16, నవంబర్ 2012, శుక్రవారం

యం ఐ యం మద్దతు ఉపసంహరణకు కారణం ..రాజ్యలక్ష్మా? భాగ్యలక్ష్మా?




ఉప ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఊహించిందే. కానీ ఎంఐఎం మద్దతు ఉప సంహరణ ఊహించని పరిణామమే! ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసి జగన్‌కు సన్నిహితులు. సోనియాగాంధీ వద్దన్నా, జగన్ ఓదార్పు కోసం బయలు దేరాలని సన్నద్ధం అవుతున్నప్పుడు సోనియాగాంధీకి, జగన్‌కు మధ్య అసదుద్దీన్ రాజీకి ప్రయత్నించారు. తమ పాత నగరానికి, మతానికి సంబంధించిన వ్యవహారాలు మినహాయిస్తే, అసెంబ్లీలో అయినా, బయట అయినా చక్కగా మాట్లాడే అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో అసదుద్దీన్ ముందు వరుసలో నిలుస్తారు.

 తమ సామ్రాజ్యంలో వారి సొంత పాలన వేరు కానీ పరిపాలనకు సంబంధించి వారు చెప్పే విషయాలు వేలెత్తి చూపడానికి వీలులేకుండా చక్కగా ఉంటాయి. అలాంటి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడానికి చూపిన కారణాలు, సందర్భం మాత్రం ఎబ్బెట్టుగా ఉంది. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో వివాదం ఇది మొదటి సారేమీ కాదు. చార్మినార్ కట్టిన తరువాత భాగ్యలక్ష్మి ఆలయం కాట్టారా? భాగ్యలక్ష్మి ఆలయం ఉన్న చోట చార్మినార్ నిర్మించారా? అనేదానిపై ఎవరి వాదనలు వారికున్నా మద్దతు ఉపసంహరణకు అసదుద్దీన్ చెప్పిన కారణాలు మాత్రం సహేతుకంగా కనిపించడం లేదు.

 భాగ్యలక్ష్మి ఆలయం విస్తరణకు ప్రభుత్వమే సహకరిస్తోందట! ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంఘ్ పరివార్ చెప్పు చేతుల్లో ఉన్నారట, ఆయన మరో మోడీ అనేది ఎంఐఎం ఆరోపణ. మిగిలిన వారికి ఎలా ఉన్నా ఈ ఆరోపణలు స్వయంగా ముఖ్యమంత్రికి సైతం విస్మయం కలిగించి ఉండొచ్చు. హైదరాబాద్‌లో సంఘ్ వారున్నారా? వారి వివరాలేమిటి? అని కిరణ్ తెలుసుకోవడానికి ప్రయత్నించి కూడా ఉండొచ్చు. క్రైస్తవుడే అయినా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హిందూ పూజారులకు ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకున్నారని చిల్కూరు బాలాజీ పూజారి, పురోహితుల సంఘం నాయకులు స్వయంగా ప్రకటించారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం ఇలాంటి చరిత్ర ఏమీ లేదు. అసలు కిరణ్ వ్యవహార శైలి అర్ధం కాక సొంత పార్టీ వారే అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఆయన మంత్రులకే ఆయనంటే పడదు. ఇక సంఘ్ కోసం ఆయన పని చేయడమా? ఒక ఉద్యోగి ఉద్యోగం మారుతున్నప్పుడు తాను అప్పటి వరకు పని చేసిన సంస్థ గురించి చెడుగా చెప్పవద్దని అంటారు. కానీ ఇది రాజకీయాల్లో చెల్లదు. పాత పార్టీని ఎంత ఎక్కువగా తిడితే కొత్త కంపెనీకి అంత చేరువవుతారు. ఎంఐఎం చేసింది కూడా అదే.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అందరికీ తెలిసిందే! ఏడాదిన్నర పాటు ప్రభుత్వాన్ని నిలుపుకుంటామని కాంగ్రెస్ నాయకులు ధీమాగా చెబుతారేమో కానీ మళ్లీ గెలుస్తాం అని ఎవరూ చెప్పరు. చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల కోసం సాగుతున్న వ్యూహాలే. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఎవరు ఎవరితో కలిసినా పాత బస్తీలోని ఏడెనిమిది నియోజక వర్గాల్లో ఎంఐఎం పార్టీనే గెలుస్తుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఉప ఎన్నికల్లో స్పష్టమైంది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మరల్చుకోవాలని ఎంఐఎం భావిస్తోంది. కొత్త ప్రాంతాలకు విస్తరించగడానికి గతంలో కొంత వరకు ప్రయత్నించింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో తెలియదు అందుకే ముందు చూపుగా ఎంఐఎం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు తీసుకునే నిర్ణయాలకు ప్రజల్లో పెద్దగా విలువ ఉండదు. అందుకే ఏడాదిన్నర ముందే ఎంఐఎం ఎన్నికల రంగంలోకి దిగింది. మద్దతు ఉపసంహరణ తొలి అడుగు. మద్దతు ఉపసంహరణ ఎంఐఎం వ్యూహాత్మక ఎత్తుగడనే తప్ప భాగ్యలక్ష్మి ఆలయ వివాదం కానే కాదు.

 ఎంఐఎం కోరాలే కానీ ప్రభుత్వం భాగ్యలక్ష్మి ఆలయ   గతంలో ఉన్న దాని కన్నా మరింత చిన్నగా ఆలయాన్ని మార్చడానికి సైతం సిద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంఐఎంకు కావలసింది అది కాదు మద్దతు ఉపసంహరణకు ఒక అవకాశం అంతే
.

2 కామెంట్‌లు:

  1. ముస్లింల వోట్ల కోసం కక్కుర్తి పడే కాంగ్రెస్ కావాలని చార్మినార్ ప్రాంతంలో హిందూ దేవాలయాన్ని విస్తరించే ధైర్యం చేస్తుందని నేను అనుకోను. ఈ విషయం MIM నాయకులకి తెలుసు. MIM నాయకుల ఉద్దేశం తెలంగాణా రాకుందా జగన్‌తో చేతులు కలపాలనుకోవడమే. ఒవైసీ కుటుంబ సభ్యులు రజాకార్‌ల నాయకుడు అబ్దుల్ వహీద్ ఒవైసీకి డైరెక్ట్ వారసులు. వాళ్ళకి తెలంగాణా రావడం ఇష్టం లేదు. ఈ విషయం డైరెక్ట్‌గా చెప్పకుండా భాగ్యలక్ష్మీ ఆలయం అంటూ ఏవో వంకలు పెడుతున్నారు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం