30, జనవరి 2013, బుధవారం

సురభి నాటక సమాజం .. కాంగ్రెస్ పార్టీ .. 1885!


ఈ దేశంలో 1885లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ యేడు రెండు వేరువేరు సంస్థలు ఆవిర్భవించాయి. సంస్థలు వేరు, లక్ష్యాలు వేరు, పని  వేరు, రంగాలు వేరు కానీ ఇద్దరి పనితీరు ఒకేలా ఉంటుంది.


***
రావణుడు టీ తాగుతుంటే శ్రీరాముడు ఆయన మీసాన్ని సవరిస్తున్నాడు. హనుమంతుడి భార్య ఇంకెంత సేపు త్వరగా తెములు అంటూ రావణుడి నెత్తిన ఒక్కటిచ్చింది. అమ్మా శ్రీకృష్ణుడు నా బిస్కట్ లాగేసుకున్నాడని ప్రహ్లాదుడు ఏడవ సాగాడు... సురభి నాటక సమాజంలోని తెర వెనక ఇలాంటి దృశ్యాలు కామనే. శ్రీరాముడు, రావణుడు, మండోదరి, సీత, ద్రౌప ది, దుర్యోధనుడు అంతా ఉమ్మడి కుటుంబ సభ్యులే. కీచకుడు, ద్రౌపది ఒకే కంచంలో తింటుంటారు. ఇలాంటి దృశ్యాలను తెర వెనుక చూసి ఏ మాత్రం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే సురభి నాటక సమాజంలోని ఉమ్మడి కుటుంబ సభ్యుల నాటకంలోని సంబంధాలు వేరు. తెర వెనక వాస్తవ సంబంధాలు వేరు.
నాటకమే వారి జీవితంగా సాగుతుంది. దీంతో ఇది నటన, ఇది వాస్తవం అంటూ వాళ్లు ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవలసిన పరిస్థితి. 

సురభి నాటక సమాజం 1885లో కడప జిల్లాలోని సురభి గ్రామంలో పుట్టింది. అదే 1885లో కాంగ్రెస్ పార్టీ పుట్టింది. అచ్చం సురభి నాటక సమాజంలానే కాంగ్రెస్ పరిస్థితి ఉంది. ఒకే కుటుంబ సభ్యులతో నడిచే 128 ఏళ్ల పురాతనమైన నాటక సమాజం ప్రపంచంలో మరోటి లేదు. అలానే 128 ఏళ్ల నుంచి ఒకే కుటుంబం నడిపిస్తున్న రాజకీయ పార్టీ మరోటి లేదు. సురభి నాటక సమాజం, కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో ఈరెండూ ప్రత్యేకమైనవే.
సురభి నాటక సమాజం ప్రదర్శించే నాటకాలు, యుద్ధ సన్నివేశాలు కళ్లు మిరిమిట్లు గొలిపేట్టుగా ఉంటాయి. యుద్ధ సన్నివేశాలకు సురభి నాటకం పెట్టింది పేరు. ఉమ్మడి కుటుంబ సభ్యులే అయినా వేషం వేసి వేదికపైకి వచ్చారంటే బాణాలతో శత్రువును చీల్చి చెండాడుతారు. కాంగ్రెస్‌లో సైతం అంతే ఒకే పార్టీ సభ్యు లు వాగ్భాణాలతో ఒకరినొకరు చీల్చి చెండాడుకుంటారు. 


తర్వాత ఇద్దరూ అమ్మదగ్గరకు వెళ్లి రాముడు మంచి బాలుడిలా నిలబడతారు. పాండవుల కొలువులోకి రాయబారం కోసం వచ్చిన శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూసి సభలోని వారు మూర్చపోయినట్టుగా అప్పటి వరకు బాణాలు దూసుకున్న వీళ్ళు అమ్మను చూడగానే ప్రసన్నంతో తమను తాము మరిచిపోయి తన్మయత్వంతో బయటకు వస్తారు.


సురభి నాటక సమాజం పుట్టిన తరువాత కొన్ని దశాబ్దాల పాటు ఎదురు లేకుండా విస్తరించింది. 50 నాటక సమాజాలుగా విస్తరించింది. సినిమాలు , టీవీలు వచ్చిన తరువాత ఒక్కసారిగా క్షీణించడం మొదలై 50 కాస్తా 16 నాటక సమాజాలు అయ్యాయి. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో అదే పార్టీ అధికారంలో ఉండేది. ప్రాంతీయ పార్టీలు పుట్టాక సురభి నాటక సమాజం మాదిరిగానే కాంగ్రెస్ వైభవం క్షీణిస్తూ వచ్చింది. సురభి నాటక సమాజం ఎన్నో అద్భుతమైన నాటకాలను ప్రదర్శించి వైభవంగా చరిత్రలో నిలిచిపోయింది. అలానే కాంగ్రెస్ సైతం దేశంలో ఎన్నో రాజకీయ నాటకాలు ఆడించింది.

కొందరు వారం లో ఒక రోజు మాట్లాడకుండా మౌన దీక్ష చేస్తారు. అది చాలా కష్టం అలాంటిది ఎనిమిదేళ్ల నుంచి వౌన దీక్ష చేయించడం సాధ్యమా? మాకు సాధ్యమే అని కాంగ్రెస్ నిరూపించింది. ప్రధానమంత్రి ఎనిమిదేళ్ల నుంచి వౌనంగానే ఉంటున్నారు. అంతే కాదు మాట్లాడాల్సిన వాళ్లు తప్ప కాంగ్రెస్‌లో అందరూ మాట్లాడుతుంటారు. ఇలాంటి చిత్రవిచిత్రమైన ఎన్నో నాటకాలకు ఊపిరి పోసిన కాంగ్రెస్ ఇప్పుడు మరో నాటకం ఆడిస్తోంది. 

ఇది సజీవ నాటకం. ఢిల్లీలో, రాష్ట్రంలో వేదికలుగా ఈ నాటకం సాగుతోంది.
కాంగ్రెస్ ఆడిస్తున్న తెలంగాణ నాటకం. ఈ కొత్త నాటకం ముగింపు ఎప్పుడో నాటకం ఆడేవారికే తెలియదు అని కొందరంటే కాదు ఆడిస్తున్న వారికి కూడా తెలియదు అందుకే అలా కొనసాగిస్తూనే ఉన్నారని కొందరంటారు. ఎంత గొప్ప హిచ్‌కాక్ అయినా రెండు గంటలకు మించి సస్పెన్స్ సినిమాను తీయలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం ఏళ్ల తరబడి సస్పెన్స్ కొనసాగిస్తూ నాటకాన్ని రక్తి కట్టిస్తోంది. 
మరు క్షణంలో తెలంగాణ ఇచ్చేస్తారు అనిపించే డైలాగులు బిగ్గరగా వినిపిస్తాయి. ప్రేక్షకులు దానికి సిద్ధం అయి బిగపట్టుకుని కుర్చీలో అటెన్షన్‌గా కూర్చుంటే .... తూచ్ ఇప్పటి వరకు మీరు విన్న డైలాగులు కేవలం రిహార్సల్స్ మాత్రమే! నాటకంలో భాగం కాదు..! అని మరో నటుడు వచ్చి చెబుతాడు.


 ఇంత మోసమా అని పళ్లు కొరుకుతుంటే అవి రిహార్సల్స్ అని చెప్పడానికి వాడెవడు? నాటకంలో భాగమే అని మరో నటుడు వచ్చి చెబుతాడు. సుదీర్ఘ కాలం నాటకాన్ని చూసిన ప్రేక్షకులు పట్టుపట్టి ఇప్పటికైనా ముగింపు చెప్పండి అని నాయకులను నిలదీస్తే, వాళ్లువెళ్లి హస్తినాపురం హై కమాండ్ నాయకులను నిలదీశారు.

వాళ్లు సుదీర్ఘంగా ఆలోచించి. ‘‘నాటకం చాలా రోజుల నుంచి సాగుతోంది. ఎవరి పాత్ర ఏమిటో? ఎవరేం మాట్లాడారో గుర్తు లేదు అందుకే మూడు ప్రాంతాల వారిని మళ్లీ పిలిచి మళ్లీ నాటకం ఆడించి, నాటకాన్ని అర్ధం చేసుకుని అప్పుడు నిర్ణయం చెబుతామని అన్నారు. అందరి అభిప్రాయాలూ తెలుసుకున్నాం .. ఇప్పుడు తెలంగాణా పై  మేం ఏమిటో ? మేం తెలుసు కోవాలని అనుకుంటున్నాం అంటున్నారు.   రమణ మహర్షులు చెప్పినా అంతకు ముందు మహామహా మునులు చెప్పినా అందరు చెప్పింది ఒకటే ప్రపంచాన్ని తెలుసుకోవడం, ఇతరులను తెలుసుకోవడం సులభమే కానీ నిన్ను నువ్వు తెలుసుకోవడనేదిచాలా కష్టం. అనేది వేదాంత సారం. ఇప్పుడు కాంగ్రెస్ తనను తాను తెలుసుకునే పనిలో పడింది. కాంగ్రెస్ తనను తాను తెలుసుకుంటుందా? ప్రేక్షకులు అంత వరకు ఓపిక పడతారా? ఏమవుతుంది? మిగిలిన నాటకాన్ని స్టేజీపైనే చూద్దాం.

12 కామెంట్‌లు:


  1. అమృతమథనం గారు,

    మీకు ఈ సారి పీహెచ్డీ ఇచ్చేసా ఈ టపా కి !


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. జిలేబి అంత తియ్యని మాట చెప్పారు

    రిప్లయితొలగించండి
  3. నారాయణ స్వామి గారు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం