12, జూన్ 2023, సోమవారం

ఎడిటర్ మరణిస్తే .... విధ్వం సుకునికి నివాళినా ? అని జర్నలిస్ట్ లుబుక్ వేశారు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -47

ఎడిటర్ మరణిస్తే .... విధ్వం సుకునికి నివాళినా ? అని జర్నలిస్ట్ లుబుక్ వేశారు .. ఒక్కొక్కడు ఒక్కో నరహంతకుడు ... మన ఎడిటర్ దేవుడు అని తప్పించుకున్నా ...
----------------------------------------- రాజకీయ నాయకుడు , సంపన్నుడు , పారిశ్రామిక వేత్త , రచయితలు మరణిస్తే పెద్ద ఎత్తున నివాళి , అవకాశం ఉన్న వాళ్ళు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాసాలు రాస్తూ ప్రచురించడం కామన్ . ఇలాంటి స్మృతి సాహిత్యం బోలెడు ఉంది మనకు . కానీ ఓక్ పత్రిక ఎడిటర్ మరణిస్తే అతను పెట్టిన బాధల వల్ల ఎంత మంది జీవితాలు నాశనం అయ్యాయో , ఎంత మంది జీవితాలు రోడ్డున పడ్డాయో వ్యాసాలు రాసి , పుస్తకం ప్రచురించడం గురించి విన్నారా ? ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ఆంధ్రప్రభలో సర్వాధికారాలు చెలాయించిన సుందరం దయనీయ మైన స్థితిలో మరణించిన తరువాత నలుగురు పాత్రికేయులు సుందరం , దీక్షితులు జర్నలిస్ట్ ల జీవితాలతో ఎలా ఆడుకున్నారో వ్యాసాలు రాసి పాత్రికేయ విలువల విధ్వంసకులకు నివాళులా ? అని పుస్తకం ప్రచురించారు . నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి మరణించాక అతని ఆకృత్యాల గురించి రాసి పుస్తకం గా ప్రచురించడం అదే మొదటి సారి. ఇప్పటివరకు అదే చివరి సారి . సుందరం తో పాటు దీక్షితులు గురించి రాశారు . ఒక వ్యక్తి మరణిస్తే అతను ఎలాంటి వాడైనా ఇంద్రుడు చంద్రుడు , శిబి చక్రవర్తి , దానకర్ణుడు అని రాయాల్సిందేనా ? అదే మన సంస్కృతి నా ? నిజం చెప్పడం పాపమా ? నిజం ఎక్కడో ఒక చోట రికార్డ్ కావాలి . ***** 2010 ఓ రోజు ఉదయమే జనాంతికం వ్యాసం రాయడానికి ఆంధ్రభూమి కార్యాలయానికి ఉదయమే వెళ్ళాను . వ్యాసం పూర్తి చేసి రిపోర్టర్ గా రొటీన్ డ్యూటీ కి వెళ్ళాలి . సాధారణంగా ఆ టైం లో ఆఫీస్ లో ఎవరూ ఉండరు . లోపలి వెళ్ళగానే మూర్తి అని సండే ఇంచార్జ్ పిలిచి సుందరం మీద జర్నలిస్ట్ నామాల విశ్వేశ్వర రావు వేసిన బుక్ చూపించి , ఈ బుక్ లో ఉన్న సుందరం పేరు తీసేసి మన ఎడిటర్ శాస్త్రి పేరు పెడితే జర్నలిస్ట్ లను వేధించే విషయం సేమ్ కదండీ అన్నారు . కాదండి మన ఎడిటర్ దేవుడు అని బదులిచ్చాను . మీరు కెమెరా ముందు మాట్లాడుతున్నారు ( ఆఫీస్ లో సిసి కెమెరాలు ఉంటాయి ) బయట మాట్లాడుదాం అని బయటకు దరి తీస్తుంటే .. నేను బయట కూడా మీతో ఇలానే మాట్లాడతాను . మన ఎడిటర్ దేవుడు .. మరో మాటే లేదు అన్నాను . ఆఫీస్ లో ప్రతి ఒక్కరు ఇంకొకరిని ఎడిటర్ ఇన్ఫార్మర్ గా చూస్తారు . అంటే అందరూ నన్ను ఎడిటర్ ఇన్ఫార్మర్ గా చూస్తారు . అందరినీ నేను ఎడిటర్ ఇన్ఫార్మర్ గా చూస్తాను . నిజానికి ఇది ఈనాడు సంప్రదాయం అని ఈ మధ్యనే చదివాను . మాజీ ఈనాడు ఉద్యోగి ఒకరు ఈనాడులో ఇన్ఫార్మర్స్ వ్యవస్థ గురించి రాశారు . టీ తాగుతూ ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు కూడా మేనేజ్మెంట్ కు తెలిసి పోతాయి . తల్లి తన పిల్లలు ఒకరి మీద ఒకరిని నిఘా పెట్టినట్టు ఈనాడులో నిఘా ఉంటుంది అని ఎవరో రాశారు . ఈనాడు నుంచివచ్చిన శాస్త్రి ఇదే విధానాన్ని ఆంధ్రభూమిలో అమలు చేశారు . ప్రతి ఒక్కరిని ఇన్ఫార్మర్స్ గా మార్చుకున్నారు . సోవియట్ రష్యాలో ప్రతి ఒక్కరిపై ఇంకొకరి నిఘా ఉంటుంది అనుకునే వాళ్ళం . అలా అన్నమాట . కొత్తలో ఓ సారి ఏం జరుగుతుందో చెప్పాలి , నువ్వు చెప్పక పోతే నాకు తెలియదు అనుకున్నావా ? అన్నారు . ఎవరేం మాట్లాడుకుంటున్నారో నన్ను అడిగినప్పుడు , నేనేం మాట్లాడుతున్నానో ఇతరులను అడుగుతారు కదా ? నాకు ఆ మాత్రం తెలియదా? అనిబదులిచ్చాను . బయట టీ తాగేప్పుడు ఏదో జోకులేసుకుంటాం అంతకు మించి ఏం మాట్లాడుతాం . అన్నింటికన్నా నా ఉద్యోగం నాకు ముఖ్యం ఏమీ మాట్లాడుకోము అని చెప్పాను .. ఆఫీస్ లో అందరూ ఇన్ఫార్మర్ లే అయినా రోజూ ఎడిటర్ తో మాట్లాడేవారిని ఇంకాస్త ఎక్కువ ఇన్ఫార్మర్స్ గా ఇతరులు చూస్తారు . ఆఫీస్ లోని వారినే కాదు ఇతర పత్రికల వారిని సైతం అలానే చూసే పరిస్థితి. ఓ సారి వార్తలో ఎడిటర్ టంకశాల అశోక్ ను ఎడిటర్ బుక్ ఏదో రివ్యూ కోసం ఇవ్వడానికివెళితే ఎడిటర్ అమానవీయంగా వ్యవహరిస్తారట కదా ? అని ఏదో అడిగితే , సిబ్బంది తో పని చేయించాలి అంటే ఆ మాత్రం తప్పదు అన్నాను . దేవులపల్లి అమర్ కూడా ఓ సారి ఏదో అడిగితే లేదండి మా ఎడిటర్ చాలా గొప్పవాడు అన్నాను . అభిప్రాయం కన్నా ఉద్యోగం ముఖ్యం . భూమిలో అందరూ ఇన్ఫార్మర్మూ లే అయినా మూర్తికి కాస్త ఎక్కువ ఇన్ఫార్మర్ అనే గుర్తింపు . అతను ఏం మాట్లాడినా నేను మన ఎడిటర్ దేవుడండీ అనే మాట నుంచి దిగడం లేదు . హఠాత్తుగా అతనికో అనుమానం వచ్చింది . ఔను ఈ బుక్ రాసిన అతను ఇంతకు ముందే నా చేతికి ఇచ్చి వెళ్ళాడు . మీరు ఇప్పుడే ఆఫీస్ కు వస్తున్నారు . ఇందులో ఏముందో మీ కెలా తెలుసు అని అడిగాడు . దొరికిపోయా నా ? అనుకుని తేరుకొని .. ఇప్పుడే ఆఫీస్ కు వస్తుంటే గేటు దగ్గర కలిశాడు అతనివద్ద చూశాను అని తప్పించుకున్నాను . నిజానికి ఆ బుక్ ప్రచురిస్తున్నామని చెబితే వద్దు అని చాలా సేపు నచ్చజెప్పాను . ఆ బుక్ వేయాల్సిందే అని వారు నిర్ణయించుకోవడానికి కారణం ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసం . ***** సుందరం మరణించాక ఆంధ్రజ్యోతిలో జగన్ వ్యాసం రాశారు . అక్షర బద్ధుడు సుందరం అని నివాళి వ్యాసం . ఆ వ్యాసం లో సుందరం గురించి తక్కువగా , జగన్ తన గురించి ఎక్కువగా రాసుకున్నారు అనేది ఓ విమర్శ . ఆంధ్రప్రభలో సుందరం వేధింపుల వల్ల జర్నలిస్టులు మరణించారు , అనారోగ్యం పాలయ్యారు , మాట్లాడితే దేశం లో ఏదో ఒక రాష్ట్రానికి బదిలీ చేసి వేధించేవారు . అలాంటి వ్యక్తి గురించి ప్రభలో ఎవరిని అడిగినా అతని పైరవీలు , వేధింపులు చెబుతారు మీరు ఇలా రాయడం ఏమిటీ అని కొంతమంది జర్నలిస్ట్ లు , సుందరం బాధితులు ఆంధ్రజ్యోతికి వెళ్లి మేం రాసిన వ్యాసం కూడా వేసుకోవాలి అని ఎడిటర్ శ్రీనివాస్ ను నిలదీశారు . ఆ నివాళి వ్యాసం రాయడమే ఎక్కువయింది , దానికి మళ్ళీ ఖండన వ్యాసమా ? వేయం పో అని పంపించారు . దాంతో కొంతమంది కలిసి బుక్ వేయాలి అని నిర్ణయించుకున్నారు . నాకు నామాల చెబితే వద్దు అన్నాను . పత్రికల మధ్య , ఎడిటర్స్ మధ్య ఇగోలు ఉంటాయి. పోటీ ఉంటుంది . కానీ మనుషులను వేధించడం లో ఐక్యత ఉంటుంది . బుక్ వేస్తే నీకు ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తారు . ఇబ్బంది అవుతుంది వద్దు అని చాలా సేపు చెప్పాను . ఐనా జర్నలిస్ట్ ఎలా ఉండకూడదంటే ( కెవి కూర్మనాథ్ ) పాత్రికేయ తక్షకులకు సానుభూతా ? (దామోదర్ ప్రసాద్ పతక మూరు ) అక్షర భక్షకుడికి బానిస నివాళి ( నామాల విశ్వేశ్వర రావు ) నామ మాత్రం సుందరం ( నరేష్ నున్నా ) . వ్యాసాలతో బుక్ వచ్చింది . చిత్రమేమంటే ఈ బుక్ అన్ని పత్రికల కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఎడిటర్ పేరు మారిస్తే అన్ని పత్రికల్లో ఇంతే కదా ? ఎవడైతే నేం ఒక్కొక్కడు ఒక్కో నరహంతకుడు అని శ్రీ శ్రీ కవిత్వం ప్రతి చోట వినిపించింది . కొన్ని చోట్ల మేనేజ్ మెంట్ , కొన్ని చోట్ల ఎడిటర్ , కొన్ని చోట్ల మేనేజర్ కావచ్చు కానీ అన్ని చోట్ల ఒకటే కథ . చాలా మంది బాధితులు నామాలకు ఫోన్ చేసి బుక్ వేసేప్పుడు మాతో మాట్లాడితే మా బాధ రాసె వాళ్ళం , బుక్ ప్రచురణకు మా వాటా డబ్బులు ఇచ్చేవాళ్ళం అని నిష్టుర మాడారు . ***** రిటైర్ అయ్యాక ఏమైనా రాయవచ్చు అది వేరు . కానీ ఉద్యోగం చేస్తూ ఆ నలుగురు తమ బాధలు రాయడం మాములు విషయం కాదు . ఇంత ఇబ్బంది పడుతూ ఉద్యోగం చేయడం ఎందుకు బయటకు వెళ్ళవచ్చు కదా అనే ప్రశ్న కొందరి నుంచి రావచ్చు . అప్పుడు ఉన్నవే నాలుగు పేపర్లు . ఈనాడు అక్కడే కొత్తవారిని తీసుకోని ట్రైనింగ్ ఇస్తుంది . మిగిలిన మూడింటిలో ప్రభ , భూమిలో మాత్రమే మంచి జీతం . ఒక చోట ఉద్యోగం పోతే మరో చోట ఉద్యోగం దొరకడం అంత ఈజీ కాదు . జర్నలిజంలో చాలా ఏళ్ళు ఉన్న తరువాత అది తప్ప ఇంకో పని రాదు . లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వెళుతుంటే మూలమలుపు లో విశాల మైన ఖాళీ స్థలం కనిపిస్తుంది . వందల కోట్ల రూపాయల విలువైన స్థలం . అది ఆంధ్రప్రభ ఆదీనంలో ఉంది . విన్నంత వరకు ఆ స్థలానికి సంబంధించి సరైన డ్యాకుమెంట్లు లేవు . ఎన్టీఆర్ ను దించేసి సమయం లో మనం బాబుకు అండగా నిలుద్దాం ల్యాండ్ సమస్య పరిష్కరించుకోవచ్చు అని సుందరం యాజమాన్యాన్ని ఒప్పించారు . సుదీర్ఘ కాలం బాబు సీఎంగా ఉన్నా ఇప్పటికీ ల్యాండ్ సమస్య పరిష్కారం కాలేదు .అలానే పాడుపడినట్టు ఉంది . ల్యాండ్ సమస్య పరిష్కారానికి తరుచుగా యజమాని కుమారుడు ఆఫీస్ కు వచ్చి సుందరం ముందు కూర్చునే వారట ...సాధారణంగా యజమాని వద్దకు ఎడిటర్ వెళతారు కానీ పని పెద్దది .. ఆంధ్రప్రభను అక్కడ పని చేసే వారే చంద్రప్రభ అని ముద్దుగా పిలుచుకునే వారు . ల్యాండ్ సమస్య పేరుతో సుందరం ఆంధ్రప్రభను చంద్ర ప్రభగా మార్చి తాను ప్రయోజనం పొందారుకాని యాజమాన్యం పేపర్ అమ్ముకొని ... ల్యాండ్ సమస్య పరిష్కారం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది . **** మిత్రుడు నామాలకు ఫోన్ చేసి మీరు అప్పుడు పబ్లిష్ చేసిన బుక్ కావాలి .. అప్పుడు వద్దని చెప్పినా బుక్ ఎందుకు వేశారు అని అడిగాను . నాకు ఉద్యోగం అవసరమే కానీ రోడ్డున పడితే సహాయం చేసేందుకు మా అన్నలు ఉన్నారు . వాళ్ళు ఒక్కొక్కరు కోటీశ్వరులు .. మీ పరిస్థితి అంతే మీకు ఉద్యోగం బతుకు తెరువు. ఒక వేళ ఉద్యోగం పోయినా హైదరాబాద్ లోనే వ్యాపారం చేసే మీ అన్నలు ఆదుకుంటారు . కానీ ఒక రోజు ఆఫీస్ లో ఓ పేద బ్రాహ్మణుడు బాధతో చెప్పిన మాటతో బుక్ వేయాలి అనుకున్నాను అన్నాడు . ఇంట్లో పిల్లకు పాలపొడి తెమ్మన్నారు , డబ్బు లేదు , లీవు అడగలేను , మాట్లాడితే ఉద్యోగం తీసేస్తామని బెదిరిస్తారు . ఇదేం జీవితం అని సుందరం వేధింపులు చెప్పి బాధపడ్డాడు . ఏమైనా జరగనివ్వు బుక్ వేయాలని అనుకున్నాను వేశాను అని చెప్పాడు . **** చివరి రోజుల్లో సుందరం దయనీయమైన స్థితిలో మరణించారు . ఆరోగ్య సమస్యలు . చేతితో ఆహరం కూడా తినలేని స్థితి . దోశ ముక్క నోట్లో పెట్టుకున్నా గొంతు దాటి పోని స్థితి అని చూసిన వారి మాట . దేవుడు ఉన్నడా ? కర్మ ఫలం ఈ జీవితం లోనే అనుభవిస్తామా ? ఏమో తెలియదు కానీ . ఉంటే బాగుండు . ఈ జన్మలో చేసిన దానిని ఫలితం ఇక్కడే అనుభవిస్తామనే నమ్మకం ఉంటే మనిషి మనిషిలా వ్యవహరిస్తాడు . సాటి మనుషులను మనుషుల్లా చూస్తాడు . ఎడిటర్ కానివ్వండి ఓనర్ కానివ్వండి . ***** ఏమీ లేదు . దేశాన్ని ఉద్ధరిద్దామని జర్నలిజం లోకి రావాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడి పరిస్థితులు ఓ సారి తెలుసుకొని నిర్ణయం తీసుకుంటావని .. ఒకసారి ఊబిలో కూరుకుపోతే బయటపడలేవు . దేశాన్ని మార్చే మాట దేవుడెరుగు బయట దేవుడిగా పూజలు అందుకునే రాక్షసులను తట్టుకొని బతకడం అంత ఈజీ కాదు . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం