7, ఫిబ్రవరి 2016, ఆదివారం

నేనే నంబర్ వన్!

  ‘‘నంబర్ వన్‌గా నిలవడం చాలా కష్టం’’
‘‘  అందుకే ఆ కార్పొరేట్ కాలేజీ వాళ్లు ఎంసెట్‌లో నంబర్ వన్ ర్యాంకు వచ్చే అవకాశం ఉన్న వాళ్లను ముందే పసిగట్టి లక్షలకు లక్షలు ముట్ట చెప్పి కొనుక్కుంటారు’’
‘‘ టీవిలో కనిపించే ఒకటి ఒకటి ఒకటి అన్నీ మాకే అనే ప్రకటన గురించా?’’
‘‘ ఆ ఒక్కటే కాదు జీవితంలో ప్రతి దశలోనో నంబర్ వన్ కావడానికే అంతా శ్రమిస్తారు. అంబడిపూడి నుంచి యండమూరి వరకూ అంతా నంబర్ వన్ కావడం గురించి రాశారు కదా? ’’


‘‘ నిజమే ఒకటి అనే అంకెలోనే ఏదో మహత్మ్యం ఉన్నట్టుగా ఉంది. అద్వైతం అంటే సూక్ష్మంగా నంబర్ వన్ కదా? ’’
‘‘ దేవుడొక్కడే అంటారు కానీ 99 అనరు కదా? 1 సంఖ్యకు ఉన్న ప్రత్యేకతే వేరు. ’’
‘‘తమ పిల్లలు ఎంసెటైనా మరే సెట్టు అయినా నంబర్ వన్‌గా నిలవాలని కోరుకుంటారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. ఈ కాలంలో ర్యాంకులు సాధించడమే మహా యుద్ధం కదా? ఈ యుద్ధ విద్యలు ఎందుకు నేర్చుకోలేరని కొందరు పిల్లలకు ర్యాంకులు రావాలని గర్భవతులుగా ఉన్నప్పుడే తల్లులను కోచింగ్‌కు పంపిస్తున్నారు. ’’

‘‘అబ్బా నేను చెబుతున్నది ఆ నంబర్ వన్ గురించి కాదంటే అర్ధం చేసుకోవేం. పూవు పుట్టగానే పరిమళించినట్టు, గ్యాస్ లీక్ కాగానే మంట పుట్టినట్టు, ఇంకా సమావేశం కాకముందే సమావేశ సారాంశం టీవిలో బ్రేకింగ్ న్యూస్‌గా టీవిలో ప్రత్యక్షం అయినట్టు ’’
‘‘అర్థం పర్థం లేని ఉపమానాలు ఆపుతావా? ఇలా ప్రాసలతో హైదరాబాద్‌లో ప్రచారం చేసి వెంకయ్యనాయుడు బిజెపిని నిలువునా ముంచేశాడట!’’
‘‘ఇప్పుడు దారికి వచ్చావు.. నేను చెప్పాలనుకున్నది కూడా రాజధాని సంగతే.. ఫలితాలపై నీ అభిప్రాయం మొత్తం తప్పు అసలు సంగతి వేరుగా ఉంది. అది నీకు అర్ధం కాలేదు’’
‘‘ ఇంకా ఫలితాలపై నేనేమీ చెప్పనే లేదు. తప్పని ఎలా అంటావు. సరే ఆ వేరుగా ఏ ముందో చెప్పు’’
‘‘ యువ జాతీయ నేత లోకేశ్ నాయకత్వంలో జరిగిన తొలి ఎన్నికల్లో ఒకే ఒక సీటు వచ్చిందని ఆయనపై ఏదో సెటైర్లు వేయాలని ప్రయత్నిస్తున్నావని నాకు తెలియదనుకోకు. నీకు తెలియని విషయం ఏంటంటే ఒకే ఒక సీటు వచ్చే విధంగా లోకేశ్ వ్యూహాత్మకంగా ప్రచారం చేశారు ’’
‘‘ నిజమా నమ్మలేకపోతున్నాను’’

‘‘ లేకపోతే బాబు తలుచుకుంటే హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ గెలుస్తుందా? టిడిపిని ఒకే ఒక డివిజన్‌కు పరిమితం చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉంది! ఎవరికీ చెప్పనంటే చెబుతాను ’’
‘‘ ఇలాంటి విషయాలు ఎవరికైనా చెబితే నన్ను అనుమానంగా చూస్తారు. పైగా ముఖం మీదే నవ్వుతారు. ఎవరికీ చెప్పను చెప్పు ’’
‘‘ ప్రపంచంలో ఏ తండ్రైనా తన పిల్లలు ఏ రంగంలోనైనా నంబర్ వన్‌గా నిలవాలని కోరుకుంటారు కదా? అలానే లోకేశ్ గ్రేటర్‌లో నంబర్ వన్‌గా నిలిచారు. ఒకే ఒక డివిజన్‌లో గెలవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువ మంది గెలిస్తే గ్రూపులు, వారిలో ఎంత మంది పార్టీ మారుతారోతెలియదు. కానీ ఒకే ఒక్కరైతే గెలిచిన వారు ఒక్క మాటపైనే ఉంటారు. లోకేశ్‌కు కార్పొరేటర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం కూడా ఈజీ, ఫోన్ ట్యాపింగ్ భయం ఉండదు, ఇంకెవరైనా వింటారనే అనుమానం ఉండదు. క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఉండదు, గెలిచిన వారిని మేపడానికి ఖర్చు అవసరం ఉండదు. ’’
‘‘ అంటే ఒక్క స్థానం ఇచ్చింది ప్రజలు కాదన్నమాట.. బాబు 


నేతృత్వంలో లోకేశ్ పర్యవేక్షణలో, రేవంత్‌రెడ్డి సమక్షంలో చాలా కష్టపడి ఒక్క సీటు తెచ్చుకున్నారన్నమాట’’
‘‘ అన్నమాటేంటి ఉన్నమాటే. ప్రజలు ఇష్టంతో గెలిపిస్తే గెలవడానికి మేమేమైనా గులాబీ వాళ్లమా? దీని కోసం ఎన్ని వ్యూహాలు పన్నామో నీకు తెలుసా? విజయవాడలో వ్యూహానికి లోకేశ్ బాబు రూపకల్పన చేసి, తెలంగాణ నుంచి నేతలను విజయవాడకు పిలిచి బోధించి, దాన్ని అమలు చేసేందుకు నేరుగా లోకేశ్ రంగంలోకి దిగి సాధించిన విజయం ఇది. గత ఎన్నికల్లో అసలు పోటీనే చేయని టిఆర్‌ఎస్ ఈసారి ఏకంగా రాష్ట్రంలో, గ్రేటర్‌లో అధికారంలోకి వచ్చింది కదా? అదే విధంగా ఒక్క సీటుతో ఉన్న మనం వచ్చే ఎన్నికల నాటికి హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల్లో కర్నాటక, తమిళనాడుల్లో సైతం అధికారంలోకి వస్తామని చెప్పడానికే ఒక్కసీటుకు పరిమితం అయ్యారు. ’’

‘‘ నిజమా? అయితే మీ వ్యూహం ముందుగానే కాంగ్రెస్‌కు లీకైనట్టుంది’’
‘‘ నీకెందుకొచ్చింది ఆ అనుమానం? ’’
‘‘ మీ ఒక్కసీటు విజయం వెనుక ఇంత వ్యూహం ఉంటే కాంగ్రెస్‌కు రెండు సీట్ల విజయం వెనుక ఎంత వ్యూహం ఉండాలి. నీకు గుర్తుందా? ఒకప్పుడు బిజెపి హనుమకొండ నుంచి జంగారెడ్డి, గుజరాత్ నుంచి ఒక పటేల్  ఇద్దరు మాత్రమే గెలిచారు. రెండు నుంచి ఏకంగా మోదీ నాయకత్వంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతగా ఎదిగింది. దాని కోసమే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా రెండు సీట్లకు పరిమితం అయింది. ’’
‘‘ పాపం ఈ విషయం తెలియక బిజెపి వాళ్లు అనవసరంగా నాలుగు చోట్ల గెలిచినట్టున్నారు? ’’
‘‘ఇంతేనా ఇంకా ఉంది? బాబు,లోకేశ్, రేవంత్‌రెడ్డిలు తలుచుకుంటే ఆ ఒక్కసీటు కూడా గెలవకుండా ప్రయత్నించే వాళ్లు. కానీ అలా చేయలేదు. ఒకవేళ అలా చేసి ఉంటే టిఆర్‌ఎస్‌కు వంద స్థానాలు వచ్చేవి. పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పెద్దలు రాజకీయ సన్యాసం స్వీకరించే వారు. టైగర్ రేవంత్ ఏకంగా తెలంగాణ వదిలి వెళ్లాల్సి వచ్చేది. ఒక్క స్థానంలో టిడిపిని గెలిచేట్టు చేసింది మేమే, 99 స్థానాల్లో టిఆర్‌ఎస్ గెలిచేట్టు చేసింది మేమే. వాళ్లు నిమిత్త మాత్రులు ఆ సంగతి తెలియక గెలిచామని సంబరపడుతున్నారు. 

ఎందరు గెలిచినా నదులన్నీ సముద్రంలో కలిసినట్టు కార్పొరేటర్లు అందరూ కార్పొరేషన్ సమావేశానికి హాజరు కావలసిందే కదా? ’’
‘‘ హైదరాబాద్‌లో నంబర్ వన్‌గా నిలిచిన మీరు ఇలానే ఆలోచించి ఇలానే పాలిస్తే ఆంధ్రలోనూ మీకు తిరుగులేదు. లోకేశ్ బాబుల నాయకత్వంలో ఆంధ్రలోనూ నంబర్ వన్‌గా నిలుస్తారు.’’
బుద్దా మురళి (జనాంతికం 7-02-2016).. 

1 కామెంట్‌:

  1. లోకేష్ గెలిచినా గెలవకపోయినా కులం కులం అని పడిచచ్చేవాళ్ళల్లో కమ్మవారే ముందుంటారు అని ఆయన అన్న ఒక్క మాట మాత్రం ఒప్పుకోవాల్సిందే !

    మీరు చెప్పింది నిజమే ధర్మం ఎపుడూ గెలవదు,గెలిచినదాన్నే ధర్మం అనుకుంటాం ! ఈ డైలాగ్ ఎవరిదో చెప్పుకోండి చూద్దాం !

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం