10, నవంబర్ 2011, గురువారం

ఇంకా మంచికాలం ముందుంది అంటున్న కిరణ్ ... రాజకీయ వ్యంగ్యం


ఉందిలే మంచి కాలం...


కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోటో. దానితో పోటీపడుతున్న స్కీముల జాబితా... వాటిని తలదనే్నవిధంగా ఉన్న ‘ముందున్నది మరింత మంచి కాలం’ స్లోగన్. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్న స్లోగన్ ఇది. స్లోగన్ అంటే అది వినియోగదారుల గుండెల్లోకి తూటాలా దూసుకువెళ్లాలి. స్కీములకు ఓట్లు రాలుతాయో లేదో కానీ స్లోగన్‌లకు ఓట్లు రాలితీరుతాయి. ఆ కాలంలోనే ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హఠావో స్లోగన్‌కు తలతూగే స్లోగన్ భారత రాజకీయాల్లో ఇప్పటి వరకు రాలేదు. రాజకీయ బిజినెస్‌లో గరీబీ హాఠావో టాప్ వన్‌గా నిలిస్తే, ఎన్‌డిఏ అధికారంలో ఉన్నప్పుడు బిజెపి వారిచ్చిన భారత్ వెలిగిపోతోంది స్లోగన్‌ను చివర్లో నిలుస్తుంది. ఈ నినాదాన్ని భారీ బహుళ జాతి కంపెనీలకు ప్రకటనలు రూపొందించే సంస్థ రూపొందించిందని అధికారంలో ఉన్నప్పుడు అద్వానీ ఘనంగా చెప్పుకున్నారు. రాజకీయ పక్షాలు, కార్పొరేట్ కంపెనీలు రెండూ చేసేవి బిజినెస్సే అయినా వ్యూహాలు వేరుగా ఉండాలి. రామ మందిరాన్ని వదిలేసి స్లోగన్‌లను నమ్ముకున్నందుకు దెబ్బతిన్నారు.

ఐటి, స్వర్ణాంధ్ర స్లోగన్‌లు ప్రజల హృదయాల్లో ముద్రించుకుపోయిన కాలంలో జాతకం మారిపోతుందని గ్రహించి స్లోగన్ మార్చారు. ఆయన్ని వదిలేస్తే ఇప్పుడు రాష్ట్రంలో స్లోగన్‌ను నమ్ముకున్నది కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రమే. ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎవరూ పట్టించుకోవడం లేదు, ఆయనా ఎవరినీ పట్టించుకోవడం లేదు. ఎప్పుడు రాజీనామా చేస్తారో, ఏ క్షణంలో దీక్ష చేస్తారో, ఎప్పుడు పార్టీ మారుతారో తెలియని ఎమ్మెల్యేలను నమ్ముకోవడం కన్నా స్లోగన్‌ను నమ్ముకోవడం మంచిదని ఆయన అనుకుంటున్నారు. ఏ కార్పొరేట్ కంపెనీ వారి ధర్మమో కానీ ఆయనకు భలే స్లోగన్ లభించింది. సర్వకాల సర్వావస్థల్లో ఉపయోగపడే తారకమంత్రమిది.

 ‘ముందుంది మరింత మంచి కాలం’
ఎవరికి మంచి కాలం తెలంగాణ వాదులకా? సమైక్యాంధ్ర అంటున్న సీమాంధ్ర వాదులకా? మంచి కాలం సిఎంకా? ప్రజలకా? హై కమాండ్‌కా? ఎమ్మెల్యేలకా? మంత్రులకా? ఒకే స్లోగన్ ఎవరికి అనుకూలంగా వారు అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరేం మాట్లాడినా దానికి రెండు అర్ధాలు ఉంటున్నాయి. చిదంబరం, ఆజాద్ అలా అన్నారు కాబట్టి దాని అర్ధం తెలంగాణ ఏర్పడుతుందని తెలంగాణ ఆశిస్తున్నవారు అనుకుంటే, ఆ మాటలతో తెలంగాణ రాదని తేలిపోయింది అంటూ ఆవే మాటలకు సీమాంధ్ర నాయకులు అర్ధాలు చెబుతున్నారు. రెండు అర్ధాల మాటలకే మనం ఆశ్చర్యపోతుంటే దాని అబ్బలాంటి మాటను కిరణ్‌కుమార్‌రెడ్డి కనిపెట్టేశారు.
ముందుంది మరింతమంచి  కాలం ఈ నినాదం కార్పొరేట్ ఆస్పత్రిలో చావుబతుకుల మీదున్న పేషింట్‌కు సైతం జీవం పోస్తుంది.
ముందుంది మంచి కాలం అనే నమ్మకమే లేకుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి జీవితం ఎలా సాగుతుంది? అందరూ రాజీనామాలు చేసేస్తారు, ప్రభుత్వం పడిపోతుంది, నేను రాజీనామా చేస్తాను అనే ఆలోచన ఆయన్ని చుట్టుముట్టకుండా ఉండాలంటే ముందుంది మరింత మంచి కాలం అనే మంత్రం పదే పదే వినాల్సిందే కదా!
టెలిఫోన్లు వచ్చిన కొత్తలో శ్రీదేవి బాలనటిగా బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు అంటూ టెలిఫోన్‌తో పాటలు పాడిన కాలంలో ఫోన్ మాట్లాడుతున్నట్టు ఫోటో దిగడం పెద్ద ఫ్యాషన్. ఆ తరువాత ఎక్కువగా రచయితలు పెన్ను వెళ్లతో పట్టుకుని చేతిని గవద కింద పెట్టుకుని ఆలోచిస్తున్నట్టు ఫోటోలు దిగేవారు. కవితా సంకలనాల్లో ఇలాంటి ఫోటోలు కనిపిస్తుంటాయి. అదే తరహాలో బాబు గారు కంప్యూటర్ ముందు కూర్చోని ఒక చేతితో వౌస్‌ను పట్టుకుని కంప్యూటర్‌ను చూస్తూ సీరియస్‌గా ఆలోచిస్తున్న ఫోటోలు ఇంకా మన మస్తిష్కంలో బలంగా ముద్రించుకొని ఉన్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా బాబు గారి కంప్యూటర్ ఫోటో కనిపించేది. ఆ ఫోటోలు చూశాక కంప్యూటర్‌ను కనిపెట్టింది బాబుగారే అని చాలా మందికి ఉన్నట్టే నాకూ గట్టినమ్మకం. సీన్ రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని ఎన్నికల ముందు తెలియగానే హడావుడిగా ఆ ఫోటోలు తొలగించి రైతుబాబు ఫోటోలు విడుదల చేశారు. ఫోటోలతో కాదని ఏకంగా పోలాల్లోకి దిగారు. ఐనా జనం మాత్రం ఆయన్ని ఐటిబాబుగానే తప్ప రైతుబాబుగా గుర్తించడం లేదు. ఐనా బాబు పొలాల వెంట పడి నడుస్తున్నారంటే ముందుంది మరింత మంచి కాలం అనే నమ్మకంతోనే కదా! అబినహీతో కబీ నహీ (ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు) అని టిఆర్‌ఎస్ బయటకు అంటుంటే బాబు మాత్రం ఇప్పుడు అధికారం రాకపోతే నాకు ఇక ఎప్పుడూ రాదని ముందున్న మంచి కాలాన్ని ఊహించుకుంటూ పోలాల్లో విత్తనాలు నాటుతున్నారు.

 ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలు చేయాలని మాయావతి అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామనగానే ముందుంది మరింత మంచి కాలం తెలంగాణ వచ్చేస్తుంది అని కెసిఆర్ చెబుతున్నారు. కాశీయాత్ర అనగానే ఏనుగుల వీరాస్వామిగారు డజను దశాబ్దాల క్రితం రాసిన కాశీయాత్ర గుర్తుకు వచ్చినట్టు ఎలాంటి సందర్భంలోనైనా ఓదార్పు అనగానే జగన్ గుర్తుకొస్తారు. ముందుంది మంచి కాలమనే గట్టి నమ్మకంతోనే జగన్ ఓదార్పు సాగుతోంది.
‘అవినీతిపై నేను పోరాడుతుంటే ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. మంత్రుల అవినీతిని నిరూపిస్తాను, కోర్టుకు వెళతాను, గవర్నర్‌ను కలుస్తాను అని లోకాయుక్తను కలిసి ఫిర్యాదు చేసిన తరువాత మంత్రి థింకర్‌రావు చెప్పాడు. నిరంతరం మంత్రుల అవినీతి గురించి చెబుతాడు కాబట్టి అంతా ఆయన్ని థింకర్ రావు అనే అంటారు. నిజంగా మంచి కాలం ఉందంటావా? ఉంటే తోటి మంత్రులను ఇలా నిద్రలేకుండా ఎందుకు చేస్తున్నావన్నా అని అడిగితే తమీ నాకు మంత్రి పదవి ఎలా ఇచ్చారు రోజూ సిఎల్‌పికి వచ్చి వైఎస్‌ఆర్‌ను తిడితేనే కదా! అలానే ఇప్పుడు మంత్రుల అవినీతిపై ఫిర్యాదు చేస్తే నా మనసులోని కోరిక గ్రహించి మంచి శాఖ ఇస్తారు తప్పకుండా ముందుంది మరింత మంచి కాలం అని థింకరన్న నవ్వాడు. నిజంగా మంచి కాలం ఉందా? మనకే కాదు ఉందిలే మంచి కాలం ముందుముందునా అని ఎప్పుడో సినీకవి చెప్పిన పాటలో సైతం ఇలాంటి అనుమానమే వ్యక్తమైంది