19, జులై 2023, బుధవారం

దేశంలోని 16లో 15 మంది ప్రముఖ జ్యోతిష్యులు బాబే గెలుస్తాడని చెప్పారు.... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -75

దేశంలోని 16లో 15 మంది ప్రముఖ జ్యోతిష్యులు బాబే గెలుస్తాడని చెప్పారు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -75 ------------------------------------- తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , దేశంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు . పత్రికలు చదివే అలవాటు , కొంత రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఈజీగానే గెస్ చేసి చెప్పవచ్చు . రిపోర్టర్ గెస్ చేసి చెబితే వంద శాతం నిజం అయినా రూపాయి కూడా జీతం పెరగదు . అదే ఓ జ్యోతిష్యుడు చెబితే , అది ముందుగా విడియోలోనో , పత్రికలోనో రికార్డ్ అయి ఉంటే ఫలితాలు వచ్చాక ఆ వీడియోలు చూపి నేను ముందే చెప్పాను అని ఓ వీడియో రిలీజ్ చేస్తే అతని గిరాకీ పెరుగుతుంది , ఫీజు పెరుగుతుంది . ఒక్క వేణు స్వామి అనే కాదు రాజకీయ జోస్యాలు చెప్పే స్వాములు అంతా ఇంతే . అంచనా నిజం కావడం తప్ప ఇందులో ప్రత్యేక శక్తులు అంటూ ఏమీ లేవు , ఉండవు . ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన ప్రధానులు పివి నరసింహారావు , మన్మోహన్ సింగ్ ల కంటే సంస్కరణలపై ఎక్కువ ప్రచారం పొందింది చంద్రబాబు నాయుడు . పివి ప్రధానిగా దిగిపోయి బాబు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బేగంపేట రామానంద తీర్ధ ట్రస్ట్ లో ఓ కార్యక్రమం . బాబు కోసం పివి నిరీక్షించడం చూసి రాజకీయాల్లో ఇంతే అనిపించింది . ఆ కార్యక్రమంలో బాబు ఆర్థిక సంస్కరణలు , ట్రిలియన్ , మిలియన్ లు అంటూ చెబితే , పివి వాటి గురించి తనకు అంతగా తెలియదు అన్నారు . ఇంగ్లీష్ మీడియా బాబును ముద్దుగా మీడియా డార్లింగ్ అంటూ పిలిచేది . దేశ వ్యాప్తంగా మీడియాలో ప్రచారానికి బాబు తీవ్రంగా కృషి చేసేవారు . సంక్షేమ పథకాలు , రైతులు , వ్యవసాయం , ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు వంటి అంశాలు ఇంగ్లీష్ మీడియాకు బోరింగ్ అంశాలు . బాబు చెప్పే ఐటీ కబుర్లు , ఉచితాల రద్దు , సబ్సిడీ బియ్యం ధర పెంపు, ప్రైవేటీకరణ వంటి నిర్ణయాలకు జాతీయ మీడియాలో సైతం మంచి అనుకూల ప్రచారం లభించేది . దేశం లో ఏ రాష్ట్రంలో ఉన్న జ్యోతిష్యుడు ఐనా ఒకటే కదా ? పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా రాజకీయ జ్యోతిష్యం చెబుతారు . 2004 ఎన్నికల ముందు ఇండియా టుడే వారు ఓ ప్రయోగం చేశారు . బహుశా వాళ్ళు ఇంగ్లీష్ ఇండియా టుడే కోసం ఈ ప్రయోగం చేసి తెలుగు ఇండియా టుడే లో కూడా ప్రచురించి ఉంటారు . తెలుగు ఇండియా టుడే లో చూశాను . దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రముఖ జ్యోతిష్యులతో 2004 లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అని అడిగారు . 16 మందిలో 15 మంది దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ జ్యోతిష్యులు చంద్రబాబు జాతకం అద్భుతంగ ఉందని , బాబే మళ్ళీ బ్రహ్మాండంగా గెలుస్తాడు అని జ్యోతిష్యం చెప్పారు . ఆ ప్రముఖ జోతిష్యుని పేరు , వారు ఏ రాష్ట్రానికి చెందిన వారు , అంతకు ముందు వారు చెప్పిన గొప్ప గొప్ప జ్యోతిష్యాలు కూడా ఆ వ్యాసంలో పేర్కొన్నారు . 16 మందిలో ఒకే ఒక్కరు బాబు గెలువరు , ఓడిపోతారు అని జ్యోతిష్యం చెప్పారు . మిగిలిన వారు నిజమైన జ్యోతిష్యులు కాదు వీరు ఒక్కరే నిజమైన వారు అని అపోహ అవసరం లేదు . బాబు ఓడిపోతాడు అని చెప్పిన ఏకైక జ్యోతిష్యులు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు . అప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం , ఆ సమయంలో కమ్యూనిస్ట్ లు బాబును తీవ్రంగా వ్యతిరేకించారు . సహజంగా బెంగాల్ కమ్యూనిస్ట్ మీడియా లో సైతం బాబు విధానాల పట్ల వ్యతిరేక వార్తలు సహజం . ఆ ప్రభావం తో బాబు ఓడిపోతారు అని బెంగాల్ జ్యోతిష్యులు చెప్పారు . **** అదే సమయంలో నేను ఏకంగా బాబుకే చెప్పాను ఈ సారి మీరు ఓడిపోతారు అని ... రోడ్డు మీద ఉన్న వారితో మాట్లాడిన తరువాత ఓటమి ఖాయం అని గట్టిగా అనుకున్నా .. రోడ్డు మీద చిలక జోష్యం వాడితో కాదు .. రోడ్డు మీద వ్యాపారం చేసే సామాన్యుల మాటలు విన్నాక ఓటమి ఖాయం అనిపించింది . . గ్రామాల్లో బస్టాండ్ లో సామాన్యులు , కూరగాయల వ్యాపారాలు , ఆర్డనరీ బస్సుల్లో ప్రయాణికులు , మాములు ఇరానీ హోటల్స్ లో వాళ్ళు మాట్లాడుకున్నది వినాలి . మహా మహా మీడియాలో మాట్లాడే విశ్లేషకుల మాటలు విని ఏర్పరచుకునే అభిప్రాయం కన్నా వీరి మాటలు విని ఏర్పరచుకునే అభిప్రాయం ఫలితాలను తేలుస్తుంది . **** 2004 ఎన్నికలకు ముందు బాబు ఇంట్లో బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ . టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఏఎం రాధా కృష్ణ ఉండేవారు . ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యాక సార్ మీతో మాట్లాడుతాడట ఆ గదిలో ఉండమన్నారు అంటే .. ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యాక రాధాకృష్ణ చూపిన గదిలో కూర్చున్నా . కొద్ది సేపటి తరువాత బాబు వచ్చి మాట్లాడితే ఈ సారి మీరు ఓడిపోయారు , ఎలా ఓడిపోయారో , ఎందుకు ఓడిపోతున్నారో వివరంగా చెప్పాను . ఎన్నికల ముందు పూజారిని కూడా హెలికాఫ్టర్ లో తీసుకువెళ్లి దేవాదుల ప్రాజెక్ట్ శంకుస్థాపన పూజ చేశారు . ఇలాంటివి జనం నమ్మరు . మీడియా ప్రచారం తప్ప గ్రామీణుల్లో , సామాన్యుల్లో అనుకూలత లేదు అని రోడ్డు మీద పండ్లు అమ్ముకునేవారు , ఇరానీ హోటల్ లో సామాన్యులు మాట్లాడిన మాటలు బాబుకు చెప్పాను . లేదు ఈ సారి గెలుస్తాం, గెలిచాక తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తాను అని బాబు చెప్పుకొచ్చారు . **** అడిగిన వారికి , అడగని వారికి మాత్రమే బాబు ఎందుకు ఓడిపోతారో చెప్పేవాడిని . అంతకు ముందే అమెరికా అధ్యక్షుడు క్లింటన్ హైదరాబాద్ వచ్చి వెళ్లారు . బాబుతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు . ఆంధ్ర భూమిలో డెస్క్ ఇంచార్జ్ బుద్ధవరపు రాజేశ్వర ప్రసాద్ అని ఉండేవారు . బాబు ఎలా ఓడిపోతారో చెబితే అతనికి నచ్చలేదు . చివరగా నీకు అమెరికా అధ్యక్షుడు క్లింటన్ కన్నా ఎక్కువ తెలుసా? క్లింటన్ మెచ్చుకుంటే నువ్వేమో ఓడిపోతాడు అంటున్నావు అని ప్రశ్న సంధించాడు . క్లింటన్అ కు తెలిసినట్టుగా అమెరికా గురించి నాకు సముద్రంలో నీటి చుక్క అంత కూడా తెలియదు . బేగం పేట విమానాశ్రయం నుంచి అత్యంత వేగంగా కారులో హై టెక్ సిటీకి వెళ్లి , తిరిగి అంతే స్పీడ్ గా విమానాశ్రయానికి , అటు నుంచి అమెరికాకు వెళ్ళిపోయిన క్లింటన్ కు ఏం తెలుస్తుంది ఇక్కడ సామాన్య ఓటరు మనసులో ఏముందో ? క్లింటన్ కు తెలియదు సామాన్యుడి గురించి సామాన్యుడికే తెలుస్తుంది అని బదులిచ్చాను . **** అలిపిరి లో నక్సల్స్ దాడి వల్ల సానుభూతి తో గెలుస్తానని భావించినా ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది . కాంగ్రెస్ , తెరాస కూటమి విజయం సాధించింది . దేశంలోని 16 మంది ప్రఖ్యాత జ్యోతిష్యుల్లో 15 మంది చెప్పిన జ్యోతిష్యం అబద్దం అయిందని ఇండియా టుడే వాళ్ళు రాయలేదు . మేం చెప్పింది నిజం కాలేదు అని ఆ జ్యోతిష్యులు ప్రకటించలేదు . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం