24, జూన్ 2023, శనివారం

రాజాలా అనుభవించాడు - అటెండర్ లా బతుకీడ్చాడు .. సీఎం తో టిఫిన్ .. ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజంలోకి రండి ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -56

రాజాలా అనుభవించాడు - అటెండర్ లా బతుకీడ్చాడు .. సీఎం తో టిఫిన్ .. ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజంలోకి రండి ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -56 ------------------------------------------------------------------------- మాసిన బట్టలతో దాదాపు 60 ఏళ్ళ వయసున్న అతను సంగారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరికీ టీ ఇచ్చేవాడు . అటెండర్ గానే పరిచయం . అక్కడికి వచ్చే నాయకులు ఎంతో కొంత ఇస్తే అదే అతని బతుకు తెరువు . ఓ రోజు ఎందుకో హఠాత్తుగా అప్పటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి చరణ్ మురళి అతను ఎవరో నీకు తెలుసా? అని అడిగాడు . అటెండర్ గురించి తెలుసా అని అడగడానికి ఏముంటుంది ? అనిపించింది . సంగడు తెలియక పోవడం ఏముంది అన్నాను . అప్పటి వరకు నాకు తెలిసిన అతని పేరు సంగడే .. అందరూ అతన్ని సంగడు అనే పిలిచే వారు . అతని పేరు సంగడు కాదు , సంగమేశ్వర్ రావు గారు అని స్వామిచరణ్ చెప్పుకొచ్చారు . హైదరాబాద్ లో నాలుగురైదుగురికి మాత్రమే ఏసీ కారు ఉన్న రోజుల్లో అతను హైదరాబాద్ లో అడుగు పెట్టాడు అంటే అతనికోసం ఏసీ కారు వచ్చేది అని చెబితే నమ్మలేక పోయాను . 1988-89 ప్రాంతంలో సంగారెడ్డిలో జిల్లా రిపోర్టర్ గా ఉన్నప్పుడు మాజీ స్పీకర్ పి రామచంద్రారెడ్డి బిల్డింగ్ లోనే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఉండేది . అక్కడే సంగడు పరిచయం . స్వామి చరణ్ చెప్పింది నమ్మలేక సంగమేశ్వర రావు గారు సంగడు గా ఎలా అయ్యాడు అని అతన్నే అడిగాను . ****** ఉదయం సీఎంతో టిఫిన్ చేసి , మధ్యాన్నం ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజం లోకి రండి .. ఇలానే సాగేది హైదరాబాద్ లో ఓ ప్రైవేటు జర్నలిజం స్కూల్ ప్రకటన . ఇప్పుడు కనిపించడం లేదు కానీ ఓ 20 ఏళ్ళ క్రితం ఈ ప్రకటన రోజూ కనిపించేది .నిజంగా జర్నలిస్ట్ ల జీవితం అంత అద్భుతంగా ఉంటుందా ? ఇప్పుడు కాదు ఎప్పుడూ అంత అద్భుతంగ లేదు . ఉండదు . సీఎం లకు , పిఎంలకు మరే పని లేనట్టు జర్నలిస్ట్ లతో టిఫిన్ చేయడం , లంచ్ చేయడమే పనా ? ఇంట్లో భార్యా పిల్లలకు జ్వరం వచ్చినా ఆస్పత్రికి వెళ్లేంత సమయం ఉండదు . కానీ ఓ సినిమా యాక్టర్ భార్య ప్రసవిస్తే గంటల తరబడి ఎండలో కెమెరాలతో ఆస్పత్రి వద్ద పడికాపులు కాయాలి . వాస్తవానికి , ప్రకటనలకు ఎంత తేడా ఉంటుందో ఈ ప్రకటన , ఆస్పత్రి వద్ద పడిగాపులు కాసిన జర్నలిస్టుల ఫోటోనే సాక్ష్యం . ప్రజాప్రతినిధులు , అధికారులు , చివరకు అందరినీ వణికించే లోకల్ గుండాలు సైతం నమస్తే అన్నా అని పలకరించడం మద్యం కన్నా మత్తుగా ఉంటుంది . సగం జీవితం ... అయిపోయాక ఆ మత్తు దిగి అసలు జీవితం అర్థం అవుతుంది . నక్సలైట్ల నాయకుడిగా ల క్షల రూపాయల డెన్ బాధ్యతలు నిర్వహించి , తరువాత జర్నలిజం లోకి వచ్చి తమను తాము కంట్రోల్ చేసుకోలేక దయనీయమైన స్థితిలో చనిపోయిన జర్నలిస్ట్ మిత్రులు తెలుసు .... ఓ వీడియో ఆ మధ్య బాగా పాపులర్ అయింది . టివి 9 రిపోర్టర్ అంటే లోకల్ గా చాలా శక్తి వంతుడు అని అర్థం . ఆ శక్తి మొత్తం చేతిలో లోగో ఉన్నంత వరకే . లోగో లాగేసుకుంటే నీటిలో నుంచి బయట పడ్డ చేపలా గిలగిల కొట్టుకుంటారు . ఏం జరిగిందో అతన్ని ఛానల్ నుంచి తీసేస్తే టివి 9 స్టూడియోలో రవిప్రకాష్ కాళ్ళు పట్టుకొని బతిమిలాడుతున్నాడు . ఎవరో దీన్ని వీడియో తీశారు . కొంతకాలానికి రవిప్రకాష్ ను కూడా ఇలానే బయటకు పంపారు . అలానే గిలగిల కొట్టుకున్నా , డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకో ఛానల్ పెడతారు , ఛానల్ పెట్టే వారు దొరుకుతారు . అలాంటి వారి పరిస్థితి వేరు . కానీ ఛానల్ లోగో ను చూసుకొని తమంతటి మొనగాడా లేదు అనుకునే వారు , లోగో లాగేసుకుంటే హీరో నుంచి ఒక్కసారి గా జీరో అవుతారు . మారిన కొత్త జీవితాన్ని జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు . ఎడిటర్ గా ఉన్నప్పుడు తలపొగరుతో ఉండే ఒకరు పీకేశాక ఓ జర్నలిస్ట్ తో చాలా సేపు ఆప్యాయంగా మాట్లాడారు . అది నిజమా అని అతను నమ్మలేక పోయాడు . కలిసిన వారందరికీ ఈ విషయం చెప్పుకున్నాడు . ఇందులో నమ్మక పోవడానికి ఏముంది ? పీకేసిన ఎడిటర్ ను పలకరించే వాడు ఎవడు ? నువ్వు కలిశావు కాబట్టి అంత ఆప్యాయంగా మాట్లాడాడు అని చెప్పాను . లోకల్ రిపోర్టర్ ( స్ట్రింగర్ ) మరణించినప్పుడు చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి ... ***** ఇది సరే ముందు సంగమేశ్వర రావు సంగడు గా ఎలా మారాడో అది చెప్పు అంటున్నారా ? అక్కడికే వస్తున్నాను . ఇదే ప్రశ్నను సంగడిని అడిగితే ... ***** మదన్ మోహన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా పాపులర్ . ముఖ్యమంత్రి తరువాత అంతటి వైభవం . సంగడు మదన్ మోహన్ కు ఆత్మ లాంటి వాడు . చేయని పాపం లేదు .. ఆడ పిల్లల ఉసురు తగిలింది . మదన్ మోహన్ రాజకీయ జీవితం ముగిసింది . నా జీవితం ఇలా అయింది . అనుకుంటాం కానీ పాపం తగులుతుంది సార్ అంటూ .. చాలా విషయాలు పశ్చాత్తాపం తో చెప్పుకొచ్చాడు . చాత నైతే నలుగురికి మంచి చేయాలి , లేదా ఊరికే ఉండాలి . అన్యాయం చేస్తే ఏదో రూపంలో పాపం మనకు చుట్టుకుంటుంది అని నా నమ్మకం . ఇది మూఢనమ్మకం అన్నా నాకు అభ్యన్తరం లేదు . మనిషిని మనిషిగా ఉండేట్టు చేసే మూఢ నమ్మకం ఐనా నాకు ఇష్టమే . సీఎం లతో టీ తాగి , పీఎం లతో లంచ్ చేస్తాం అనే భ్రమలు ఎంత త్వరగా వీడితే అంత మంచిది . వాస్తవంలో జీవించి , ప్రాక్టికల్ గా ఆలోచించాలి . మహా మహులే రాలిపోయారు , లోగోలతో మనకెందుకు అహంకారం . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం