6, జనవరి 2013, ఆదివారం

‘ఖర్మ’ భూమి లో మహిళా నిర్మూలనా యజ్ఞం


దేవకీ అష్టమ సంతానంతో ప్రాణాపాయం ఉందని ఆకాశవాణి చెప్పడంతో కంసుడు ఏడుగురు పిల్లలను పుట్టగానే హతమార్చాడు. ఎందుకంటే వారితో కంసుడి ప్రాణాలకు ముప్పు ఉంది. మనం కంసుడ్ని మించి పోతున్నాం. కంసుడు వాడి ప్రాణాలకు ముప్పు ఉందని మాత్రమే ఆడ శిశువులు అని కూడా కనికరం చూపకుండా చంపేశాడు. వాడే రాక్షసుడు అయినప్పుడు మరి మనం... ఎలాంటి ముప్పు లేకున్నా ఆడ పిల్లల ప్రాణాలు హరిస్తున్నాం.

 స్కానింగ్‌లో తేలింది. ఆడపిల్ల అని
 అయితే కడుపులోనే ప్రాణాలు తీసేయ్!
 పుట్టింది ఆడపిల్ల .

ఇంత ఘోరాన్ని తట్టుకుని ఎలా ఉన్నావురా! గొంతు పిసికేయ్!

 అయినా తప్పించుకొని తల్లి ఒడిలో హాయిగా పడుకుంటున్నారా?

 వాళ్లను చూసి ఎలా సహిస్తున్నావురా!

 ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు రాగానే చాక్లెట్ ఇస్తాననో, పిప్పరమెంటు ఇస్తాననో ఆశ చూపించి గొంతు నులిమేయ్ మరీ కోపంగా ఉంటే అత్యాచారం చేసేయ్! 

అంత చిన్నపిల్లపై అత్యాచారం చేయాలని ఆలోచన వస్తే నువ్వు మనిషివెలా అవుతావు. అత్యాచారం చేసేయ్! 

అయినా కొందరు తప్పించుకుని పాఠశాలకు వెళుతున్నారు. ఇది ప్రమాదకరం... ప్రేమిస్తావా? చస్తావా? అని యాసిడ్ బాటిల్ పట్టుకెళ్లి ప్రశ్నించు... ప్రేమిస్తే, మోసం చేయ్! ప్రేమించడం లేదంటే ముఖంపై యాసిడ్ పోసేయ్!

 అందమైన అమ్మాయిలు చేతిలో పుస్తకాలు పట్టుకొని కాలేజీలకు వెళితే అమ్మో ఎంత ప్రమాదం... వాళ్లు ఎదిగిపోతారు. ఏదో ఒకటి చేసేయ్ సీతాకోక చిలుకల్లా ఉన్న వాళ్లను నమిలి మింగేయ్.. 

పేదరికానికి తల వంచక హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారా? అర్ధరాత్రి వెళ్లి అత్యాచారం చేసేయ్.. గుర్తు పడుతుందనుకుంటే చంపేయ్!

 గర్భస్త శిశువు నుంచి ఇంట్లో ఉన్న గృహిణి వరకు అందరూ మన శత్రువులే ... తలెత్తుకోకుండా అత్యాచారం చేయ్... సరదాగా ఉంటే హత్య చేసేయ్!

 చదవడానికి సిగ్గేస్తుందా? రాయడానికి కూడా... కానీ ఇది నిజం. వారి మానాన వారిని బతకనివ్వడం లేదు. మనకు చదవడానికి, రాయడానికే సిగ్గేస్తుంది... కానీ సమాజంలోని ఈ స్థితి మహిళలకు ఎంతటి ఆవేదన కలిగిస్తుందో, అత్యాచారాలకు గురవుతున్నా బాధితులకు ఎంతటి క్షోభను కలిగిస్తుందో కదా?

 * * *
 రావణుడు, దుర్యోధనుడు, కీచకుడు ఇప్పుడు మన దేశం వైపు చూస్తే ఏమనుకుంటారు. వాళ్లు కల్పిత పాత్రలో నిజమైన వాళ్లో తెలియదు కానీ ఉండి ఉంటే మాత్రం సిగ్గుతో తలదించుకునే వాళ్లు. రావణుడు సీతను ఎత్తుకెళ్లాడు కానీ అత్యాచారం చేయలేదు.. దుర్యోధనుడు, కీచకుడు సైతం సిగ్గుతో తల దించుకునేంతగా బరితెగించారు కొందరు నర రూప రాక్షసులు. ఎవరో చేసిన తప్పుకు మనం రాక్షసులను తిడుతున్నాం కానీ నిజానికి రాక్షసులు సైతం సిగ్గుతో తలదించుకునే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి.

 * * * 
మానవ పరిణామ క్రమంలో కోతి నుంచి మనిషిగా పరిణామం చెందాడని అంటారు. మనిషి పరిణామం చెందినట్టుగానే దేశం కూడా పరిణామం చెందుతుంది. చెందింది. కర్మ భూమి నుంచి కామ భూమిగా మనం పరిణామం చెందుతున్నాం. ఒకవైపు ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యువత ఆందోళన చేస్తున్న సమయంలోనే దేశంలోని అనేక ప్రాంతాల్లో అత్యాచారాల పరంపర కొనసాగూతనే ఉన్నప్పుడు మన దేశం కర్మ భూమి నుంచి కామ భూమిగా మారుతుందనే విమర్శను ఎలా కాదంటాం.

 దేశంపై పడ్డ కామభూమి అనే ఈ మచ్చను తొలగించడం అందరి బాధ్యత. ఆవును ఆ బాధ్యత గుర్తించారు కాబట్టే దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు, పెద్దలు, ఆడమగ అనే తేడా లేకుండా, యువత, వృద్ధులు అనే తేడా లేకుండా.. హిందువు, ముస్లిం, క్రైస్తవులు అనే మత విభేదాలు లేకుండా మనుషులంతా ఈ అమానుష అత్యాచారాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. అది అన్నా హజారే చూపిన మార్గం కావచ్చు, కేజ్రీవాల్ ఐడియా కావచ్చు. నిద్ర పోతున్న పాలకుల చెంప ఛెళ్లు మనిపించే విధంగా శాంతియుతంగా లక్షలాది మంది యువత ఇండియా గేట్ వద్ద ఆందోళన సాగిస్తోంది. వారి గాంధీగిరితో పాలకులు కదిలి రాక తప్పలేదు. మీరు ఒకసారి మాకు ఓటువేసి అధికారం అప్పగించారంటే ఐదేళ్ల వరకు మా ఇష్టం అని భావించే రాజకీయ వ్యవస్థ చొక్కా పట్టుకుని నిలదీశారీ ఉద్యమ కారులు. 

ఎచ్చట స్ర్తిలు పూజలందుకుంటారో అక్కడ సంపద ఉంటుంది. ఇది పాత మాట. ఇప్పుడు దేశంలో సంపదకు కొరత లేదు కానీ స్ర్తిలు పూజలందుకనే మాట అటుంచి, రక్షణ లేని పరిస్థితి కల్పించాం. కాలేజీకి వెళ్లి ప్రేమించలేదని యాసిడ్ పోసినా దిక్కులేదు. ఇంటికి వెళ్లి కత్తితో పొడిచినా అడిగేవారు లేరు. అడ్డొచ్చిన అమ్మానాన్నలు సైతం ప్రాణాలు వదులుకోవలసిందే.

 ***
 కాలేజీ వదలగానే బిలబిలమంటూ అమ్మాయిలు బస్టాప్‌కు వచ్చేశారు. అప్పటి వరకు కళావిహీనంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా కళకళలాడింది. ఇంతలో బైక్ మీద పోకిరీలు వచ్చారు. మాటలతో చేతలతో కంపరమెత్తించారు. ఆ అమ్మాయిలకి కన్నీళ్లొక్కటే తక్కువ. 18 ఏళ్ల వయసులో కొన్ని వందల సార్లు ఇలాంటి వికారపు చేష్టలను భరించిన అనుభవం అయినా మూగగానే రోదించింది. బస్టాప్‌లో అంత మంది ఉన్నా కొద్ది మంది పోకిరీల ఆగడాలను చూసి మనకెందుకులే అని వౌనంగానే ఉండిపోయారు. కన్నీటితోనే అమ్మాయిలు బస్సెక్కారు. కొజ్జా నా కొడుకులు అని మనసులోనే ఎవరో తిట్టుకున్నట్టు వినిపించింది.
 ***
 విజయవాడ హాస్టల్‌లో ఉంటూ భవిష్యత్తు కోసం బంగారు కలలు కంటూ చదువులో మునిగిపోయినా ఆ అమ్మాయి తనపైకి ఒక మానవ మృగం పంజా విసిరేందుకు వేచి చూస్తోందని తెలియదు. కలల ప్రపంచంలో ఉన్న ఆమె కలలను చిదిమివేస్తూ ఆ మృగం అమానుషంగా మానభంగం చేసి హత్య చేసింది. ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదో, లేక వినిపించినా మనకెందుకులే అనుకున్నారో తెలియదు. అప్పుడూ చీ... సిగ్గులేని నపుంసక సమాజం అని ఎక్కడో నిరసన ధ్వనించింది.

 ***
 ఆర్థిక సంస్కరణలతో, ఐటి విప్లవంతో అమ్మాయిలకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది. దేశమంతా అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మేలుకొని ఉండే అమెరికా వాడి కోసం అమ్మాయిలు అర్ధరాత్రి పని చేసి క్యాబ్‌లో ఇంటికి రావాలి. క్యాబ్ డ్రైవర్ కీచకుడు కావచ్చు, మధ్యలో రావణాసురుడు కనిపించవచ్చు. ప్రతి రోజూ గండమే. సీతకు ఒక్కసారే రావణాసురుడి నుంచి ప్రమాదం ఎదురైంది. నేటి మహిళలకు ప్రతి రోజు ... ప్రతి నిమిషం ... కీచకులతో తప్పించుకోవాలి. బెంగళూరు, నోయిడా, ఢిల్లీలలో క్యాబ్‌లో అమ్మాయిలపై అఘాయిత్యం చేసిన సంఘటనలు చాలానే జరిగాయి. అలాంటి వాతావరణాన్ని చూస్తూ మనకెందుకులే అని వెళ్లిపోయిన వారిని చూసి ఎక్కడో ఛీ ... నపుంసకుల్లారా! అని ఎవరో తిట్టినట్టు వినిపించింది. *** 
హైదరాబాద్ శివారులో ఇంటర్నేషనల్ పాఠశాలలో తమ కూతురు హాయిగా చదువుకుంటుందనుకుని గుండెల మీద చేయివేసుకుని నిద్రపోతున్న ఆ దంపతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పదో తరగతి చదివే తమ కూతురును స్కూల్ ప్రిన్సిపల్ గర్భవతిని చేశాడని తెలిసి వారికి పిచ్చెక్కినట్టు అయింది. పాఠశాల పిల్లలను పాఠాలు చెప్పాల్సిన పంతులు లైంగికంగా ఉపయోగించుకుంటున్నాడని తెలిసీ మనకెందుకులే అని వౌనంగా ఉన్నవారిని చూసి ఛీ..్ఛ... సిగ్గులేని కొజ్జా సంఘం అని మనసులోనే తిట్టుకున్నారా తల్లిదండ్రులు. *** అభిమాన హీరో తన సినిమాల్లో అమ్మాయిలను ఏడిపించినట్టుగానే వారి రోడ్డుమీద పోకిరీలు అమ్మాయిలను వేధిస్తుంటే వౌనంగా ఉన్నవారిని చూసి సిగ్గులేని జాతి అని వినిపించింది.
 *** 
పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని, పని చేసే ఉద్యోగిని, ఇంట్లో ఉన్న గిృహిణీ ఏ ఒక్కరికీ రక్షణ లేదు. అర్ధరాత్రి స్వతంత్య్రం వచ్చిందని అర్ధరాత్రి ఆడవారు బయట తిరిగితే ఎలా? అని ఇదో మంత్రి ప్రబుద్ధుని ప్రశ్న. సరే మరి పట్టపగలు ఇంట్లో ఉన్నవారిపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా? మహిళలకు ఇంట్లోనూ రక్షణ కల్పించలేకపోతున్నాం మాది సిగ్గు శరం.. చీము నెత్తురు లేని ప్రభుత్వం అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అని ఆ మంత్రిని ప్రశ్నించాల్సింది.

 ***
 అడుగడుగునా అత్యాచారాలను చూశాం, వౌనంగా ఉన్నాం ఇక చాలు మేం చీమునెత్తురు లేని జాతి కాదు. పాఠశాలకు వెళ్లే బిడ్డపైన, ఆఫీసుకు వెళ్లే కూతురుపైన, ఇంట్లో ఉన్న అమ్మపైన జరిగిన అత్యాచారాలు చాలు ఇక సహించం అని సమాజం ఒక్కటై నిలిచింది. *** ఫేస్‌బుక్‌లు, సోషల్‌సైట్స్‌లో యువత సొల్లుకబుర్ల మత్తులో జోగుతున్నారు అని పాలకులు వేసిన అంచనాలను తలక్రిందులు చేస్తూ చీమల దండులా యువత ఢిల్లీ ప్రభుత్వంపై దండయాత్రకు బయలు దేరింది. ఢిల్లీలో 23 ఏళ్ల వైద్య విద్యార్థిని డిసెంబర్ 16న తన స్నేహితునితో కలిసి బస్సులో వెళుతుండగా, ఆమెపై సామూహికంగా అత్యాచారం జరపడమే కాకుండా సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా గాయపరిచారు. ఆమెను గాయపరిచిన తీరు చూసి సీనియర్ డాక్టర్లు నా జీవితంలో ఎన్నో రేప్ కేసులు చూశాను, కానీ ఇంత అమానుషంగా ప్రవర్తించిన సంఘటన చూడలేదని గద్గద స్వరంతో పలికాడు. మనకెందుకులే అని వౌనంగా ఉండే సమాజాన్ని ఈ సంఘటన ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఇంత కాలం తాము చేసిన తప్పేమిటో చెంప ఛెళ్ళుమని చెప్పినట్టు అనిపించింది. ఒకరు ఇద్దరు ముగ్గురు నుంచి వందలు వేలు లక్షల సంఖ్యగా మారింది. ఏ రాజకీయ పార్టీ పిలుపు ఇవ్వలేదు. యువత తమకు తామే పిలుపు ఇచ్చుకున్నారు. ఛలో ఇండియా గేట్ అనుకున్నారు. చీమల దండు రాజ్యంపై దండెత్తివచ్చినట్టుగా చీమల్లా కదిలారు. పామును కూడా వణికిపోయేట్టు చేశారు. న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదన్నారు. 

ఫేస్‌బుక్ లేందే నిమిషం గడవదు వీళ్ల ముఖం రాజ్యంతో వీళ్లేం పోరాడుతారనుకున్న ప్రభుత్వం దిమ్మ తిరిగిపోయేట్టుగా అలా ఇండియా గేట్ వద్దకు జన ప్రవాహం కదలి వస్తూనే ఉంది. వాటర్ ట్యాంకులతో నీళ్లు చిమ్మినా, బాష్పవాయువులు ప్రయోగించినా ప్రవాహం ఆగలేదు. ప్రభుత్వం పోరాడాల్సింది ఉద్యమ కారులపై కాదు రేపిస్టులపై అని నినదించారు. ఔను సాధారణంగా మేం సమాజం గురించి పెద్దగా పట్టించుకోం. పట్టించుకోవడం పాలకుల బాధ్యత అనుకుంటాం. కానీ మేం ఒక్కసారి పట్టించుకోవడం మొదలు పెట్టామా? మీకు నిద్ర లేకుండా చేస్తాం అని ఢిల్లీ యువత చేసి చూపించారు. కాలేజీలో చదువుకునే పిల్లలు, ఐటి ఉద్యోగులు, వారు వీరని కాదు ఆడ మగ అనే తేడా లేదు. తమ తల్లి, చెల్లి, అక్క, భార్య కూడా మహిళే ఈ రోజు ఇతరులకు జరిగింది మనకెందుకులే అనుకుంటే అదే అన్యాయం మనకు జరగవచ్చు అని ప్రతి ఒక్కరు స్పందించారు. చీమలదండు తిరగబడితే పాముకూడా తోక ముడవాల్సిందే అని చాటి చెప్పారు. తాత్కాలిక ఆవేశమే అని భావించి ప్రభుత్వం సైతం ఈ స్పందన చూసి బెదిరిపోయింది. పోలీసుల లాఠీలతో సమస్య పరిష్కారం కాదని భావించింది. ఒక్క అత్యాచారం సంఘటనపై ఇంతగా రెచ్చిపోతారా? దేశంలో 43 నిమిషాలకో అత్యాచారం జరుగుతుంది అని అధికారంలో ఉన్న పెద్దలు అధికారిక లెక్కలు చెప్పారు.

 ఔను అందుకే మేం ఉద్యమిస్తున్నాం ఇంకెన్నాళ్లీ అత్యాచారాలు అని ప్రశ్నించారు. తన కూతురును కిడ్నాప్ చేస్తే దేశానికి ప్రమాదకరంగా పరిణమించిన తీవ్రవాదులను సైతం వదిలిపెట్టారు. మరి సామాన్య మహిళలపై అఘాయిత్యాలు జరిగితే రక్షించాల్సిన బాధ్యత మీపై లేదా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వౌనంగా ఉండే సోనియాగాంధీని అర్ధరాత్రి బయటకు రప్పించారు. హోంమంత్రికి నిద్ర లేకుండా చేశారు. ఢిల్లీలో యువత ఉద్యమాన్ని చూసి మొత్తం దేశం కదిలింది. కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించి మద్దతు ప్రకటించారు. వౌనంగా ప్రదర్శన చేశారు. నల్లగుడ్డలు మూతికి కట్టుకుని ర్యాలీ జరిపారు. ఆసేతు హిమాచలం స్పందించింది. మహిళా స్వాతంత్య్రం కోసం దేశం ఉద్యమించింది. నిజమే 43 నిమిషాలకో అత్యాచారం జరుగుతుంది కాబట్టి దాన్ని ఇకనైనా ఆపమని చెప్పడానికే ఈ ఉద్యమం అని యువత పట్టువదకుండా ఉద్యమించింది. ఆయుధాలు పట్టుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారికి ఎన్‌కౌంటర్‌తో సమాధానం చెబుతారు కానీ ఆడవారికి రక్షణ కల్పించమని, అత్యాచారాలు నిలిచిపోయేట్టు చేయమని విద్యుత్ స్తంభాలను పట్టుకుని నిరసన గళాలు వినిపించే వారిని ప్రభుత్వం ఏమని ఎన్‌కౌంటర్ చేయగలదు. 

ఆయుధ పోరాటంలో ప్రభుత్వానికి ఎన్‌కౌంటర్ రక్షణ కవచం. నిరాయుధీకరణతో యువత జరిపే ఎన్‌కౌంటర్‌కు ప్రభుత్వం సరెండర్ అయి తీరాల్సిందే. మీ విజ్ఞప్తిని పరిశీలించాం, తగు చర్యలు తీసుకుంటాం అని మంత్రిగారు చెప్పే రొటీన్ డైలాగులు వినీ వినీ విసిగిపోయిన దేశమిది. అందుకే నిర్దిష్టమైన హామీ ఇచ్చేంత వరకు, అత్యాచారాల నివారణకు తగు చర్యలు తీసుకునేంత వరకు కదిలేది లేదని యువత పట్టు పట్టింది సాధించుకుంది. అత్యాచారం సంఘటనల్లో కేసులు నమోదయ్యేది 11 శాతమని ఒక సర్వేలో తేలింది. 90 శాతం కేసుల్లో అత్యాచారం చేసేది తెలిసి ఉన్న వారేనట! దేశంలో ప్రతి 34 నిమిషాలకు ఒక రేప్ కేసు నమోదు అవుతోంది. 42 నిమిషాలకు ఒక లైంగిక వేధింపు కేసు నమోదు అవుతోంది. ప్రతి 43 నిమిషాలకు ఒక మహిళను కిడ్నాప్ చేస్తున్నారు. ప్రతి 93 నిమిషాలకు వరకట్నం వేధింపుల్లో ఒక మహిళ సజీవ దహనం అవుతోంది. ఇది ఇంకెంత కాలం ఇక సహించేది లేదని వినిపించిన నిరసన గళమే ఇండియా గేట్ వద్ద జరిగిన ఆందోళన. దీనికి దేశం అండగా నిలిచింది. సమాజాన్ని చైతన్య పరిచిన ఈ ఆందోళన కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఈ ఉద్యమం మళ్లీ మన దేశాన్ని కర్మ భూమిగా మారుస్తుందని ఆశిద్దాం. * 

.................... ఔరత్ బంద్

అమ్మ రాజీనామా- ఈ పేరుతో మనకో తెలుగు సినిమా వచ్చింది గుర్తుందా? ఒక్క రోజు అమ్మ రాజీనామా చేసి పని మానేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతో వచ్చిందే ఆ సినిమా? మరి మహిళలు బంద్ చేస్తే ఎలా ఉంటుంది? వస్త్ర వ్యాపారుల బంద్‌లా ఎవరి సమస్యకు వారు బంద్‌లు జరపడం తెలిసిందే! మరి కేవలం మహిళలు మాత్రమే బంద్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఢిల్లీకి చెందిన కొంత మంది మహిళా సామాజిక ఉద్యమ కారులకు వచ్చింది. ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై అమానుషంగా సామూహిక అత్యాచారం సంఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా యువత నిరసన ఉద్యమాలు చేస్తోంది. ఢిల్లీకి చెందిన నటి, హుమా ఖురైషి, ఢిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త నూర్ ఇనాయత్‌లకు వచ్చిన ఆలోచన మహిళా బంద్. వీరి ఆలోచనకు ఇతర ఉద్యమ కారులు మద్దతు పలికారు. డిసెంబర్ 26ను మహిళా బంద్‌గా ప్రకటించారు. ప్రతి ఒక్కరు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్దకు వచ్చి నిరసన గళం వినిపించలేకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు మహిళా బంద్‌లో పాల్గొని సంఘీభావం ప్రకటించవచ్చు. కార్పొరేట్ రంగంలో 45 శాతం వర్క్ ఫోర్స్ మహిళలే. అలాంటి మహిళలు బంద్ పాటించి ఒక చోట చేరి నిరసన వ్యక్తం చేస్తే... ఇంట్లో మహిళలు ఒక రోజు పని మానేస్తే, మాల్స్, ఎక్కడ పని చేసే వారైనా మహిళలు ఒక రోజు పని మానేస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజం దృష్టి సారించక తప్పని పరిస్థితి వస్తుంది అందుకే మహిళా బంద్‌కు పిలుపును ఇచ్చినట్టు ఇనాయత్ తెలిపారు. 

ఈ ఆలోచన రాగానే సామాజిక సైట్స్‌లో ఒకరి నుంచి ఒకరికి వెళ్లింది. ఐదువేల మంది మహిళలకు ఈ ఆలోచనలకు మద్దతు ప్రకటించి ఆమోదం తెలిపారు. ఇంత జరుగుతుంటే మేం ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చోలేం. ఏదో ఒక రూపంలో మా గళం వినిపిస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం, నిగ్గ తీస్తాం అంటున్నారు మహిళలు. ఢిల్లీలో అనేక రంగాల్లో మహిళల సంఖ్య అధికంగా ఉంది. మహిళా బంద్‌కు అనేక మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. మహిళా బంద్ వల్ల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ఢిల్లీలో మహిళా డ్రైవర్లతోనే క్యాబ్స్ నడిపే సఖా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలిపింది. పేరు మహిళా బంద్ అయినప్పటికీ ఈ బంద్‌లో ఒక్క మహిళలే కాకుండా పురుషులు సైతం పాల్గొంటే నేను మరింత సంతోషిస్తాను అని న్యూఢిల్లీలోని రామ్‌జా కాలేజీ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇది రాజకీయ బంద్ కాదు సమాజానికి పట్టిన రుగ్మతకు చికిత్స కోసం మహిళలు చేపట్టిన వినూత్న నిరసన. ఈసారి ఢిల్లీకే పరిమితం అయిన మహిళా బంద్ ఇతర ప్రాంతాలకూ వ్యాపించవచ్చు. వ్యాపించాలి కూడా. మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పాటించినట్టుగా డిసెంబర్ 26న అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళలు గళమెత్తే దినంగా మారాలి.

 ................. త్రిసూత్ర పథకం

 అత్యాచారం జరిగిన బాధితులు ఏం చేయాలి? దీనికి తనకు ఎదురైన అనుభవం ఒకటి ఇటీవల తనికెళ్ల భరణి వివరించారు. భరణి ఇంటికి సమీపంలో వాళ్లకు తెలిసిన ఇంటి వాళ్ల చిన్నపాపను చాక్లెట్ ఇప్పిస్తానని ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలిసిన భరణి తీవ్రంగా ఆవేదన చెంది ఏం చేద్దామని తనకు తెలిసిన న్యాయవాది వద్దకు తీసుకు వెళితే, ఆయన చెప్పిన విషయం విని భరణి విస్తుపోయాడు. ఆ న్యాయవాది చెప్పిన దాని ప్రకారం ఎవరిపైనైనా అత్యాచారం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేయాలి. ఇది ఒక మార్గం. బలవంతులు, డబ్బు, పలుకుబడి ఉంటే అత్యాచారం చేసిన రాక్షసుడ్ని కిరాయి హంతకులతో చంపించాలి. మూడు వౌనంగా ఉండిపోవాలి... అంటూ సూచించారు. అంత చిన్నబాలికపై అత్యాచారం జరిగిందని ఆవేదనతో వస్తే ఇదేం పరిష్కారం అనుకున్న భరణి ఇదే విధంగా నీ కూతురుకు జరిగితే ఏం చేస్తావు అని న్యాయవాదిని ప్రశ్నించాడు. అలా జరిగితే మా అమ్మాయిని విదేశాలకు పంపిస్తాను, నాకున్న పలుకుబడి, రాజకీయ పరిచయాలతో వాడ్ని చంపేయిస్తాను కానీ న్యాయస్థానానికి మాత్రం వెళ్లను అని న్యాయవాది చెప్పాడట! ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనపై చానల్స్‌లో జరిగిన చర్చలో ఈ విషయాన్ని స్వయంగా భరణి వివరించారు. అత్యాచారం జరిగిన సంఘటనల్లో ఒక నివేదిక ప్రకారం కేవలం 11 శాతం కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఇలా నమోదయిన కేసుల్లో నిందితులకు శిక్ష పడి బాధితులకు న్యాయం జరిగే కేసులు చాలా స్వల్పంగా ఉంటాయి. అత్యాచారం జరిగిన బాధితురాలిని న్యాయస్థానాల్లో ప్రశ్నలతో పొడిచిపొడిచి చంపేస్తారు. అప్పటికే మానసికంగా చనిపోయి ఉన్న బాధితురాలిని ప్రశ్నలతో మరింతగా చంపేస్తారు. ఆ విషయం తెలుసు కాబట్టి అందుకే ఆ న్యాయవాది అత్యాచారం జరిగినప్పుడు కోర్టుకు మాత్రం వెళ్లను అంటూ మిగిలిన పరిష్కార మార్గాలను చూపించారు. అత్యాచారం వంటి కేసుల విచారణ ఇన్‌కెమెరాలో జరగాలి తప్ప బాధితురాలిని మరింతగా కృంగదీసే విధంగా ఉండకూడదు. ఏ చట్టం అయినా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉండనే ఉంటాయి. అంత మాత్రాన చట్టాలు అవసరం లేదని చెప్పలేం. అలానే అత్యాచారం కేసుల్లో సైతం చట్టాలను దుర్వినియోగం చేసే వారు ఉంటే ఉండవచ్చు. అలా అని అత్యాచారం జరిగిన వారు కేసు పెట్టడానికి బదులు వౌనంగా ఉండడమే మేలు అనుకునేట్టుగా విచారణ ఉండకూడదు.

 ఢిల్లీలో జరిగిన సంఘటన తరువాత మహిళల రక్షణ కోసం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వర్మ కమిటీ వేస్తే వేలాది మంది తమ అభిప్రాయాలను కమిషన్‌కు పంపించారు. కమిషన్ వేసిన మూడు రోజులకే ఆరువేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. పలు సూచనలు చేశారు. మనకెందుకులే అనుకుంటున్న స్థాయి నుంచి ఇంత తీవ్రంగా స్పందించి సూచనలు పంపపడం సమాజం చైతన్యానికి ప్రతీక. అత్యాచారం కేసుల విచారణలో బాధితులకు ఎదురవుతున్న సమస్యలు, సత్వరం కేసు విచారం కోసం కమిటీ పలు సూచనలు చేస్తుంది.


8 కామెంట్‌లు:

  1. చాలా చక్కటి ఆలోచింపజేసే టప.అందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. మురళిగారూ ఏ gender bias చూపించకుండా, అమ్మాయిల/ ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలకి వారి వస్త్రధారణే కారణమంటూ వాదించేవారికి కొంచం బుద్ధి వచ్చేలా, ఏ పక్షపాతం చూపించకుండా మీరు రాసినది అభినందననీయమైనది.
    క్రిష్ణవేణి

    రిప్లయితొలగించండి
  3. మీ వ్యాసం చాలా బాగుంది. ఆ రోజును జాతి ఎప్పటికీ మర్చిపోకుండా ప్రతి ఏడాదీ ఇలాగే అత్యచార భాదితుల స్మరణ/సంతాప దినం కావాలి.

    మీరు ఇంకో కోణం కూడా తట్టి వుండాల్సింది. కోర్టుకు కానీ, సమాజం దృష్టికి కానీ ఎక్కువ కేసులు రాక పోవడానికి, మహిళలపై అఘాయిత్యం చేయడానికి, చేశాక కూడా ధైర్యంగా తిరగడానికి ప్రజల్లో "శీలం" పట్ల వున్న అభిప్రాయమే!

    శీలంపై నా బ్లాగులో ( http://www.charasala.com/blog/?p=263 ) నా అభిప్రాయం చూడండి.

    రిప్లయితొలగించండి
  4. స్పందన గారు ధన్యవాదాలు .. మీరు ఆశించే మార్పు అంత సులభం కాదు ...

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం