27, జూన్ 2023, మంగళవారం

జనం కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ .... అన్న పార్టీ నుంచి గెలిచింది వదిన ఒక్కరే .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -58

జనం కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ .... అన్న పార్టీ నుంచి గెలిచింది వదిన ఒక్కరే జర్నలిస్ట్ జ్ఞాపకాలు -58 ---------------------------------- బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసం . అక్కడ లక్ష్మీ పార్వతి నాయకత్వంలో పొలిట్ బ్యూరో తో పాటు కీలక నేతల ముఖ్య సమావేశం జరుగుతోంది . మీడియా ఆ ఇంటి ఆవరణలో బయటే ఉంది . లోపల మాట్లాడే మాటలు కొంచెం వినిపిస్తున్నాయి . అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన నాయకుడు ఒకరు ఎన్నికల వ్యూహాలు , ఎలా విజయం సాధించాలి అంటూ ఏవేవో చెప్పుకుంటూ పోతున్నారు . అది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సమావేశం . ఆ కొత్త పార్టీ తరపున అప్పటి వరకు గెలిచింది అతనొక్కడే కాబట్టి గెలుపు వ్యూహాలు చెబుతున్నాడు . ఎలాంటి పార్టీ ఎలా అయిపొయింది అనిపించింది . దేశ రాజకీయాలను శాసించే నేషనల్ ఫ్రంట్ చైర్ మెన్ , ఓటి చేత్తో కాంగ్రెస్ ను ఓడించి సీఎం అయిన ఎన్టీఆర్ నివాసం . జాతీయ నాయకులు , రాష్ట్రనాయకులు పడిగాపులు కాసిన ఇల్లు . ఎలా అయిపొయింది? . అనిపించింది . ఏదీ శాశ్వతం కాదు ... ****** సినిమా రంగాన్ని వదిలి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు జనం తండోప తండాలుగా ఆయన వెంట నడిచారు . ఇసుక వేస్తే రాలనంత జనం అనే వార్త ఎన్టీఆర్ సభలకు సర్వ సాధారణం అయింది . ముందుగా ప్రకటించిన ప్రాంతానికి 24 గంటలు ఆలస్యం అయినా జనం అలానే ఎదురు చూస్తూ రోడ్డు మీదనే ఉండిపోయిన సందర్భాలు అనేకం . అలాంటి ఎన్టీఆర్ జనం కోసం చాలా సేపు ఎదురు చూశారు . ఎదురు చూసినా జనం రాకపోవడం తో చైతన్య రథం లోనే భోజనం కానిచ్చారు . అప్పటికి చాలా కొద్ది మంది వస్తే వారిని ఉద్దేశించి మాట్లాడారు . ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారం లోకి వచ్చారు . ఇది అందరికీ తెలిసిందే . ఎన్టీఆర్ ఒకటే పార్టీ పెట్టలేదు . రెండు పార్టీలు పెట్టారు . అన్నగారు పెట్టిన రెండో పార్టీ నుంచి వదిన ఒక్కరే గెలవడం విశేషం . ఎన్టీఆర్ గురించి రాసేప్పుడు , చెప్పేప్పుడు తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం గురించే చెబుతారు కానీ , అట్టర్ ప్లాప్ అయిన రెండో పార్టీ గురించి చెప్పరు . జనం కోసం ఎన్టీఆర్ ఎదురు చూడడమే కాదు స్వయంగా ఎన్టీఆర్ ను జనం ఓడించారు . ఈ రెండూ తెలంగాణ లోనే జరిగాయి . **** ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వరరావు దివిసీమ తుఫాన్ బాధితుల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించేప్పుడు తొలిసారి సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ లో దర్గా వద్ద బట్టల షాప్ లో విరాళం అడుగుతున్నప్పుడు చూశా . . 82లో టీడీపీ పెట్టినప్పుడు రామకృష్ణ స్టూడియోలో జిల్లాల వారీగా సమావేశాలు. నేను పదవ తరగతి విద్యార్థిని కరీంనగర్ జిల్లాకు చెందిన క్లాస్ మెట్ ఒకరు ఈ రోజు మా జిల్లా మీటింగ్ ఉంది . తెలిసిన వాళ్ళు వస్తారు అంటే అతనితో పాటు వెళ్ళాను . మార్వాడీలు వేసుకునే గద్దె పరుపు దానిపై ఎన్టీఆర్ , నాదెండ్ల కూర్చున్నారు . ఒక ఫోటో గ్రాఫర్ ఫోటో తీస్తే ఎన్టీఆర్ కనులతోనే గద్దించారు . నాదెండ్ల సర్ది చెప్పారు . సాధారణంగా సినిమా వారికి గ్లామర్ ముఖ్యం . ఎలా పడితే అలా ఫోటో తీస్తే ఒప్పుకోరు . ఇది రాజకీయ మీటింగ్ అని నాదెండ్ల సర్ది చెప్పి ఉంటారు . 1989 ఎన్నికల ప్రచారం . గజ్వేల్ లో ఎన్టీఆర్ బహిరంగ సభ కావడంతో అప్పుడు మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ను సంగారెడ్డి నుంచి ఎన్టీఆర్ న్యూస్ కవరేజ్ కోసం గజ్వేల్ వెళ్ళాను . విశాలమైన మైదానంలో సభ కోసం బ్యారీ కేడ్లు ఏర్పాటు చేశారు . చైతన్య రథం పై ఎన్టీఆర్ వస్తే మీడియా తప్ప ఎవరూ లేరు . ఏమైందో అర్థం కాలేదు . ఎన్టీఆర్ వస్తున్నారు అంటే పొలం పనులు కూడా వదిలేసి రోడ్డు మీదకు జనం పరిగెత్తుకు వచ్చిన వార్తలు బోలెడు చదివి ఉండడం తో ఆ దృశ్యం అర్థం కాలేదు . ప్రకాశం జిల్లాకు చెందిన సంజీవ రావు గజ్వేల్ నుంచి టీడీపీ శాసన సభ్యులు . 89లో కూడా ఆయనకే టికెట్ రావడంతో పోటీ చేస్తున్నాడు . ఇప్పుడున్నంత మీడియా హడావుడి అప్పుడు లేదు . నాలుగురైదుగు తప్ప మీడియా పెద్దగా ఉండదు . జనం లేకపోవడంతో సంజీవరావును ఎన్టీఆర్ చైతన్య రథంలోకి పిలిచారు . కొంత సేపటి తరువాత రావచ్చు అని చైతన్య రథంలో నిరీక్షించి , అక్కడే భోజనం చేశారు . ఎన్టీఆర్ మాట్లాడే సమయం లో కూడా గ్రౌండ్ ఖాళీగానే ఉంది . ఈ సభతో 89 ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అర్థం అయింది . గజ్వేల్ ఖాళీ గ్రౌండ్ , ఎన్టీఆర్ ఉపన్యాసం , బ్యారికేడ్లు ఇవన్నీ వచ్చేట్టుగా అప్పుడు నేను తీసిన ఫోటో భూమి , క్రానికల్ లో మొదటి పేజీలో వచ్చింది . అంతకు ముందు భువనగిరిలో భారీ బహిరంగ సభ అని ప్రచారం చేసినా జనం అంతంత మాత్రంగానే వచ్చారు . ఐతే గజ్వేల్ సభలో స్వయంగా జనం కోసం ఎన్టీఆర్ నిరీక్షించినా ఫలితం లేకపోవడం తో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అర్థం అయింది . జనం పొలం పనుల్లో ఉండడం వల్ల రాలేక పోయారు అని సంజీవరావు వివరణ ఇచ్చారు . ఇక్కడి నుంచే 89 ఎన్నికల్లో గీతారెడ్డి సంజీవరావుపై విజయం సాధించారు . ఇందిరాగాంధీ లా తలపై చీర కొంగు కప్పుకొని ఆమె సాగించిన ప్రచారం ఫొటోలతో లోకల్ మీడియాను ఆక్రమించేశారు . 89 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎన్టీఆర్ చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారు . అదే దాస్ బాబు నాయకత్వంలోని టీడీపీలో చేరారు . ఎన్టీఆర్ ను ఎన్నికల్లో ఓడించిన చిత్తరంజన్ దాస్ , వెన్నుపోటుతో ఓడించిన బాబు ఒకే గూటికి చేరారు అని అప్పుడు జోకులు వినిపించేవి . అంతకు ముందు పిసిసి అధ్యక్షుడిగా మర్రి చెన్నారెడ్డి సంగారెడ్డి లో జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు . అనంతరం జరిగిన విలేకరుల సమావేశం లో మొదటి సారి కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు . 180 + సీట్లు ( 182 నో లేక 183 ) వస్తాయని చెప్పారు . ఆయన చెప్పినట్టే ఒకటో రెండో సీట్ల తేడాతో ఆ జోస్యం నిజమైంది . **** వెన్నుపోటులో బాబు చేతిలో ఎన్టీఆర్ ఓడిపోయారు . న్యాయ పోరాటంలోనూ పరాజయం ఎదురయ్యాక తన వద్ద ఉన్న దాదాపు 30 మంది శాసన సభ్యులతో కలిసి ఎన్టీఆర్ 1996 లో కొత్త పార్టీ పెట్టారు . ఎన్టీఆర్ టీడీపీ అనే పార్టీ పెట్టి సింహం గుర్తుతో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు . తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు . ఎన్టీఆర్ సినిమా నటునిగా ఉన్నప్పుడు తిరుపతి వెళ్లిన యాత్రికులు చాలా మంది అటు నుంచి మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ ను చూసే వారు . ఎన్టీఆర్ ను దించేశాక అదే తరహాలో పెద్ద సంఖ్యలో జనం ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి చూసి వెళ్లేవారు . అక్కడో జాతరలా ఉండేది . 96 పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎన్టీఆర్ మరణించారు. చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టు అయింది . పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎన్టీఆర్ బతికి ఉంటే రాజకీయాలు ఎలా ఉండేవో . ఎన్టీఆర్ టీడీపీ తరపున పోటీ చేసిన హేమా హేమీలంతా ఓడిపోయారు . ఎన్టీఆర్ కులారుడు జయకృష్ణ ఎన్టీఆర్ టీడీపీ తరుపున శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఓడిపోయారు . ఎన్టీఆర్ టీడీపీ తరపున ఒకే ఒకరు గెలిచారు . ఉప ఎన్నికల్లో పాత పట్నం నుంచి నందమూరి లక్ష్మీ పార్వతి గెలిచారు . తరువాత ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టారు . ఒక్కరు కూడా గెలువ లేదు . ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టినప్పుడు ఇంగ్లీషులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని విమర్శించేవారు . అలాంటి ఎన్టీఆర్ రెండు పార్టీలు పెడితే , కుమారుడు ఓ పార్టీ పెట్టారు . అన్న టీడీపీ , అల్లుడు టీడీపీ , కుమారుడు టీడీపీ , వదిన టీడీపీ ఎన్ని బంధుత్వాలు ఉంటాయో అన్ని టీడీపీలు . వైస్ రాయ్ క్యాంపు బాగా పాపులర్ కానీ ఎన్టీఆర్ కూడా ఓ క్యాంపు నడిపారు అది పెద్దగా పాపులర్ కాలేదు . 30 మంది శాసన సభ్యులతో గోల్కొండ హోటల్ క్యాంపు నడిపారు . విజయాలనే కాదు పరాజయాలను కూడా గుర్తు చేసుకోవాలి . సినిమాలు , జీవితాన్ని మించిన మలుపులు ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఉన్నాయి . బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం