకు ప్రపంచ వ్యాప్తంగా అవినాభావ సంబంధం ఉంది. రెండు వేల ఏళ్ల క్రితమే బుద్ధుడు విగ్రహారాధనను వ్యతిరేకించారు. ప్రపంచంలో కెల్లా ఎక్కువ విగ్రహాలు, ఎత్తయిన విగ్రహాలు, ఎక్కువ దేశాల్లో విగ్రహాలు ఉన్నది బుద్ధుడికే. ప్రపంచంలో అత్యధికులు దేవునిగా పూజించేది విగ్రహారాధనను వ్యతిరేకించిన బుద్ధ విగ్రహాలనే.. ఆఫ్ఘానిస్తాన్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధ విగ్రహాన్ని తాలిబాన్లు కూల్చేశారు!! ’’
‘‘ అవును కూలిస్తే ? ’’
‘‘ ఆఫ్ఘానిస్తాన్ బుద్ధ దేశంగా ఉన్నప్పుడు బుద్ధుని విగ్రహాలు వెలిశాయి, రాజకీయాల్లో మార్పులు వచ్చి తాలిబానిజం పెరిగినప్పుడు విగ్రహాలు కూలాయి. విగ్రహారాధనను వ్యతిరేకించి మతంలానే వ్యక్తి పూజను వ్యతిరేకించే దేశా లు పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్లూ విగ్రహారాధనకు, విగ్రహ పూజకు అతీతులు కారు. ’’
‘‘ వాళ్లెవరు? ’’
‘‘ సోవియట్ రష్యా... శ్రీశ్రీ చెప్పినట్టు గర్జించు రష్యా గాండ్రించు రష్యా అనే నినాదాలతో ఓ వెలుగు వెలిగినప్పుడు లెనిన్ విగ్రహాలు పూజలందుకునేవి. 75ఏళ్ల వయసులో వృద్ధాప్యం మీద పడి గాండ్రించే రష్యా కాస్తా చతికిల పడ్డ రష్యాగా మారినప్పుడు లెనిన్ విగ్రహాలను కూల్చేశారు. రాజకీయం మారినప్పుడు విగ్రహాల స్థానం మారుతుంది.’’
‘‘ ఏ విగ్రహం కూడా శాశ్వతం కాదన్నమాట’’
‘‘ రాజకీయంగా ప్రయోజనం ఉన్నంత వరకే ఆ విగ్రహం శాశ్వతం. మనువాద పార్టీలు అంటూ బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పుట్టిన బిఎస్‌పి మాయావతి బహెన్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చాక ఉత్తరప్రదేశ్‌లో భారీ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ’’


‘ కానీ ఆమెనే బ్రాహ్మణులకు ఎక్కువ టికెట్లు ఇచ్చారట కదా? ’’
‘‘ నిజమే ఉత్తర ప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా బ్రాహ్మాణులకు టికెట్‌లు ఇచ్చిన ఘనత ఆమెదే. 70మందికి పైగా టికెట్‌లు ఇచ్చారు. ఎన్టీఆర్ సావిత్రి, అక్కినేని వాణిశ్రీ, చిరంజీవి విజయశాంతి హిట్ పేయిర్ అంటూ తెలుగు సినిమా జంటలు ఉండేవి తెలుసు కదా? ఈ జంట కలిసి నటిస్తే సినిమా సూపర్ హిట్ అని గట్టి నమ్మకం ఉండేది. కుటుంబ నియంత్రణపై పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో ఒక్కో సినీ కుటుంబం నుంచి డజన్ల కొద్ది హీరోలు వచ్చి వాలిపోతున్నారు. అలానే ఫ్యాక్షన్ కథలకు ఒకప్పుడు మినిమం గ్యారంటీ ఉండేది. రాజకీయాల్లో సైతం సరిగ్గా ఇంతే. బహుజన నినాదంతో రాజకీయంగా బలమైన శక్తిగా నిలిచిన మాయావతి హిట్ కాంబినేషన్ కోసం దళిత, బ్రాహ్మణ వాదాన్ని మిక్స్ చేశారు. దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అన్నారు. ములాయం బిసి, మైనారిటీ కాంబినేషన్‌తో విజయం సాధించారు. లేకపోతే ఉత్తర ప్రదేశ్‌లో అతి పెద్ద మనువు విగ్రహాలు ఏర్పాటయి ఉండేవి కూడా? ’’
‘‘???’’


‘ రాజకీయాల్లో విగ్రహాలను నమ్ముకున్న వాళ్లు ఎవరూ చెడిపోలేదు. ఎన్టీఆర్‌ను దించేసిన బాబే శ్రీకృష్ణునిగా ఎన్టీఆర్ విగ్రహం చేయించారు. జగన్ ముందు చూపుతో వైఎస్‌ఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్లనే కదా బలమైన విపక్షంగా నిలిచింది. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను కూల్చేశాక కేంద్రం సైతం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగం చేసింది. ’’
‘‘ ఆ విగ్రహాలను విజయవాడకు పార్సిల్ చేస్తాను అని కెసిఆర్ చెబితే, మేం తీసుకుంటాం అని సినీ పెద్ద మురళీ మోహన్ అన్నారు. కెసిఆరే ఇప్పుడు ఎన్టీఆర్ జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటామని చెబుతున్నారు. ’’
‘‘ ఆ మాటల్లో నిజంగా ప్రేమ ఉందంటావా? మీ దేశం మీరు వెళ్లండి మీరు వదిలిన విగ్రహాలను మేం జాగ్రత్తగా చూసుకుంటాం అని అప్పగింతలు చెప్పడం అయితే కాదు కదా? ’’
‘‘ ఏమో నాయకుల మాటలకు అర్ధాలే వేరు? దీని కంతటికీ కారణం ఏమంటావు? ’’
‘‘ నెహ్రూతో పాటు ఆనాటి జాతీయ నాయకులంతా కారణం? ’’
‘‘ ఇంకా నయం జగన్ కారణం అనలేదు? వాళ్లేం చేశారు. ’’
‘‘స్వాతంత్య్రానికి ముందులా కొందరికే ఓటు హక్కు ఉంటే కొందరి విగ్రహాలే కనిపించేవి. సార్వజనీన వయోజన ఓటు హక్కు వల్ల ఓటున్న సామాజిక వర్గాలన్నింటికి విగ్రహాలు వస్తాయి . ’’
‘‘ ఆర్‌కె లక్ష్మణ్ కామన్ మ్యాన్ విగ్రహంలా సింబాలిక్‌గా ఓటరుకే భారీ విగ్రహం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఆ పార్టీకే అంతా ఓటు వేస్తారు కదా? ’’
‘‘ఓటరు దేవుళ్లు అని పూజించే నాయకులు ఓటరుకు విగ్రహాన్ని నిర్మించే రోజులు కూడా వస్తాయి’

-బుద్దా మురళి (జనాంతికం 24. 4. 2016)

17, ఏప్రిల్ 2016, ఆదివారం

చంద్రోదయం!

‘‘ఇంత కాలానికి కెసిఆర్ అసలు విషయం చెప్పారు’’
‘‘ఏంటా అసలు విషయం? ’’
‘‘బాబా సాహెబ్ అంబేద్కర్ వల్లనే తెలంగాణ ఏర్పడిందని ఒప్పుకున్నా రు కదా? సోనియాగాంధీ వల్ల అని, కెసిఆర్ ఉద్యమంతో సాకారం అయిందని, తెలంగాణ ప్రజలు జరిపిన ఉద్యమంతోనే తెలంగాణ సాకారం అయిందన్నారు. ఇప్పుడు చూడు కెసిఆరే స్వయంగా అసలు విషయం చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా అంబేద్కర్‌కు రాజ్యాంగ రచన బాధ్యత అప్పగించక పోయి ఉంటే సమైక్యాంధ్రలో మనం చక్కగా ఉండేవాళ్లం ’’
‘‘సరే అయిపోయిన పెళ్లికి ఏమనుకుంటే ఏం కానీ... సపోజ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఉండక పోతే తెలంగాణ రాకపోయి ఉండేదని నీ అభిప్రాయమా? రాజ్యాంగం ఎవరో ఒకరు రచించాల్సిందే, రాష్ట్రాల ఏర్పాటుకు ఏదో ఒక నిబంధన చేర్చాల్సిందే కదా? అంబేద్కర్‌కు ఉన్న ముందు చూపు వల్ల ఆ అధికారం కేంద్రం చేతిలో పెట్టారు. ’’
‘‘అంటే కెసిఆర్ చెప్పింది నిజం కాదా? ’’
‘‘వెనకటికో రాజుగారి కుమారుడి జాతకంలో శునకంతో ప్రాణాలకు ముప్పు ఉందంటే ఒంటి స్తంభం మేడ గట్టించి కుమారున్ని ఎవరి కంట పడకుండా రాజు దాచి పెడతాడు. పిల్ల రాజు శునకం బొమ్మతో ఆడుకుంటుంటే గుండెల్లో కుచ్చుకుని ప్రాణాలు విడుస్తాడు. జాతకంలో అలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది అంతే. బుద్ధుడు జాతకాన్ని చూసి దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా పెంచాలని శుద్ధోదనుడు ప్రయత్నిస్తే, ఏమైంది చివరకు గౌతముడు రాజ్యాన్ని, భార్యను వదిలేసి బుద్ధుడయ్యా డు కదా? జాతకాలను బుద్ధుడు వ్యతిరేకించి ఉండవచ్చు కానీ ఆయన జాతకంలో అలా రాసిపెట్టి ఉంది అంతే. అలానే తెలంగాణ ఏర్పడాలని తెలంగాణ ప్రజల జాతకంలో రాసిపెట్టి ఉంది. శుద్ధోదనుడు ఎన్ని అడ్డంకులు కల్పించినా బుద్ధునికి జ్ఞానోదయం అనివార్యం అయినట్టు ఎన్ని అడ్డంకులు కల్పించినా తెలంగాణ సాకారం అయింది. అంతా జాతక మహిమ. ’’
‘‘నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే తెలంగాణ వచ్చేదా? ’’
‘‘గాంధీ లేకపోతే స్వాతంత్య్ర ఉద్యమం సాగేది అని కొందరి అనుమానం. నెహ్రూ పోయాక ఈ దేశం ఏమవుతుందో అని భయపడ్డవాళ్లున్నారు. ఎవరూ లేకపోయినా చాయ్ వాలా కూడా ఈ దేశాన్ని పాలించగలడు అని మోదీ నిరూపించారు. బాబు గారు ఓడిపోతే భూమి బద్దలవుతుంది అని 2004లో మేధావులే ఆందోళన పడ్డారు. వైఎస్‌ఆర్ వచ్చాక ఐటి ఎగుమతులు మరింతగా పెరిగాయి. కెటిఆర్ నాయకత్వంలో ఇప్పుడు మరింత వేగంగా ఐటిలో అభివృద్ధి కనిపిస్తోంది. తీన్మార్‌లో మల్లన్న పోతే చానల్‌లో చూసేందుకు ఏముంటుందని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. ఏమైంది మల్లన్న ప్లేస్‌లో బిత్తరి సత్తి వచ్చాక రేటింగ్ ఇంకా పెరిగింది. దేని కోసం ఏదీ ఆగదు. ’’
‘‘ నేను అడిగిన దాని గురించి చెప్పు’’
‘‘యుపిఏ ప్రభుత్వం, సోనియా నాయకత్వం ఉండి ఉండకపోతే, కెసిఆర్ నాయకత్వంలో ఉద్యమం జరగకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. 1969లో ఉధృతంగా ఉద్యమం సాగింది కానీ ఫలించలేదు. అలా రాసిపెట్టి ఉంది అంతే’’
‘‘ ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందటావ్?’’
‘‘చంద్రబాబు వల్ల తెలంగాణ వచ్చిందటాను కాదంటావా? బాబు పాలనలో వరుస కరువు, విద్యుత్ చార్జీలు పెంచడం, చార్జీలు తగ్గించమని రైతులు ఆందోళన చేస్తే కాల్పులు జరిపి ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం వంటివన్నీ జరిగి ఉండక పోతే కెసిఆర్ ఉద్యమానికి జనం అండగా నిలిచేవారా? బాబుగారి వల్లనే తెలంగాణ వచ్చిందటాను’’
‘‘నువ్వేమనుకున్నా అంబేద్కర్ వల్లనే.. కాకపోతే 125 అడుగులు ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని కెసిఆర్ ఎందుకు ప్రకటిస్తారు’’
‘‘ చూడోయ్ రాజకీయ నాయకుడు ఏం చేసినా అందులో రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయం ప్రజలకు మంచిచేసేదైతే స్వాగతిద్దాం. విగ్రహాల్లోనూ కచ్చితంగా రాజకీయమే ఉంటుంది. ఇద్దరు చంద్రుల మధ్య విగ్రహ పోటీ సాగుతోంది. ఎప్పుడొచ్చామన్నది కాదు. బుల్లెట్ దిగిందా లేదా? అనే డైలాగు తరహా కెసిఆర్‌ది. కెసిఆర్ కన్నా ముందు బాబు విగ్రహ ప్రకటన చేశారు, కానీ కెసిఆర్ ముందు విగ్రహాన్ని నిర్మించి చూపిస్తారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని చేర్చడం ద్వారా తెలంగాణ సాకారం కావడానికి దోహదం చేసిన అంబేద్కర్‌కు భారీ విగ్రహం నిర్మించి నివాళి అర్పిస్తాను అని కెసిఆర్ చెబుతున్నారు. సెక్షన్ 8తో కెసిఆర్‌ను ఇరకాటంలో పెట్టాలనుకుంటే ఆర్టికల్ 3తో బాబును ఇరకాటంలో పెట్టారు. నెక్లెస్ రోడ్ అంటే ఎన్టీఆర్ పేరు గుర్తొస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ స్థానంలో ఆర్టికలో 3ని చేర్చిన అంబేద్కర్ పేరు గుర్తుకు రావడం ఇదే రాజకీయం .
‘‘ కెసిఆర్‌కు ఆంధ్రలో సైతం పాపులారిటీ లభించడం కెసిఆర్ పాలన వల్లనా లేక బాబుపై వ్యతిరేకత వల్లనా? ’’
‘‘ ఆంధ్రలో ఆంధ్ర సంస్థలు జరిపిన సర్వేల్లో కూడా ఆ చంద్రుడి కన్నా ఈ చంద్రుడి పాలన బాగుందని చెప్పారట ! మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టు, సొంత రాష్ట్ర ప్రజలు విమర్శించినందుకు కాదు కానీ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి పనితీరును తమ రాజ్య ప్రజలు అభినందిస్తున్నందుకు బాబుకు చిరాకెత్తిందట! అయితే ఏ సర్వేలో ఏ రాజకీయం ఉందో కాబట్టి ఈ సర్వేలను అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదనుకో’’
‘‘ అంటే సర్వే జగన్ కుట్ర అంటావా? ’’
‘‘ అన్నింటికీ జగన్ కుట్ర అనడం కామన్ డైలాగ్. జగన్‌మీద కుట్ర ఈ సర్వే అని ఎందుకనుకో కూడదు. బాబు గ్రాఫ్ పడిపోతున్నా, విపక్ష నాయకుడి పట్ల ప్రజలు విశ్వాసం చూపించడం లేదు అనే ప్రచారం చేసేందుకు జగన్‌పై సర్వేల కుట్రలు జరపవచ్చు కదా? ’’
‘‘ వారికి లేని ఆలోచనలు నువ్వు పుట్టించేట్టు ఉన్నావు? ’’
‘‘ ఏది నిజం అనే ఆలోచన వదిలేయ్ ! ఏ ప్రచారాన్ని ఎవరు ఎందుకు ప్రారంభించి ఉంటారని ఆలోచించు రాజకీయం అర్ధమవుతుంది ’’

-బుద్దా మురళి (జనాంతికం 17-4-2016)

11, ఏప్రిల్ 2016, సోమవారం

స్క్రిప్ట్ మార్చండి!


‘‘ దిగులుగా ఉన్నావేంటి?’’
‘‘ న్యూ ఇయర్ ఆలోచనలు ’’
‘‘దుర్ముఖి నామ సంవత్సరంపై భయపడాల్సిందేమీ లేదని కెసిఆర్ పంచాంగ శ్రవణంలో చెప్పారు కదా? ’’
‘‘ తెలుగు కాదు ఇంగ్లీష్ సంవత్సరం గురించి? ’’


‘‘ హేమా మాలిని తెల్ల జుట్టుతో కనిపించడం లేదా? ఒక రోజు ఐశ్వర్యారాయ్ కనిపిస్తుంది. దిగులు పడితే అవుతుందా? ’’
‘‘రోజులు గడిచిపోతున్నాయని కాదు. విజయమాల్యా విదేశాలకు వెళ్లిపోయారు కదా? కొత్త క్యాలండర్ వస్తుందా? రాదా? అనేదే నా బాధ. అందమైన అమ్మాయిల బొమ్మలతో చక్కని క్యాలండర్‌ను ప్రతి ఏటా విడుదల చేసేవాడు. మనసు బాగా లేనప్పుడు క్యాలండర్‌లోని ఆ ముద్దు గుమ్మలను చూస్తూ సమస్యలన్నీ మరిచిపోయే వాడ్ని. కత్రినాకైఫ్ లాంటి వాళ్లెంతో మంది ఆ క్యాలండర్‌లో మనను కనువిందు చేశారు. ఆ మహానుభావుడు తన వ్యాపారాన్ని, వ్యవహారాలను పక్కన పెట్టి అందమైన అమ్మాయిల క్యాలండర్ ఫోటో షూట్ కోసం చెట్ల వెంట పుట్టల వెంట, సముద్రాల వెంట తిరిగేవాడు. మన కష్టాలను పారద్రోలిన ఆయనకు కష్టాలంటే నమ్మలేక పోతున్నాను. విధి బలీయమైంది. ’’
‘‘మాట్లాడుకోవడానికి నీకు మరో అంశమే లేదా? ’’
‘‘సరే సర్దార్ గబ్బర్ సింగ్ ఎలా ఉందట! ’’
‘‘ కొందరు పండగ అంటే మరికొందరు దండగ అంటున్నారు. ఒక అభిమాని అకాశానికి ఎత్తితే మరో అభిమాని పనిలేకపోతే రామకోటి రాసుకోవాలి కానీ కథ స్క్రీన్‌ప్లే మాత్రం రాయవద్దని ఫేస్‌బుక్‌లో సలహా ఇచ్చారు. నేను చూడలేదు కాబట్టి చెప్పలేను. ’’


‘‘సినిమాలు చూడక పోతే రాజకీయాల గురించి ఎలా తెలుస్తుంది?టీచర్ పిల్లలకు చెప్పాల్సిన పాఠం ముందుగా చదువుకొని వెళ్లకపోయినా ఇబ్బంది లేదు. జర్నలిస్టు పేపర్ చదవక పోయినా ఏమీ కాదు. టీవి యాంకర్‌కు తాను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి పేరు తెలియక పోయినా ఏమీ కాదు. కానీ కలికాలంలో సినిమా గురించి తెలియక పోతే ఎలా బతుకుతావోయ్ ’’
‘‘రాజకీయాలకు సినిమాకు సంబంధం ఏంటోయ్?’’
‘‘ 82లో బెబ్బులి పులి వంటి సూపర్ హిట్ సినిమాల తరువాతే కదా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చింది. అలానే పవన్ కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఇచ్చి రాజకీయాల్లోకి ఫుల్‌టైమ్‌గా రావాలని వ్యూహం. ఈ విషయం తెలిసే అధికారపక్షం, విపక్షం సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేస్తోంది.’’


‘‘ఎట్టెట్టా! ’’
‘‘జగన్ అధికారంలోకి వస్తే దించడం కష్టం అని పవన్ వ్యూహాత్మకంగా బాబుకు మొన్న ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. అంటే 2019లో పవన్ అధికారంలోకి రావాలంటే బాబు గెలవాలి అదీ వ్యూహం. అందుకే ఇప్పుడు ఇద్దరి వర్గం సినిమా ప్లాప్ అని ప్రచారం చేస్తోంది’’
‘‘ఈ వ్యూహాల సంగతి తెలియదు కాదు. పవన్ ఆ డైలాగు చెప్పినప్పుడు ఆయనలో మాత్రం నిజాయితీ కనిపించింది? ’’
‘‘ఏ డైలాగు? ’’
‘‘నాక్కొంచం తిక్కుంది. అనే డైలాగు’’
‘‘రాజకీయాలంటే నీకు మరీ జోకులయ్యాయి.. రాజకీయాలంటే ఒక పవిత్ర కార్యం. సరే లోకేశ్‌ను మంత్రివర్గంలో తీసుకుంటారా? ’’


‘‘మీ బాబాయ్‌కి స్వీట్ షాపుంది కదా? వాళ్ల అబ్బాయి ఓ స్వీట్ బాక్స్ అడిగితే ఇస్తాడా? ’’
‘‘ఎందుకివ్వడు షాపే వాళ్లది’’
‘‘ఇదీ అంతే ప్రాంతీయ పార్టీ అంటే కుటుంబ వ్యాపారమే? హెరిటేజ్ బాధ్యతలు ఇవ్వడం ఎలాగో ఇదీ అంతే.. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు. లోకేశ్ లోకనాయకుడు అని పల్లె రఘునాథరెడ్డిలాంటి వారి సిఫారసూ అవసరం లేదు. లోకేశ్ గురించి తల్లిదండ్రుల కన్నా పార్టీ వారికి ఎక్కువ తెలుసా? ’’
‘‘ ఏదీ తిన్నగా చెప్పవు కదా? ’’
‘‘ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ వ్యాపారాలే. ప్రాంతీయ పార్టీలు పుట్టిన తమిళనాడు నుంచి కొత్తగా పుట్టిన మన తెలుగు రాష్ట్రాల వరకు అంతా అంతే. ’’


‘‘ తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీలో కిలోల లెక్క అమ్ముతుంటే చలించిపోయిన ఎన్టీఆర్ టిడిపిని పెట్టారు. ప్రాంతీయ పార్టీలను కుటుంబ వ్యాపారం అని తేలిగ్గా తీసేస్తావా? కొన్ని కోట్ల మంది ఆశలకు ఆశయాలకు, సిద్ధాంతాలకు ప్రతిరూపం’’
‘‘ ఎన్టీఆర్ అయినా కెసిఆర్ అయినా ఏదో త్యాగం చేయాలని పార్టీ పెట్టరు. ఒక్కో పార్టీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. 60 ఏళ్ల హీరో రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీమ్ పాత టిడిపి , మామ గారి రెండో పెళ్లికి అల్లుడికి దక్కిన కట్నం కొత్త టిడిపి, టెక్ట్స్‌బుక్ నాలెడ్జ్‌తో పుట్టిన పార్టీ లోక్‌సత్తా, ఏ నాలెడ్జ్ లేకుండా పార్టీ పెడితే జనసేవ అవుతుంది.
కాలం కాని కాలంలో కూసిన కోయిల ప్రజారాజ్యం. ఒక ప్రాంత ప్రజల వివక్షపై ఆసంతృప్తి ఆగ్రహంగా మారితే పుట్టిన పార్టీ టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ స్కీముల నుంచి పుట్టిన పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పార్టీలు వామపక్షాలు. మతం నుంచి పుట్టింది బిజెపి, బ్రిటీష్ పాలకులకు వినతిపత్రాలు ఇవ్వడం కోసం ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ చాలా ఇంకా చెప్పాలా? ’’


‘‘ అందరు నాయకులు తమ పిల్లలకు పదవులు ఇచ్చిన వారే కదా? ’’
‘‘ఇవ్వలేదని, అలా ఇవ్వవద్దని ఎవరన్నారు? హీరోయిన్ బొడ్డును అందంగా చూపిస్తారని రాఘవేంద్రరావు సినిమాలకు యమ క్రేజీ ఉండేది. స్మార్ట్ఫోన్ పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచ నగ్న స్వరూపమే అరచేతిలో ఉన్నప్పుడు హీరోయిన్ బొడ్డు చూసేందుకు రాఘవేందర్‌రావు సినిమాలకెళ్మేదెవరు? కాలాన్ని బట్టి మారాలి. సినిమాల స్కిృప్ట్ మారుతోంది అది గమనించకుండా రాజకీయాల్లో ఇంకా పెద్దమనుషులు సినిమా కాలం నాటి స్క్రిప్ట్‌లే వినిపిస్తే ఎలా? మీ అబ్బాయకి మంత్రి పదవి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాం అని ప్రజాప్రతినిధులతో డ్రామాలెందుకు ? ప్రజలు వీటిని నమ్మేంత అమాయకులు కాదు. ’’
‘‘ప్రజలు వీరి చేతిలో ఇలా మోసపోవలసిందేనా? ’’


‘‘ అలా అని ఏమీ కాదు ఇంకెంత కాలం వీరి చేతిలో మోసపోతారు? మోసం చేసేందుకు మాకూ ఓ చాన్స్ ఇవ్వండి అని చాలా మంది వస్తూనే ఉంటారు. కావాలంటే రాజకీయ చరిత్ర చదువు మోసం కు మార్కెట్ ఉందిఅని  గ్రహించినప్పుడల్లా మార్కెట్ లోకి కొత్త పార్టీ లు వచ్చాయి . వస్తూనే ఉన్నాయి . వస్తుంటాయి  ’’
-బుద్దా మురళి (జనాంతికం 10.4. 2016)

3, ఏప్రిల్ 2016, ఆదివారం

కెసిఆర్-బాబు-జగన్.. మిస్టరీ

‘‘దీని వెనుక ఏదో మతలబు ఉందనిపిస్తోంది. బాబు మంచి మిత్రుడని కెసిఆర్ చెప్పడం మాయగా ఉంది’’
‘‘కోటి ఎకరాలకు సాగునీరిస్తానన్న విషయంపైనా నీ అనుమానం’’
‘‘నీళ్లిస్తే నాకేంటి, ఇవ్వక పోతే ఏంటీ ? హైదరాబాద్‌లో నాకు ప్లాట్లు తప్ప వ్యవసాయ భూమి లేదు. అసలు విషయం ఉద్దేశ పూర్వకంగా దాట వేస్తున్నావు’’


‘‘ ఇలానే తెలివిగా ఆలోచిస్తే అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌ల మధ్యనే ఏదో మతలబు ఉంది.
షరీఫ్ మనవరాలి పెళ్లి వేడుకలకు మోదీ ఎందుకు వెళ్లారు. చిన్ననాటి మిత్రులా? దగ్గరి బంధువులా? ఇంకాస్త విస్తృతంగా ఆలోచిస్తే అమెరికాకు పాకిస్తాన్‌కు మధ్య కూడా ఏదో మతలబు ఉంది. అమెరికా నిధులతోనే పాకిస్తాన్ బతుకుతుంది. అమెరికా స్నేహపూర్వకంగా ఇచ్చే ఆయుధాలతోనే పాకిస్తాన్ యుద్ధాలు చేస్తుంది. అమెరికాకు పాక్‌తో స్నేహం, చైనా పాకిస్తాన్ మా స్నేహ దేశం అని ప్రకటించింది. మోదీ పాకిస్తాన్ వెళ్లి వచ్చారు. అంటే అమెరికా, చైనా, ఇండియా, పాకిస్తాల మధ్య బహిరంగ స్నేహం, రహస్య శతృత్వం మిస్టరీ ఉందనిపిస్తోంది. దశాబ్దాల పాటు శత్రువులుగా పోరాడిన క్యూబాకు అమెరికా స్నేహ హస్తం అందించింది. మొత్తం ప్రపంచ దేశాల మధ్యనే ఏదో రహహ్య మతలబు సాగుతున్నట్టు అనిపించడం లేదా? ’’


‘‘ఏదో చెప్పి నన్ను నన్ను కన్‌ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తున్నావు. నేను రెండు తెలుగు రాష్ట్రాల నాయకుల స్నేహం గురించి చెబుతుంటే నువ్వు ప్రపంచ దేశాల గురించి మాట్లాడుతున్నావు.
‘‘సరే లోకల్ మిస్టరీ గురించే మాట్లాడుకుందాం. కెసిఆర్‌కు బాబుతోనే కాదు అందరితో రహస్య స్నేహం ఉందనిపిస్తోంది. 2014 ఎన్నికల పోలింగ్ ముగియగానే తెలంగాణలో టిఆర్‌ఎస్, ఆంధ్రలో జగన్ అధికారంలోకి వస్తారని చెప్పారు కదా? ఏ బంధం లేకుంటేనే ఇలా చెబుతారా? పైగా నిప్పులాంటి మనిషి బాబు కూడా కెసిఆర్ జగన్ కుమ్మక్కయ్యారని ఎన్నిసార్లు చెప్పలేదు. ఇక ఢిల్లీలో సోనియాగాంధీ ఇంటికి సకుటుంబ సపరివారంగా వెళ్లారు. అంటే కాంగ్రెస్‌తో బంధం బహిరంగ రసహ్యమే కదా? మరోవైపు మోదీతో స్నేహం నడుపుతున్నారు. ఇక ఎంఐఎం మంచి స్నేహితులే. సిపిఐ నారాయణ నాకు మంచి మిత్రులు అని కెసిఆర్ చాలా సార్లు చెప్పారు. కెసిఆర్ బాబు పాత స్నేహం, కెసిఆర్ జగన్‌లది కొత్త స్నేహం. స్నేహితుడి స్నేహితుడు కూడా స్నేహితుడే అవుతాడు కదా? దీన్ని బట్టి వీళ్లంతా స్నేహితులే అవుతారు’’


‘‘ నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తోంది. కెసిఆర్‌కు బాబో జగనో ఒక్కరితో స్నేహం ఉండాలి కానీ ఇదేంటి ? ’’
‘‘నీ ఆలోచనలో గందరగోళం ఉంది కానీ జరుగుతున్న పరిణామాల్లో ఎలాంటి గందరగోళం లేదు. ఒక్కో పాత్రకు ఒక్కో బాధ్యత ఉంటుంది. నువ్వు అదే గ్రహించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ నేత నోట విన్నా తెలంగాణకు పెద్ద పీట అనే మాటలు వినిబడేవి. ఎన్టీఆర్ భవన్‌లో ఒక అంతస్థు నిండా పెద్ద పీటలు తయారు చేయించి పెట్టారనే మాట కూడా వినిపించేది. అప్పుడు పాలమూరు జిల్లాను బాబు ఏకంగా దత్తత తీసుకున్నారు. అదే బాబు పాలమూరు ఎత్తిపోతల పథకం ఆంధ్రకు ప్రమాదం అని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గట్టిగా ఫిర్యాదు చేయలేదని శాసన సభలో జగన్ నిలదీశారు. విలేఖరుల సమావేశాల్లో తెలంగాణపై బాబు, జగన్ చూపిన ప్రేమను గుర్తుకు తెచ్చుకున్న వారికి ఈ ఫిర్యాదు నమ్మశక్యం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో పెద్దపీటలు వేయడం రాజకీయంగా అవసరం. ఆంధ్ర సిఎంగా పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకించడం ఇప్పటి అవసరం. తెలంగాణ ఉద్యమ కాలంలో, ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూసిన సందర్భంలోనైనా కెసిఆర్‌కు బాబు శత్రువే. ఇప్పుడు రాష్ట్రంలో వారి పార్టీనే కనుమరుగైనప్పుడు ఇంకెక్కడి శతృత్వం?
యాచకునికి యాచకుడే శత్రువు అన్నారు కానీ రాజుకు రాజు కూడా శత్రువే. ఆనకట్టలు కట్టి తన రాజ్యం సుభిక్షంగా ఉండేట్టు చూసుకోవడం రాజు బాధ్యత కానీ పక్క రాజ్యంలో నాయుడు పార్టీ ఉండాలా? రెడ్డి రాజ్య పాలన సాగాలా?అనే దానిపై ఆసక్తి ఎందుకుంటుది. రాజుతో సంబంధాలు ముఖ్యం కానీ రాజు ప్రత్యర్థితో కాదు.


 పొరుగున రెడ్డి రాజ్యం ఉండాలా? నాయుడు రాజ్యం పతనం కావాలా? అనేది పాలకుడికి ముఖ్యం కాదు. ఏ రాజ్య పాలకునికి ఆ రాజ్య ప్రయోజనాలు ముఖ్యం.
‘‘ నువ్వు ఎన్ని చెప్పినా కెసిఆర్ చెప్పినట్టు ప్రాజెక్టులు పూర్తవుతాయని నాకైతే అనిపించడం లేదు’’
‘‘ వర్షాలు వస్తే సాగు లేదంటే కన్నీళ్లే జీవితంగా గడిపే తెలంగాణ పల్లెలు రెండు పంటల పండించే రోజులు రాబోతున్నాయి అని వింటేనే మనసు పులకించి పోతుంది? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన యోధుడికైనా, చంద్రుడిపై తొలిసారి పాదం మోపిన వీరుడికైనా తొలుత కొన్ని లక్షల గొంతులు ఇది అయ్యేదా పొయ్యేదా? అని వారి వారి మాతృభాషల్లో ముందు మాటలు పలికిన వారే’’


‘‘ అవుతాయంటావా? ’’
‘‘ ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తానని తొలుత చెప్పినప్పుడు కొన్ని వందల గొంతులు అయ్యే పని కాదులే అని స్వాగత వచనాలు పలికాయి. వాటిని పట్టించుకోకుండా ఎవరెస్ట్ ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ పేరు మనకు గుర్తుంది కానీ ఆ లక్షల గొంతుల్లో ఒక్క పేరూ గుర్తు లేదు. చందమామపై కాలు మోపేందుకు వెళుతున్న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్‌కూ ఇలానే బృంద గీతం వినిపించారు. కెసిఆర్ తెలంగాణ కోసం వెళ్లినప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద గొంతులు ఇలానే అన్నారు. ’’


‘‘ అంటే కోటి ఎకరాలకు సాగునీరు వస్తుందని అంత నమ్మకమా? ’’
‘‘ గోదావరి, కృష్ణా నదులతో పొలాలు తడిస్తే మంచిదే,కాక పోతే కొన్ని వందల ఏళ్ల నుంచి అణిచివేత, పేదరికం,కరువుతో సహజీవనం చేసిన వాడికి కొత్తగా పోయేదేముంది. యత్భావం తత్భవతి.. రెండు రాష్ట్రాల రైతులకు మంచే జరుగుతుందనుకుందాం పోయేదేముంది’’

బుద్ధా మురళి (జనాంతికం 3. 4. 2016)

27, మార్చి 2016, ఆదివారం

‘బ్రహ్మర్షి’ కన్నయ్య!

‘‘మూస కథలతో ఊపిరి ఆగిపోయే దశలో ఉన్న తెలుగు సినిమాకు ఊపిరి పోసిందట కదా ? ఊపిరి సినిమా’’


‘‘రాజకీయ తెరపై కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, ప్యామిలీ సెంటిమెంట్ కలగలిసిన సినిమాలు వరుసగా కనిపిస్తుంటే.. ఉపిరి దాకా ఎక్కడ ? ’’
‘‘ నాకైతే రాజకీయాలు బోర్ అనిపిస్తున్నాయి. ’’
‘‘అంతరించి పోతున్న కమ్యూనిస్టులకు, బక్కి చిక్కి పోతున్న కాంగ్రెస్‌కు కన్నయ్య అనే కాలేజీ కుర్రాడు దొరికడం సినిమా కథలానే ఉంది.’’
‘‘మాంత్రికుడు రాజకుమారిని ఎత్తుకెళ్లినప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన రాజుగారికి తోటమాలి ఎన్టీఆర్ దేవుడిలా కనిపించినట్టు ఈ రెండు పార్టీల వారికి దూరమైన సింహాసనాన్ని తీసుకు వచ్చి అప్పగించే తోటమాలిలా కన్నయ్య కనిపిస్తున్నాడా? ’’


‘‘ ముందు నన్ను చెప్పనివ్వు. రాజనాల, ముక్కమాల సినిమా మొదట్లో కనిపించినా చివర్లో కనిపించినా విలన్ అని ఈజీగా గుర్తుపట్టేస్తాం. కానీ ఎప్పుడూ దగ్గుతూ ఉండే గుమ్మడి విలన్ అని చివర్లో కానీ తెలియదు. అందుకే తొందర పడి ఎవరు తోటమాలో, ఎవరు రాజనాలనో ముందే నిర్ణయానికి రావద్దు. ’’
‘‘ అంటే హీరో కాదంటావా? ’’
‘‘ నేనింకా ఏమీ అనలేదు. దసరా బుల్లోడులో కన్నయ్య కోసం వాణిశ్రీ, చంద్రకళ నల్లవాడే అల్లరి పిల్లవాడే అంటూ నల్లనయ్య నా వాడు నా వాడు అని పాడుతారు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసేందుకు సిద్ధపడుతూ కాదు నీ వాడు అంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనిపిస్తాయి చూడు అచ్చం అలాంటి గుట్టల మధ్య త్యాగం పాట పాడుతుంటారు గుర్తుందా? ’’


‘‘అవును ఐతే’’
‘‘నవయువ నేత రాహుల్‌బాబును, వృద్ధ ఎర్రన్నలను చూస్తుంటే ఎందుకో వాణిశ్రీ, చంద్రకళ పాట గుర్తుకొచ్చింది. నాగేశ్వర్‌రావేమో ఇద్దరితో సరసాలాడుతుంటారు. ఎవరికి వారు కృష్ణయ్య నా వాడే అనుకుంటారు. ఇప్పుడు అచ్చం మన కాలేజీ కన్నయ్యలానే. చచ్చీ చెడి కన్నయ్యను కమ్యూనిస్టులు పైకి తీసుకు వచ్చారు. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ తన హోదాను కూడా మరిచి కాలేజీ కుర్రాడికి విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు గంటల తరబడి నిరీక్షించారు. కమ్యూనిస్టు నాయకులు వస్తున్నారంటే చంద్రబాబు, వైఎస్‌ఆర్ లాంటి వారు లేచి ఎదురెళ్లి స్వాగతం పలికేవారు. తనను తాను దైవంగా భావించే ఎన్టీఆర్ సైతం ఎంతో గౌరవించేవారు. అలాంటి కమ్యూనిస్టులు కన్నయ్యను భుజానికి ఎత్తుకుని తమకు పునర్జన్మ ప్రసాదించేందుకు వచ్చిన దేవదూతలా చూస్తున్నారు. సభలు ఏర్పాటు చేస్తున్నారు. సత్కారాలు చేస్తున్నారు. శ్రీకృష్ణుడు నా మిత్రుడు అని కుచేలుడు గర్వంగా చెప్పుకున్నట్టు కన్నయ్య మా నాయకుడు అంటున్నారు. ఎన్నికలకు ఉపయోగపడే చిన్ని కన్నయ్య అని మురిసిపోతున్నారు. కన్నయ్యనేమో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేశ్ సౌందర్యకు తెలియకుండా నేపాలీ అమ్మాయిని ప్రేమించినట్టు, కమ్యూనిస్టులను, కాంగ్రెస్ నాయకులను కన్నయ్య ఒకేసారి కలుస్తున్నారు. కష్టపడి కమ్యూనిస్టులు సభ ఏర్పాటు చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు అని కన్నయ్య చెబుతున్నాడు. ’’


‘‘ నిజమే ఎందుకలా అంటావు?’’
‘‘ చూడోయ్ కన్నయ్య చదువుకునేది ఎంత ఆఫ్రికన్ స్టడీ అయినా అతనికీ సైన్స్ తెలుసు. లెక్కలు వస్తాయి కదా? రాజకీయ జీవితం కోరుకునే వాడు భవిష్యత్తు ఉన్న పార్టీ వైపు చూస్తాడు కానీ ఊపిరి ఆగిపోయే పార్టీని నమ్ముకుంటాడా? కోమాలో ఉన్న పార్టీల కన్నా పదేళ్లపాటు తిండి ఎక్కువై, రెండేళ్ల నుంచి తిండి లేక నీరసించిన కాంగ్రెస్ బెటర్ అనే లెక్క తెలియనంత అమాయకుడేం కాదు. అందుకే రాహుల్‌బాబుతో టచ్‌లో ఉన్నారు.’’
‘‘ మంచిదే కదా ? ’’
‘‘ తలకు బలమైన గాయం తగలగానే అప్పటి వరకు జరిగిన విషయాలన్ని మరిచిపోవడం, మరోసారి దెబ్బతగలగానే గుర్తుకు వచ్చే సీన్లు గుర్తున్నాయా? అలానే మన కమ్యూనిస్టులకు తప్పులు చేయడం సరిగ్గా మూడు దశాబ్దాల తరువాత అవి తప్పులు అని గుర్తుకు రావడం గుర్తొచ్చింది అంతే. ఇప్పటి తప్పులను వాళ్లు మూడు దశాబ్దాల తరువాత ఒప్పుకుంటారేమోనని. 95 నాటి వెన్నుపోటుకు చేయూత నివ్వడం చారిత్రక తప్పిదం అని ప్రకటించేందుకే ఇంకా తొమ్మిదేళ్ల గడువు ఉంది.’’


‘‘ఇంతకూ కన్నయ్య కథ సూపర్ హిట్టా కాదా? కన్నయ్య హీరోనా కాదా? ఏదీ తేల్చవు’’
‘‘ కొన్ని విషయాలు కాలం తేల్చేంత వరకు వేచి చూడాలి. ‘వైదిస్ కొలవెరి కొలవెరి డీ’ పాట వినిపించిన కొత్తలో భారతీయ ప్రపంచం ఊగిపోయింది. వీళ్ల ఊపు చూసి బయ్యర్లు కోట్లు గుమ్మరించారు. తీరా సినిమా వచ్చాక రోడ్డున పడ్డారు. పాట మరుగున పడింది. బయ్యర్లు ఇల్లు వాకిలి అమ్ముకున్నారు. 


అన్నా హజారే అవినీతిపై ఉద్యమించినప్పుడు బాబు అన్నా కన్న పెద్ద జాతీయ జెండా భుజాన తగిలించుకుని పాదయాత్ర చేశారు. చివరకు హాజారే సైతం పార్లమెంటు కన్నా తానే ఉన్నతున్ని అనుకున్నారు. తాను ఎంపిక చేసిన పౌర సమాజం సభ్యులు పార్లమెంటు కన్నా ఉన్నతం అని ప్రకటించారు. ఆయన్ని బిజెపి వదిలేసింది ప్రజలు మరిచిపోయారు. నెల తరువాత సికిందరాబాద్‌లో భారీ బహిరంగ సభ పెడితే 50 మంది మీడియా బృందాన్ని కలిపితే మొత్తం 300 మంది వచ్చారు. ’’


‘‘దసరా బుల్లోడు సూపర్ హిట్ సినిమా. కన్నయ్య సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టే కదా? ’’
‘‘ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్‌కు ఢిల్లీ నుంచి విపి సింగ్ వంటి హేమీ హేమీలెందరో వచ్చారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ మేనక పాత్రధారి మీనాక్షి శేషాద్రి వీపుమీద ఫైళ్లు పెట్టి సంతకం చేశారు. ఈ సినిమాతో మా పని ఐపోయిందని ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు సైతం బెంబేలెత్తిపోయారు. కానీ సినిమా ఊహించని స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ స్వయంగా ఓడిపోయారు. కన్నయ్య సినిమా కథ దసరా బుల్లోడును పోలి ఉన్నా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా  ఫలితం గుర్తుకు వస్తోంది. ’’

బుద్దా మురళి (జనాంతికం 27. 3. 2016)

20, మార్చి 2016, ఆదివారం

మచ్చలేని మనిషి!

‘‘ మీరెవరు? యమధర్మరాజులా ఉన్నారు? ?’’
‘‘ యమధర్మరాజునే. నీ పేజీ చింపేశాను, పైకి తీసుకెళుతున్నాను’’
‘‘ ఇదన్యాయం నేనొప్పుకోను. కోర్టుకెళతాను’’
‘‘ అసలేం జరిగింది? ’’
‘‘ వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో సినిమా చూస్తూ కాలువలో పడిపోయి. ఇక్కడికొచ్చేశావు. ఇంతకూ అంతగా మైమరిపించిన సినిమా ఏంటో’’
‘‘ ఎంత గొప్ప సస్పెన్స్ సినిమా అయినా ముగింపులో ఏం జరిగిందో తెలుస్తుంది. నాలుగు దశాబ్దాలైనా ఆ సస్పెన్స్ ఇంకా వీడక పోవడంతో ఆలోచనలో పడి కాలువలో పడ్డాను.’’
‘‘ ఏమిటా సస్పెన్స్’’
‘‘60 ఏళ్ల నటరత్న అమ్మా అని తన కన్నా పదేళ్ల చిన్న వయసులో ఉన్న అంజలిని కౌగిలించుకుని కాలేజీలో నేను ఫస్ట్ వచ్చాను అని మురిపెంగా చెబుతాడు. వీరిద్దరి కన్నా మరో పదేళ్ల పిన్న వయసులో ఉన్న గుమ్మడిని చూసి తాతయ్యా అంటూ పండరీబాయి వెనక ఎన్టీఆర్ దాక్కుంటాడు. ’’
‘‘ అవును చాలా సినిమాల్లో ఈ దృశ్యాలు చూశాను’’
‘‘ కొడుకు వయసు కన్నా తల్లివయసు తక్కువని, తాతయ్య వయసు మరింత తక్కువ అని తెలిసినా మేం ఈ దృశ్యాలను చూసి ఎలా తన్మయం చెందామో ఇప్పటికీ అర్ధం కావడం లేదు. ఇది ఎన్నటికీ తీరని సస్పెన్స్ కాదా?’’
‘ నువ్వు ఏవో కథలు చెబుతూ నన్ను ఎక్కడికో లాక్కెళ్లాలని చూస్తున్నట్టున్నావ్, నేను సతీ సావిత్రి కాలం నాటి యముణ్ణి కాదు. టెక్నాలెజీ మీ సొంతమే కాదు మాకూ ఉంది. ’’
‘‘ మీరు యమలీల కాలం నాటి యముడు కాదు.. నేను సతీసావిత్రిని కాదు. బుద్ధున్నోడెవడైనా పై లోకం లోని నరకం నుంచి భూ లోకంలోని నరకానికి తిరిగి వెళ్లాలనుకుంటాడా? ఈ ట్రాఫిక్ జామ్‌లతో బతికే ఓపిక లేదు. పైన ఏమున్నా లేకున్నా ట్రాఫిక్ జామ్ అయితే ఉండదు కదా? చివరి కోరిక తీర్చమని కోరుకుంటున్నాను అంతే ’’
‘‘ సతీ సావిత్రి లా ఇరికించాలని చూస్తున్నావేమో? నీ ప్రాణాలు తప్ప చివరి కోరిక ఏదైనా తీరుస్తాను అడుగు. ’’
‘‘ మాట మీద నిలబడాలి. మాటిచ్చి తప్పవద్దు’’
‘‘ పిచ్చోడా! ఆ రోజుల్లో అంటే టెక్నాలజీ తక్కువ కాబట్టి సావిత్రి మనసులో ఏముందో తెలియక దెబ్బతిన్నాను. నీకు తెలియకుండానే నీ చేతికి చిప్ అతికించాను. నీ మనసులోని మాట కూడా నాకు తెలుసు.చెప్పు ’’
‘‘ మచ్చలేని నాయకుణ్ణి చూడాలని నా జీవితాశయం. మచ్చలేని నాయకుణ్ణి చూడగానే నీ వెంట వచ్చేస్తాను ’’
‘‘ ఏరా నువ్వు కొణిజేటి సుందర్రావు హై స్కూల్‌లో చదివావు కదూ! ఆ స్కూల్‌లో టీచర్ సుబ్బారావు మచ్చలేని మనిషి భూ లోకంలోనే లేడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడే కాదు మనకాలం దేవుడనుకునే మహాత్మాగాంధీ జీవితంలో సైతం మచ్చలున్నాయని ఆయన చెప్పిన పాఠాలు గుర్తుయా? ’’
‘‘ ఔను’’
‘‘ ప్రతి మనిషి జీవితంలో చిన్నదో పెద్దదో ఒక మచ్చ ఉంటుంది. నీ చావు తెలివి తేటలు బాగున్నాయి. మచ్చలేని మనిషి ఉండడు కాబట్టి నిన్ను భూ లోకానికి పంపించేస్తాను అనుకున్న నీ ఆచలోన తప్పు’’
‘‘ మచ్చలేని నాయకుణ్ణి చూపించండి లేదంటే భూ లోకానికి పంపించండి’’
‘‘ ముందే చెప్పాను సతీసావిత్రి కాలం నాటి యముణ్ణి కాదు అని ’’
‘‘ అంటే చివరి కోరిక తీర్చకుండానే పైకి తీసుకు వెళతారా? ’’
‘‘ ఒకసారి మాటంటే మాటే... మాట తప్పడానికి మేమేమీ మనుషులం కాదు’’
‘‘ అయితే మచ్చలేని మనిషిని చూపించండి’’
‘‘ ఒక మనిషి చాలా?’’
‘‘ ముందు ఒక్కరిని చూపించండి చాలు’’
‘‘అదిగో అక్కడ రాజకీయ సమావేశం జరుగుతుంది. కనిపిస్తుందా? అక్కడ వేదికపై ఉన్న మహామహులంతా మచ్చలేని నాయకులే కావాలంటే వెళ్లి చూడు’’
‘‘ ఇది అన్యాయం తొండి. వాళ్లు రాజకీయాలను వ్యాపారంగా మార్చి కోట్లు సంపాదించారు. ఎక్కడ ఏ కొత్త ప్రాజెక్టు వస్తే అక్కడ భూములు కొనేశారు. రాజకీయంగా అడ్డు వచ్చిన వాళ్లను లేపేశారు. రాజకీయ జీవితం ప్రసాదించిన వారిని సైతం దారుణంగా దెబ్బతీసిన దుర్మార్గులు కూడా అక్కడున్నారు. అలాంటి వాళ్లను చూపించి మచ్చలేని మనుషులు అని చెబితే నమ్మడానికి నేనేమన్నా అమాయకుడిని అనుకుంటున్నావా? మాట తప్పిన పాపం మూట కట్టుకోవలసి వస్తుంది జాగ్రత్త’’
‘‘ నేను అబద్ధం చెప్పడం లేదురా! మానవా! అదిగో అటు చూడు నిప్పులాంటి మనిషిని, మనుషుల్లో దేవుణ్ణి, ఆక్సిజన్ లేకపోయినా బతికేస్తాను కానీ నైతిక విలువలు పీల్చంది బతక లేను అని ఉపన్యసిస్తున్నాడు చూడు అతను నంబర్ వన్ మచ్చలేని నాయకుడు ’’
‘‘ ఇది మరీ అన్యాయం ఆయనకు వాళ్లందరి కన్నా ఎక్కువ మచ్చలున్నాయి. మచ్చలేని మనిషి అని చెప్పి మోసం చేస్తున్నావు. ఆయన చేసిన ఎన్నో పాపాలకు నేను సాక్ష్యం’’
‘‘ నువ్వు చెబుతున్నది నిజమే, మచ్చలేని నాయకుడు అని నేను చెబుతున్నది నిజమే. చూడోయ్ నీ తెల్లని షర్ట్‌పై ఒక నల్లని రంగు చుక్క పడిందనుకో స్పష్టంగా కనిపిస్తుంది. అదే తెల్లని షర్ట్‌ను మొత్తం నల్లరంగులో ముంచితే?’’
‘‘ ???’’
‘‘ రాజకీయాల్లోనే కాదు అన్ని రంగాల్లో ఇలాంటి మచ్చలేని మనుషులు కనిపిస్తారు. తమకు మచ్చలేదు అని వాళ్లు చెప్పింది కరక్టే ఒక్క మచ్చ ఉంటే గుర్తించవచ్చు, మొత్తం శరీరమే మచ్చల మయం ఐతే? పాన్‌షాప్‌లో అప్పు కోసం ప్రయత్నించే అప్పుల అప్పారావు మొదలుకుని ప్రపంచ బ్యాంకు అప్పు కోసం ప్రయత్నించే నాయకుల వరకు అన్ని రంగాల్లో నూ ఈ మచ్చలేని మహానుభావులు కనిపిస్తారు. విలువల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటే వీరిని ఈజీగా గుర్తించవచ్చు. మరణించిన తరువాత మనిషి తిరిగి జన్మించడం అనేది ఎంత వరకు నిజమో! మనిషై పుట్టిన తరువాత ఏదో ఒక మచ్చలేకుండా జీవితం ఉండకపోవడం కూడా అంతే నిజం. పుట్టినప్పటి నుంచి కోమాలో ఉంటే చెప్పలేం కానీ.. ’’
***
‘‘ ఏమండీ ఎంత ఆదివారం అయితే మాత్రం బారెడు పొద్దెక్కినా ఇంకా లేచేది లేదా?’’
‘‘ఇదంతా కలా? ఒక జీవిత సత్యం తెలిసింది. విలువల గురించి ఎక్కువగా మాట్లాడవద్దు.. మాట్లాడేవారిని నమ్మొద్దు’’
-బుద్దా మురళి (జనాంతికం 20-3-2016)