2, ఏప్రిల్ 2011, శనివారం

2012 లో యుగాంతం : సిద్దంగా ఉన్నారా ?

బె దురు చూపులతో వస్తున్న పరమేశాన్ని చూడగానే సిఐ ఒక్క సారిగా అలర్టయ్యాడు. ‘‘రండి పౌరుడు గారు ... రండి... ఈ పోలీస్ స్టేషన్ మీ కోసమే. ప్రజల కోసం, ప్రజల చేత నడిపింపబడేదే పోలీస్ స్టేషన్.

మీ రాకతో మా స్టేషన్ పునీతమైంది రండి... ’’ అంటూ సిఐ లేచి నిలబడి స్వాగతం పలికాడు. సిఐ స్వాగతంతో పరమేశం కంగారు పడ్డాడు. ‘‘ సార్! ననే్నవరనుకుంటున్నారో, మంత్రిగారి బావమరిది కాని, డిజిపి దూరపు చట్టాన్ని కాదు. సాధారణ పౌరుడ్ని’’ అంటూ కంగారుగా చెప్పాడు

.‘‘మీరు సాధారణ పౌరుడని మాకు ముందే తెలుసు’’ అని సిఐ వినయంగానే చెప్పాడు. ఏంటో ఈరోజు ఎక్కడికెళ్లినా అంతా విచిత్రంగా వ్యవహరిస్తున్నారనుకున్నాడు. ముల్లు ఆకుమీద పడ్డా, ఆకొచ్చి ముల్లుమీద పడ్డా నష్టపోయేది ఆకే అన్నట్టుగానే మనం పోలీస్ స్టేషన్‌కెళ్లినా పోలీసులు మన వద్దకు వచ్చినా నష్టపోయేది మనమే అని మనసులోనే అనుకున్న పరమేశం తన స్కూటర్ చోరీ అయిందని ఫిర్యాదు ఇచ్చాడు.

మీరేమీ కంగారు పడకండి వెతికి పెట్టే బాధ్యత మాది అని సిఐ భరోసా ఇచ్చాడు.
పరమేశం వెళ్లబోతుంటే మా స్టేషన్‌కు వచ్చి కప్పు కాఫీ కూడా తాగకుండా వెళితే నామీద ఒట్టే అని సిఐ కాఫీకి ఆర్డరిచ్చాడు. కాఫీ తాగాక వక్కపొడి ఆఫర్ చేశాడు. తాను కల గంటున్నానా? ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నానా?లేక మరో లోకంలో ఉన్నానా? అని డౌటొచ్చిన పరమేశం తనను తాను గిచ్చి చూసుకున్నాడు.

అది చూసి సిఐ తన గుబురు మీసాలను దువ్వుకుంటూ పౌరుడు గారూ మీ డౌటు నాకర్ధమైంది మిమ్ముల్ని మీరు గిచ్చుకుని నొప్పితో బాధపడడం ఎందుకు నన్ను గిచ్చండి అంటూ తన చేయి ముందు పెట్టాడు. ఇంకాస్సేపు ఇక్కడే ఉంటే తనకేదో అయ్యేట్టుగా ఉందని తల గిర్రున తిరుగుతున్నట్టు అనిపించడంతో పరమేశం పోలీస్ స్టేషన్ నుంచి బయటపడ్డాడు.

** **
‘‘అతిథి దేవోభవ ’’ అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈరోజు మీరు నా అతిథి మిమ్ములను సంతృప్తి పరచడమే నా ధర్మం. మొహమాటపడకుండా మీకు కావలసినవి అడిగి తీసుకోండి ’’ అంటూ తెల్లని దుస్తుల్లో పరమ పవిత్రంగా కనిపిస్తున్న నాయకుడు గ్లాసును అస్సలు ముట్టుకోకుండా విలేఖరి విశ్వనాథం సేవలో మునిగిపోయారు. విశ్వనాథానికి అంతా కొత్తగా కనిపిస్తోంది.

పచ్చి రక్తాన్ని కూడా తాగడానికి సైతం సిద్ధమన్నట్టుగా ఉండే నాయకుడు గ్లాసు ముట్టుకోకుండా సేవ చేయడం ఏమిటడబ్బా అని ఆలోచనల్లో మునిగిపోయాడు. నిశ్శబ్దాన్ని చేధిస్తూ విశ్వనాథమే అందుకున్నాడు. గురు వు గారూ మీ గురించి మీరెప్పుడూ గొప్పలు చెప్పుకుంటారు కదా!

కొత్త కుంభకోణాల సాహసాలు, మీ ప్రత్యర్థులకు కనిపించకుండా మీరు పొడిచే పోట్లు కథలు కథలుగా చెబుతారు కదా! ఏదీ ఒక సాహస కథ చెప్పండి అంటూ విశ్వనాథం నాలుగో రౌండు తరువాత ధైర్యాన్ని కూడగట్టుకుని అడిగేశాడు. ‘‘ విలేఖరి విశ్వనాథం గారూ మీరు బుద్ధి జీవులు.. మీలాంటి వారే సమాజానికి మార్గం చూపాలి. ... ప్రజలు ఎందుకిలా చెడిపోతున్నారు.

పాపభీతి, దైవచింతన తగ్గిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. మనిషి ఎనె్నళ్లు బతుకుతాడు ? మహా అయితే 90 ఏళ్లు బతుకుతారు. దాని కోసం ఇనే్నసి అక్రమాలకు పాల్పడాలా? మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటే ఎవరైనా ఇంతటి దుర్మార్గాలకు పాల్పడరని నేననుకుంటున్నాను. మీరేమంటారు?’’ అని నాయకుడు విశ్వనాథాన్ని వినయపూర్వకంగా అడిగాడు.

నాయకుడు ఎన్నో ముందుపోట్లు, వెనక పోట్లు పొడిచి ఈ స్థాయికి వచ్చారు. అలాంటి మహనీయుని నోటిలో శాంతి వచనాలు, ధర్మ సందేహాలు వినిపించే సరికి తట్టుకోలేక విశ్వనాథం దబేల్ మని కింద పడిపోయాడు.

**
ట్రింగ్ ... ట్రింగ్.. కాలింగ్ బెల్ మ్రోగగానే పార్వతి ఈ సేల్స్ మ్యాన్లకు వేళాపాళ ఉండదు అని తిట్టుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా కనిపించిన మొగుణ్ని చూసి నిర్ఘాంత పోయింది. ‘‘షాక్ తిన్నావా?పిచ్చి పారు అంటూ మొగుడు మల్లెపూలను పార్వతికి అందించాడు.

ఆమె స్పృహతప్పి పడిపోతుందని ముందే తెలిసిన మొగుడు రెండు చేతులతో ఆమెను పట్టుకున్నాడు. ఆమె మెల్లగా తేరుకుని మీరు సాయంత్రం ఏడుగంటలకు ఇంటికి రావడమే షాకైతే, మందు కొట్టకుండా రావడం, మల్లెపూలు తేవడం తేరుకోలేని వింత. ఇంతకూ మీరు మీరేనా? లేక సినిమాల్లో మాదిరిగా మా ఆయనలా ఉన్న మరెవరైనా కాదు కదా!’’ అని పార్వతి సంతోషంగా అడిగింది.

‘‘నేను నేనే పారు గృహమే కదా! స్వర్గ సీమ. స్వర్గాన్ని వెతుక్కుంటూ పెందరాళే ఇంటికి వచ్చాను’’ అంటూ మొగుడు భార్య కోసం కాఫీ తీసుకురావడానికి వంట గదిలోకి వెళ్లాడు.

****
‘‘ కలియుగం ఆరంభం అయినప్పుడు అంతా ఒక్కసారిగా వింతగా మారిపోయారట!అలానే ఇప్పుడు యుగాంతం అయి సత్యయుగం వచ్చేస్తుందా? అనే అనుమానంగా ఉంది. 2012నాటికి విశ్వం అంతమవుతుందంటున్నారు కదా! ఆ భయంతో అంతా మారిపోయారా? ’’అని సీనియర్ విలేకరి సింగినాదాన్ని విలేకరి విశ్వనాథం అడిగాడు.
‘‘పిచ్చోడా? మరో నెలలో విశ్వం అంతమవుతుందన్నా అప్పటి వరకు అందిన కాడికి దోచుకుందామనుకునే రకం మన వాళ్లు.. వాళ్లేం బయపడతారు?’’

అంటూ ఏదో చెప్పబోతూ సింగినాదం ఠక్కున ఆగిపోయి ‘‘ ఒరేయ్ విశ్వనాథం నిజం చెప్పు నా ఉద్యోగానికి ఎసరు పెడదామని నా మాటలు రికార్డ్ చేస్తూ స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం లేదు కదా!
అని విశ్వనాథం జేబులోని పెన్నును చేతిలోకి తీసుకుని కెమెరా ఎక్కడుందా?అని జాగ్రత్తగా వెతకసాగాడు.
‘‘ ఓస్ అసలు కారణం ఇదా? అందరూ వింతగా ఎందుకు మాట్లాడుతున్నారో ఇప్పుడర్ధమైంది.
అని తన పెన్నును తాను చేతిలోకి తీసుకుని స్ట్రింగ్ ఆపరేషనా వర్ధిల్లు అని గట్టిగా అన్నాడు విశ్వనాథం.

**

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం