4, అక్టోబర్ 2015, ఆదివారం

ఔను! వాళ్లు మేధావులు!!

‘‘నాచేతిలో గన్ ఉంటే ఇలాంటి వాళ్లను వరుసబెట్టి కాల్చి పారేసేవాడ్ని.. వీళ్లను ... ’’


‘‘అంత ఆవేశపడుతున్నావ్ అంటే . మన దేశంలోకి ఉగ్రవాదాన్ని దిగుమతి చేస్తున్న పొరుగు దేశం మీదనే కదా  ఆ కోపం ?’’
‘‘మా ఇంటి పొరుగు వారిని ప్రేమించాలనే బలమైన కోరిక ఉన్నా వాళ్లా యన కండలు చూసి భయంతో ఊరుకున్నాను. లేకపోతే ఎప్పుడో పొరుగు వారిని ప్రేమించే వాడ్ని. అలాంటిది నేను పొరుగు దేశాన్ని వ్యతిరేకిస్తానా? ’’
‘‘అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నర రూపరాక్షసులు ఉగ్రవాదుల మీద కోపం సహజమే. మన పార్లమెంటు మీద దాడి చేశారు. తాజ్ హోటల్‌పైన, ముంబాయి, ఢిల్లీ ఎక్కడ పడితే అక్కడ ముష్కరులు దాడి చేసి ప్రాణాలు తీస్తుంటే కోపం రాదా? ఏం పాపం చేశారని గోకుల్ ఛాట్‌లో పిల్లా పాపలతో సంతోషంగా ఛాట్ తినడమే వారు చేసిన పాపమా? బాంబులు పెట్టి ప్రాణాలు తీస్తారా? అలాంటి వారిని వరుసగా నిలబెట్టి చంపినా తప్పు లేదు. నాకు అర్థమయింది నీ కోపం వారి పైనే  ’’


‘‘మీరు అపార్ధం చేసుకుంటున్నారు. నాకు వాళ్లమీద ఎలాంటి కోపం లేదు. మనకు అన్నీ నెగిటివ్‌గా ఆలోచించడం అలవాటైంది. వాళ్ల సాహసాలను ఒకసారి పాజిటివ్ కోణంలో ఆలోచించి చూడండి. ఒక్కసారి కూకట్‌పల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు ప్రయాణించి చూడు తాతలు గుర్తుకొస్తారు.అలాంటిది దేశం కాని దేశం నుంచి అర్ధరాత్రి నాటు పడవలో కసబ్ అనే ఆ కుర్రాడు రావడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో? తలుచుకుంటేనే జాలేస్తోంది. సరైన తిండి కూడా లేకుండా రోజుల తరబడి సముద్రంలో ప్రయాణించి ఇండియాలో అడుగు పెట్టిన అతని సాహసానికి నేను అబ్బురపడతాను. కానీ కాల్చివేయాలని ఎందుకనుకుంటాను. మీరు గమనించలేదేమో ఇలాంటి వారిని ఉరి తీయడాన్ని తప్పు పడుతూ సంతకం చేసిన మేధావుల్లో నా పేరు కూడా ఉంది. ’’


‘‘ మీరెప్పుడయ్యారు మేధావులు? ఆ వార్త ఎప్పుడొచ్చింది? ’’
‘‘ చేతిలో ఇంగ్లీష్ బుక్, భుజానికి బట్ట సంచి. సంచిలో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నెరిసిన గడ్డం. ఇవన్నీ చూసిన తరువాత కూడా నేను మేధావిని అయ్యాను అనే నమ్మకం నీకు కలగ లేదంటే నీ దురదృష్టానికి నేనేం చేయలేను. నేను మేధావిననే విష యం అందరికీ తెలియడానికి ఎంతో కష్టపడి అందరి సంతకాల మధ్యలో నా సంతకాన్ని జొప్పించాను.. ’’
‘‘ఇంతకూ ఎవరిని కాల్చేయాలనుకున్నావో ఆ ఒక్కటీ చెప్పలేదు.. జీహాదీ పేరుతో అమాయకులను చంపే వారిపైనా? పార్లమెంటుపై దాడి చేసిన వారినా? ’’
‘‘పార్లమెంటులోకి వెళ్లడానికి ఎంపిలే అష్టకష్టాలు పడతారు. అక్కడ సెక్యూరిటీ అంత ఇబ్బంది కరంగా ఉంటుంది. అలాంటి ప్రాంతానికి తీవ్రవాదులు వెళ్లినందుకు వాళ్ల సాహసాన్ని మెచ్చుకోవాలి కానీ తప్పు పట్టడం ఎందుకు? జీహాద్ వారి మనోభావం. ఎవరి మనోభావలను నొప్పించే అధికారం మనకు లేదు. ’’


‘‘మరింకెవరిపై నీ కోపం. అడవుల్లో ఆయుధాలు పట్టుకుని ఆటో డ్రైవర్లను, కూలీలను కిడ్నాప్ చేయడం, ఇన్ఫార్మర్లుఅని కాల్చి చంపడం, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే తీవ్రవాదులపైనా నీ కోపం’’
‘‘ఎంత మాటన్నావు... చిక్కడపల్లి నుంచి మల్కాజిగిరి వరకు, ఎల్‌బి నగర్ నుంచి ఉప్పల్ వరకు అక్కడ ఇక్కడ అని కాదు. ఎక్కడైనా దోమ కాటును తప్పించుకొని దమ్ముంటే సుఖంగా నిద్ర పోయామని ఒక్కరిని చెప్పమను చూస్తాను. మహానగరంలోనే మనం దోమల దాడిని తట్టుకోలేక అల్లాడి పోతుంటే పాపం ఆ అడవి బిడ్డలు దోమలు, పురుగులు, పాములను తప్పించుకుంటూ ఎండకు ఎండి, వానకు తడుస్తూ ఒక చేతితో ఆయుధాలు, మరో చేతితో ఇన్ఫార్మర్ల తలలు పట్టుకుని భారంగా నడవడమే జీవితంగా గడిపే అడవి బిడ్డలను గుండెలకు హత్తుకుంటాను కానీ వాళ్లనెందుకంటాను. పిల్లలు తుపాకీతో ఆడుకుంటే ముచ్చటపడతాం కానీ తప్పు పడతామా? చిన్నప్పుడు బొమ్మ తుపాకీ పెద్దయ్యాక నిజమైన తుపాకీ తేడా అంతే ... ’’
‘‘మరింకెవరిని వరుసగా కాల్చాలనుకుంటున్నావ్’’


‘‘ఎందరో మహానుభావులు దేశం కోసం సర్వస్వం అర్పించి స్వాతంత్య్రం సాధించింది ఇందుకోసమేనా? పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇందుకోసమేనా? ఆరవై ఏళ్ల కొట్లాటతో తెలంగాణ సాధించుకున్నది ఇందుకోసమేనా? ’’
‘‘నీ ఆవేశం, ఆవేదన నా కర్ధమైంది. కానీ ఎందుకోసమో ? ఎవరిపై కోపమో తెలియడం లేదు’’
‘‘ఈ దేశానికో సంప్రదాయం, సంస్కృతి ఉంది? ఎంతో మంది ఎన్నో సార్లు ఈ దేశంపై దాడులు చేశారు. ప్రపంచ పటంలో బూతద్దం పెట్టుకుని చూస్తే కానీ కనిపించని బుడ్డ బుడ్డ దేశాల వాళ్లు కూడా దాడి చేశారు. ఆలయాలపై దాడులు చేశారు. సంపద దోచుకున్నారు. మత మార్పిడులు చేశారు’’
‘‘ఔను నిజమే చేశారు. కానీ వాళ్లను ఇప్పుడు కాల్చాలంటే కుదరదు, ఆ పనులు చేసిన వంశాలన్నీ గతించి కాలగర్భంలో కలిసిపోయాయి. ’’
‘‘నా కోపం వాళ్ల మీద కాదు. అన్ని సార్లు దాడులు చేసినా, సంపద దోచుకెళ్లినా మనం పల్లెత్తు మాట అనలేదు. అతిథిని గౌరవించడం మన ధర్మం... అతిథి దేవోభవ అని నిరూపించుకున్న వాళ్లం మనం. వాళ్లమీద నాకెందుకు కోపం కానీ’’
మరి ఇంకెవరి పై ఆ ధర్మాగ్రహం ’’

 ‘‘ఉదయమే ధర్మ సందేహాలు అంటూ టీవిల్లో మాట్లాడుతున్నారు. మనిషి జీవితానికి విలువలు ముఖ్యం అంటున్నారు. పతనం అయితే సమాజం ప్రమాదంలో పడుతుందని ధర్మోపన్యాసాలు చేస్తున్నారు. గణపతి విగ్రహాల ఏర్పాటు వల్ల 22వేల కోట్ల 575 రూపాయల 45 పైసల ప్రజా సంపద వృధాఅవుతుంది తెలుసా? బతుకమ్మ, అట్లతద్ది వల్ల ఈ ప్రపంచానికి  ఎంత నష్టమో తెలుసా?  ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి బాధ పడుతున్నారు కానీ బతుకమ్మ పండుగ ,రక రకాల  పూజల పేరుతో పూలను హత్య చేయడం గురించి మాట్లాడరేం ..  ఇలాంటివి ప్రోత్సహించే వాళ్లను వరుసబెట్టి కాల్చేయాలనిపిస్తోంది. ’’
‘‘నా అనుమానాలు తీరిపోయాయి. ఇప్పుడొప్పుకుంటున్నాను. నువ్వు కొత్తగా మేధావి మతం పుచ్చుకున్నవాడివి, ట్రైనింగ్ పిరియడ్ ముగిసిపోయిన కరుడు కట్టిన సెక్యూలరిస్టువి ’’ 
- బుద్దా మురళి (జనాంతికం 4.1 0.201 5)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం