1, ఆగస్టు 2012, బుధవారం

హనుమంత రావు మౌన దీక్ష -గబ్బర్ సింగ్ కెవ్వు..... కేక ..పాట

ఇసుకవేస్తే రాలనన్ని మైకులున్నాయక్కడ. సంచలనాత్మక ప్రకటన చేస్తారని తెలియడం వల్ల డజన్ల కొద్ది మీడియా లైవ్ వ్యాన్‌లు అక్కడికి చేరుకున్నాయి. నేను వౌన దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను అని నాయకుడు ప్రకటించగానే అంతా ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. తాము విన్నది నిజమేనా? అని ఆ నాయకుడిని మళ్లీ అడిగారు. ఔను నిజమే నేను వౌన దీక్ష చేయాలనుకుంటున్నారు. పార్టీని బాగు చేసేందుకు మా వాళ్లేవరూ మెదడును ఉపయోగించడం లేదు. ఎవరికి వారు ఖర్చవుతుందని మెదడు ఉపయోగించక పోతే పార్టీ పరిస్థితి ఏం కావాలి. పార్టీని బతికించుకోవాలంటే మెదడును ఉపయోగించాలని, క్యాడర్‌ను అర్సుకోవాలి అనే డిమాండ్‌తో వౌనదీక్ష చేస్తాను అని ప్రకటించారు.
కాంగ్రెస్ నేత హనుమంతరావు వౌనదీక్ష ఆరంభిస్తున్నట్టుగా మూతికి వేలును అడ్డుం పెట్టుకున్నాడు.



 ఒకటి రెండు మూడు నిమిషాలు గడిచిపోయాయి. ఇంకెన్ని సెకండ్లు వౌనంగా ఉంటారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విషయం తెలిసిన హై కమాండ్ ఆగ్రహంతో పిసిసి అధ్యక్షుడికి ఫోన్ చేసింది. మీ రాష్ట్రంలోని ఈ ఉద్యమం కొంప దీసి దేశ మంతా వ్యాపించిందంటే ఇంకేమన్నా ఉందా? మొత్తం ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిపోతుంది ఎలాగైనా చేసి వౌన దీక్షను విరమింపజేయండి అని హై కమాండ్ ఆదేశించింది. దీక్ష విరమించు అని బొత్స తన మనిషితో రాయబారం పంపించాడు. ఏంరా బాయ్ బొత్స నాకు రాయబారిని పంపేంత పెద్దొడయ్యాడా! 
చంద్రబాబు తాలుకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ను, నేను పిసిసి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు బొత్స యూత్ కాంగ్రెస్ నాయకుడు కాలం కలిసి రాక ఇలా ఉన్నా అని రాయబారికి హనుమంతరావు సమాధానం రాసిచ్చాడు. ఎవరైనా తపస్సు చేస్తే భగ్నం చేయడానికి ఇంద్రుడు రంభ ఊర్వశి, మేనకలను పంపినట్టు నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు.


 దీక్షా శిబిరం వద్దకు ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ప్యారడైజ్ బిర్యాని ఐదు రూపాయలకు ప్లేట్ అని మైకులో అరుస్తున్నారు. రాహుల్‌గాంధీ సైతం ఇష్టంగా తినే ప్యారడైజ్ బిర్యాని పేరు వినగానే అంతా అటు పరుగులు తీశారు. హనుమంతరావుకు నోరూరింది. అన్నా వౌన దీక్ష మాటకే కాని నోటికి కాదు కదా? తిందామన్నా అని పక్కనున్న అనుచరుడు ఊరించాడు. పుల్లారెడ్డి స్వీట్స్ కారు చౌకగా అంటూ వ్యానొచ్చి ఆగింది. 


దీక్షా శిబిరం ఎదురుగా ఎవరో ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేశారు. కొప్పున పూలెట్టుకుని.... కెవ్వు కేక అంటూ గబ్బర్‌సింగ్ సినిమాలో ఐటెం సాంగ్ ప్రదర్శించారు. అది చూడగానే విజిల్ వేయాలన్నంత ఉత్సాహం వచ్చింది హనుమంతుకు విజిల్ ఘాటైన మాటే అని ఊరుకున్నాడు. అన్నా ఇందులో బొత్సా కుట్ర ఉందనిపిస్తోంది అని అంబర్‌పేట శివశంకర్ హనుమంతరావు చెవిలో ఊదాడు. రంభ, ఊర్వశి, మేనకల్లానే బిర్యానీ, స్వీట్స్, గబ్బర్‌సింగ్ కేక ఏదీ పని చేయలేదు.


ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ వచ్చి హనుమంతరావు చెవిలో ఏదో చెప్పాడు. నా మాట నమ్ము నిజం అని దామోదర్ పక్కనున్న డాక్టర్‌ను ముందుకు తోశాడు. అతను చెప్పింది హనుమంతరావు నమ్మనట్టుగానే ముఖం పెట్టాడు. అతను తన ఐడెంటీ కార్డు తీసి చూపించాడు. ఆ తరువాత తన వద్ద ఉన్న వైద్య గ్రంధంలోని ఒక పేజీ చూపించాడు. ఆ పేజీ చూడగానే హనుమంత రావుకు చమటలు పట్టాయిదీక్ష విరమించాడు. తన 60 నిమిషాల వౌన దీక్ష గురించి హనుమంతరావు మూడు గంటల పాటు మీడియాకు ఏకధాటిగా వివరించారు. దీక్ష విరమించగానే ఆయన పలికిన తొలి పలుకు ‘‘మాట్లాడకుండా ఉండడం చాలా కష్టం.’’


హై కమాండ్ దూతలు చెప్పినా వినని హనుమంతరావును దామోదర్ ఎలా దీక్ష విరమింపజేశారు. తెర వెనుక మతలబు ఏమిటి? అంటూ చానల్స్ గంట దీక్షపై ఇరవై మూడున్నర గంటల పాటు ప్రత్యేక వార్తా కథనాలు ప్రసారం చేశాయి.


మన శరీరంలోని ఏవైనా అవయవాలను ఎక్కువ రోజుల పాటు ఉపయోగించక పోతే ఆ అవయవం మొద్దు బారిపోతుంది. నాయకులు  అధినేత చెప్పు చేతుల్లో ఉంటూ సొంతంగా  మెదడును ఉపయోగించరు దాంతో మెదడు పని చేయకుండా పోతుంది. రాజకీయ నాయకుల శరీరం లో అతి తక్కువగా పని చేసేది మెదడు, అతి ఎక్కువగా పని చేసేది నోరు . అందుకే మెదడు మొద్దు బారినా నోరు చురుగ్గా ఉంటుంది . ఇప్పుడు మీరు నోటికి కూడా పని చెప్పక పొతే అదికూడా శాశ్వతంగా పని చేయకుడా పోయే ప్రమాదం ఉంది.ఇక మీరు శాశ్వతంగా వౌనంగా ఉండాల్సి వస్తుంది అని హనుమంతరావుకు చెప్పగానే ఆయన వణికి పోయి దీక్ష విరమించాడు. ఈ విషయాన్ని దామోదర్ వౌనంగా తనలోనే దాచుకున్నాడు. రాజకీయ నాయకుడు పదవి లేకపోయినా, తరువాత వస్తుందిలే అనే ఆశతో ఉండగలడు కానీ మాట్లాడుకండా ఉండలేడు.


 నది లేని చోట ప్రాజెక్టులు నిర్మించడం, కనిపించని రోడ్డు వేయడంలో మన నేతలకు సామర్ధ్యం ఉన్నప్పటికీ మాట్లాడకుండా ఉండడం అసాధ్యం.


 బాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ శిక్షణ ఇప్పించారు. 15 నిమిషాలకు మించి ఉపన్యసించవద్దు, అలా చేస్తే వినేవాళ్లు అసహనంగా ఉంటారని చక్కగా చెప్పారు. ఈ శిక్షణ అద్భుతంగా ఉందని, చాలా చక్కగా బోధించారని చంద్రబాబు 90 నిమిషాల పాటు ఉపన్యసించారు. ఆ 90 నిమిషాల లక్ష్యాన్ని ఆయన చాలా కాలం కొనసాగించారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి విలేఖరుల సమావేశం అంటే ఐదు నిమిషాల్లో ముగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పివి నరసింహారావువినడమే తప్ప ఎక్కువగా మాట్లాడే వాళ్లు కాదు. వౌన మునులు రాజకీయాల్లో రాణించలేరు.
 ఈ జబ్బు కొత్తగా పుట్టిందేమీ కాదు. తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఓసారి జర్నలిస్టులతో మీరూ, మేమూ ఒకటే నాయకులు తెలియకపోయినా ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు, తెలియకపోయినా మీరు రాసేస్తుంటారు అని చమత్కరించారు.

4 కామెంట్‌లు:

  1. నది లేని చోట ప్రాజెక్టులు నిర్మించడం, కనిపించని రోడ్డు వేయడంలో మన నేతలకు సామర్ధ్యం ఉన్నప్పటికీ మాట్లాడకుండా ఉండడం అసాధ్యం.


    బాగా చెప్పారండి. :)
    ఇంతకీ ఇక ముందట మౌన దీక్షలు ఉండవంటారా?

    రిప్లయితొలగించండి
  2. :) బలే! గాంధీ గారు చచ్చిపోయి బతికిపోయాడు.

    రిప్లయితొలగించండి
  3. నిజమే.తక్కువ మాటలాడితే మంచిదే.కాని నాయకులకీ,ఉపన్యాసకులకీ oratoryముఖ్యం.ప్రజలను ఆకర్షించడానికి. ఐతే ఎక్కడ ,ఎలా ,ఎంత ,మట్లాడాలని తెలిసిఉండాలి.నెహ్రూగారికి మంచి sense of humour ఉండేది.తనమీదే జోకులు,కార్టూన్లు వేసినా తేలికగా తీసుకొనేవారు.ఆయన కోపం కూడా తాత్కాలికమే.అలాంటి నాయకులు ఇప్పుడు అరుదు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం