23, మార్చి 2014, ఆదివారం

అతని జీవితం సినిమా కథ ... దొర గడీని కొన్న డాలర్ లక్ష్మయ్య


నేతా శ్రీ 6
అది ఖిలాషాపురం గ్రామం. మొత్తం ఊరిని శాసిస్తున్నట్టుగా సగర్వంగా తలెత్తుకుని నిలిచినట్టున్న ఊరి దొరగారి గడీ (పెద్ద భవనం). భవనం నుంచి రేడియోలో చక్కని పాటలు వినిపించేవి. ఓ కుర్రాడు రేడియో పాటలు వినడానికి తెల్లారకముందే భవనం గోడకు చెవి ఆనించేవాడు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని, అలా ఎదిగి ఆ భవనాన్ని, అందులోని రేడియోను కొని కాలుమీద కాలేసుకుని పాటలు వినాలని కలలుగన్నాడు. ఆ తరువాత కలలకే పరిమితం కాలేదు.వాటిని సాకారం చేసుకోవాలని కంకణం కట్టాడు. యువకుడిగా తన చదువు అతన్ని సంపన్నుడిని చేసింది. విదేశాలకు వెళ్లాడు, డాలర్లు సంపాదించాడు.. సొంతూరికి వచ్చాడు. వచ్చీ రాగానే భవనం గురించి వాకబు చేశాడు. అమ్మకానికి ఉందని తెలియగానే కొనడానికి ముందుకొచ్చాడు. అప్పటి వరకు రెడ్డిగారిదైన భవనం అప్పటి నుంచి ఆ యువకుడిది అయింది. భవనం అమ్మాక నాకు ఆ రేడియో కూడా కావాలని, ఎంతకైనా సరే కొంటానని ముచ్చట పడి రేడియోనూ కొన్నాడు. ఇదేదో సినిమా కథ అనిపిస్తుంది కదూ! అలా అనిపించొచ్చుగానీ, ఇది సినిమా కాదు. పొన్నాల లక్ష్మయ్య సొంత కథ. స్వయంకృషితో చదువును నమ్ముకుని ఉన్నతస్థాయికి ఎదిగిన ఒక గ్రామీణుడి కథ. ఆ ఇంటిని ఏనాటికైనా కొనాలనే తన లక్ష్యమే తనకు చదువుపై ఆసక్తి పెంచిందని, అమెరికాకు వెళ్లేలా చేసిందని చెప్పుకుంటారు ఆయన. ఏదైనా అనుకుంటే సాధించేంత వరకూ వదిలిపెట్టను అంటారాయన! ఆయన జీవితం లో మొదటి సగం సినిమా హీరో జీవితాన్ని తలపింప జేసే విధంగా ఉన్నా , ఇంటర్వెల్ తరువాత రాజకీయ జీవితం లో మాత్రం  ఆయన మరీ ఫన్నిగా వ్యవహరించారు .. తెలంగాణా  కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత సీరియస్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు . 

చిన్ననాటి లక్ష్యం వేరు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం ఉన్నా, అది అంత సులభం కాదు.


ఇంటి పేరు పొన్నాల. ఆయన పేరు లక్ష్మయ్య. జనగామలో ఆయన గురించి తెలిసినవారు మాత్రం డాలర్ లక్ష్మయ్య అంటారు. ఒకప్పుడు రూపాయి కోసం ఆశగా ఎదురు చూసిన ఆయన తరువాత డాలర్ లక్ష్మయ్యగా మారారు. బాల్యంలో పేదరికాన్ని అనుభవించిన లక్ష్మయ్య కసితో చదివి ఇంజనీరింగ్ డిగ్రీతో అమెరికా వెళ్లి మాస్టర్ డిగ్రీతోపాటు డాలర్లతో తిరిగొచ్చాడు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితం, మూడుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం, నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నిక. అయినా ఆయన చర్యలు మాత్రం సీరియస్ పాలిటిక్స్ నడుపుతున్నట్టుగా ఉండవు. మంత్రిగా ఉంటూ స్విమ్మింగ్ చేస్తూ కెమెరాలకు ఫోజులిస్తాడు. కెమెరాల కోసం ఆయన చేయని చిలిపి పని లేదు.
వరంగల్‌లో 94 సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు సాగుతున్న కొంతసేపటికి పొన్నాల లక్ష్మయ్య లేచి విలేఖరులకు నమాస్కారం చేసి వెళ్లిపోసాగారు. అదేంటి ఇంకా సగం కూడా ఓట్ల లెక్కింపు జరగలేదు, అప్పుడే వెళ్లిపోతున్నారేంటని అడిగితే -‘చివరి వరకు ఉండటం వృధా. ఫలితం తేలిపోయింది. ప్రజల తీర్పు అలా ఉంది.. ఆమోదించాల్సిందే’ అంటూ వెళ్లిపోయారు. సాధారణంగా నాయకులకు చివరి ఓటు వరకూ గెలుపుపై ఆశ చావదు. కానీ ఎప్పుడూ బోళాగా నవ్వుతూ ఉండే పొన్నాల అంత హుందాగా ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే ఓటమి అంగీకరించడం ప్రత్యేకంగా నిలిచింది.


కాంగ్రెస్‌లో ఎవరికి వారే హీరోలు. ఎవరూ ఎవరి మాటా వినరు. అలాంటిది కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఈ పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్‌కు పొన్నాల లక్ష్మయ్య సారథి. అంటే -తెప్పతో నడి సంద్రంలో సాహసాలు చేయడం లాంటిదే. అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేని పార్టీలు సైతం ‘పవర్లోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి’ అంటూ ప్రచారం చేసుకుంటున్న తరుణంలో.. ‘మా పార్టీ అధ్యక్షుడే బీసీ’ అని చెప్పుకునే స్థితిలో కాంగ్రెస్ లేదు. 1945 ఫిబ్రవరి 1న వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో జన్మించిన పొన్నాలకు ఇద్దరు కుమారులు.

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం