16, ఏప్రిల్ 2011, శనివారం

విశ్వసనీయత మార్కెట్ లో అమ్మితే ? ఐదు రూపాయల మల్లెపూలు చాలు ఐస్ చేసేందుకు’

ఏమోయ్ చూశావా? చెప్పిన టైంకు ఇంటికొచ్చాను. వస్తూ వస్తూ మల్లెపూలూ తెచ్చాను’- అని విశ్వం తూలుకుంటూ వచ్చాడు. ‘్భర్యను పడగొట్టడం అంత ఈజీ మరోటి లేదు. ఐదు రూపాయల మల్లెపూలు చాలు ఐస్ చేసేందుకు’ అని మనసులోనే అనుకుంటూ చేతిలోని మల్లెపూల దండను భార్య వళ్లో వేశాడు. 


‘‘మీ తింగరి వేశాలు చాల్లేండి.మీరు తాగున్నారు’’అని భాగ్యం మండిపడింది. ‘‘పిచ్చి భాగ్యం తాగాననుకుంటున్నావు. అది మల్లెపూల వాసన’’ అని చెప్పాడు.
 ‘‘ జీవితంలో మందు కొట్టను. ఇదే చివరి సారని ఒట్టేసి చెప్పారు.మొన్నటికి మొన్న మందు వాసనొస్తుందేమిటంటే తలనొప్పిగా ఉంటే నీళ్లలో జిందాతిలస్మతి వేసుకుని తాగానని బుకాయించావు. ఇప్పుడేమో తాగి పూల వాసన అంటున్నావు. మీరు చెప్పిన సమయానికే కాదు అంతకు గంట ముందొచ్చినా మీమీద నాకు మరింత అపనమ్మకం పెరిగిపోతుంది కానీ నమ్మకం కలగదు. నోరు మూసుకుని తిని బయటపడుకోండి’’ అంది భాగ్యం.
‘‘ఐదు రూపాయల మల్లెపూలతో కాకపోతే మూడు వేలతో పట్టుచీర కొనైనా నా మీద నమ్మకం పెరిగేట్టు చేస్తా’’ అని వినిపించేట్టుగానే పలికి వెళుతుంటే విశ్వసనీయత అనేది డబ్బుతో కొంటే వచ్చేది కాదండి. 


మనిషన్నాక విశ్వసనీయత ముఖ్యం. అసలు విశ్వసనీయత అంటేనే తెలియని మీతో కాపురం చేయలేను. మీపై విశ్వసనీయత పెరిగేంత వరకు దగ్గరకు రానిచ్చేది లేదని భార్య తలుపులేసుకుంది.
‘‘చూడు భాగ్యం నీక్కావలసినంత విశ్వసనీతయత తీసుకు వచ్చిన తరువాతనే నీకు కనిపిస్తాను’’ అని చెప్పి మరో రాత్రి బయటగడిపేందుకు చాన్స్ లభించిందని మురిసిపోతూ భాగ్యం భర్త రోడ్డున పడ్డాడు. ఆఫీసులో ఎవరికే సమస్య వచ్చినా క్షణాల్లో తీర్చేసి మామకు ఫోన్ ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు. అతని పేరేంటో తెలియదు కానీ అంతా ముద్దుగా మామా అని పిలిచేస్తుంటారు. 



‘‘మామ చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. అదేదో విశ్వసనీయతట అది తీసుకు రాందే ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు ఎలాగైనా నువ్వు కాసింత విశ్వసనీయత ఇప్పించాలి ’’అంటూ తాగిన మైకంలోనే అడిగాడు.‘‘ పిచ్చివాడా? డబ్బుతో విశ్వసనీయత మార్కెట్‌లో దొరికితే ఈ ప్రపంచం ఇలా ఉండేది కాదు.’’ అంటూ మామ చెబుతుంటే ‘‘నేను విశ్వసనీయత గురించి అడిగితే నీవేదో చెబుతావేంటి మామా విశ్వసనీయత ఎక్కడ దొరుకుందో చెప్పు’’ అని విశ్వం ఊగాడు.‘‘ ఆ విషయం తెలియకనే చాలా మంది జుట్టుపీక్కుంటున్నారు. మన పనులను బట్టి మనపై ఇతరులకు ఏర్పడే అభిప్రాయం అది. ఆఫీసులో నీకో పని చెబితే చక్కగా చేస్తావనే నమ్మకం నీ బాస్‌కుంటే నీపై మీ బాస్ విశ్వసనీయత అదన్నమాట! భర్తగా నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తిస్తావనే నమ్మకం ఉంటే నీపై అది నీ భార్య విశ్వసనీయత.


 ఆ మధ్య టాటా గ్రూప్ వాళ్లు వాళ్ల ప్రొడక్ట్ మార్కెట్‌లో విడుదల చేసిన తరువాత ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. 90 శాతం మంది వినియోగదారులు మన ఉత్పత్తి మీద సంతృప్తి వ్యక్తం చేశారు. 10 శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు అని సంబరంగా చెబితే టాటా చైర్మన్ మాత్రం సీరియస్‌గా ముఖం పెడుతూ ఈ ఫీడ్ బ్యాక్ ప్రకారం మన ఉత్పత్తిలో చాలా లోపం ఉందన్న మాట అన్నారు. పది కోట్ల మంది మన ఉత్పత్తులను వాడుతారు, పది శాతం అంటే కోటి మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్టే కదా! అని ఆ లోపాలను గుర్తించి సరిదిద్దమని ఆదేశించారు. అందుకే టాటా ఉత్పత్తులంటే వినియోగదారుల్లో అంత విశ్వసనీయత ఉంటుంది. వస్తుత్పత్తుల వ్యాపారులే కాదు రాజకీయ వ్యాపారులకు సైతం విశ్వసనీయతే ముఖ్యం. 
 వైఎస్‌ఆర్ రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో బాబుమీద కోపం వచ్చినప్పుడల్లా విశ్వసనీతయ విషయంలో నువ్వు, నేను సర్వే చేయించుకుందామా? అంటూ సవాల్ చేసే వారు. పాపం బాబు అన్ని విషయాల్లో ముందున్నా ఈ విశ్వసనీయత విషయం వచ్చే సరికి బలహీనపడిపోయేవారు. మన బలం సరిగ్గా అంచనా వేసుకోవడంతో పాటు ప్రత్యర్థి బలహీనత ఏమిటో కూడా సరిగ్గా అంచనా వేయగలగాలి.


 తన బలం, ప్రత్యర్థి బలహీనత విశ్వసనీయతే అనే విషయం తెలియగానే వైఎస్‌ఆర్ బాబుపై దాడి చేయాల్సిన ప్రతి సారి ఇదే ఆయుధాన్ని ఉపయోగించుకునే వారు. మన నాయకులు అవసరం కోసం మాట మారుస్తూ విశ్వసనీయత కోల్పోతూ శక్తులు కోల్పోయిన గంధర్వులుగా మిగిలిపోతున్నారు. విశ్వసనీయతపై బాబును ఇరకాటంలో పెట్టే వైఎస్‌ఆర్ పోయారు కానీ బాబుకు విశ్వసనీయత సమస్య మాత్రం పోలేదు. బాబుగారి పార్టీ ఆఫీసులో విశ్వసనీయతపై ఓటింగ్ పెడితే అక్కడ కూడా బాబుకన్నా వైఎస్‌కే ఎక్కువ ఓట్లు వస్తాయని అక్కడే చెప్పుకునే వారు.


 అధికారం నుంచి దిగిపోయిన ఆరేళ్ల నుంచి విశ్వసనీయత కోసం ఎంత ప్రయత్నిస్తున్నా ఆశించిన స్థాయిలో దొరకడం లేదు. బాబుగారికే దొరకంది మార్కెట్‌లో నీకు విశ్వసనీయత దొరుకుందారా?
హీరోగారు తాత వయసులోకి వచ్చాక వాళ్ల సినీ గ్లామర్‌ను వాడుకుని కొడుకులు, మనవళ్లు హీరోలవుతున్నట్టుగా , విశ్వసనీయత బ్రాండ్ ఇమేజ్‌తో జగన్ కూడా జనంలోకి వెళుతున్నారు. హై కమాండ్ అనుమతించకపోయినప్పటికీ చెప్పిన తేదీన ఓదార్పుకు వస్తానంటూ జగన్ శ్రీకాకుళం భయలు దేరారు. విశ్వసనీయత ముఖ్యమా? హై కమాండ్ ఆదేశాలు ముఖ్యమా అని నెల రోజుల పాటు బాగా ఆలోచించుకున్న తరువాత ఆయన విశ్వసనీయతే ముఖ్యం అనుకున్నారు.



 ప్రజల విశ్వసనీయత ఎలా ఉన్నా జగన్ హై కమాండ్ విశ్వసనీయతను కోల్పోయినట్టుగానే ఉంది. మహాభారత యుద్ధంలో అశ్వత్థామను ఏ అయుధంతో కూడా పాండవులు ఎదుర్కొలేక ధర్మరాజు విశ్వసనీయతను ఉపయోగించుకుని అశ్వత్థామ చనిపోయారని చెప్పించారు. ’’ వ్యాపారానికైనా, దేవుళ్లకైనా, రాజకీయ వ్యాపారానికైనా, చివరకు సంసారానికైనా విశ్వసనీయత ముఖ్యం. అది లేకపోతే ఎవరి బతుకైనా చెల్లని గవ్వలాంటిదే. విశ్వసనీయత ఎవరికి వారు సంపాదించుకోవలసిందే ’’ అని మామ ముగించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం