13, మార్చి 2014, గురువారం

దివాకర్ ట్రావెల్స్ .. గాంధీ భవన్ టూ ఎన్టీఆర్ భవన్


కుటుంబం దెబ్బతిన్నప్పుడు గుర్తుకు వచ్చేది మేనమామ. మేనమామ అంటే తల్లి తరువాత తల్లిలా ఆదరిస్తాడు, తండ్రిలా భరోసా ఇస్తాడు. మాటల్లోనే కాదు చేతల్లోనూ దీన్ని రుజువు చేశారు అనంతపురం సీనియర్ నాయకుడు జెసి దివాకర్‌రెడ్డి. కరవు జిల్లా అనంతపురంలో అపరకుబేరుడు. తన కింద పని చేసే సాధారణ ఉద్యోగితో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టించిన మహనీయుడు. మైన్స్, ట్రాన్స్‌పోర్ట్, రాజకీయం వంటి అనేక వ్యాపారాల్లో ఆరితేరిన వారు. రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు వోల్వా బస్సును బహుమతిగా ఇస్తానని బహిరంగంగా ఆఫర్ చేసిన మహాదాత. ఆయన చితికి పోవడం ఏమిటని? సందేహం రావడం సహజమే. చితికి పోయింది ఆయన కాదు. ఆయన వోల్వా బస్సు తగలబడి అర్ధశతకం మంది అసువులు బాసినా ఆయన బస్సులు గంట కూడా నిలువలేదు. వ్యాపారం ఆగలేదు. 

చితికిపోయింది ఇంత కాలం ఆయన్ని ఆదరించి పెద్దవాన్నిచేసిన పార్టీ. కుటుంబం చితికి పోతే మేనమామను ఆశ్రయిస్తారు. అలానే రాజకీయ పార్టీ చితికిపోతే మేనమామ పార్టీనే కదా ఆశ్రయించాల్సింది. జెసి ఆదే చేశారు. సొంతంటిలో కన్నా అమ్మ పుట్టిల్లు అయిన మేనమామ ఇంటిలో మరింత స్వేచ్ఛ ఉంటుంది. అనంతపురంలో కాంగ్రెస్, టిడిపి నాయకులు కత్తులు దూసుకున్నా, పీకలు తెగ్గోసుకున్నా జెసి మాత్రం తాను కాంగ్రెస్‌లో ఉన్నా టిడిపితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలే నెరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడ్డా కింద పడకుండా ఉండడం వెనుక మ్యాజిక్ ఏమిటో జెసినే చెప్పారు. బాబు కాంగ్రెస్‌కు మేనమామ లాంటివారు, అండగా నిలవడం మేనమామ బాధ్యత అందుకే మా బాబు మేనమామలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నాడని చెప్పుకొచ్చారు. విభజనతో కాంగ్రెస్ పరిస్థితి అడవి గాచిన వెనె్నలగా మారిపోవడంతో మేనల్లుడు జెసి మేనమామను నమ్ముకుని టిడిపికి దూకేశారు. పరిటాల రవి హత్య సమయంలో జెసి పాత్ర ఉందని బాబు గగ్గొలు పెట్టాడు కదా? కార్యకర్తలను చంపించాడన్నారుకదా మరి ఎలా చేర్చుకుంటున్నారు అనే ప్రశ్నలు వంద వచ్చాయి. 

అన్నాదమ్ములే కోపం వచ్చినప్పుడు ఎన్నో తిట్టుకుంటారు. పార్టీలు అన్నాక అలాంటివి సాధారణం. మేనల్లుడు కష్టాల్లో ఉన్నప్పుడు మేనమామ పిలిచి ఆదరించడంలో విశాల హృదయాన్ని చూడాలి కానీ పాత కక్షలనుకాదు. ఒకే వేదికపై పరిటాల భార్య సునీత, జెసి దివాకర్‌రెడ్డి కూర్చోని రాష్ట్ర సంక్షేమం కోసం పాటు పడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు. ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎమ్మెల్యేలుగానే కాదు మంత్రులుగానే వారిద్దరు ఒకే వేదికపై కూర్చుంటారు. ఆరుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జెసి దివాకర్‌రెడ్డి 69 ఏళ్ల వయసులో పసుపు కండువాతో కొత్త పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నారు

1 కామెంట్‌:

  1. ఈ ముసలిగుర్రాలు చంద్రబాబు కొంప ముంచుతాయి! జ్యోతిబసు ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా ఉండి రికార్డ్ నెలకొల్పినట్టు, చంద్రబాబు ఎక్కువకాలం ప్రతిపక్షనేతగా ఉండి రికార్డ్ నెలకొల్పుతాడు. ఆల్ ద బెస్ట్ బాబూ!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం