25, జూన్ 2018, సోమవారం

సమాచార సమస్యకు సాంకేతికతే సమాధానం

మిషన్ భగీరథ పథకం కింద మారుమూ ల గ్రామాలకు సైతం ఇంటింటికి మం చినీటితో పాటు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించే ప్రయత్నాలు సాగుతున్నప్పుడు, అధికారు లు ప్రభుత్వ సమాచారాన్ని ఇంటర్‌నెట్‌లో ఉంచలే రా? సమాచారహక్కు చట్టం కింద సమాచారం ఇవ్వడం అదనపు భారంగా మారిందని భావిస్తున్న అధికారులు సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించుకొ ని ఈ సమస్యను పరిష్కరించలేరా?
సమాచారహక్కు చట్టం కింద సమాచారం కోరితే ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది చాలామంది పిటిషనర్ల ఫిర్యాదు. అనేక పథకాల అమలుతో పని ఒత్తిడి పెరిగిపోయింది. దీనికితోడు సమాచారహక్కు చట్టం పేరుతో అవసరంలేని సమాచారం కూడా అడుగుతూ ఒత్తిడి పెం చుతున్నారు. ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఒత్తిడి పెం చేందుకు ఉపయోగించుకోవడం మంచిది కాదు అనేది అధికారులు వినిపించేమాట. ఎవరైనా సమాచారం కోరినప్పుడు అధికారులు తగిన వ్యవధిలో ఇవ్వాల్సిందే తప్ప ఈ సమాచారం ఎందుకు? అని అడుగడానికి వీలులేదు. సమాచారం ఏం చేసుకోవడానికి అనేది కూడా అధికారులకు అనవసరం.

కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు సమాచారం ఇంకా పూర్తిగా మాకు అందలేదు అందువల్ల సకాలంలో ఇవ్వలేకపోయాం. బదిలీపై ఈ మధ్య నే వచ్చాను అంతకుముందున్న అధికారి సమాచారం ఇవ్వలేదు. ఫైల్స్ దొరుకడం లేదు ఇలా ఉంటాయి అధికారులు చెప్పే కొన్ని కారణాలు. మరోవైపు సమాచారం కోసం కన్నా ఏదోరకంగా ఇబ్బందిపెట్టాలనే కోణంలోనే కొందరు సమాచారహక్కు చట్టాన్ని ఉపయోగించుకొంటున్నారు. పని ఒత్తిడి నిజమే, కొందరు అధికారులు సకాలంలో సమాచా రం ఇవ్వడంలేదు అనేదీ నిజమే. ఫిర్యాదుదారు, ప్రజా సమాచార అధికారి ఇద్దరు చెబుతున్న సమస్యలు నిజమే. ఇరువురి సమస్యలకు ఒకే పరిష్కారం- సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంతో పాటు సమాచార కమిషన్ కార్యాలయం కూడా కిక్కిరిసిపోయేది. ఆ పరీక్షలకు సంబంధించి కొన్ని వందలమంది అభ్యర్థులు అనేక సందేహాలతో సమాచారహక్కు చట్టం కింద సమాచారం కోరుతూ దరఖాస్తుచేసి, సమాచారం ఇవ్వలేదని కమిషన్‌ను ఆశ్రయించేవారు. ప్రతి కేసుకు సమాచార కమిషన్ వద్దకు వచ్చి సమాధానం చెప్పడం కన్నా సమాచారం మొత్తం వెబ్‌సైట్‌లో ఉంచడం మంచిదని పబ్లిక్ సర్వీ స్ కమిషన్ నిర్ణయించి అమలుచేసింది. అప్పటి నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించి పిటిషన్లు పూర్తిగా తగ్గిపోయాయి. సమాచారం నెట్లో అందుబాటులో ఉన్నప్పుడు ఏ అభ్యర్థి అయినా సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగి రోజుల తరబడి ఎందుకు నిరీక్షిస్తారు. సమాచారం ఇవ్వడం అనేది తమకు అదనపు భారంగా మారిందని భావించడంకన్నా సమాచారం మొత్తం నెట్‌లో ప్రజలకు అందుబాటు లో ఉంచేట్టు చేస్తే అధికారులకు భారం తగ్గడమే కాకుండా అవసరమైన వారికీ సమాచారం అందుబాటులో ఉంటుంది.

నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్ నగరం నుంచి గ్రామానికి ఫోన్ చేసుకోవాలంటే ట్రంక్ కాల్ బుక్‌చేసి టెలిఫోన్ ఎక్స్‌ంజ్‌లో గం టల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది . మరిప్పుడు అమెరికాలో ఉండే పిల్ల లు హైదరాబాద్‌లో ఉండే అమ్మతో వంటల గురించి కూడా క్షణాల్లో సలహాలు తీసుకొంటున్నారు. సాంకేతిక విప్లవం సమాచారం ఇచ్చిపు చ్చుకోవడంలో ఇంత మార్పు తెచ్చినప్పుడు ప్రభుత్వాధికారులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి . వేధించే విధంగా సమాచారం కోరుతున్న కేసులు కూడా చాలానే కనిపిస్తున్నాయి. అంతమాత్రాన చట్టం కల్పించిన హక్కును కాదనలేరు.విద్యాశాఖకు సంబంధించి తరుచుగా ఒకేరకమైన సమాచారం కోరుతుంటారు. జిల్లా/మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల పేర్లు? వాటి లో గుర్తింపున్న పాఠశాలలు గుర్తింపులేని పాఠశాలలు వాటిపేర్లు, ఆటస్థలం, ఉపాధ్యాయులు, ఇతర సౌకర్యాలు వాటి వివరాలు అడుగుతుంటారు. ప్రతి జిల్లా విద్యా శాఖాధికారికి ఇలాంటి ప్రశ్నలతో కొన్ని వందల దరఖాస్తులు వస్తుంటాయి. వీటిలో కొన్ని నిజంగా సమాచారం తెలుసుకోవడానికి వస్తుంటాయి. ప్రైవేట్ పాఠశాలలతో ఏవో వివాదాల వల్ల సమాచారం కోరేవారు కొందరు. ఎవరు ఏ ఉద్దేశంతో సమాచారం కోరినా సమాచారం ఇవ్వడం అధికారుల బాధ్యత.కొన్ని వందల దరఖాస్తుల్లో ఒకేరకమైన సమాచారం కోరుతున్నప్పుడు ఆ అధికారులు తమ దృష్టి మొత్తం వీటికి సమాధానాలు పంపడంలోనే కేంద్రీకరించడం కన్నా ఆ సమాచారం మొత్తం వెబ్‌సైట్‌లో ఉంచడం మంచి ది. యూజీసీ గుర్తింపు పొందిన విద్యాలయాల జాబితాను తమ వెబ్‌సై ట్‌లో ఉంచుతున్నది. అదే తరహాలో విద్యాశాఖ కూడా జిల్లాలవారీగా ప్రభుత్వ పాఠశాలలు, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల పేర్లు, ఆ పాఠశాలలకు సంబంధించి తమ వద్ద ఉండే ఇతర సమాచారం వెబ్‌సై ట్‌లో పొందుపరిస్తే అధికారులకు భారం తగ్గుతుంది. పిటిషనర్లకు సమాచారం అందుబాటులో ఉం టుంది.

పాఠశాలకు సంబంధించి సమాచారం కోరినప్పుడు పిటిషనర్ తొలు త ప్రజా సమాచార అధికారికి దరఖాస్తు ఇస్తారు. ముప్ఫై రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే తర్వాత మొదటి అప్పిలేట్ అధికారిని సంప్రదించా లి. అక్కడా సమాచారం రాకపోతే కమిషన్‌ను సంప్రదించాలి. ఒక పిటిషన్‌పై సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి , కమిషన్ ముగ్గురు పని చేయాల్సి ఉంటుంది. అదే సమాచారాన్ని ఇంటర్‌నెట్‌లో ఉండేట్టు చేస్తే ముగ్గురి పని సులువుకావడంతో పాటు పిటిషనర్‌కు ఈ ముగ్గురి చుట్టూ తిరుగాల్సిన బాధ తప్పుతుంది.
సమాచారం వెబ్‌సైట్‌లో ఉండేట్టు చూడటంవల్ల అధికారులకు పని భారం తగ్గడం తప్ప నష్టంలేదు. ఒక్క విద్యాశాఖనే కాదు, అనేక శాఖలకు సంబంధించి కోరుతున్న సమాచారం ఇదేవిధంగా ఉంటుంది. ఒకే రకమైన సమాచారం అడుగుతుంటారు. ఆయా శాఖలు ఆ సమాచారా న్ని ఇంటర్‌నెట్‌లో ఉంచి తమ పనిభారాన్ని తగ్గించుకోవచ్చు. తృతీయ పక్షానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం అయితే సెక్షన్-11 ప్రకా రం ఆ వ్యక్తి అనుమతి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమాచారం కానప్పుడు నెట్‌లో అందుబాటులో ఉంచడమే మేలు.
Buddamurali 
2005లో సమాచారహక్కు చట్టం వచ్చింది. చట్టం అమల్లోకి వచ్చిన 120 రోజుల్లో అధికార యంత్రాంగం స్వచ్ఛందంగానే తన వద్ద ఉన్న రికార్డులను, ఉద్యోగులు, విధులవంటి పలు అంశాల సమాచారం ప్రచురించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని చట్టం చెబుతున్నది. తమ వద్ద ఉన్న అన్ని రికార్డులను సహేతుకమైన కాలపరిమితిలో ఇంటర్‌నె ట్లో అందుబాటులో ఉంచాలని చట్టం చెబుతున్నది. సమాచారం పొం దడం కోసం ప్రజలు వీలైనంత తక్కువగా ఆశ్రయించడం కోసం అధికార యంత్రాంగం చట్టంలో చెప్పిన విధంగా ఎవరూ కోరకముందే వీలైనంత ఎక్కువ సమాచారం ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉండాలని చట్టం చెబుతున్నది. 30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే కమిషనర్ విచారించి జరిమానా విధించవచ్చు. అయితే స్వచ్ఛందంగానే సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఇంటర్‌నెట్‌లో ఉంచాలని చట్టం చెప్పింది కానీ అలా చేయకపోతే జరిమానా గురించి ప్రస్తావన లేదు. తమ పని సులభం చేసుకోవడానికి అధికారులు తామే వీలున్నం తవరకు సమాచారాన్ని నెట్‌లో పెట్టడం మంచిది. సమాచారం ఇవ్వడం భారంగా భావించడం కన్నా అడుగకముందే సమాచారం ఇంటర్‌నెట్ లో ఉంచడం ద్వారా పని భారం తగ్గించుకోవచ్చు.తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ తాగునీటి పథకంతో పాటు ఇంటర్ నెట్ సౌకర్యం అందించనున్నట్టు ప్రకటించింది. మారుమూల గ్రామా ల్లో సైతం ఇంటర్నెట్ అందుబాటులో ఉంటున్నప్పుడు జిల్లాస్థాయి అధికారులు తమ కార్యాలయంలో ఉన్న సమాచారాన్ని ఇంటర్నెట్‌లో ఉం డేట్టు చూడటం కష్టమేమీ కాదు.
-బుద్దా మురళి (నమస్తే తెలంగాణ 24-6-2018)