11, సెప్టెంబర్ 2018, మంగళవారం

పాసివ్ ఇన్‌కమ్

మనకీ పదం అంత పరిచయమైనది కాకపోవచ్చు. ఈ పదం గురించి తెలియకుండానే మనలో చాలా మంది పాసివ్ ఇన్‌కం ఎప్పటి నుంచో సంపాదిస్తూనే ఉన్నారు. పాసివ్ ఇన్‌కమ్ పదం మనకు కొత్త అయినా కొన్ని ప్రాంతాల్లో చాలా కాలం నుంచి వినిపిస్తున్నదే. ఆదాయం రెండు మార్గాల్లో ఉంటుంది. ఒకటి యాక్టివ్ ఇన్‌కమ్ అయితే రెండవది పాసివ్ ఇంకమ్ . యాక్టివ్ ఇన్‌కమ్ వల్ల సంపన్నులు అయ్యేవారు చాలా తక్కువ కానీ ఎక్కువ మంది సంపన్నులు అయింది పాసివ్ ఇన్‌కమ్ ద్వారానే.
మీరు ఉద్యోగులు అయితే మీకు నెల నెలా ఒకటవ తేదీన జీతం వస్తుంది. నెల నెలా వచ్చే జీతం మీ యాక్టివ్ ఇన్‌కమ్ అంటే నెల రోజుల పాటు ఉద్యోగం చేస్తేనే జీతం వస్తుంది. ఉద్యోగానికి వెళ్లక పోయినా, ఉద్యోగం మానేసినా మీ ఆదాయం నిలిచిపోతుంది. ఇది యాక్టివ్ ఇన్‌కమ్. మీరు యాక్టివ్‌గా ఉద్యోగం చేసినన్ని రోజులు మాత్రమే. మీకు జీతం వస్తుంది. అదే మీ యాక్టివ్ ఇన్‌కమ్.
రెండవది పాసివ్ ఇన్‌కమ్ . ఒకసారి ఆదాయం రావడం ప్రారంభం అయితే వస్తూనే ఉంటుంది. పాసివ్ ఇన్‌కం మార్గాల్లో కొంత కాలం ఈ ఆదాయం కోసం కృషి చేసి మీ పనిలో మీరున్నా ఆదాయం వస్తూనే ఉంటుంది. పాసివ్ ఇన్‌కమ్‌లో అనేక మార్గాలు ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి. ఏ ఉద్యోగం ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏ ఖర్చు వచ్చి మీద పడుతుందో అనే సందేహాలతో చాలా మంది అదనపు ఆదాయాలపై దృష్టిసారించారు. పాసివ్ ఇన్‌కమ్ అలాంటిదే.
సకాలంలో పాసివ్ ఇన్‌కమ్‌పై దృష్టిసారిస్తే ఉద్యోగంలో ఉండగానే జీతాన్ని మించిన సంపదను కళ్ల చూడవచ్చు. కనీసం ఎంతో కొంత ఆదాయం వస్తుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు కుర్రాళ్లు బిటెట్ పూర్తయ్యాక. బెంగళూరులో ఐటి కంపెనీలో ఉద్యోగంలో చేరారు. వారాంతంలో సొంత గ్రామాలకు వెళ్లేవాళ్లు. ప్రైవేటు బస్సుల్లో టికెట్ కోసం ఏజెంట్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన వారికి సమస్య నుంచే పాసివ్ ఇన్‌కమ్ ఆలోచన పుట్టింది. బస్సు ఆపరేటర్ల ఏజెంట్లను బతిమిలాడి ఒప్పించి రెడ్ బస్ అనే యాప్ రూపొందించారు. ఇంట్లో కూర్చోని బస్సులో టికెట్ బుక్ చేసుకోవచ్చు. రెడ్‌బస్ ఎంతగా సక్సెస్ అయిందంటే కొంత కాలానికి కుర్రాళ్లు కొన్ని వందల కోట్ల రూపాయలకు దీన్ని అమ్మేశారు. తమకు కావలసిన బస్సు టికెట్ కోసం వచ్చిన ఆలోచన వారిని సంపన్నులుగా మార్చేసింది. మొదట్లో ఇంతగా సక్సెస్ అవుతుందని ఆలోచించలేదు. తమ ఉద్యోగాలు చేసుకుంటూనే పై సంపాదనగా ఇది ఉపయోగపడుతుంది అని భావించారు. కానీ వారికే తెలియకుండా వారిని ఊహించనంత సంపన్నులను చేసిందీ ఆలోచన.
అందరూ ఇదే స్థాయిలో విజయం సాధిస్తారని కాదు. జీతం సరిపోవడం లేదని, భవిష్యత్తు ఎలా? అనే దిగులుతో తమలో తామే కుమిలిపోకుండా మరింత సంపాదన కోసం ఎవరికి వారే పాసివ్ ఇన్‌కమ్‌పై దృష్టిసారించవచ్చు.
పాసివ్ ఇన్‌కమ్ అనే మాట విని ఉండక పోవచ్చు కానీ చాలా మంది ఈ దిశగా ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉన్నారు.
జీతం నుంచి కొంత పొదుపు చేసి బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ పాసివ్ ఇన్‌కమ్. అయితే ద్రవ్యోల్భణం ఎంత శాతం ఉంటుందో, బ్యాంకు వడ్డీకి అంత కన్నా ఎక్కువ ఏమీ ఉండదు. దీని వల్ల బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీని పెద్దగా ఆదాయంగా చూడలేం. అయితే భద్రత ఎక్కువ కోరుకునే వారికి మరో మార్గం లేదు.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ మెంట్‌కు సగటున 15 శాతం ఆదాయం వసుంది. మార్కెట్‌లో ఎగుడు దిగుడులు సహజమే. సిస్టమెటిక్ ఇనె్వస్ట్‌మెంట్ (సిప్)ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్‌మెంట్ చేయడం పాసివ్ ఇన్‌కమ్‌కు ఎక్కువ మందికి అందుబాటులో ఉన్న అవకాశం.
లక్షా 50వేల రూపాయల పెట్టుబడి వరకు పన్ను రాయితీ కూడా ఉంది. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఒకవైపు ఆదాయం, మరోవైపు పన్ను రాయితీ ప్రయోజనాలు ఉన్నాయి. నెల నెలా జీతంలా లాభాన్ని పంచే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అవగాహన ఉన్నవాళ్లు, రిస్క్ భరించేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లు స్టాక్‌మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేయవచ్చు. స్టాక్‌మార్కెట్ అనేది జూదం అనే అభిప్రాయం తప్పు. సరైన అవగాహనతో పెట్టుబడి పెట్టి ప్రయోజనాలు పొందాలి కానీ జూదం ఆడినట్టు ఆడి నష్టపోయి స్టాక్ మార్కెట్ జూదం అనడం తప్పు. దాదాపు ఐదేళ్లపాటు స్టాక్‌మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేస్తే దాదాపు 15శాతం వరకు లాభం ఉంటుంది.
హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇళ్లు, స్ధలాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చాలా మందికి పాసివ్ ఇన్‌కమ్‌కు ఇంటిపై పెట్టుబడి ఉపయోగపడుతోంది. ఇంటిపై నెల నెల వచ్చే అద్దె పాసివ్ ఇన్‌కమ్. అద్దె రూపంలో ఆదాయం రావడంతో పాటు ఇంటి విలువ పెరుగుతుంది. మన ఆస్తి మన చేతిలోనే ఉంటుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. చక్కని ఆదాయం రావడంతో పాటు విలువ పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పాసివ్ ఇన్‌కమ్ కోసం ఇంటిపై పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచన.
చాలా మంది అద్దెల కోసం అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఐతే మన పెట్టుబడి దానిపై అద్దె రూపంలో వచ్చే ఆదాయం ఎంత అనే సరైన అంచనాతో పెట్టుబడి పెట్టాలి.
మన ఉద్యోగం మనం చేసుకుంటూ అదనపు చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా అదనపు ఆదాయం పొందే మార్గాలు ఏమున్నాయని ఎవరికి వారు దృష్టి సారిస్తే ఏదో ఒక అవకాశం లభిస్తుంది. ఇప్పుడు వేల కోట్లు సంపాదిస్తున్న కార్పొరేట్ కాలేజీల యజమానులు ప్రారంభంలో జీతం సరిపోక ట్యూషన్ల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకున్నారు. చివరకు ఆ ట్యూషన్ సెంటర్లు కార్పొరేట్ కాలేజీలుగా రూపొంతరం చెంది వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అందజేస్తున్నాయి.
కొంత మంది ఉద్యోగాలు చేస్తూనే బ్లాగ్‌ల ద్వారా, యూ ట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు. నవతరం యువత యూ ట్యూబ్‌ను పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ మిషన్‌గా ఉపయోగించుకుంటున్నారు. యూట్యూబ్‌లో కొందరు హాస్యంతో పాటు వివిధ అంశాల ఫిల్మ్‌లు తయారు చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటే వీరికి ప్రకటనల రూపంలో ఆదాయం వస్తుంది. ఇలాంటి వారు చాలా మందికి అప్పటికప్పుడు ఆదాయం లభించడంతో పాటు ఏకంగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. వారి ఆదాయం ఊహించని స్థాయికి చేరింది. తెలుగులో హాస్యంపైనే ఎక్కువ కానీ హిందీలో అంతకు మించి క్లిష్టమైన పలు అంశాలను సులభంగా షార్ట్ఫిల్మ్‌లుగా యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. వీరంతా ఏదో ఒక ఉద్యోగంలో ఉన్న వాళ్లే. వీరికి ఇది అదనపు ఆదాయం. మనసుంటే మార్గం ఉంటుంది. ఉద్యోగంలో యాక్టివ్‌గా ఉన్నప్పుడే రేపటి కోసం పాసివ్ ఇన్‌కమ్‌పై దృష్టిసారించాలి.
-బి.మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం