1, జూన్ 2023, గురువారం

దమ్మున్న మీడియా దీవిస్తే ఎవరైనా మటాషే ..... విజయశాంతి నుంచి షర్మిల వరకు సేమ్ రిజల్ట్స్ జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 39

దమ్మున్న మీడియా దీవిస్తే ఎవరైనా మటాషే ..... విజయశాంతి నుంచి షర్మిల వరకు సేమ్ రిజల్ట్స్ జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 39 ------------------ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో కలిపేయమని ఒకరు పిలుపు ఇస్తే , ఆంధ్ర కాంగ్రెస్ లో చేరమని మరొకరి పిలుపు . ప్రతి రోజు ఆంధ్ర జ్యోతి మొదటి పేజీని అలంకరించి , సీఎంలను మించి ఆ మీడియాలో ప్రాధాన్యత పొందిన షర్మిల కు ఎన్ని సీట్లు అనే చర్చ నుంచి అసలు ఆమె పోటీ చేస్తుందా ? ఏ పార్టీలో కలిసి పోతుంది అనే చర్చ సాగుతోంది . పార్టీలో చేరిపోవాలి అని కాంగ్రెస్ పిలుపు ఇస్తే నాకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయి అని ఆమె చెబుతోంది . సీఎంను అవుతాను అని abn ఛానల్ లో చెప్పిన ఆమె అసలు పోటీ చేస్తుందా ? అనుమానమే . .. ఎందుకిలా అని ఆలోచిస్తే పాపం ఆంధ్ర జ్యోతి దీవెనలతో వెలుగు చూసిన అన్ని పార్టీల పరిస్థితి ఇదే అని చరిత్ర కళ్ల ముందు కనిపించింది . ***** పలానా పెద్దాయన దీవిస్తే మంచి జరుగుతుంది . ఆమె దీవెనలు ఉంటే అనుకున్నది అవుతుంది ... ఆ డాక్టర్ష హస్తవాసి మంచిది . పోవడానికి సిద్ధం అయిన వారు కూడా లేచి కూర్చుంటారు - అంటుంటారు . ఇవి నమ్మకాలు . వీటికి శాస్త్రీయత ఏమీ ఉండదు . ఐనా నమ్ముతుంటారు . . విచిత్రంగా మీడియాకు సంబంధించి కూడా ఇలాంటి నమ్మకం ఒకటి ఉంది . పాపం రాధాకృష్ణ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన దీవెనలు అందుకున్న పార్టీలు అన్నీ మటాష్ అయ్యాయి . ఈ నమ్మకానికి శాస్త్రీయత లేకపోవచ్చు , కానీ అలా జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. విజయశాంతి పార్టీ తల్లి తెలంగాణ నుంచి షర్మిల తెలంగాణ వై యస్ ఆర్ కాంగ్రెస్ వరకు అన్ని పార్టీలను వారి మీడియా భుజాన మోసి దీవెనలు అందించింది ... ఆచారం తప్పకుండా దీవెనలు పొందిన అన్ని పార్టీలు చావు దెబ్బ తిన్నాయి . అదే సమయంలో వారి మీడియా శపించిన పార్టీలు అధికారం లో వెలిగి పోతున్నాయి . అటు ఆంధ్ర లో ఇటు తెలంగాణ లో .... ***** షర్మిల కాంగ్రెస్ లో చేరాలి అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు ... ఆంధ్రకు వెళ్లి రాజకీయం చేసుకోవాలి అని రేవంత్ రెడ్డి సుచించారు ... షర్మిల కాంగ్రెస్ లో చేరుతారు అని కొన్ని పత్రికల్లో , ఆంధ్ర కాంగ్రెస్ లో అని మరి కొన్ని పత్రికల్లో వార్తలు . ఆమె నేమో నేను సీఎం ను అవుతున్నాను అని Abn ఛానల్ ఇంటర్వ్యూ లో చెబుతుంటే ... ఆమెకో పార్టీ ఉందని , దానికో పేరు ఉందనిమరిచిపోతున్నారు . వాట్స్ ఆప్ లో మాత్రమే కనిపించే వాట్స్ ఆప్ పత్రికల సర్వేల్లో ఆమెకు ఉదారంగా 74 సీట్లు ఇస్తుంటే ఇవేవీ గుర్తించకుండా కాంగ్రెస్ వాళ్ళు పార్టీలో చేరిపొమ్మంటున్నారు . ఆంధ్ర లో అన్న ను తీవ్రంగా వ్యతిరేకించాలి . అవసరం ఐతే రాష్ట్రపతి పాలన పెట్టించాలి . ఇటు తెలంగాణలో అన్న చెల్లిని ఆకాశానికి ఎత్తాలి , తెలంగాణ ను రక్షించడానికి అవతరించిన దేవత అన్నట్టు చూపించాలి . దీనికోసం ఎంత కష్టపడుతున్నారు . . ఇది మాములు విషయమా ? ఒకే కుటుంబంలో అన్నను రాక్షసుడిగా , చెల్లిని దేవతగా చూపాలి అంటే ఆషామాషీ కాదు దమ్ముండాలి . తమకా దమ్ముందని పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అండగా నిలిస్తే .... కాంగ్రెస్ లో కలిపేయండి.. ఆంధ్రాలో ఓ టికెట్ ఇస్తాం అనడం ఎంత అమానవీయం . ***** విజయ శాంతికి ఆంధ్ర జ్యోతికి ఎంతో అనుబంధం ఉంది .ఆంధ్రజ్యోతి మొదటి యజమాని కి సినిమా వ్యాపారాలు ఉన్నాయి . ఉమ్మడి రాష్ట్రం లో ఆంధ్ర జ్యోతి తొలుత విజయవాడ నుంచే వచ్చేది . సచివాలయం ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో ఓ గది కార్యాలయంగా ఉండేది . ఆంధ్ర జ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభం ప్రచారం ఓ సంచలనం. అప్పటి వరకు ఈనాడు , ఉదయం తమ ఎడిషన్ లు ప్రారంభించేప్పుడు ఉదృతంగా ప్రచారం చేశాయి . ఉదయం ఐతే ఏకంగా ఉదయం టైటిల్ ఎలా ఉండాలో చెప్పండి అని అనేక డిజైన్ లలో అప్పటి అన్ని పత్రికల్లో మొదటి పేజీ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు . కానీ ఆంధ్రజ్యోతి మాత్రం నభూతో న భవిష్యతి అనే విధంగా విజయశాంతి పోస్టర్ లతో ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రచారం చేశారు . అప్పుడు విజయశాంతి హీరోయిన్ గా సినిమా రంగాన్ని ఏలేస్తున్నారు . దిన పత్రికకు హీరోయిన్ పోస్టర్ తో ప్రచారం ఏమిటా ? అని సాంప్రదాయ వాదులు ముక్కున వేలేసుకున్నారు కానీ బాగానే వర్కౌట్ అయింది . విజయశాంతి తెలంగాణ తల్లి పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే పాత అనుబంధాలతో ఆంధ్రజ్యోతిలో ప్రచారంతో హోరెత్తించారు . బహుశా తెలంగాణలోనే కాకుండా మొత్తం దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీకి కూడా అంత ప్రచారం లభించి ఉండదేమో . వారం పాటు మొదటి పేజీ సింహ భాగం ఆమె పార్టీకే .కేటాయించారు . బాధ్యత మొత్తం మీడియా భుజానికి ఎత్తుకుంది . అమె నెమో తెలంగాణ సాధిస్తాను అని పార్టీ పెట్టింది . ఆమెకేమో తెలంగాణ ను వ్యతిరేకించే మీడియా మద్దతు . ఆమెకు వై యస్ ఆర్ ఆత్మగా గుర్తింపు ఉన్న కెవిపి రామచంద్రరావు ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం . తెరాస నుంచి గెలిచి కాంగ్రెస్ కు అనుబంధంగా పని చేస్తున్న శాసన సభ్యులు జగ్గారెడ్డి తరుచుగా తల్లి తెలంగాణ అధ్యక్షురాలు విజయశాంతి ఆఫీస్ లో కనిపించేవారు . సరే బయట ఎలా ఉన్నా లోపల పార్టీ పని చేసేది తెలంగాణ వాళ్లే అయి ఉంటారు అని ఓసారి వెళ్ళాను . ఆ రోజు ఆమె పుట్టిన రోజు వెళ్ళాక తెలిసింది . అక్కడున్న బొకే నుంచి ఓ గులాబీ పూవు తీసి ఇచ్చి జన్మ దిన శుభాకాంక్షలు చెప్పాను . ఎన్నికల ప్రచారం కోసం కొందరు పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు . పలకరిస్తే గుంటూరు నుంచి తెలంగాణ పాటలు పడేందుకు వచ్చిన ఉపాధ్యాయులం రిహార్సల్స్ చేస్తున్నాం అన్నారు . బాగుంది అనుకోని విజయశాంతిని ఏమడిగినా ఆమె పక్కనున్న భర్త శ్రీనివాసరావు సమాధానాలు చెబుతున్నారు . ఆమె నోరుమెదపలేదు . ఇంత దాకా వచ్చినందుకు ఏదో మాట్లాడించాలి అని ప్రయత్నిస్తే తెలంగాణ ను విముక్తి చేస్తాను అన్నారు . ఆఫీస్ కు వచ్చి తెలంగాణను తరువాత విముక్తి చేద్దువు కానీ ముందు ఆ శ్రీనివాసరావు నుంచి విముక్తి సాధించండి అని రాశాను . అధ్యక్షురాలిని ఏమడిగినా ఆయనే సమాధానం చెబుతున్నారు అని .... మరోసారి కలిసినప్పుడు గుర్తు పెట్టుకొని ఏమండీ అలా రాశారు అని అడిగారు . తాట తీస్తారు అని మీరు రోజూ అంటారు కదా ? ఈ మాట తెలంగాణ లో ఏ జిల్లాలో అంటారు అని అడిగాను.. అదేంటీ ఆ మాత్రం తెలియదా ? అన్నట్టు చూసి నేను చాలా సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడేప్పుడు అన్నాను అని చెప్పారు . పార్టీ నడపడం ఆంధ్రజ్యోతి మొదటి పేజీ ఆక్రమించినంత ఈజీ కాదు అని గ్రహించి తెరాస లో విలీనం చేశారు . తరువాత కాంగ్రెస్ , బీజేపీ అంటూ అటూ ఇటు తిరిగి ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు . ఆమె బీజేపీలో ఉన్నారు అని అంత కరెక్ట్ గా చెబితే నాకు గొప్ప జ్ఞాపక శక్తి ఉందని అపోహ పడకండి . పార్టీ తన సేవలు ఉపయోగించుకోవడం లేదు అని అధ్యక్షుడిని ఇటీవల ఆమె విమర్శించారు . దాని వల్ల గుర్తుంది పోయింది . ****** ఇక కోదండరాం ను సీఎంగా ప్రాజెక్ట్ చేయడానికి సర్వం సిద్ధం అయిన తరువాత ఇప్పుడే వద్దు ముందు మహాకూటమిని ఫోకస్ చేద్దాం అని మహాకూటమిని ఓట్లు లెక్కింపు మొదలైన తరువాత కూడా మెజారిటీ సీట్లు ఇచ్చారు . ఐతే ఎలక్షన్ కమిషన్ ఫలితాలు వేరుగా ఉన్నాయి . కోదండరాం సొంత పార్టీ పెట్టినప్పుడు కోదండరాం కూడా ఉహించనంత ప్రచారం కల్పించారు . తెరాస నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎవరు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టినా ఆకాశానికెత్తారు . పత్రికల్లో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు అనే రాస్తారు వారు పార్టీ పెడుతున్నట్టు చెప్పినా భుజానికెత్తుకున్నారు . ఉద్యమ సమయంలో గద్దర్ పార్టీ , ఇంటి పార్టీ ఇవి గుర్తున్నవి మాత్రమే ఇంకా ఎన్నో పార్టీలు వాటికీ మంచి ప్రచారం కల్పించారు . అదేం హస్తవాసో అవన్నీ కాల గర్భంలో కలిసి పోయాయి . ఆంధ్ర లో తెలంగాణ లో మీడియా అండగా నిలిచినా పార్టీలు కనుమరుగు అవుతుంటే , మీడియా వ్యతిరేకించిన పార్టీలను జనం ఆదరిస్తున్నారు . మీడియా మేనేజ్అం మెంట్టే కు నచ్చింది తెలుగు ప్రజలకు నచ్చడం లేదు . ఇదేం శాపమో ... ***  దీవించడం వల్ల మటాష్ అవుతున్నారా ? మటాష్ అయ్యే పార్టీలను దీవిస్తున్నారా ? అని ప్రశ్నిస్తే , ఏమో తెలియదు ... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం