21, సెప్టెంబర్ 2014, ఆదివారం

నాల్గవ స్తంభానికి మేస్ర్తి కావలెను!

‘‘సరే ఇప్పుడే వాడి సంగతి చూస్తాను’’ అని విప్లవ్ ఫోన్ పెట్టేశాడు. ‘‘మానవ హక్కులకు అస్సలు విలువ లేకుండా పోతుందోయ్ ’’అని ఎదురుగా ఉన్న పరమేశం ముందు విప్లవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
బాస్ మాటకు ఔను అనడమే ఉత్తమ ఉద్యోగి లక్షణం అనుకున్న పరమేశం ‘‘గాజాలో అమెరికా అండతో  సైన్యం పిల్లలు అమాయకులను ఊచకోత కోస్తోందట! అమెరికా వాడి గుండెలపై నిద్ర పోయేంత ధైర్యం మీకే ఉంది సార్. దీనిపై మన చానల్‌లో ఓ చర్చ నిర్వహించారంటే అదిరిపోతుంది ’’ అంటూ పరమేశం ఆవేశంగా చెప్పుకు పోతున్నాడు. 


‘‘బోడి గాజా గొడవ మనకెందుకోయ్. రేటింగ్ పెరగని పనులేమీ మనం చేయవద్దు’’ అన్నాడు.


ఆలోచనలో పడ్డ పరమేశం ‘‘ మీరెన్నన్నయినా చెప్పండి సార్ రాష్ట్ర విభజన అన్యాయం. మా కాలనీ కర్రీపాయింట్ వాడు రోజూ ఒకటే ఏడుపు.. రోజుకు రెండు వేల రూపాయల కర్రీలు అమ్మేవాడట! ఉమ్మడి రాష్ట్రం ఉంటుందని తప్పని సరి అయితే యూటి చేస్తారని వాళ్ల కేబుల్ కనెక్షన్ కుర్రాడు చెప్పాడట! నెల నెల కేబుల్ బిల్లు తీసుకుపోయేప్పుడు వాడితో మాట్లాడితే నిజం సార్ నమ్మండి అంటూ యూటీ గురించి చెప్పాడట! దాంతో వీడేమో పెద్ద మొత్తంలో కర్రీ పాయింట్ కోసమని వంట పాత్రలన్నీ కొనుకున్నాడు. ఇప్పుడేమో అలాంటిదేమీ లేకపోయే సరికి లబోదిబో మంటున్నాడు. కేబుల్ కనెక్షన్ ఇచ్చే కుర్రాడి మాటకే విలువ లేకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధం ఏముంది? విలువలు ఎక్కడున్నాయి. 

కర్రీపాయింట్ ప్లాబ్లమ్స్‌ను హైలెట్ చేస్తూ రాష్టప్రతి పాలన విధించాలని మన చానల్ తరఫున ఉద్యమిస్తే ఎలా ఉంటుంది సార్! కాళిదాసును చూస్తే నిరక్ష్యరాస్యుడికి కూడా కవిత్వం వచ్చేదట! మీరు కూడా అంతటి వారే సార్! మిమ్ములను చూడగానే నా మట్టిబుర్రలో ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు వస్తున్నాయి. మీరు చాలా గ్రేట్ సార్! నాలాంటి అనామకుడిలోనూ ఇన్ని ఆలోచనలు తెప్పిస్తున్న మీ బుర్రను మ్యూజియంలో ఉంచాలి ’’ అంటూ పరమేశం తన లీవ్ లెటర్‌ను ముందుకు జరిపాడు.


‘‘నీ ఆందోళన నిజమేనోయ్ ... మొన్న మన కేబుల్ ఆపరేటర్లు మన చానల్ వైర్లు కత్తిరించారని, కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్టప్రతి పాలనకు సిఫారసు చేసింది. ఆర్డర్ కాపీ ఆర్డినరీ పోస్ట్‌లో పంపినట్టున్నారు. ఇంకా చేరలేదు. ఆర్డర్ చేరగానే రాష్టప్రతి పాలన దానంతట అదే వచ్చేస్తుంది అంటూ విప్లవ్ అనునయించాడు.
ఔనుసార్ ఆప్పుడప్పుడు మనం పత్రికల్లో చూస్తూనే ఉంటాం కదా ఇండియన్ పోస్టల్ శాఖ ఘనకార్యాలు. పెళ్లికి రమ్మని ఉత్తరం రాస్తే పదేళ్లకు సరైన అడ్రస్‌కు ఉత్తరం చేరిందనే వార్తలు ఎన్ని చూడలేదు. కేంద్రం పంపిన ఉత్తరం ఏదో ఒక రోజు రాక తప్పుతుందా? అప్పటి వరకు మనం వేచి చూడాలి...ఐనా మన జవదేకర్ దేవుడు సార్ ’’ అంటూ హఠాత్తుగా టాపిక్ మారుస్తూ వౌనంగా ఉండిపోయాడు.
‘‘అదేంటయ్యా సగం చెప్పి ఆపేస్తావు. పూర్తి చేయ్’’ అని విప్లవ్ ఆసక్తిగా అడిగాడు.
‘‘ఎవరు కాదన్నా ఔనన్నా ఆయన దేవుడుసార్.. దేవుడు... మీకు తెలుసు కదా సార్... బ్రహ్మకు తన సృష్టి గురించి చెప్పినట్టు మీకు మేం చెప్పాలా.. మనుషులకు రోజు అంటే 24 గంటలు రెండు రోజులంటే రెండు 48 గంటలు. కానీ మనకు లెక్కలేనన్ని రోజులు అయితే దేవుళ్లకు ఒక రోజు అవుతుంది. అలాంటిది రెండు రోజులు కావాలంటే మాటలా? ’’ అని చెబుతుంటే
నసగకుండా విషయం చెప్పవయ్యా అని విప్లవ్ గద్దించాడు.
అదే సార్ కేబుల్ వైర్లు బిగించే వారి గొంతును రెండు రోజుల్లో బిగించేస్తాను అని అప్పుడెప్పుడో జవదేకర్ చెప్పారు కదా? సామాన్య మనుషులు రెండు రోజులు కాగానే ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు కానీ ఆయన దేవుడని ఆయన లెక్కలు వేరుగా ఉంటాయని వారికి తెలియదు’’ అని పరమేశం చెప్పుకొచ్చాడు.


ఏంటీ వీడు మామూలుగానే చెబుతున్నాడా? లేక వ్యంగ్యమా? అని విప్లవ్ పరమేశం ముఖంలోకి పరీక్షగా చూశాడు.
వీడి బొంద బానిసకు యజమానిపై వ్యంగ్యాస్త్రాలు విడిచేంత ధైర్యమా? ఏదో నన్ను మస్కా కొట్టాలని కాకపోతే అని సంతృప్తి చెంది విప్లవ్ తల ఆడించాడు.


నా బాధ అదికాదయ్యా మీడియా అంటే ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభం కదా? నాలుగవ స్తంభాన్ని చిన్నచూపు చూడడం తగునా? మా అబ్బాయి ర్యాగింగ్ చేస్తే అడ్డుకుంటారా? సర్లే తెలియకుండా చేశారని క్షమించేశాను. తాగి కారు నడిపితే పట్టుకుంటారా? ఎక్కడికెళుతున్నది సమాజం. ఇలా అయితే అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది. నాలుగవ స్తంభంలో నేనో ఇటుక లాంటి వాడిని అని మా అబ్బాయి చెబుతున్నా వినకుండా బ్రీతింగ్ టెస్ట్ చేశారట! ప్రజాస్వామ్యానికి ఇది నిజంగా బ్లాక్ డే అని విప్లవ్ వాపోయాడు. ఇటుకలు లేనిదే స్తంభం ఉండదు. ఒక్కో ఇటుక బలహీన పడితే ఇక స్తంభం ఎక్కడుంటుంది ?’’ అని విప్లవ్ బాధగా చెప్పాడు.
‘‘విషయం ఇదే అనుకున్న పరమేశం అవును సార్ మనం మంచి మేస్ర్తిని చూడాల్సిన తరుణం ఆసన్నమైంది. గోల్కొండ కోటలోని రాళ్లను ఇళ్లు కట్టుకోవడానికి పీక్కెళ్లినట్టు నాలుగవ స్తంభం ఇటుకలను ఎవరికి వారు పీకేశారు. ఇప్పుడు నాలుగవ స్తంభాన్ని మీరే పునర్నిర్మించాలి సార్. మన వాళ్లలో ఎంతో మంది బ్రహ్మాండమైన కాంట్రాక్టర్లు ఉన్నారు. నిజానికి రాజ్యాంగంలో పార్లమెంటు, జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్ అనే మూడు స్తంభాలే ఉంటే ఎంత కష్టపడి మన స్తంభాన్ని కూడా భవనం లోనికి దూర్చేశాం. మొన్నటి మొన్న ఒక కామన్ మ్యాన్ ఏమన్నాడో తెలుసా సార్! మీడియాకు ప్రత్యేకంగా భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ ఏమీ ఉండదు. ప్రజలకు ఉండే భావ ప్రకటనా స్వేచ్ఛనే మీడియా భావ ప్రకటన స్వేచ్ఛ అనేశాడు సార్. ఆ మాటలు వినగానే నా రక్తం ఉడికిపోయింది. మనకున్న ప్రత్యేక స్వేచ్ఛను కోన్‌కిస్కా సామాన్య ప్రజల స్వేచ్ఛతో పోలుస్తారా?’’ అని పరమేశం ఊగిపోయాడు.


కలికాలం బ్రదర్ కలి కాలం అంటూ విప్లవ్ ఫోన్ తీసుకొని సిఐ గారా సారీ సార్ మీకు ట్రబుల్ ఇస్తున్నాను, వాడు మా వాడే ఏదో తెలియక ... దాందేముంది మీరు రండి సార్  హృదయం  విప్పి మాట్లాడుకుందాం... మీ పిల్లల ముచ్చట తీర్చే విధంగా ఒక ప్రోగ్రాం చేద్దాం దాందేముంది సార్ ’’ అంటూ విప్లవ్ ఫోన్ పెట్టేశాడు. పరమేశం నాలుగవ స్తంభాన్ని బాగు చేసేందుకు మేస్ర్తిని వెతికేందుకు వెళ్లాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం