1, జులై 2014, మంగళవారం

నెల రోజుల తెలంగాణ అస్తిత్వ పాలన

ఐదేళ్లపాటు అధికారంలో ఉండే ప్రభుత్వానికి నెల రోజులు అంత ప్రధానమైన అంశం  కాకపోవచ్చు. 60 నెలల పాటు ప్రజలు అధికారం అప్పగించినప్పుడు మొదటి నెలలోనే ఒక అభిప్రాయానికి ఎలా వస్తామని అనిపించచ్చు. కానీ ఇది ఒక నెల రోజుల ప్రభుత్వ పాలన మాత్రమే కాదు. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రం నెల రోజుల నడక. అందుకే ఈ నెల రోజుల ప్రభుత్వ తీరు బేరీజు వేసుకోవడం తెలంగాణకు అవసరం. కాళ్లు కడిగినప్పుడే కొత్త కోడలు కాపురం చేసే తీరు తెలుస్తుందన్నట్టు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పని తీరును అంచనా వేయాల్సిందే. 
తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని అమలు పరచలేదు. భారీగా ప్రభుత్వంపై భారం పడే ఆ పథకాల అమలు ఒకటి రెండు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు కావు. దానికి కొంత సమయం పడుతుంది. నిధుల అవసరం పడుతుంది. సాధారణ కుటుంబం కొత్త ఇంట్లోకి మారినప్పుడు కొత్త ఇంటికి అలవాటు పడేందుకైనా నెల రోజులకు పైగానే సమయం పడుతుంది. అలాంటిది కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికే కొంత సమయం పడుతుంది. అలాంటిది హామీలను అమలు చేయలేదని నెల రోజులకే విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. జూన్ రెండవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన నెల రోజుల పాలనలో తెలంగాణ అభిమానుల, తెలంగాణ వాదులను సంతృప్తి పరిచారనే చెప్పవచ్చు. 

భారీ పథకాలేమీ ప్రకటించలేదు, భారీగా నిధులేమీ తేలేదు, భారీ హామీలేమీ ఇంకా అమలు పరచలేదు. అయినా తెలంగాణ ముద్రతో సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి పాలన తెలంగాణ వాదులను సంతృప్తి పరిచేట్టుగానే ఉంది.

ఏ వాదనతో తెలంగాణ ఉద్యమం సాగిందో, అధికారంలోకి వచ్చిన తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ వాదనను ఆచరణలో పెడుతున్నట్టుగానే నెల రోజుల పాలన సాగింది. సాధారణ సమయంలో ధరలు తగ్గడం, పెరగడాన్ని బట్టి ప్రభుత్వ పనితీరుపై ఒక అంచనాకు వచ్చే వారు ఉంటారేమో కానీ, ఇక్కడ ఆ సూత్రం వర్తించదు. పన్నులు పెంచడం, ధరలు పెరగడం, తగ్గడం ఏ ప్రభుత్వంలోనైనా సహజమే. నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే ధరలు పాతాళంలోకి పడిపోతాయని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆకాశంలోకి దూసుకెళతాయని అనుకునే వారు ఉంటే ఉండవచ్చు. కానీ ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర స్వల్పమే, ఇతర అంశాలే కీలక పాత్ర వహిస్తాయి.
ఇలాంటి సాధారణ అంశాలు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రంపైన తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారో సరిగ్గా గ్రహించి కెసిఆర్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు నెల రోజుల పాలనతో అనిపిస్తోంది.
తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ఆస్తిత్వ పోరాటం. తమ సంస్కృతి, తమ యాస, భాషను అవహేళన చేస్తున్నారని, మాయం చేస్తున్నారనే బాధ నుంచి పుట్టిన ఉద్యమం ఇది. కెసిఆర్ తన నెల రోజుల పాలనలో ప్రధానంగా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అది పివి నరసింహారావు జయంతిని అధికారికంగా నిర్వహించడం కావచ్చు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం కావచ్చు. ఇవి కొందరికి చిన్న విషయాలుగా కనిపించవచ్చు. పుట్టినప్పటి నుంచి ఊపిరి విడిచే క్షణం వరకు కాంగ్రెస్‌లోనే ఉన్న పివి నరసింహారావును కెసిఆర్ గుర్తించిన తీరు తెలంగాణ సమాజం మొత్తం ఉద్వేగానికి గురయ్యేట్టు చేసింది. ఈ రాష్ట్రంలో ఎంతో మంది జయంతులు, వర్ధంతులు ఒక తంతుగా నిర్వహించడం చూశాం. పివి నరసింహారావు జయంతి వేడుకలకు కొన్ని కోట్ల రూపాయలేమీ ఖర్చు చేయలేదు. సాదాసీదాగానే చేశారు. 

చాలా సంతోషంగా ఉన్నప్పుడు సగటు తెలంగాణ వ్యక్తి కడుపు నిండినట్టుగా ఉంది అంటారు. పివి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన కుమార్తె వాణి సభలో అందరినీ చూస్తూ ఉద్వేగానికి గురై కడుపు నిండినట్టుగా ఉందని పలకడం అందరినీ కట్టిపడేసింది. తెలంగాణ అనే పదానే్న అసెంబ్లీలో పలక రాదు అనే ఆంక్షలను చూసిన తెలంగాణ సమాజం తమ వాడిని తాము గౌరవించుకోవడం చూసి నిజంగానే ఉద్వేగానికి గురైంది. మన కట్టుబొట్టు తెలియని వారు ఇంత కాలం అధికారంలో ఉండడం వల్ల పివికి తగిన గౌరవం ఇవ్వలేదని, ఇంత కాలానికి మన రాష్ట్రంలో, మన ప్రభుత్వం వచ్చింది పివిని గౌరవించుకుంటోంది అంటూ పివి కుమార్తె చెప్పిన మాటలు సగటు తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిప్రాయం.
కారణాలు ఏమైనా కావచ్చు, రాజకీయాలు ఏమైనా కావచ్చు. పివి నరసింహారావుకు లభించాల్సిన గౌరవం అప్పటి పాలకులు ఇవ్వలేదు. ఒక పోలీసు అధికారి తన విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే భాగ్యనగరంలో భారీ విగ్రహాన్ని నిర్మించారు. మంచిదే వారి సేవను గుర్తించి, విగ్రహం నిర్మించాలనే ఆలోచన వచ్చిన పాలకులకు అప్పుల్లో కూరుకుపోయిన దేశాన్ని సంక్షోభ సుడిగుండం నుంచి పైకి తీసుకు వచ్చిన నాయకుడి విగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచన రాకపోవడం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. పివి నరసింహారావు టిఆర్‌ఎస్ అభిమాని కాదు... కేసిఆరే సభలో చెప్పారు తనకు పివితో వ్యక్తిగతంగా సంబంధం లేదని. కానీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన మహానేతగా పివిని సముచిత రీతిని గౌరవించుకోవడం తెలుసు అని కేసిఆర్ చేసి చూపించారు. ప్రతి అంశాన్ని ఓట్ల లెక్కలతోనే చూసేవారు ఆ లెక్కల్లో భాగంగానే పివికి సముచిత గౌరవం ఇవ్వలేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు బాబ్రీ మసీదు కూల్చారు. ఆయనకు గౌరవం ఇస్తే మైనారిటీల ఓట్లు రావు. ఇదీ వారి లెక్క. త్వరలోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. మజ్లీస్ పార్టీతో టిఆర్‌ఎస్ స్నేహాన్ని కోరుకుంటోంది. అదే సమయంలో దేశాన్ని గట్టెక్కించిన పివి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు కెసిఆర్ ఓట్ల లెక్కలకు భయపడలేదు. 

తమ పట్ల తామే ఆత్మన్యూనతకు గురయ్యేట్టు చేయడం ఆధిపత్యం చెలాయించే వాడి లక్షణం. దీనికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఆ ఆత్మన్యూతనను సంప్రదాయంగా కొనసాగించాల్సిన అవసరం లేదు. మన జాతి రత్నాలను మనం గౌరవించుకుందాం. మన సంస్కృతి ఔన్నత్యాన్ని మనం చాటి చెప్పుకుందాం అనే ధోరణితోనే కెసిఆర్ మొదటి నెల రోజుల పాలనలోనే నిర్ణయాలు నిర్ణయాలు తీసుకున్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం పాతిక లక్షలు విడుదల చేసింది, పివి జయంతి వేడుకలకు అంత కన్నా కొంచం ఎక్కువో తక్కువో ఖర్చయి ఉంటుంది. ఇక్కడ నిధుల విషయం కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం, అధికారంలో ఉన్నది తెలంగాణ పార్టీ అని కెసిఆర్ తన చర్యల ద్వారా చాటి చెప్పారు. 

నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం ఎలా ఉన్నా, వాటిని కొనసాగనిచ్చేది లేదనే గట్టి సంకేతాలు పంపుతూనే సాంస్కృతికంగా తెలంగాణ ముద్రను బలంగా వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం ఒక్కటే ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకు వెళ్లలేదు. ఈ మూడింటిలో తెలంగాణకు జరిగిన అన్యాయాలపై కమిటీల నివేదికలు ఉన్నాయి, కళ్ల ముందు కనిపిస్తున్నాయి. కానీ ఉద్యమంలో ఈఅంశాలు కీలక పాత్ర వహించి ఉండవచ్చు, కానీ ఉద్యమానికి ఈ మూడు అంశాలు మాత్రమే కారణం కానే కాదు.
నిధుల కోసమే అయితే కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తుంది, సమైక్య రాష్ట్రానికి ఒప్పుకోండి అనేవారు. నియామకాలే కారణం అయితే ఎక్కడో అమెరికాలో మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ దూకేవారు కాదు. తెలంగాణ వ్యక్తి ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ ఉద్యమంతో ఏదో ఒక రూపంలో పాలు పంచుకున్నాడు. నిధులు, నియామకాల కోసమే అయితే పాశ్చాత్య దేశాల్లో హాయిగా జీవిస్తున్న వ్యక్తి ఎందుకు స్పందిస్తాడు. ప్రధానంగా ఆస్తిత్వ పోరాటం కాబట్టే సకల జనులు ఉద్యమంలో భాగస్వామ్యం వహించారు. ఇప్పుడా సకల జనులు సంబరపడే విధంగా తెలంగాణ పాలనలో తెలంగాణ ముద్రను చూపేందుకు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తున్నారు.
కొంత మందికి మంత్రి పదవులు, కొందరికీ నామినేటెడ్ పదవులు, అధికారం ఒక వర్గం చేతి నుంచి మరో వర్గం చేతిలోకి రావడం కోసమే తెలంగాణ ప్రజలు ఉద్యమించలేదు. తెలంగాణ ఆస్తిత్వాన్ని చూపించేందుకు ఉద్యమించారు. దీన్ని కేసిఆర్ గుర్తించారు.. గుర్తుంచుకోవాలి కూడా. నెల రోజులైనా ఇప్పటి వరకు కేసిఆర్ ఒక్కసారి కూడా రాష్ట్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడలేదు. ఏదైనా చేసిన 
తరువాతనే మాట్లాడతాను అంటున్నారు. ఎన్నికల హామీల అమలు, పథకాలు ప్రవేశపెట్టడం, పాలనలో లోటు పాట్లు ఏ రాష్ట్రంలోనైనా, ఢిల్లీలోనైనా ఎవరు అధికారంలోకి వచ్చినా షరా మామూలే.
టిఆర్‌ఎస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే జరిగిన శాసన సభ సమావేశాల్లోనే ముఖ్యమంత్రిగా కేసిఆర్ తన ప్రసంగంలో తెలంగాణ ఆత్మను ఆవిష్కరించారు. కాకతీయుల పాలన నుంచి కులీకుతుబ్‌షాహీల పాలన వరకు ప్రస్తావించారు. సభలో ఒకసారి ఇదేమన్నా చందూలాల్ దర్బారా? అంటూ యధాలాపంగా పలికినా ఇంత కాలం కనిపించకుండా మట్టిలో కప్పి పెట్టిన తెలంగాణ ఆస్తిత్వాన్ని బయటకు తీసుకు వస్తున్నానని, తన ప్రతి మాట ద్వారా సంకేతాలు పంపించారు. ఇది తెలంగాణ సర్కార్ అనే మాటను సభకు, లోకానికి గుర్తు చేశారు. తెలంగాణ ఆస్తిత్వం సగర్వంగా తలెత్తుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం పని చేయాలి. చేస్తుందని ఆశిద్దాం.

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం