29, జూన్ 2018, శుక్రవారం

ఆ ‘మట్టిగడ్డ’ ఏమైంది..?

‘‘దిగులుపడకు.. మన రాజకుమారి అక్కయ్య కోరినట్టు మగవాళ్ల హక్కుల కమిషన్ వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది.’’
‘‘నాకూ అదే అనిపించింది.. ఆడపిల్ల అని కడుపులోనే చంపేసినట్టు వచ్చే వార్తలు కాస్తా ఇప్పుడు మగపిల్లాడని తెలిసి పుట్టగానే చంపేసిన తల్లి అనే వార్తలుగా మారాయి.’’
‘‘ఏదో జరుగుతోందని అనిపిస్తోంది..’’
‘‘సినిమాలో హీరోకో, హీరోయిన్‌కో ఏదన్నా అయితే ప్రకృతి స్తంభించి పోతుంది. నిజంగా అలా ఎప్పుడూ జరగదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఏదో ఒకటి జరిగిపోతూనే ఉంటుంది. ప్రపంచం ఎవరి కోసం ఆగదు’’
‘‘కడుపులో శిశువులను చంపడం గురించి కాదు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నా .. అతను చాలా సీరియస్‌గా ఉన్నాడు. ఏదో ఒకటి చేసేట్టుగానే ఉన్నాడు’’
‘‘ఏమా కథ?’’
‘‘రష్యాను శక్తిమంతంగా మార్చి, ట్రంప్ పీచమణిచి, ప్రపంచ శాంతి సాధించి, మోదీని దించేసి, ఆంధ్రలో జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకొని, తెలంగాణలో మరో మహాకూటమిని ఏర్పాటు చేసి అధికారంలో కూర్చోబెట్టి తీరుతానని అంటున్నాడు’’
‘‘ఎవరతను..?’’
‘‘వెలిసిపోయిన ఎర్రరంగు ఇల్లుంది కదా? అతనే.. వాళ్లింట్లో మూడు ఓట్లున్నాయి’’
‘‘ఆ మూడు ఓట్లు ఆయన చెప్పిన వారికి పడతాయని గ్యారంటీ ఇస్తావా?’’
‘‘రెండు ఓట్ల సంగతి చెప్పలేను. భర్త ఓటు వేయమన్న పార్టీకే భార్య ఓటు వేస్తుందనే గ్యారంటీ లేని రోజులివి. ఆయన ఓటు మాత్రం కచ్చితంగా తాను అనుకున్న విధంగా వేసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉందని గట్టిగా నమ్ముతున్నాను.’’
‘‘అతని పేరు రామకృష్ణనా?’’
‘‘తెలియదు.. ఎందుకలా అడిగావు?’’
‘‘అదే పేరుగలాయన ఒకరు ఇలానే మాట్లాడితే అతనేనేమో అనుకున్నాను. చేతిలో ఉన్న ఒక్క ఓటుతో ట్రంప్ పీచమణిచి, మోదీని ఓడించి, జగన్‌ను అధికారంలోకి రాకుండా చేసి, మహాకూటమిని అధికారంలోకి తేవడం సాధ్యమే అంటావా?’’
‘‘అబ్దుల్ కలాం ఏమన్నారు. కలలు కనమన్నారు. అసాధ్యం అని తెలిసినప్పుడు చిన్న కలలు ఎందుకు కనాలి? అదేదో పెద్ద కలలే కంటే సరిపోతుంది కదా? అప్పుడెప్పుడో మూడు వందల ప్రజాసంఘాలు, పనె్నండు పార్టీల కూటమితో వరంగల్‌లో పోటీ చేసి చతికిలపడ్డారు.
ఏమో.. రేపు ఎన్నికల్లో రెట్టించిన బలంతో అంటే ఆరువందల ప్రజాసంఘాలు, 24 పార్టీలతో కూటమి కట్టే చాన్స్ లేకపోలేదు.’’
‘‘నిజమే.. కలలు కనేందుకు పన్నులేమీ లేవు కదా? ’’
‘‘గట్టిగా అనకు.. కలలపై జిఎస్‌టి వేస్తే దిగులతో జనం చచ్చిపోతారు’’
‘‘కలల లోకానిదేముంది కానీ రాజకీయ లోకంలో ఏం జరుగుతోంది? నేను మాట్లాడుతుంటే నువ్వేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్? దేని గురించి ఆలోచన?’’
‘‘ కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో మళ్లీ చేరుతున్నార ట!’’
‘‘ఆయన చేరితే.. నీకెందుకు దిగులు..?’’
‘‘నా ఆలోచన ఆయన చేరడం గురించి కాదు. ఆయన చేతిలోని ఆ కర్ర, మట్టిగడ్డ ఏమైందా? ఎక్కడుందా? వాటిని కూడా తనతో పాటు తీసుకెళ్లి కాంగ్రెస్‌లో చేరుతున్నాడా? అని?’’
‘‘మట్టిగడ్డ ఏంటి? కర్ర కధేంటి?’’
‘‘బెర్లిన్ గోడను కూల్చారు కదా? ఆ గోడ మట్టిగడ్డను తన పలుకుబడి ఉపయోగించి కిరణ్‌కుమార్ రెడ్డి ఎలాగోలా సంపాదించారు. రాష్ట్ర విభజనను నిలిపివేస్తూ ఆ మట్టిగడ్డ ఆంధ్ర, తెలంగాణ మధ్య ఫెవికాల్‌గా మారుతుందని చాలా మంది అనుకున్నారు. మహిమ గల ఆ మట్టిగడ్డ గురించి కిరణ్ కూడా మీడియా సమావేశంలో అద్భుతంగా చెప్పేవారు. ఇప్పుడా మట్టిగడ్డ ఎక్కడుందా? అని ఆలోచిస్తున్నా! విభజన తరువాత తెలంగాణ అంతా చీకటే అని చూపించిన ఆ కర్ర ఇప్పుడెక్కడుందా? అని ఆలోచిస్తున్నాను. ఆ రోజు కిరణ్ ఆ కర్రను తనతోనే తీసుకు వెళ్లారా? లేక సచివాలయంలోనే ఉంచారా? ’’
‘‘ఉమ్మడి రాష్ట్రంలోని సంపద కదా? రెండు రాష్ట్రాలకు సగం కర్ర, సగం మట్టిగడ్డ పంచే చాన్స్ ఏమైనా ఉందంటావా? లేక సొంత సంపదగా కిరణ్‌కే దక్కుతుందంటావా?’’
‘‘అది కిరణ్ చెప్పాలి.’’
‘‘అప్పుడెప్పుడో కిరణ్ భాజపాలో చేరుతారనుకున్నారు, తమ్ముణ్ణి తెదేపాలోకి పంపారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతారంటావా? చేరితే తెలంగాణ కాంగ్రెస్‌లో చేరుతారా? ఆంధ్ర కాంగ్రెస్‌లో చేరుతారా? తాను పక్కా హైదరాబాదీని అని ఉద్యమ కాలంలో చెప్పిన ఈ నిజాం కాలేజీ మాజీ విద్యార్థి తెలంగాణ కాంగ్రెస్‌లో చేరితే ఎలా ఉంటుందంటావు? ఆంధ్ర కాంగ్రెస్‌లో ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది? కాంగ్రెస్‌కు ఆయన లాభమా? భారమా? ’’
‘‘ఐపోయాయా? ఇంకా ప్రశ్నలున్నాయా? కిరణ్ తన గురించి తాను ఇన్ని ప్రశ్నలు వేసుకుని ఉంటే ఆయన భవిష్యత్తు మరోలా ఉండేదేమో. సీఎంగానే హాయిగా క్రికెట్ చూస్తూ గడిపేశారు. పార్టీ పెట్టి, పోటీ నుంచి తప్పు కున్న రాజకీయ యోధుడు.’’
‘‘చూడోయ్.. ఎవరి భవిష్యత్తు ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతుందో చెప్పలేం. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్న చెన్నారెడ్డి అవసరం అయితే గంగలో దూకుతాను కానీ కాంగ్రెస్‌లో చేరను అని ప్రతిజ్ఞ చేసి , సొంత పార్టీకి అడ్రెస్ లేక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి 1989లో ఏకంగా కాంగ్రెస్ నుంచి సిఎం అయ్యారు’’
‘‘అందుకేనేమో కిరణ్ ఏదో ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా తిరిగి అవతారం ఎత్తినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని ఆంధ్రలో అనువాద ఉపన్యాస నేత చాలారోజుల క్రితమే చెప్పారు.’’
‘‘్భమి గుండ్రంగా ఉంటుందన్న దానిపై ఇప్పటికీ కొందరు శాస్తవ్రేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం భూమి గుండ్రంగా ఉంటుందని పదే పదే నిరూపిస్తుంటారు. రాజకీయ పరీక్షల్లో తప్పి పోయి, సొంతంగా బతక లేనప్పుడు, నిర్మోహమాటంగా సొంత గూటికి చేరుకుంటారు.’’
‘‘్భమి గుండ్రంగా ఉన్నా, బల్లపరుపుగా ఉన్నా మనకొచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ ఏనాటికైనా మనందరి శాశ్వత చిరునామా ఆరడుగుల భూమిలోపలే అని గుర్తుంచుకుంటే మనుషుల తీరు మారొచ్చునేమో’’

-బుద్దా మురళి (జనాంతికం 29-6-2018)

1 కామెంట్‌:

  1. బహుశా ఆ మట్టిగడ్డని కిరణ్ గారు మోది గారికి ఇచ్చారు. ఆయన అమరావతికి వచ్చినప్పుడు కాసిన్ని నీళ్ళతో సహా చంద్రబాబు గారికి ఇచ్చారు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం