6, జూన్ 2012, బుధవారం

పాలు+నీళ్ళు=విలువలు

చుట్టూ ముస్లిం దేశాల మధ్య యూదు దేశం ఇజ్రాయిల్ తరహాలో ఉంటుంది నగరంలో భోలక్‌పూర్. చుట్టూ అధిక సంఖ్యలో హిందువులు ఉండే కాలనీలు. గాంధీనగర్, కవాడీగూడ, పద్మశాలి కాలనీ, రాంనగర్.. వీటి మధ్యలో ఉంటుంది ఎక్కువ మంది ముస్లింలుండే భోలక్‌పూర్. అచ్చం ఇజ్రాయిల్ లానే.


ఇప్పుడంటే ప్రైవేటు డెయిరీల సంఖ్య పెరిగిపోయింది కానీ మూడు దశాబ్దాల క్రితం పాల కోసం భారీ క్యూలు కనిపించేవి. ఇప్పుడు సైకిళ్లు ఎక్కువగా కనిపించడం లేదు కానీ ఆ రోజుల్లో సైకిళ్లుఅద్దెకిచ్చే షాపులు ఉండేవి. అలా సైకిళ్లు అద్దెకిచ్చే ముస్లిం వ్యక్తి బిజినెస్ డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా పాల వ్యాపారంపై దృష్టి పెట్టారు. కొన్ని బర్రెలు కొనుగోలు చేసి వినియోదారుల ముందే పితికి పోసేవాళ్లు. కళ్లముందు పితికి పోస్తున్న ఆ చిక్కటి పాల కోసం భారీ క్యూ ఉండేది. బర్రెల అరుపులే తప్ప అతని నోటి నుంచి మాటలు వచ్చేవి కావు. మొదట్లో అతనికి మాటలు రావేమో అనిపించేది. క్యూలో నిలబడిన వారికి పాలు పితికి పోయడం తప్ప మరో మాట మాట్లాడేవాడు కాదు. కొద్ది రోజులు తరువాత మెల్లగా అతను మాట్లాడడం మొదలు పెట్టాడు. అతని ఇంటి వాళ్లు మాకూ పాలు పితికి ఇవ్వండి అంటూ చిన్న బిందె ఇచ్చే వాళ్లు ఆ బిందెలో సగం వరకు పాలు పితికిన తరువాత ఆ వ్యక్తి ఇంటి వారికి తరువాత ముందు కస్టమర్ ముఖ్యం అంటూ కొద్దిసేపువ్యాపార విలువలు, ఖాతాధారుల ముఖాల్లో చిరునవ్వు చూడడం వల్ల తనకు కలిగే సంతృప్తి , దీని వల్ల పై లోకంలో తనకు లభించే సౌకర్యాల గురించి చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చి ఇంటి వాళ్లను పక్కకు జరిపి ఆ పాలను కూడా క్యూలో ఉన్నవారికి పోసేవాడు.


 సైకిల్ అద్దెకివ్వడం, పాలు అమ్మడం వంటి వ్యాపారమే అయినా విలువల గురించి అతను చెప్పే మాటలు ముచ్చటేసేవి. అన్నిట్లోకి తొంగి చూసే పిల్లకాయలకు ముందు, పెద్దవారికి తరువాత క్రమంగా అందరికీ ఆ బిందె రహస్యం తెలిసిపోయింది. బిందెలో ముందుగానే కొన్ని నీళ్లు ఉండేవి. ఆ నీళ్లలో పాలు పితికి తరువాత ముందు కస్టమర్లకు అంటూ నీళ్లు కలిపిన ఆ పాలు పోసేవాడు. పాల గురించి తక్కువగా, విలువల గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. నువ్వు ఏదైతే కాదో అది అని నమ్మించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తావు అంటారు ఓషో రజనీష్. విలువల గురించి అతని ఉపన్యాసం క్రమంగా పెరుగుతూ వచ్చింది, బిందెలో నీటి రహస్యం బట్టబయలు అయ్యాక క్యూ క్రమంగా తగ్గుముఖం పట్టింది. మూడు దశాబ్దాల్లో ఆ సైకిల్ షాపు లేదు అక్కడ పాలమ్మడం లేదు.


పాలు, నీళ్లు, విలువలు ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఆత్మను శరీరాన్ని వేరు చేయలేట్టుగానే ఆ మూడింటిని వేరువేరుగా చూడడం కష్టం. సగం పాలు సగం నీళ్లు కలిపినా అవి పాలలానే తెల్లగా ఉంటాయి. ఆ రెంటిని కలిపి పాల ధరకే అమ్మితే వ్యాపారం విలువ పెరుగుతుంది. అది ఏ వ్యాపారం అయినా కావచ్చు, వ్యాపారంలో విలువ అంటే ఇదే?
నాచారంలోని విశాలమైన ఆ ఇంటికి వెళితే మహాశక్తిసంపన్నమైన ఒక ఆలయంలోకి వచ్చిన భావన కలుగుతుంది. ఎక్కడ చూసినా దేవుని బొమ్మలు, భక్తి పాటలు, పచ్చని మొక్కలతో

దైవత్వం   కళ్లముందు కనిపిస్తుంది. ఆ ఇల్లు గాలికి బెయిల్ కోసం న్యాయమూర్తి పట్ట్భారామారావుకు కోట్ల రూపాయల ముడుపులు మట్టుచెప్పడంలో మధ్యవర్తిత్వం వహించిన ప్రముఖ రౌడీషీటర్ పరుచూరు యాదగిరిరావు గారిది. ఆయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో జీవిత విలువల గురించి అనర్గళంగా ఉపన్యసించగలరు.



నేనే దేవుణ్ణి అంటూ అన్ని మతాల్లోనూ కొందరు వ్యక్తులు బయలు దేరడం సాధారణ విషయమే. హైదరాబాద్ పాత నగరంలో ఈ మధ్య సర్వమత దేవుడొకరు వెలిశారు. శ్రీరాముడిని నేనే, ఏసును నేనే, అల్లానూ నేనే అంటూ పాతనగరం మైనారిటీ రౌడీ షీటర్ ఒకరు అన్ని దేవుళ్ల అవతారం ఎత్తారు. అదేదో సినిమాలో ఒకాయన దుర్యోధనుడు, కర్ణుడు, శ్రీకృష్ణడు వంటి వేషాలన్నీ తానే వేసి మెప్పించినప్పుడు ముగ్గురు దేవతల వేషం నేను వేయలేనా? అనుకున్నాడు. అంత వరకు బాగానే ఉంది. అతనికి నోటి కన్నా చేయి చురుకైనది. కనిపించిన వారినల్లా కొడుతూ నేను దేవుణ్ణి నన్ను గౌరవించేది లేదా అని చితగ్గొట్టడం మొదలు పెట్టాడు. మాటలైతే వింటారు కానీ చేతలను ఎవరు సహిస్తారు. తిరగబడి చితగ్గొట్టి ప్రాణాలు తీశారు.


వయసులో ఉన్నప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చదివిన వారు అక్షరాలతో నిప్పు పుట్టించారని ముచ్చటపడిపోతారు. అదే విషయం పై ఒకాయన ఓస్ అదేం గొప్ప శ్రీశ్రీ అక్షరాలతో మంట పుట్టిస్తే, కరుణశ్రీ కన్నీటిని తెప్పించాడు, కానీ మా జర్నలిస్టు అక్షరాలతో పవర్ ప్రాజెక్టు కూడా పుట్టించాడు తెలుసా?అని గర్వంగా చెప్పుకొచ్చాడు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే నమ్మకం కుదరదు కానీ కళ్ల ముందు వార్తలతో ప్రాజెక్టులు పుట్టిస్తే నమ్మకుండా ఎలా ఉంటాం.

7 కామెంట్‌లు:

  1. "నువ్వు ఏదైతే కాదో అది అని నమ్మించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తావు అంటారు ఓషో రజనీష్." quote బాగుంది. నిజమే! నాకు కూడా ఒకరిద్దరు అనుభవమే ఇలాంటి వారు.As usual నాకు బాగా నచ్చుతాయి మీ టపాలు.. విలువల మీద టపా unique గా ఉంది. నచ్చింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జలతారు వెన్నెల గారు ధన్యవాదాలు. వీలుంటే రజనీష్ సాహిత్యం చదవండి .... మనకు తెలిసిన , విషయాలను , తెలిసిన వ్యక్తులనే మరో కోణం లో ఆ సాహిత్యం చూపిస్తుంది

      తొలగించండి
  2. మా జర్నలిస్టు అక్షరాలతో పవర్ ప్రాజెక్టు కూడా పుట్టించాడు తెలుసా?అని గర్వంగా చెప్పుకొచ్చాడు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే నమ్మకం కుదరదు కానీ కళ్ల ముందు వార్తలతో ప్రాజెక్టులు పుట్టిస్తే నమ్మకుండా ఎలా ఉంటాం.
    super ..

    జనం ఇవి నమ్మే రెండవసారి పట్టం కట్టారు.
    పట్టాభి షేకం చేయలేదనే బాధ.. తో ఇప్పుడు ప్రాజెక్ట్లు కూల్చేసారేమో! అని కూడా అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వనజవనమాలి గారు ధన్యవాదాలు బహుశా మీరు ప్రస్తావించిన పవర్ ప్రాజెక్ట్ పత్రిక అధిపతి పవర్ ప్రాజెక్ట్ గురించి కావచ్చు, నేను ప్రస్తావించినది జర్నలిస్ట్ గా పనిచేస్తూ పవర్ ప్రాజెక్ట్ సంపాదించిన వ్యక్తి గురించి .

      తొలగించండి
  3. విలువల గురించి ఊకదంపుడు తో 'విలువ'(డబ్బు)ని పెంచుకోవడం ద్వారా విలువల వలువలూడ్చేవాల్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది.

    సమాజం లో అలాంటి వాల్లే దర్జాగా బ్రతుకుతున్నా ..... అవి ఎక్కువ కాలం నిలబడవు.

    పోస్టు వ్రాసిన విధానం బాగుంది. అభినందనలు మురళీ గారు.

    జర్నలిజం అంటే సంపాదనకు దగ్గర దారి గా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డమైన బెదిరింపులు - పనులు చక్కదిద్దుకునేందుకు సులువైన దారి అయింది. రామోజీ నుండి చిన్న పత్రికలవరకు అదే ఒరవడి.

    రామోజీనీ - రాధాకృష్ణలతో విసిగే రాజశేఖరరెడ్డి తానూ ఆ పని చేయగలనని చూపించాడు. కాకుంటే డైరెక్టుగా చేసి చూపించాడు.ఎలా చేసినా తప్పు తప్పే.

    జర్నలిజం అంటే బెదిరించడం - అధికారాన్ని బరితెగించి ఉపయోగించుకోవడం - అహంకారం పెంచుకోవడం గా మారింది.

    సాక్షి వచ్చాకే వీళ్ల అసలు రంగు బయటపడడం ప్రారంభమయింది. పత్రికలు - చానల్లు బండారం బయటపడుతున్నట్లే , చీ.బీ.ఐ - న్యాయమూర్తుల బండారాలు బయటపడుతున్నాయి.

    అవి బయటపెడుతున్నది జర్నలిస్టులే అన్నది మనం మరవకూడదు. జర్నలిజం 'నిజం' కావాలి.

    పెట్టుబడిదారుల కబంధ హస్థాలనుండి లేదా దుర్మార్గ మనస్తత్వం ఉన్న వాళ్ల నుండి కాపాడాలి.

    ఆ పని చేయాల్సింది - జనాన్ని మేల్కొల్పాల్సింది జర్నలిస్టులే.

    రిప్లయితొలగించండి
  4. *జర్నలిజం అంటే సంపాదనకు దగ్గర దారి గా మారింది. రామోజీ నుండి చిన్న పత్రికలవరకు అదే ఒరవడి*

    చిన్న పత్రికల వారి మీద ఈ అభియోగం ఎప్పటి నుంచో ఉంది. ఆ రోజుల్లో చదువుకొని ఉద్యోగం రాక ఖాళీగా ఉండేవారు లోకల్ పేపర్ పెట్టుకొని రాస్తూండేవారు. వాళ్లు కొంతమంది రాజకీయ నాయకులను సమర్దిస్తూ రాసేవారు. ఆ నాయకులు డబ్బులు ఇస్తూండేవారు. ఆపేపర్ వాళ్లని ఎవరు పట్టించుకొనేవారుకాదు. ఈనాడు లోకల్ ఎడిషన్ వచ్చిన తరువాత చిన్న పేపర్ వాళ్లంతా తమ పేపర్లను మూసుకొన్నారు. ఎంతో ఘనత వహించిన పెద్ద పేపర్ వాళ్లు ఇలా చేయటమే అభ్యంతరకరం. అయినా ఇప్పుడు చేయదగినది ఎమీ లేదు. ప్రజలేప్పుడో పేపర్ వారి, దాని అనుబంధ రాజకీయ పక్షం వారి అసలు స్వభావాన్ని గుర్తించి జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం