7, జూన్ 2023, బుధవారం

హైదరాబాద్ లో మూడు రాష్ట్రాలు ముగ్గురు గవర్నర్లు శ్రీకృష్ణ కమిటీ నివేదిక వందేళ్లకు వస్తుంది తేల్చేసిన ఎడిటర్ బిల్లు సవరణ ప్రతిపాదనలు రామబాణం అన్న టీడీపీ జర్నలిస్ట్ జ్ఞాపకాలు -44

హైదరాబాద్ లో మూడు రాష్ట్రాలు ముగ్గురు గవర్నర్లు శ్రీకృష్ణ కమిటీ నివేదిక వందేళ్లకు వస్తుంది తేల్చేసిన ఎడిటర్ బిల్లు సవరణ ప్రతిపాదనలు రామబాణం అన్న టీడీపీ జర్నలిస్ట్ జ్ఞాపకాలు -44 ___________________________________________ ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం కార్యాలయం లోకి వెళితే శాసన సభ్యులంతా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టుగా ఉంది . నేను పదవ తరగతి పరీక్షలకు వెళుతున్నప్పుడు ఆ దృశ్యం అచ్చం అలానే ఉండేది . ఒకరు శ్రద్దగా చదువుతుంటాడు , ఇంకో విద్యార్ధి పరీక్షలో కాపీ కొట్టే విధంగా చిన్న అక్షరాలతో రాస్తుంటా డు .అలానే ఉన్న దృశ్యం వీరందరికీ మధ్యలో కూర్చొని టీడీపీ శాసన సభ్యులు దూళిపాళ నరేంద్ర సలహాలు ఇస్తున్నారు . వారి సందేహాలు తీరుస్తున్నారు . 2013 డిసెంబర్ 16న అసెంబ్లీలో రాష్ట్ర విభజన పై ముసాయిదా బిల్లు ప్రవేశపెడతారు . అంతకన్నా ముందు రోజు tdlp లో కనిపించిన సీన్ ఇది . ఏం జరుగుతుంది అని అడిగితే రామబాణం వేయబోతున్నాం అని ఉత్సాహంగా చెప్పారు . ముసాయిదా బిల్లును సభలో ప్రవేశ పెడుతున్నారు కదా ? మేం బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తున్నాం . ఎన్ని సవరణలు అయినా ప్రతిపాదించవచ్చు . ఒక్కో శాసన సభ్యుడు కనీసం వంద సవరణలు ప్రతిపాదిస్తాడు . ప్రతిపాదిస్తున్న సవరణలు రాసి అసెంబ్లీ కార్యదర్శికి ముందే ఇవ్వాలి . దానికోసం ఈ కసరత్తు . అలా ఇస్తే ఏమవుతుంది ? అని అడిగితే సవరణలు వేలలో ఉంటాయి . ప్రతిపాదించిన ప్రతి సవరణపై చర్చ జరగాల్సిందే అంటే ఆలోచించండి , ఏడాది గడిచినా చర్చ పూర్తి కాదు . ఇదే మా రామబాణం అని చెప్పుకొచ్చారు . తెలంగాణ ను అడ్డుకోవడానికి ఏ ఒక్కరు ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోలేదు . కేంద్రం లో అధికార పక్షం , ప్రధాన ప్రతిపక్షం అనుకూలంగా ఉన్నప్పుడు ఏ ప్రయత్నం ఐనా వృధానే అని చెప్పాలని ఉన్నా , అక్కడి వాతావరణం చెప్పడానికి వీలుగా లేకపోవడంతో మౌనంగా చూస్తూ ఉండిపోయాను . **** నాలుగు తెలుగు దిన పత్రికలు ఉంటే సర్క్యులేషన్ లో నాలుగవ స్థానం లో ఉన్నా ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి తెలంగాణ ను అడ్డుకోవడానికి చేయని ప్రయత్నం లేదు . లాభసాటి ప్రయత్నాలు చేశారు . లాభసాటి అంటే ఫలించే ప్రయత్నాలు అని కాదు . సమైక్యాంధ కోసం ఏదో రాయడం , దాన్ని పుస్తకంగా ప్రచురించడం , ఏదో తక్కువ జీతం తో నెట్టుకొచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగులైన తెలంగాణ జర్నలిస్ట్ లకు బుక్స్ అంటగట్టి అమ్మి పెట్టమనడం .... పర్మనెంట్ ఉద్యోగులకు వెజ్ బోర్డు సిఫారసులు అమలవుతాయి . జీతం ఎక్కువ , ఉద్యోగ భద్రత ఉంటుంది . నేను తెలంగాణ కోరుకుంటున్నాను అని ధైర్యంగా చెప్పే అవకాశం ఉంటుంది . కాంట్రాక్ట్ వాళ్లకు చాలా తక్కువ జీతం కనీసం నోరు తెరిచి తెలంగాణ కోరుకుంటున్నాను అని చెప్పే స్వేచ్ఛ ఉండదు , పైగా సమైక్యాంధ్ర కోసం రాసిన పుస్తకాలు అమ్మి పెట్టాలి . ఉద్యమ సంఘాల వార్తలు రాసే రెడ్డి అనే కుర్రాడి ఇంట్లో ఈ పుస్తకాల కట్టలు కనిపించాయి . ఓ నాయకుడు ఇతని పరిస్థితి గమనించి డబ్బు ఇచ్చి , పుస్తకాలు నీ వద్దనే ఉండనివ్వమని వదిలేశాడు . **** హైదరాబాద్ కేంద్రంగా మూడు రాష్ట్రాలు ఏర్పడతాయి అని ఒక సారి ఎడిటర్ అద్భుతంగా రాశారు . ముగ్గురు గవర్నర్లు ఉంటారని సెలవిచ్చారు . తీరా చూస్తే విభజన తరువాత రెండు రాష్ట్రాలకు చాలా కాలం ఒకరే గవర్నర్ ఉన్నారు . తెలంగాణ ఏర్పడితే చీకటి , నక్సలైటు విజృంభిస్తారు అని అందరూ రాశారు . మూడు రాష్ట్రాలు , ముగ్గురు గవర్నర్లు అనే కొత్త కోణం బాగుంది అనిపించింది . రాస్తున్నది అబద్దం అని తెలిసినప్పుడు ఆకట్టుకునే అబద్దమే రాయాలి . ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో నలుగురు రిపోర్టర్ లతో ఎర్రంనాయుడు పిచ్చాపాటి మాట్లాడుతూ తెలంగాణ రాదు అని చెబుతూ నక్సలైట్ల సమస్య , శాంతిభద్రతలు అంటూ యేవో చెప్పుకుంటూ పోతున్నారు . అవి కాదు కానీ మీకు అంతకన్నా బలమైన కారణం చెబుతాను అని అమెరికా ఒప్పుకోవడం లేదు , తెలంగాణ ఇవ్వ వద్దు అని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చింది అందుకే ఇవ్వడం లేదు అని చెప్పండి బాగుంటుంది అని చెబితే , అయన వెంటనే ఔను నిజం .. కావాలంటే మొన్న వార్త కూడా వచ్చింది అన్నారు . విదేశాల్లో పర్యటించే అమెరికా పౌరులకు అమెరికా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది . తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం గురించి పర్యాటకులకు వార్నింగ్ ఇస్తే ఆ వార్తను ప్రస్తావిస్తూ అమెరికా వద్దంటోంది అని చెప్పుకొచ్చారు . **** శ్రీకృష్ణ కమిటీ పై ఎడిటర్ సీరియస్ గా రాసిన ఆణిముత్యం లాంటి వ్యాసం ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది . .. శ్రీ కృష్ణ కమిటీ ఆంధ్ర , తెలంగాణల్లో అనేక జిల్లాల్లో పర్యటించింది . కొన్ని వేల మంది కమిటీకి స్వయంగా లేఖలు ఇచ్చారు . వేల మంది విభజన పై తమ అభిప్రాయాలు కమిటీకి మైయిల్ చేశారు . ఓ సారి తమకు ఎన్ని వినతి పత్రాలు వచ్చాయో కమిటీ ప్రకటించింది . ఎడిటర్ఎ ఓ రోజు ఎ న్ని వేల వినతి పత్రాలు , ఒక్కో వినతి పత్రంలో ఎన్ని పేజీ లు అని లెక్క తెలిస్తే లక్షల్లో వచ్చింది . ఒక పేజీ చదవడానికి ఎంత సమయం పడుతుంది . లక్షల పేజీలు చదివేందుకు ఎన్ని కోట్ల నిముషాలు , ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందో లెక్క వేసి .... ఇన్ని వినతి పత్రాలు చదివేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పి ... చదివేందుకు ఇన్ని సంవత్సరాలు పడితే ఇక నివేదిక ఎప్పుడిస్తారు , తెలంగాణ రాదు అని తేల్చేశారు . జెమినీ టివిలో కావచ్చు చర్చ . ఎడిటర్ శాస్త్రి తో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు . ఆఫీస్ లో స్టాఫ్ తో మాట్లాడినట్టు టివి చర్చలో తెలంగాణ ప్రజలెవరూ తెలంగాణ కోరుకోవడం లేదు . అది నాయకుల కోరిక మాత్రమే అంటూ చెప్పుకు పోయారు . అలా చెబితే ఆఫీస్ లో ఐతే ఔను అన్నట్టు తలాడించే వాళ్ళం . అది టివి అక్కడున్నది హరగోపాల్ .... మీరు అలా మాట్లాడడం తప్పు , తెలంగాణ ఇవ్వ వద్దు సమైక్యాంధ్ర గానే ఉంచాలి అని మీ వాదన వినిపించవచ్చు తప్పు లేదు కానీ , తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోరుకోవడం లేదు అని వారి తరపున మీరెలా చెబుతారు . వారి కోరిక చెప్పుకొనే హక్కు కూడా వారికి ఇవ్వరా అని జూనియర్ రిపోర్టర్ కు చూపినట్టు చెప్పారు . మూడు రాష్ట్రాలు , ముగ్గురు గవర్నర్ లు , రాజ్యాంగ సంక్షోభం లక్షల పే జీ ల నివేదికలు, అమెరికా ఆగ్రహం ,,నక్సలైట్లు , చీకటి .. ఊహించినట్టు ఏమీ లేవు . చక్కగా రెండు రాష్ట్రాలు , ఇద్దరు గవర్నర్లు మాత్రమే ఉన్నారు . ఇద్దరు ముఖ్యమంత్రులు తమ పని తాము చేసుకుంటున్నారు .

1 కామెంట్‌:

  1. >> చక్కగా రెండు రాష్ట్రాలు , ఇద్దరు గవర్నర్లు మాత్రమే ఉన్నారు . ఇద్దరు ముఖ్యమంత్రులు తమ పని తాము చేసుకుంటున్నారు .
    చక్కగా చెప్పారు! చక్కగా రెండు రాష్ట్రాలు అన్నారే, అవి నిజంగానే చక్కగానే ఉన్నాయా? రెండుచోట్లా ముఖ్యమంత్రులు తమ పని తాము చేసుకుంటున్నారా చక్కగానే? ఇవి ఆలోచనీయమైన అంశాలు కావంటారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వలన ఎవరికి ఏమి లాభాలూ ఎవరికి ఏమి నష్టాలూ వచ్చాయా అన్న పద్దులు అటుంచితే, జాతీయస్థాయిలో తెలుగువాళ్ళు ఎన్నడూ లేనంతగా లోకువ అయ్యారన్నది నిజమా అబధ్ధమా అన్నది కూడా ఆలోచించి చెప్పండి దయచేసి.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం