20, ఆగస్టు 2018, సోమవారం

సంపద వ్రతం

హలో డ్రాలో మీ సెల్ నంబర్ లక్కీ నంబర్‌గా తేలింది. లక్ష్మీదేవి రాగిరేకులు అందరికీ రెండు వేలు మీకు డ్రాలో వచ్చింది కాబట్టి ఆరు వందలకే ఇస్తాం. డబ్బులు చెల్లించండి ఇంటికి రాగిరేకులు వచ్చేస్తాయి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అదృష్టం మిమ్ములను వరిస్తుంది.
***
మీకు ఉద్యోగ సమస్యనా? పిల్లల పెళ్లిళ్లు, వ్యాపారంలో భాగస్వామి మోసం, డబ్బు లేక ఇబ్బందులా? వీటన్నింటికీ ఒకే పరిష్కారం మా కంపెనీ రాగిరేకులు ధరించండి మీ సమస్యలన్నీ చిటికెలు పరిష్కారం అవుతాయి.
ఇలాంటి ప్రకటనలు రోజూ టీవిల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఈ మధ్య మానసిక సమస్యలు పెరగడంతో జనంలో భక్త్భివం కూడా పెరిగింది. ఆధ్యాత్మిక ఉపన్యాసాల కోసం భక్తి చానల్స్‌ను చూస్తుంటే మధ్యలో ఇలాంటి వారి ప్రకటనలకు కొదవ ఉండదు. నరేంద్ర మోదీ మొదలుకుని చాలా మంది ప్రముఖ నాయకుల ఫొటోలు చూపిస్తూ వీరి పూజల ఫలంగానే వారికి అధికారం దక్కిందన్నట్టు చెబుతారు. వీరి యంత్రాలు వల్లనే అంబానీ అంతటి వాడు అయ్యాడంటారు? నిజంగా వీరి యంత్రాలు అంత శక్తివంతమైనవా? వీరు తయారు చేసే ఆ రాగిముక్కలకే అంత శక్తి ఉంటే మోదీకి ఇవ్వడం ఎందుకు వీళ్లే ధరించి ప్రధానమంత్రి అయ్యేవాళ్లు. ఆ రాగిరేకుకు అంత శక్తి ఉంటే అంబానీకి ఆరువందలకు అమ్ముకోవడం ఎందుకు ఇంట్లో పెట్టుకుంటే వీళ్లే సంపన్నులు అయ్యే వాళ్లు కదా? కొంత మంది ఉద్యోగులను నియమించుకుని ఇంటింటికి ఫోన్ చేసి రాగిరేకులు అమ్ముకొని సంపాదించడం ఎందుకు, ఆ రేకులు ఇంట్లో తగిలించుకుంటే సరిపోతుంది కదా? రూపాయి విలువ చేసే రాగిరేకులను ఆరువందల రూపాయలకు అంటగట్టే వ్యాపారులు బాగుపడతారేమో కానీ రేకులు కొన్న వాళ్లు బాగుపడరు. పైగా ఆ రేకుల కోసం పెట్టిన డబ్బులు నష్టం.
***
ఇలాంటి రాగిరేకుల అమ్మకాలు, అదృష్టాలు, వ్రతాల గురించి మిత్రుల చర్చల్లో ఒకరు లక్ష్మీదేవి వ్రతం గురించి చెప్పారు. ఆ వ్రతం దీక్షతో ఆచరిస్తే డబ్బుకు సంపన్నులు ఎలా అవుతారో ఒకరు వివరించారు. ఆ వ్రత విధానం వింటే మీరు కూడా నిజమే అది పని చేస్తుంది అని ఒప్పుకోక తప్పదు.
ఒకవైపు రాగిరేకులు, వ్రతాలు ఏవీ పని చేయవు. అంటూనే మరోవైపు లక్ష్మీదేవి వ్రతం పని చేస్తుందని, ప్రభావం ఉంటుందని, సంపన్నులు అవుతారని చెప్పడం డబుల్ స్టాండర్డ్ అనిపించవచ్చు కానీ వాస్తవం ఆ వ్రతం పని చేస్తుంది అనే నమ్మకం నాకుంది.
ఇంట్లో పూజా మందిరంలో ఒక బిందెను పెట్టి లక్ష్మీదేవిని పూజించి రోజుకు ఒక రూపాయి నాణెం ఆ బిందెలో వేయాలి. ఒకేసారి బిందె నిండా నాణాలు వేయవద్దు. రోజుకు ఒక నాణెం మాత్రమే వేయాలి. ఇదీ ఆ వ్రతంలో ప్రధానమైన షరతు. బిందె పూర్తిగా నిండేందుకు ఏళ్లు పడుతుంది. అయితే బిందెలో నాణాలు క్రమంగా పెరుగుతూ ఉన్నా కొద్ది ఆర్థిక పరిస్థితిలో మార్పు సష్టంగా కనిపిస్తుంది. స్థూలంగా ఆ వ్రతాన్ని ఆచరించడం గురించి మిత్రుడు చెప్పిన విధానం.
మంత్రించిన రాగిరేకులు పని చేయనప్పుడు లక్ష్మీదేవి బిందె వ్రతం ఎలా పని చేస్తుంది? అని ప్రశ్నిస్తే, జాగ్రత్తగా ఆలోచిస్తే పని చేసి తీరుతుంది.
రాగిరేకులు కొనడానికి డబ్బులు ఖర్చు చేయాలి. ఈ వ్రతంలో ఇతరులకు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. బిందె ఇంట్లోనే ఉంటుంది. బిందెలో వేసిన నాణాలు ఇంట్లోనే ఉంటాయి. ఇక్కడ నష్టపోయేదేమీ ఉండదు.
మరి ఈ వ్రతం ఎలా పని చేస్తుంది? అంటే ...
ఒకే చోట ఉద్యోగం, ఒక జీతం పొందేవారి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. ఒక తండ్రికి ఐదుగురు సంతానం అనుకుంటే పెద్దయ్యాక ఐదుగురి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. తండ్రి పిల్లలందరికీ ఒకే విధమైన సౌకర్యాలు కల్పించినా పిల్లలందరి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. వారి ఆర్థిక పరిస్థితికి వారి ఆలోచనా ధోరణి ప్రధాన కారణం. ఒకే విధమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థికంగా బాగుపడదాం ఆనే ఆలోచనతో ఉన్న వారు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవడు కష్టపడతాడు ఉన్నదాంట్లో సుఖపడదాం అనే ఆలోచన ఉన్నవారు దానికి అనుగుణంగానే సినిమాలు, యాత్రలు అంటూ ఉన్నదాంటో సంతృప్తి పడుతూ జీవిస్తారు.
ఒకరు సంపన్నులుగా మారినా, పేదవారిగా జీవిస్తున్నా దానిలో ప్రధాన పాత్ర వారి ఆలోచనా ధోరణే. ఆలోచనా ధోరణే మన జీవితంపై ప్రభావం చూపుతుంది.
ఇక లక్ష్మీదేవి వ్రతం విషయానికి వస్తే, మంత్రాలకు చింతకాయలు రాలవు అనేది ఏ మంత్రానికైనా వర్తిస్తుంది. కానీ ఇక్కడ చింతకాయలు రాలుతాయి. మంత్రాలకు కాదు ఆలోచనలకు.
సంపన్నుడిని కావాలి, ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలి ఆనే ఆలోచనతో వ్రతం ప్రారంభిస్తారు. బిందెలో రోజూ ఒక రూపాయి వేస్తారు. ఆ రూపాయి పిల్లలు పెట్టదు మనం బిందెలో ఎన్ని రూపాయలు వేస్తే అనే్న ఉంటాయి. కానీ రోజుకో నాణెం వేయడం వల్ల సంపన్నులం కావాలి అనే ఆలోచన రోజు రోజుకు మనసులో బలపడుతుంది. దానికి తగ్గ కార్యాచరణ చేపడతాం. తొలుత డబ్బును వృథా చేసే ఆలోచన తగ్గుతుంది. తరువాత డబ్బు డబ్బును సంపాదిస్తుందనే విషయం తెలిసి సంపాదించింది ఇనె్వస్ట్ చేయాలనే ఆలోచన వస్తుంది. డబ్బు సంపాదించాలనే ఆలోచన వస్తుంది. క్రమంగా సంపదకు సంబంధించిన పాజిటివ్ ఆలోచనలు చుట్టు ముడతాయి. బిందెలో ఒక్కో రూపాయి పెరుగుతుంటుంది. మనసులో సంపదకు సంబంధించిన ఒక్కో ఆలోచన రూపుదిద్దుకుంటుంది. ఇలాంటి వ్రతం చేసేవారు డబ్బు వృథా చేయమని చెప్పినా చేయరు. వారికి సంపద విలువ తెలుసు.సంపదకు సంబంధించి సరైన ఆలోచన, డబ్బుకు ఉండే విలువ గ్రహించడం వంటి ఆలోచనలు ఈ వ్రతం పుణ్యమా ఆని మనసులో స్థిరపడతాయి. ఆలోచనలే మనిషిని సంపన్నుడిగా మారుస్తాయి. ఆ ఆలోచనలకు ఈ వ్రతం దోహదం చేస్తుంది.
డబ్బును వృధా చేసుకుని, మోసగాళ్లను మేపే వ్రతాల కన్నా మన ఇంట్లోనే మన డబ్బు ఉండడంతో పాటు మనకు డబ్బు విలువ నేర్పించే లక్ష్మీదేవి వ్రతం ఆచరణ యోగ్యమైనదే..
-బి.మురళి(30-7-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం