2, జూన్ 2023, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళుతున్నాను .. తెలంగాణ రాష్ట్రం తోనే తిరిగి వస్తాను కోట్ల మందికి విశ్వాసం కలిగించి .. ఆత్మహత్యలను ఆపిన ఒక్క మాట జర్నలిస్ట్ జ్ఞాపకాలు -40

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళుతున్నాను .. తెలంగాణ రాష్ట్రం తోనే తిరిగి వస్తాను కోట్ల మందికి విశ్వాసం కలిగించి .. ఆత్మహత్యలను ఆపిన ఒక్క మాట జర్నలిస్ట్ జ్ఞాపకాలు -40 ----------------------------------------------------------------------- అంతా అయ్యాక ఇప్పుడు ఇప్పుడు ఏ టుంరీలు ఏమైనా మాట్లాడవచ్చు . కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఈజీగా ఏమీ రాలేదు . ప్రతి క్షణం సస్పెన్స్ .. నరాలు తెగేంత ఉత్కంఠత ... ఏమవుతుందో తెలియని భయం .. మరో వైపు మాఫియా మీడియా ... సాధారణంగా బ్రేకింగ్ న్యూస్ లు మనకు తెలిసినవే .. బ్రేకింగ్ న్యూస్ కాకుండా అతికించే న్యూస్ ఒకే ఒక్కటి .. అది ఎంతో మంది ప్రాణాలు తీసింది .. భయపెట్టింది . ఒక్క మాట ఔను ఒకే ఒక్క మాట పోయే ప్రాణాలను నిలబెట్టింది ... మాటకు ఎంత శక్తి ఉంటుందో నిరూపించిన మాట అది . మీడియా ప్రచారం వల్ల సర్వత్రా నిరాశ ఆవహించిన సమయం అది ఆత్మ హత్యలు మళ్ళీ మొదలైన సమయం ఆ సమయంలో తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ వస్తుంది అని తాను చెప్పదలుచుకున్నది చెప్పి ... ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళుతున్నాను , తెలంగాణ రాష్ట్రం తోనే తిరిగి వస్తాను అని పిడికిలి బిగించి ఆత్మవిశ్వసం తో పలికారు . ఆ విలేఖరుల సమావేశం లో నేనూ సి డబ్ల్యూ సి నిర్ణయం అయిపోయిన తరువాత నాకు ఎప్పుడూ తెలంగాణ రాదేమో అనే అనుమానం కలుగలేదు . కానీ మీడియా ప్రచారంతో భయాలు పెంచారు . మీడియా సమావేశం ముగించి కిందకు వచ్చాక కెసిఆర్ గారికి అదే చెప్పాను .. ఆత్మ విశ్వసం తో మీరు చేసిన ప్రకటన బాగుంది . టివిల వల్ల భయం పెరిగింది . మీ ప్రకటనతో తెలంగాణ కోరుకుంటున్న వారిలో ఆత్మ విశ్వసం పెరుగుతుంది అని .... ****** 16 డిసెంబర్ 2013న రాష్ట్ర విభజన కు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లును అప్పటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు . అంతకు ముందే సి డబ్ల్యూ , సి నిర్ణయం అయిపొయింది . కేంద్ర మంత్రులం మండలి ఆమోదం అయిపొయింది . డ్రాఫ్ట్ బిల్లు రాష్ట్రపతికి పంపడం అయిపొయింది . సంప్రదాయం ప్రకారం అసెంబ్లీకి పంపించారు . అభిప్రాయం కోసమే తప్ప అసెంబ్లీ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదు . ఆంధ్ర ప్రాంత శాసన సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉండడం తెలంగాణలో తక్కువ సంఖ్య కావడం వల్ల బిల్లు వీగిపోతుంది అని ముందే తెలుసు . ఐతే అసెంబ్లీలో బిల్లు వీగిపోగానే తెలుగు మీడియా హడావుడి అంతా ఇంత కాదు . బ్రేకింగ్ న్యూస్ ల స్థానంలో టివిలు పగిలిపోయేంత శబ్దం తో ఆంధ్ర తెలంగాణ రెండింటిని జాతక బెడుతున్నట్టు చూపిస్తూ హడావుడి చేశారు . ఆ రోజు అసెంబ్లీ ముగియగానే లాబీ నుంచి బయటకు వస్తే మెట్ల వద్ద న్యాయ నిపుణులు జంధ్యాల రవి శంకర్ జర్నలిస్ట్ లతో ఇప్పుడేమవుతుంది అని చెబుతున్నారు . అసెంబ్లీ తీర్మానమే అత్యున్నతం అన్నట్టుగా సాగుతుంది ఆయన వాదన . ఎక్కువ మంది జర్నలిస్ట్ లు అదే కోరుకుంటున్నందున ఆసక్తిగా వింటున్నారు . కొంత సేపు విని నేను అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలను అతక బెట్టేస్తారా ? అని కొంత వెటకారంగా అడిగాను . అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే అడిగారు , ఆ అభిప్రాయం అనుకూలం కావచ్చు వ్యతిరేకం కావచ్చు అని కేంద్రం చెబుతున్నప్పటికీ మీడియా ప్రచారం వల్ల మరికొన్ని ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి . ఆ సమయంలోనే కెసిఆర్ సాయంత్రం తెలంగాణ భవన్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళుతున్నాను . తెలంగాణ లోనే తిరిగి వస్తాను అని అటు నుంచే ఢిల్లీ వెళ్లి .. నిజంగా తెలంగాణ సాధించిన తరువాతనే హైదరాబాద్ లో అడుగు పెట్టారు . తిరిగి వచ్చాక ఆ రోజు ఒక్క NDTV తోనే మాట్లాడారు . మాకు కాంగ్రెస్ తోనే పోటీ కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరం అయితే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని కెసిఆర్ చెప్పారు . ప్రధాన ప్రత్యర్థికే మద్దతు ఇవ్వడానికి సిద్దపడడాన్ని NDTV ఆశ్చర్యంగా చూసింది . ***** మల్లిక్ కార్టూన్ ఒకటి .. కెసిఆర్ పక్కన ఉంటే ఒక వ్యక్తి పది హేను రోజుల్లో తెలంగాణ వస్తుందట అని కిందపడి దొర్లుతూ నవ్వుతుంటాడు . మల్లిక్ కార్టూనిస్ట్ కాబట్టి తన మనసులోని అభిప్రాయాన్ని కార్టూన్ రూపం లో ప్రదర్శించారు . తెలంగాణ వస్తుంది అని కెసిఆర్ చెప్పినప్పుడు చాలా మంది నాయకులు ఇలానే ఎకసెక్కాలు ఆడేవారు . ఢిల్లీ నుంచి నాకు సిగ్నల్స్ ఉన్నాయి , తెలంగాణ ఏర్పడుతుంది అని కెసిఆర్ చెబితే చాలా మంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ భవన్ లో టవర్లు ఏమైనా ఏర్పాటు చేశారా అని జోకులేశారు . సి డబ్ల్యూ సి తొలి సమావేశం లోనే నిర్ణయం తీసుకోలేదు . అనేక సార్లు సమావేశాలు జరిగాయి . సమావేశం లో ఏ నిర్ణయం తీసుకోక పోతే తుస్సు మన్న సి డబ్ల్యూ సి సమావేశం అని కొమ్మినేని కామెంట్ గుర్తుంది . తీరా సి డబ్ల్యూ సి లో తెలంగాణ ఏర్పాటు కు నిర్ణయం తీసుకుంటే , ఎవరినీ సంప్రదించకుండా హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు అని ధ్వజమెత్తారు . **** కెసిఆర్ తో మాట్లాడితే తెలంగాణ వస్తుంది అని నమ్మకం కలుగుతుంది . బయటకు వెళ్లి ఎవరితో మాట్లాడినా తెలంగాణ రాదు అనిపిస్తోంది అని జర్నలిస్ట్ మిత్రుడు అనే వాడు . బాగ్ లింగం పల్లి వద్ద 69 ఉద్యమ కారుల సమావేశం జరిగింది . గద్దర్ పాల్గొన్నారు . తెలంగాణ వస్తుందా ? అని అడిగితే ఆంధ్ర నాయకుల లాబీ సామాన్య మైనది కాదు . రానివ్వరు అని చెప్పారు . యుద్ధ నౌకలు , అప్పుడు ఉద్యమం లో కీలక స్థానాల్లో ఉన్న నాయకులను సకల జనుల సమ్మె అప్పుడు అడిగితే రాదు అన్నట్టుగానే మాట్లాడేవారు . ఒక్క కెసిఆర్ మాత్రం ఉద్యమ సన్నాహక సమావేశాలు నుంచి చివరి వరకు తెలంగాణ వస్తుంది .. ఎలా వస్తుందో చెప్పేవారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం