1, జూన్ 2014, ఆదివారం

వాళ్లు ఇప్పుడేం చేస్తున్నారు?

సెలబ్రిటీల జీవితం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఒకప్పటి భారతీయ వెండి తెర కలల రాకుమారుడు రాజేష్ ఖన్నా హఠాత్తుగా తెర వెనక్కి వెళ్లారు. వృద్ధాప్యం, అనారోగ్యం పీడిస్తున్న కాలంలో ఆయన ఫోటోను హఠాత్తుగా పత్రికల్లో చూసిన వాళ్లు ఒక్కసారిగా వైరాగ్యంలోకి వెళ్లారు. రాజేశ్ ఖన్నా వెలుగులను చూసిన తరం ఆయన చీకటిని చూసే సరికి తమ జీవితం కూడా అంతే కదా అనే ఆలోచన పడ్డారు. కాంతారావు కత్తి ఝుళిపిస్తూ గుర్రంపై స్వారీ చేస్తూ కృష్ణకుమారి మనసు దోచుకోవడం చూసిన కుర్ర కారు తమ లేవల్‌లో సైతం అదే విధంగా ఎవరో ఒక కుమారి కోసం ప్రయత్నించే వారు. ఆ కాలం గడిచిపోయాక ఒక్కసారిగా కాంతారావు వృద్ధాప్యంలో కనిపిస్తే తామూ వృద్ధులమయ్యామనే విషయం గుర్తుకు వచ్చి ఎంత కాదన్నా మనసు కలవరపడుతుంది. ఆకాశంలో చుక్కలు హఠాత్తుగా మాయమైనట్టు సినిమాల్లో వెలిగిన తారలు హఠాత్తుగా మాయం అవుతుంటారు. ఇలాంటి వారిపై సహజంగా ఉండే ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని వాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ పాత తరం నటీనటుల గురించి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. 

ఎంతో మందికి నిద్ర లేకుండా చేసిన జయమాలిని ఇప్పుడు చెన్నైలో ప్రశాంతంగా విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నారు. జ్యోతిలక్ష్మి కూడా అంతే. మళయాల మహానటులకు ము చ్చెమటలు పోయించిన షకీలా తెర వెనక్కి వెళ్లారు. ఏం చేస్తున్నారు? అంటే అన్ని రకాల అనుభవాలతో ఆత్మకథ రాస్తున్నాను అని ఆమె ప్రకటించగానే చాలా మందికి నిద్ర కరువైందట!
పాండవులు పాండవులు తుమ్మెదా అంటూ అభిమానుల హృదయాల్లో దూసుకెళ్లిన జానకి, ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, కాంతారావులను మురిపించిన అందాల రాణి కృష్ణకుమారి బెంగళూరులోని ఫాం హౌస్‌లో విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నారని, అలనాటి అందాల తార కాంచన ఒక ఆలయంలో సేవ చేస్తూ శేష జీవితం దైవారాధనలో గడుపుతున్నారంటే ఆసక్తిగానే ఉంటుంది. ఏయిర్ హోస్టేస్ నుంచి సినీ తారగా అటు నుంచి ఆలయంలో సేవకురాలిగా అంటే చదివేందుకు మనసు భారంగానే ఉంటుంది. 


సినిమా తారలు అంటే అభిమానుల దృష్టిలో దేవుళ్లే. దేవుళ్లు నిత్య యవ్వనులు. దేవుని అస్థిత్వాన్ని మనిషి గుర్తించినప్పుడు దేవుళ్ల వయసు ఎంతో ఇప్పుడూ అంతే. దేవుళ్లు నిత్యయవ్వనులుగా ఉన్నప్పుడు తాము అభిమానించే తారా దేవుళ్లు కూడా అలానే ఉండాలని అభిమానులు కోరుకోవడం సహజమే. అందుకే రాజేశ్ ఖన్నా ముఖం ముడతలు పడినా, జేమ్స్‌బాండ్ 116 అంటూ విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సూపర్ స్టార్ కృష్ణ వయసు భారంతో కనిపించినా అభిమానులు తట్టుకోలేరు. మిస్సమ్మలో కస్సుబుస్సు మంటూ వయ్యారి నడకతో కనిపించిన అందాల బొమ్మ జమున ఇప్పుడు నడిచేందుకే ఒకరి సహాయం తీసుకోవడం అభిమానులు అస్సలు తట్టుకోలేరు.


వాళ్లిప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అంటూ చాలా మంది తారల గురించి అప్పుడో ఇప్పుడో ఎక్కడో ఒక పత్రికలో కనిపిస్తూనే ఉంటుంది.
తారల కన్నా ఒక్కో సమయంలో ఎక్కువ వెలుగురు విరజిమ్మిన చాలా మంది నాయకులు కనిపించకుండా పోయినప్పుడు పాపం వారేరీ అంటూ ఎవరూ పట్టించుకోరు. అధికారాంతమున చూడాలి అని వూరికే అనలేదు మరి..


రాష్ట్రం ఎంత క్లిష్టపరిస్థితిలో ఉన్నా, ఉన్నతాధికారులు బయట వేచి ఉన్నా తన గదిలో క్రికెట్ క్రీడను వీక్షించే లాస్ట్‌బాల్ హీరో కిరణ్ కుమార్‌రెడ్డి పేరు నిన్నమొన్నటి వరకు మీడియాలో మారు మ్రోగేది. కాంగ్రెస్‌లో ఉంటూ సోనియాగాంధీనే ఎదిరించిన నేతగా, చక్రం అడ్డువేసి విభజనను అడ్డుకునే మహావీరునిగా ఆయన పేరు మారుమ్రోగింది. మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్న ప్రతి తార టిడిపి వైపు చూసినా చలించని హేమ లాంటి నటికూడా కిరణ్ కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్రలో చేరి మండపేట నుంచి పోటీ చేశారు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అనే ఆసక్తి జనంలో ఉండడం సహజమే. ఏం చేస్తున్నారు అంటే క్రికెట్ చూస్తున్నారు అంటూ ఠక్కున చెప్పవచ్చు కానీ క్రికెట్ 24 గంటలు ఉండదు కదా మిగిలిన సమయంలో ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పార్టీ ఏమైంది? సమైక్యాంధ్ర పరిస్థితి ఏమిటి? అన్నీ సందేహాలే. ఇంతకూ జనం సమైక్యాంధ్రను తిరస్కరించారా? కిరణ్ కుమార్‌రెడ్డి నాయకత్వాన్ని తిరస్కరించారా? ఆయన విషయంలో అన్నీ సందేహాలే.


సాధారణంగా ఎన్నికల ఫలితాలు  చాలా మంది నాయకుల విషయంలో ఇప్పుడు వాళ్లేం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉదయించేట్టు  చేస్తాయి . చంద్రబాబు రెండుసార్లు ఓడిపోయినా  మీడియా ప్రచారం పుణ్యమా అ ని ఆయనే సీఎం అనిపించేది. 83లో ఓడిపోగానే టిడిపిలో చేరడం ఆయన తీసుకున్న తెలివైన నిర్ణయం లేకపోతే ఎన్టీఆర్ అల్లుడు ఇప్పుడేం చేస్తున్నాడు? అనే ప్రశ్న  వినిపించేది.
 మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు విషయంలో మాత్రం  ఈ ప్రశ్న వేసుకోవలసిందే. ఆయనిప్పుడు ఏం చేస్తున్నారో? నంబర్ టూ పదవి కోసం బాబుతో పోటీ పడి 95లో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇప్పుడాయన ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించుకునే స్థితికి వచ్చారు. టిడిపిలో ఆయన బాబు కన్నా సీనియర్... బిజెపితో స్నేహం విషయంలో కూడా ఆయన బాబు కన్నా సీనియర్ కానీ ఏం లాభం సరైన సమయంలో తప్పుడు నిర్ణయంతో దెబ్బతిన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పుస్తకాల రచనలో మునిగిపోయారు. బహుశా ఇప్పుడు రచయితగా కొత్త అవతారంలో కనిపించవచ్చు. 

బాబు అధికారంలో ఉన్నప్పుడు వైస్రాయ్ ప్రభాకర్‌రెడ్డి ఆయనకు కుడిభుజంగా కనిపించేవారు. ఆయనిప్పుడు రాజకీయాలకు దూరంగా హోటల్ వ్యాపారం విస్తరణలో బిజీగా ఉన్నారు. ఒక్కటి మాత్రం నిజం. ఏదీ శాశ్వతం కాదు. మాకు ఎదురు లేదు విర్రవీగితే ఇప్పుడేం చేస్తున్నారు? అని గుర్తు పెట్టుకునే వారు కూడా ఉండరు. ఈ సత్యాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

1 కామెంట్‌:

  1. gatham eppudu vokala , gatham voka sweet la untudi kastapadi anbavichhamu kaabati mana gatham raboye tharaaniki paatam ika pothe rajulu poyaru raallu migilaya uddalu jargayai raanula gaajulu poya celebraties gatham thelusukovatam lo thappu ledu addulo nte ah gathamlo vaallu padina kasta manaki emaina upayoga paduthudu emo choodaali

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం