14, జులై 2023, శుక్రవారం

వై యస్ ఆర్ కు తలపాగా - రేణుకా చౌదరి తలపై క్యాప్ లో ఫ్యాన్ .. అధికారమనే శక్తే నడిపిస్తుంది అన్నాను . -- జర్నలిస్ట్ జ్ఞాపకాలు -72

వై యస్ ఆర్ కు తలపాగా - రేణుకా చౌదరి తలపై క్యాప్ లో ఫ్యాన్ అధికారమనే శక్తే నడిపిస్తుంది అన్నాను జర్నలిస్ట్ జ్ఞాపకాలు -72 ---------------------------------------- ఎన్టీఆర్ వద్ద ఉన్నప్పుడు నేను ఎన్నో చూశాను . వై యస్ రాజశేఖర్ రెడ్డికి చెప్పాను ఇది సరైన సమయం కాదు ఇప్పుడే పాద యాత్ర వద్దు . ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పాను. కానీ ఆయన వినలేదు . - ఇది పర్వత నేని ఉపేంద్ర చెప్పిన మాట . మెదక్ జిల్లా జోగిపేట ప్రాంతంలో వై యస్ ఆర్ పాద యాత్ర సాగుతున్నప్పుడు పిచ్చాపాటిగా మాట్లాడుతుంటే ఉపేంద్ర ఈ మాట చెప్పారు . ఉపేంద్ర ఆ మాట చెబుతుంటే ఇతనే నా ఒకప్పుడు టీడీపీలో నంబర్ టూ అనిపించింది . ఎన్టీఆర్ ముఖ్యంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పుతుంటే , రాజ్యసభ సభ్యునిగా ఉపేంద్ర ఢిల్లీలో చక్రం తిప్పేవారు . ఒక రకంగా ఆయనది దాదాపు నంబర్ 2 పవర్ సెంటర్ . తరువాత కాంగ్రెస్ లో చేరారు . మెదక్ జిల్లాలో వైయస్ ఆర్ పాదయాత్ర కవర్ చేయడానికి వెళ్ళాను . పాదయాత్ర జరుగుతున్న కాలం లో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ఎండలు . ఆ సమయంలోనే తొలిసారిగా తల పై క్యాప్ లో ఫ్యాన్ ఉండడం చూశాం . రేణుకా చౌదరి తలపై క్యాప్ దానిలో ఫ్యాన్ ధరించి ప్రత్యేకంగా కనిపించడం మీడియాలో ఫొటోతో మంచి ప్రచారం లభించింది . ఆ సమయంలో కాంగ్రెస్ శాసన సభా పక్షం కార్యాలయంలో రిపోర్టర్ లు అందరూ ఉంటే కెవిపి రామచంద్రరావు ఓ సలహా అడిగారు . ఎండలు బాగా ఉన్నాయి , ఫ్యాన్ ఉన్న క్యాప్ ధరిస్తే ఎలా ఉంటుంది అని .. ఫ్యాన్ ఉన్న క్యాప్ ధరిస్తే బాగుంటుంది అని ఒకరిద్దరి సలహా . ఆ సమయంలో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ఎండలు , ఇంట్లో నుంచి బయట కాలు పెట్టలేని పరిస్థితి . అందరూ ఈ ఎండలు చూసి వైయస్ ఆర్ ఎలా నడుస్తున్నాడో అనుకుంటున్నారు ... క్యాప్ , దానికో ఫ్యాన్ ఒక్క రోజు బోలెడు ప్రచారం వస్తుంది కానీ ఇప్పటి వరకు వచ్చిన సానుభూతి పోతుంది . పడే ఇబ్బంది ఏదో పడుతున్నారు అలానే కొనసాగించాలి అన్నాను . నేను ఎవరో కెవిపికి తెలిసే అవకాశం లేదు . నేను టీడీపీ బీట్ రిపోర్టర్ ను కాబట్టి.. పేరు తెలియక పోయినా ఓ రిపోర్టర్ అని తెలిసే అవకాశం ఉంది . *********** తరువాత ఫ్యాన్ ఉన్న క్యాప్ కాదు కానీ ఎండ దెబ్బ తాకకుండా పెద్ద తలపాగా చుట్టుకొని , దాన్ని నీటితో తడుపుతూ పోయారు . వైయస్ ఆర్ కు సన్నిహితంగా ఉండే రవిచంద్ పరిచయం ఉండడం వల్ల అతనితో చెప్పి ఈ పాదయాత్ర లో జోగిపేట లో వైయస్ ఆర్ ఇంటర్వ్యూ చేశాను . సరైన సమయం కాదు అనే మాటకు బదులిస్తూ కరువుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు పాదయాత్ర ద్వారా వారిని పలకరించాలి కానీ మనకు కుదిరిన సమయంలో పలకరిద్దాం అంటే ఎలా అన్నారు . ఇంత ఎండలో ఎలా నడుస్తున్నారు ? మిమ్ములను నడిపిస్తున్న శక్తి ఏమిటీ అని అడిగితే .. ప్రజలు అంటూ ఏదో చెప్పారు . మిమ్ములను నడిపిస్తున్న ఆ శక్తి ఏమిటో చెప్పాలా అని నేనే చెప్పాను . పవర్ మిమ్ములను నడిపించే శక్తి .. అధికారానికి ఆ శక్తి ఉంటుంది అదే మిమ్ములను నడిపిస్తుంది అని నా అభిప్రాయం చెబితే వై యస్ ఆర్ నవ్వారు . 2004 లో టీడీపీ ఓటమి ఖాయం అని తేలిపోయింది . పాదయాత్రతో మీకు కాంగ్రెస్ లో ఎదురు లేకుండా పోతుంది అని నా అభిప్రాయం నేను చెప్పాను . ప్రశ్నకు వైయస్ నుంచి ఏం సమాధానం వస్తుందో నాకు తెలుసు నిజానికి నా ఈ అభిప్రాయం చెప్పడానికే ఆ ప్రశ్న అడిగాను . అలిపిరిలో తనపై నక్సల్స్ హత్యా యత్నం చేయడం తో సానుభూతి పై ఆశలు పెట్టుకొని చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు . ఉపేంద్ర చెప్పినా వినకుండా సరైన సమయంలోనే వైయస్ ఆర్ పాదయాత్ర చేయడం కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చింది . మేం ఎన్నికల కోసం పాదయాత్ర చేయడం లేదు అని చెప్పినట్టు అయింది , ముందస్తు వల్ల పాదయాత్ర ఎన్నికలకు ఉపయోగపడింది . **** టీడీపీలో ఢిల్లీలో అధికార కేంద్రంగా చాలా కాలం చక్రం తిప్పిన ఉపేంద్ర మారిన పరిస్థితిని జీర్ణం చేసుకోలేక పోయారు . ఆయన ఒక్కరే కాదు రాజకీయాల్లో చాలా మంది ఒకప్పుడు చక్రం తిప్పి ఉంటారు . అది శాశ్వతం అనుకుంటారు . . ఉపేంద్ర కాంగ్రెస్ లో చేరినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు . ప్రాధాన్యత ఇవ్వలేదు . కాంగ్రెస్ లో తన ప్రభావం చూపాలి అని ప్రయత్నించినా సాధ్యం కాలేదు . 99లో స్వల్ప తేడాతో టీడీపీ గెలిచింది . విద్యుత్ ఉద్యమం , తెలంగాణ ఉద్యమం వల్ల టీడీపీ ఓటమి ఖాయం అని తేలిపోయింది . ఎర్రటి ఎండలో ధైర్యంగా పాదయాత చేసిన వైయస్ ఆర్ కు కాంగ్రెస్ లో ఎదురు లేకుండా పోయింది . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం