25, మే 2023, గురువారం

దగ్గుబాటి రాజకీయంగా పరాజితుడు - మనిషిగా విజేత జర్నలిస్ట్ జ్ఞాపకాలు

దగ్గుబాటి రాజకీయంగా పరాజితుడు - మనిషిగా విజేత జర్నలిస్ట్ జ్ఞాపకాలు ^^ మీరు బాబు గారి తోడల్లుడు . ఆయనేంటో మీకు బాగా తెలియాలి . ఇప్పటి వరకు నేను జిల్లాల్లో పని చేశా , హైదరాబాద్ వచ్చి నెల రోజులు అవుతుంది . బాబు ఏమిటో ఒక్క సారికే నాకు అర్థం అయింది . బాబు ఏంటో మీకు తెలియలేదా ? ఎలా నమ్మారు ^^ దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో నేను మాట్లాడిన మొదటి మాటలు . అయన తన ట్రేడ్ మార్క్ చిరునవ్వుతో అలా జరిగిపోయింది అన్నారు . మోసపోయాను అనే బాధ కనిపించలేదు , చిరునవ్వే డామినేట్ చేసింది . 1995లో ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు సీఎం అయ్యాకదగ్గుబాటి ఇంటికి వెళ్లే సరికి ఆయన శాసన సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు . ^^ నిన్నటి వరకు వాళ్లంతా బయటకు వస్తామని అన్నారు . అందరికీ బాబు ఫోన్ చేసి వెళ్ళవద్దు అని చెబుతూ, మీకు మంత్రిపదవి ఇస్తాను, కార్పొరేషన్ ఛైర్మెన్ పదవి ఇస్తాను అని చెబుతుంటే, అంతా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు .^^ ఇదీ ఆ రోజు దగ్గుబాటి చెప్పిన విషయం . ***** దేవదత్ పట్నాయక్ అని ఓ డాక్టర్ ఉన్నారు . మహాభారతం , రామాయణం వంటి పురాణాల ఆధారంగా ఆధునిక జీవితం మేనేజ్ మెంట్ పై దాదాపు రెండువందల పుస్తకాలు ఇంగ్లీషులో రాశారు . పలు ఇంగ్లీష్ పత్రికల్లో కాలమ్స్ రాస్తారు . ఓ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన సదస్సులో యాంకర్ చాలా వివరంగా ఓ ప్రశ్న అడిగింది . మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు అనేక సార్లు ధర్మ విరుద్ధంగా వ్యవహరించారు . నువ్వు నా కుమారుడివే పాండవులను చంపవద్దు అని కర్ణుడి వద్దకు రాయబారం పంపడం , భీష్ముడి వద్దకు అర్జునుడిని పంపి నువ్వు ఎలా మరణిస్తావు అని రహస్యం తెలుసుకోవడం వంటివి వివరించి , ఇన్ని చేసిన శ్రీ కృష్ణుడిది ధర్మ పోరాటం అని ఎలా అంటారు అని అడిగింది . సుదీర్ఘమైన ప్రశ్నకు పట్నాయక్ సంక్షిప్తంగానే సమాధానం చెప్పారు . మీరు చెప్పినవి కరెక్ట్ కానీ అక్కడ పాండవులు , శ్రీకృష్ణుడు ఎవరితో యుద్ధం చేస్తున్నారు ? దుర్యోధనుడి వంటి దుర్మార్గుడితో దుర్యోధనుడితో యుద్ధం అలానే చేయాలి . అది ధర్మ విరుద్ధం అని మరోలా చేస్తే పాండవులు ఓడిపోయే వారు కౌరవులు విజయం సాధించేవారు . మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది కూడా యుద్ధ నీతిలో ముఖ్యమైనది అని వివరించారు . ఈ ధర్మ సూక్ష్మం గ్రహించక పోవడం వల్లనే దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాల్లో బాబు చేతిలో మోసపోయారు . మోసపోయారు అనడం కన్నా ఓడిపోయారు అనడం సబబు . తాను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఎదుటి వారు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకోవడం అత్యాశే . *** దగ్గుబాటి వెంకటేశ్వర రావు , నారా చంద్రబాబు ఇద్దరూ ఎన్టీఆర్ అల్లుళ్ళు . ఇద్దరిలో ఆర్థికంగా , చదువు పరంగా దగ్గుబాటి ముందున్నారు . పైగా కులానికి సంబంధించిన గ్రేడింగ్ లోనూ దగ్గుబాటి ది ముందువరుస . ఐతే బాబు రాజకీయం ముందు నిలువ లేక పోయారు .ఎన్టీఆర్ ను దించేసిన వైస్రాయ్ క్యాంపు సమయంలో క్యాంపు లో కన్నా దగ్గుబాటి శిబిరం లో శాసన సభ్యుల సంఖ్య ఎక్కువ .దగ్గుబాటి చెప్పడం తో వీళ్లంతా వైస్రాయ్ శిబిరానికి వెళ్లారు . దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి పదవి . రోజూ మనిద్దరం ఒకే కారులో సచివాలయానికి వెళదాం ఇదీ ఇద్దరి మధ్య అలిఖిత ఒప్పందం . సీఎంగా బాబు కుదురుకోగానే ఒకే కారులో వెళ్లడం మాట దేవుడెరుగు పొమ్మనలేక పొగపెట్టాలని దగ్గుబాటి ఫోన్ చేసినా బాబు లిఫ్ట్ చేయలేదు . తన వర్గం తో బయటకు వెళ్ళాలి అని దగ్గుబాటి ప్రయత్నాలు చేస్తుండడం తో పాలేటి రామారావు తప్ప దగ్గుబాటితో ఎవరూ వెళ్లరు అని ఆంధ్రభూమిలో రాశాను . ఆయనకు బాగా కోపం తెప్పించింది . డిసి యజమాని వెంకట్రామ్ రెడ్డి తో పార్లమెంట్ లో పరిచయం . నాపై ఫిర్యాదు . ఎడిటర్ పిలిచి ఓ సారి మాట్లాడి రా అని చెబితే వెళ్ళాను . ఫిర్యాదు చేసినప్పటికీ ఇంటికి వెళితే చాలా మర్యాదగా మాట్లాడారు . చాలా సౌమ్యుడు , ఎదుటి వారికి గౌరవం ఇస్తారు . ఐనా రాజకీయాలకు సంబంధించి నా అభిప్రాయం మారలేదు . ఇంటికి వెళితే అప్పుడు శాసన సభ్యులకు ఫోన్ చేస్తూ కనిపించారు . దగ్గుబాటి ఆశించినట్టు 70 మంది శాసన సభ్యులు రాలేదు , నేను రాసినట్టు ఒకే ఒక mla కాదు . పన్నెండు మంది దగ్గుబాటితో పాటు తిరిగి ఎన్టీఆర్ నివాసానికి వచ్చారు . లక్ష్మీ పార్వతి ని చూపించి ఎన్టీఆర్ ను దించేసి అధికారంలోకి వచ్చింది బాబు . కానీ బాబు ఒక్కసారి కూడా ఆమెను బహిరంగంగా విమర్శించలేదు . యెర్ర బస్సు అని ఆమెను విమర్సగించింది దగ్గుబాటి , దుష్ట శక్తి అని తిట్టింది హరికృష్ణ . నాయకుడు తిట్టిస్తాడు , తాను తిట్టడు . రాజకీయ నాయకుడు ఇతరులను పని ముట్లుగా ఉపయోగించుకుంటారు కానీ తానె పని ముట్టుగా మారడు . బాబు కరుడుగట్టిన రాజకీయ నాయకుడు . బాబు వెంట వెళ్లి మధ్యలో వదిలేసి ఎలా వస్తారని ఎన్టీఆర్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశం లో ఆంధ్రప్రభ తరపున దేవులపల్లి అమర్ గట్టిగా ప్రశ్నించారు . ఏమీ అనలేక ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు , హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మెన్ సాయిబాబాబా తన పక్కన ఉన్న అనుచరుడి చెంప చెళ్ళు మనిపించాడు . ఇదంతా దగ్గుబాటి రాజకీయాల్లో పరాజిత గా .. **** అధికారాంతమున చూడాలి అన్నారు పెద్దలు . విపరీతమైన అధికారం అనుభవించి అధికారం నుంచి దిగిపోయిన తరువాత వారిని చూస్తే జాలి వేస్తుంది . సహజంగా ఉండలేరు . సినిమావాళ్లు , రాజకీయ నాయకులు డిమాండ్ తగ్గినప్పుడు అందరిలోకి రావడానికి ఇష్టపడరు . మందులో మునిగిపోయే నటులు , అజ్ఞాతంలోకి వెళ్లిపోయే నాయకులు ఎంతో మంది . అటు సినిమా గ్లామర్ తో ఇటు రాజకీయాలతో సంబంధం ఉన్న దగ్గుబాటి రాజకీయాలకు స్వస్తి పలికి సాహిత్య జీవితం గడుపుతున్నారు . ఉమ్మడి రాష్ట్రం లో ఎన్టీఆర్ తరువాత రెండు పవర్ సెంటర్ లు ఉండేవి . ఒకటి దగ్గుబాటిలు రెండు బాబు . అప్పుడు పవర్ సెంటర్ అంటే అల్లా టప్పా కాదు . తరువాత కాంగ్రెస్అ లో , బీజేపీలో చేరి రాజకీయాలకు స్వస్తి పలికారు . దశాబ్దాల పాటు అధికార కేంద్రంగా ఉండి రాజకీయాలు వదిలేసి పుస్తకాలు చదువుతూ , పుస్తకాలు రాస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు . ప్రపంచ చరిత్ర ఆది నుండి నేటి వరకు - ఆ తరువాత అని చరిత్రను అధ్యయనం చేసి సంక్షిప్తంగా ప్రపంచ చరిత్రను పుస్తకంగా తీసుకువచ్చారు . భగత్ సింగ్ గా నటించేందుకు చాలా కాలం క్రితం దగ్గుబాటి ప్రయత్నించారు . స్టీల్ ఫోటో కూడా విడుదల చేశారు . 95 వెన్నుపోటు పై సినిమా తీసేందుకు 96లో ప్రయత్నించారు . 82 ;ఓ టీడీపీ ఆవిర్భావం నుంచి 95 వెన్నుపోటు వరకు ఆ తరువాత నడుస్తున్న చరిత్ర వరకు దగ్గుబాటి రాస్తే బాగుండు . సాక్షుల కన్నా పాత్రదారులకు నాటకం గురించి ఎక్కువ తెలిసే అవకాశం ఉంది . దగ్గుబాటి తన కోణం నుంచి ఐనా 95 వెన్నుపోటును రికార్డ్ చేయాలి . ఒక చరిత్ర కొన్ని నిజాలు పేరుతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు 95 నాటి పరిణామాలపై పుస్తకం రాశారు

1 కామెంట్‌:

  1. 'ఒక చరిత్ర కొన్ని నిజాలు' - దగ్గుబాటి వెంకటేశ్వర రావు (నివేదిత పబ్లికేషన్స్, ఫిబ్రవరి 2009)

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం