17, ఏప్రిల్ 2019, బుధవారం

ఎవడు కొడితే మైండ్ బ్లాంక్...

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండు. పూరి జగన్నాథ్ సినిమాలోని ఈ డైలాగు తెలుగు నెలను ఒక ఊపు ఊపింది. ఇది అందరికీ తెలుసు కాని విషయం ఏమంటే ... చాలా మంది జీవితాల్లో ఇలా దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేట్టు చేసే పండుగాడు చాలా మంది జీవితాల్లో ఉంటారు. చివరకు ఆ డైలాగు రాసిన పూరి జగన్నాథ్ జీవితంలో కూడా ఉన్నాడు. తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ సంపాదించనంత డబ్బు సంపాదించిన దర్శకుడు ఆయన. ఆయన తీసిన చాలా సినిమాలు సూపర్ హిట్. కథ మాత్రమే కాదు ఇలాంటి పాపులర్ డైలాగులు రాసింది సైతం ఆయనే. కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందని డైలాగు రాసిన పూరి జగన్నాథ్‌కు దిమ్మతిరిగి, మైండ్ బ్లాంక్ అయ్యేట్టుగా కొట్టింది ఆయన నమ్మిన వారే. పూరి జగన్నాధ్ చెప్పిన దాని ప్రకారమే అతని ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తే నమ్మించి దాదాపు వంద కోట్ల రూపాయల వరకు మోసం చేశాడట! సూపర్ హిట్ సినిమాలతో బిజీగా ఉన్న పూరి ఆర్థిక వ్యవహారాలు అన్నీ ఒకరు చూసేవారు. ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ నమ్మిన వ్యక్తి పూరిని నిండా ముంచేశాడు. అత్యధిక పారితోషకం తీసుకున్న దర్శకుడు, అత్యధికంగా సంపాదించిన దర్శకుడు ఆ దెబ్బతో చివరకు తన పెంపుడు కుక్కలకు తిండి కూడా పెట్టలేని స్థితిలో పడిపోయాడు. ఆ మోసం విలువ దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఉంటుందని పూరి చెప్పారు.
దర్శకుడు, రచయిత అంటే మనుషుల జీవితాలను పరిశీలిస్తుంటారు. అంత పవర్‌ఫుల్ డైలాగులను రాయాలి అంటే జీవితాన్ని ఎంత సునిశితంగా పరిశీలించే అలవాటు ఉండాలి. నమ్మకం, మోసం వంటి మనుషుల లక్షణాలు ఎంత బాగా తెలిసి ఉండాలి. ఏదో ఆషామాషిగా అంత గొప్ప దర్శకులు కాలేరు. కానీ చిత్రం ఏమంటే తన పరిశీలన మొత్తం దర్శకత్వం వహించడానికి, కథ, మాటలు రాయడానికే పరిమితం చేశారు. నిజ జీవితంలో సైతం తనకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేట్టు చేసే వ్యక్తులు ఉంటారని పూరి జగన్నాథ్ ఊహించలేకపోయారు.
ఇక్కడ పూరి జగన్నాథ్ గురించి చెప్పడం అంటే ఆయన వంద కోట్ల రూపాయలు పోయాయని సానుభూతితో కాదు. నిజానికి ప్రతి మనిషి జీవితంలో ఇలా మైండ్ బ్లాంక్ చేసే పండుగాళ్లు ఉంటారు అని చెప్పడానికే పూరి ఉదంతాన్ని ప్రస్తావించడం.
ఒక్క సినిమా రంగంలోని వారికే కాదు, ఏ రంగంలో ఉన్నా ఇలా మోసం చేసేవాళ్లు ఉంటారు. మోసపోయేవాళ్లు ఉంటారు. సంపాదించడమే కాదు సంపాదించిన డబ్బును మనం కోరుకున్నట్టుగా ఉపయోగించుకోవడం,జాగ్రత్త చేయడం కూడా మనకు తెలిసి ఉండాలి. లేకపోతే రోడ్డున పడతాం. పూరి జగన్నాథ్ వంద కోట్ల రూపాయల మోసానికి గురైనా కాలం కలిసి వచ్చి తిరిగి నిలదొక్కుకున్నారు. అందరికీ అలాంటి అవకాశాలు వస్తాయని కాదు. పాత తరం నటులు ఇలా మోసాలకు గురైన చివరి దశలో తిండికి లేకుండా గడిపారు. హీరోయిన్‌గా, హాస్యనటిగా ఒక వెలుగు వెలిగిన గిరిజ చివరి దశలో తిండికి సైతం బాధపడ్డారు. చివరకు తిండి కోసం కూడా నలుగురి ముందు చేయి చాచి బతికారు. భర్త చేతిలోనే గిరిజ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ఆయన్ని దర్శకుడిగా నిలబెట్టడానికి సినిమాలు తీసి, భర్తమీద పెట్టుబడి పెట్టి రోడ్డున పడ్డారు. ఆనాటి స్టార్ హీరోలతో సమానంగా మద్రాస్‌లో పెద్ద భవంతి నిర్మించుకున్న ఆమె చివరి దశలో తలదాచుకునే చోటు కూడా లేకుండాపోయింది.
ఇక్కడ తెలివితో సంబంధం లేదు. పూరి జగన్నాథ్‌కు తెలివి లేదు అందామా? తెలుగు సినిమా రంగంలో రికార్డులు సృష్టించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు ఆయన ఆయనకు తెలివి లేదని ఎలా అంటాం. అలానే అలనాటి పాత తరం నటులు ఎంతో మంది తెలివి లేకుండానే అంత ఉన్నత స్థాయికి వెళ్లారా? అద్భుతమైన తెలివి తేటలు, నైపుణ్యం ఉంటే తప్ప వీళ్లు తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరరు.
ఐతే ఇదే సమయంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన తెలివి తేటలు సైతం అవసరం.
సినిమా వారి ఉదాహరణలు ఎందుకు అంటే వారి గురించి అందరికీ తెలుసు కాబట్టి. ఇలా స్నేహితులను నమ్మి నిండా మునిగిపోయిన వారు మన చుట్టుపక్కలనే ఎంతో మంది ఉండొచ్చు. మన బంధువుల్లో ఉండొచ్చు. డబ్బు కుండే లక్షణాలను తెలుసుకుంటే ఇలా మోసాల బారిన పడం. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఉంటే అది ఆ ఇద్దరి వద్దనే చెల్లుబాటు అవుతుంది. ఇద్దరు బంధువుల మధ్య ఉండే బంధుత్వం ఆ ఇద్దరికే వర్తిస్తుంది. ఇద్దరు పెద్ద వారి మధ్య ఉండే స్నేహం మరో వ్యక్తి వద్ద అది పని చేయకపోవచ్చు. కానీ డబ్బు అలా కాదు. ఎక్కడైనా డబ్బు విలువ ఒకే రకంగా ఉంటుంది. నీ చేతిలో ఉన్నంత వరకే అది నీ డబ్బు. నీ వద్ద ఉన్నంత వరకే అది నీ మాట వింటుంది. నీ చేయి దాటి ఇంకొకరి వద్దకు వెళ్లిందనుకో... ఆ డబ్బు నిన్ను అస్సలు గుర్తు పట్టదు. నీ వైపు చూడదు. ఎవరి వద్ద ఉందో వారికే విశ్వాసంగా ఉంటుంది. వారి మాటే వింటుంది. డబ్బుకుండే ఈ లక్షణం అర్థం అయితే దానికి తగిన విలువ ఇస్తాం. మోసపోయాను, నమ్మించి మోసం చేశారు అనే మాటలు ఎవరి నుంచి వినిపించినా అది వారి అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడమే అవుతుంది. తెలివి తేటలతో డబ్బు సంపాదించాను అని భావిస్తున్నప్పుడు, అజ్ఞానం వల్ల ఆ డబ్బును కోల్పోయామని గ్రహించాలి.
ఇష్ట పూర్వకంగా నచ్చిన వారికి మీ డబ్బులు ఇవ్వడం వేరు. తెలివి తేటలు ఉపయోగించి, చమటోడ్చి సంపాదించిన మీ డబ్బుపై పెత్తనాన్ని అమాయకత్వంతో ఎవరికో అప్పగిస్తే రోడ్డున పడాల్సి వస్తుంది. చాలా మంది విషయంలో ఇలానే జరిగింది. ఒకసారి దెబ్బతిన్నతరువాత తిరిగి కోలుకోవడం అంత ఈజీ కాదు. వయసు సహకరించదు. కాలం కలిసి రాదు. మళ్లీ సంపాదిద్దాం అనుకుంటే అప్పటికి మీ ఆరోగ్యం, వయసు పరిస్థితులు అన్నీ మారిపోయి ఉంటాయి. కాలాన్ని వెనక్కి తిప్పలేం. డబ్బుల విషయంలో మన మైండ్ బ్లాంక్ చేసే అవకాశం ఎవరికీ కల్పించవద్దు. కాల్చడమే నిప్పు లక్షణం. డబ్బుకు స్నేహాలు, బంధుత్వాలు ఏమీ ఉండవు. ఎవరి వద్ద ఉంటే వారికి విలువ ఇవ్వడమే దాని లక్షణం. ఎంత త్వరగా ఈ లక్షణాన్ని అర్థం చేసుకుంటే డబ్బు విషయంలో అంత ప్రాక్టికల్‌గా ఉండడం అలవాటు అవుతుంది.
-బి.మురళి(31-3-2019

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం